తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర: అంధ యుగం – గ్రంథ యుగం
తెలుగువాళ్ళ సాంఘిక చరిత్రను గురించిన ముఖ్యమైన సమాచారాన్ని, సంగతులను సేకరించుకుని ఒకచోట రాసుకోవడానికి వీలుగా ఇదేమిరకమైన విభజన అనిపించినా, నాకు మాత్రం ఇది ఒక విధమైన (convenient) స్థూల విభజనలాగానే అనిపిస్తుంది.
ఇందులో, అంధ యుగం అని నేను విభజించుకున్నది – తారీకంటూ లేని/తెలియని తొలినాళ్ళ నుంచి క్రీ.శ.1000 సం. దాకా (అంటే గీత గీసినట్లు వెయ్యవ సంవత్సరందాకా అని కాకుండా ఆ ప్రాంతాలదాకా) ఈ అంధ యుగంలోకి చేర్చుకుంటాను. కారణం – వ్రాతలో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్రను గురించి తెలిపే ఆధారాలేవీ ఈ యుగంలో దొరకవు గాబట్టి. దొరికిన శిలాశాసనాలన్నీ దానశాసనాలు. ఇందులో పెద్దగా సామాన్యజనుల సాంఘిక చరిత్రకు సంబంధించిన అంశాలేమీ వుండవు. అందువలన, ఈ యుగానికి చెందిన జనజీవనానికి సంబంధించిన ఆసక్తికరమైన అదనపు సమాచారం చిన్నదైనా సేకరించడం చాలా కష్టం, challenging గా ఉండే పని.
ఇక రెండవది గ్రంథ యుగం – పేరు సూచించేటట్లుగానే, రాజరాజు కోరికతో నన్నయ మహనీయుని చేతులమీదుగా క్రీ.శ.1050 ప్రాంతంలో మొదలైన గ్రంథ రచన, ఆ తరువాత శతాబ్దాలుగా నిరాటంకంగా సాగి, ఇప్పటికీ సాగుతూనే ఉంది. పోను పోను కాలంలో వ్రాత అనేది పరిణతిచెంది సర్వ సామన్యమైన తరువాత సంగతులన్నీ గ్రంథస్థం చేయబడినాయి. శాసనాలు చాలమటుకు రాజుల చరిత్రనే చెప్పాయి. తాళపత్రాలు మిగతా సంగతులతో పాటు, అప్పుడప్పుడూ జనసామాన్యం జీవన విశేషాలను చెప్పాయి. అయితే, ఈ యుగానికి సంబంధించి అదనపు సమాచారం పెద్దగా సేకరించగలిగింది ఏమీ లేదనే అనిపిస్తుంది. ఉన్నదేదో ఇప్పటికే పెద్దలచేత బయటపెట్టబడింది గాబట్టి. ఈ యుగంలో కూడా, వెతకడానికి మిగిలి ఉన్నవిగా చెప్పాల్సినవి దొరకకుండాపోయిన ప్రసిధ్ధకవులవే గానీ, అంత ప్రసిధ్ధులు కానివారివి గానీ రచనలు. కాలగర్భంలో కలిసిపోయినవిగా అనుకోబడుతున్నవాటిని వెలికి తీసి వెలుగుచూపించడానికి కొంత అదృష్టంతో సహా ఇంకా చాలా కలిసిరావాలి.
అలాగని ఈ గ్రంథయుగంలో ఇక వెదకడానికి ఏమీ లేదని అనుకోవడంకూడా తెలివైన మాటకాదు. ఎందుకంటే, తెలుగువాళ్ళ చరిత్రకు సంబంధించిన చాలానే సంగతులు ఇంకా అపరిష్కృతాలుగా మిగిలున్నవి ఉన్నాయి. ఉదాహరణకి, శాతవాహను లెవరు? వీళ్ళు పుట్టుకతో ఆంధ్రులేనా? అనే ప్రశ్నకు ఇది final అని చెప్పుకోదగిన సమాధానం ఇంతవరకూ లేదు. అలాగే, కాకతీయులు ఎవరు? అన్న ప్రశ్నకూ, ‘కాకతి’ అనే మాట ఏ అర్ధాన్ని సూచిస్తుంది? కాకతి శక్తి ఎవరు? ఇలాంటి ప్రశ్నలకూ ఇది అంతిమం, దీనికిక తిరుగులేదు అని చెప్పుకోదగ్గ, అందరూ ఒప్పుకోదగిన, ఒప్పుకున్న సమాధానం లేదు, నాకు తెలిసినంతవరకూ, నేను చదివున్నంతవరకూ. ఇలాగే, పల్లవులు ఇక్కడివారా? బయటనుంచి వచ్చిన వారా? పల్లవ అనే మాటకు ఏమిటి అర్ధం? బృహత్ఫలాయన, శాలంకాయన, ఇత్యాది చిన్న చిన్న రాజవంశాలవారు ఇక్కడివారేనా? లేక బయటినుంచి వచ్చినవారా? ఇక్కడివారే అయితే వీరి పూర్వులు ఎవరు? ఈ వంశనామాలు దేనిని సూచిస్తాయి? ఇవి వంశనామాలేనా లేక గోత్రనామాలా? గోత్రనామాలే వంశనామాలుగా ఎందుకయ్యాయి? ఇలాంటి ప్రశ్నలకూ సరయిన convincing సమాధానాలు దొరకవలసే ఉంది ఇంకా!
అందువలన, (నా విభజనలో) అంధయుగంలోనే కాదు, గ్రంథయుగంలోని సంగతులకు సంబంధించిన సమాచారమూ సమగ్రమేమీ కాదు! అందులోకూడా ఇంకా తెలియాల్సింది ఉందనే అనుకోవాలి. చరిత్ర గురించి రాయడం out of fashion అయిపోయి చాల రోజులే అయింది. ఒకప్పుడు, 1970 ల దాకా కూడా, చరిత్ర గురించి రాయడం ఒక యజ్ఞంగా తీసుకుని కృషి చేసిన వాళ్ళున్నారు. ప్రచురించిన పత్రికలూ ఉన్నాయి. అవన్నీ గ్రంథాలయాల్లో భద్రంగానే ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుతూనే ఉన్నారు, రాయడానికి సాహసించకపోయినా!
కీ.శే. సురవరం ప్రతాపరెడ్డిగారు తమ ఆంధ్రుల సాంఘిక చరిత్రలో శాతవాహనుల కాలం నుండి క్రీ.శ.వెయ్యి దాకా ఆంధ్రుల సాంఘిక చరిత్రను గ్రంథస్థం చేయాలని అభిలషించారుగాని, ఏ కారణం చేతనో, అది కార్యరూపం దాల్చలేదు. ముందు చెప్పుకున్నట్లుగానే, వెయ్యి తరువాత ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాయడానికి తగినన్ని ఆధారాలు ఉన్నందువలన వీలయ్యే పనే! వెయ్యికి ముందు చరిత్ర రాయడానికి సరయిన ఆధారాలు ‘sources’ లేకపోవడం అనడం కంటే లభ్యంకాకపోవడం వలన అంత సులభంగా జరగే పనికాదు.
అందువలన ఆంధ్రుల చరిత్రలో తొలి వెయ్యేళ్ళు ఓరకంగా అంధయుగమే! అలా అన్నంత మాత్రాన, ఇక కృషి చెయ్యడానికి ఏమీ లేదని కాదు; చేయగలిగినంత ఉంది…ఉంటుంది!