వేణుగోపాల శతకంలోని మరి కొన్ని అర్ధవంతమైన, హృద్యమైన, ఇప్పుడు అంత విరివిగా వినబడనటువంటి లోకోక్తులను క్రింద పొందుపరుస్తున్నాను:
“కలియుగ ధర్మ మేమనగ వచ్చు, నిన్నటికి ఓర్చి ఊరక యుండవలయు”
“రంభయైన తన శరీరము కరంబుల తా బిగించిన సుఖ తరములేదు”
“నత్తు లేకుండిన ముత్తైదు ముక్కు నందు (పెద్దమ్మ కొలువు తీరి యుంటుంది అని)”
“కట్ట నిల్వని చెరువు గడియ లోపల నిండు”
“పొయి పాలికే పాలు పొంగుటెల్ల”
“పొరుగూరి కేగిన పోవునే దుర్దశ”
ఇవి ఇలా ఉండగా, మరికొన్ని ఆసక్తి కరమైన సంగతులను తెలిపే పద్యాలను గురించి కూడా ఇక్కడ ముచ్చటించుకోవాలి.
ఎవరికి నచ్చిన మతాన్ని వారు అవలంబించుకునే స్వాతంత్ర్యాన్ని, వ్యక్తి స్వేఛ్ఛనూ భారత దేశం మొదటినుంచీ ఇస్తూ వస్తోంది. ఆంధ్ర దేశానికి సంబంధించినంత వరకూ, శాతవాహనుల కాలంనుండీ దీనికి నిదర్శనాలున్నాయి. శాతవాహన రాజులలో, రాజకీయ అవసరాలకోసం అనుకున్నప్పటికీ, పురుషులు హిందూ మతాన్ని అనుసరిస్తే, స్త్రీలు బౌధ్ధాన్నిఅనుసరించారు. వర్ణాశ్రమ ధర్మాలను ఎంత కట్టుదిట్టంగా అమలుపరిచినప్పటికీ, వర్ణసంకరమయ్యే సందర్భాలు ప్రతి కాలంలోనూ అన్నో ఇన్నో ఉంటూనే ఉంటాయి. ఒక ఇంటిలో, ఆ ఇంటికి సంబంధించిన బంధువర్గంతో కలుపుకుని చూస్తే, ఎన్ని రకాల మతానుయాయులూ, వర్ణాలవారూ ఉండడానికి ఆస్కారం ఉందో తెలియచెప్పే పద్యం ఒకటి, ఆసక్తికరమైనది, వేణుగోపాలశతకంలో ఉంది. ఆ పద్యం:
“తండ్రి మధ్వాచారి, తనయు డారాధ్యుండు, తల్లి రామాంజ మతస్థురాలు,
తనది కూచిమతంబు, తమ్ముడు బౌధ్ధుండు, సర్వేశ్వర మతంబు సడ్డకునిది,
ఆలు కోమటి జాతిది, అక్క జంగమురాలు, బావగారిది లింగబలిజ కులము,
ఆడుబిడ్డ సుకారి, అల్లుడు పింజారి, మఱదలు కోడలు మారువాడి,
కలియుగమ్మున వర్ణసంకరము ప్రబలి….”
ఇది కొంత అతిశయోక్తిగా అనిపించినప్పటికీ, ఇన్నిరకాలుగా ఉండడానికి అప్పట్లో అవకాశం ఉండేదంటే తప్పుకాదు. ఊళ్ళూ, నగరాలూ cosmopolitan గా మారడంలో ఆశ్చర్యపోవాలిసింది లేదుగాని, ఈ ఇల్లు దానికదే ఒక cosmopolitan ఇల్లుగా ఇందులో దర్శనమిస్తుంది.