వారి కాలంలోని ముగ్గురు గొప్ప కవులలో (అంటే 19వ శతాబ్దం ఉత్తరార్ధం, 20వ శతాబ్దం పూర్వార్ధం) వసురాయ కవిగా రొకరు. మిగిలిన యిరువురూ, కందుకూరి వేరేశలింగంగారు, వావిలాల వాసుదేవశాస్త్రి గారు. వావిలాల వాసుదేవశాస్త్రిగారు శూద్రకుని మృచ్ఛకటికాన్ని మొదటగా తెలుగులోనికి అనువదించి అప్పట్లో వెలువడుతూండిన ‘చింతామణి’ మాస పత్రికలో (న్యాపతి సుబ్బరావుగారు స్థాపించి నిర్వహిస్తూండినది) ప్రకటించారు.
భక్తచింతామణి శతకం తరువాత వసురాయకవి గారికి అంతగా పేరుతెచ్చినది ‘వేణీ సంహారం’ నాటకం. ఇది సంస్కృత నాటకానికి రసవంతమైన తెలుగు అనువాదం. వసురాయకవిగారు దీనిని రచించి ఊరుకోకుండా, రంగస్థలం మీదికి కూడా ఎక్కించి, అందులో భీముని పాత్రను గూడా పోషించేవారని చెబుతారు.
‘గయోపాఖ్యానం’ నాటక కర్త అయిన చిలకమర్తి లక్ష్మీనరసింహంగారికి (క్రీ.శ.1867-1946), వసురాయకవిగారు తమ ‘వేణీసంహారం’ నాటకాన్ని స్వయంగా చదివి వినిపించగా, విని పరవశుడైన చిలకమర్తివారు మెచ్చుకోలుగా అప్పటికప్పుడు ఆశువుగా చెప్పిందట ఈ క్రింది పద్యం:
“వేణీ సంహారంబును
వాణీధవ తుల్యుడైన వసురాయుడు తా
నాణెముగా తెనిగించెను
ప్రాణంబులు లేచివచ్చు పద్యము విన్నన్.”
తెలుగునాట అత్యధిక జనత (popularity) పొందిన పద్య నాటకాలలో చిలకమర్తివారి ‘గయోపాఖ్యానం’ ఒకటి. తెలుగులో బహుశః అన్ని కాపీలు అమ్ముడుబోయిన గ్రంథం (నాటకాలలో) మరొకటి లేదు అనిపించుకున్నది ‘గయోపాఖ్యానం’ నాటకం. అదలా వుంచితే, చిలకమర్తివారి పేరుమీద ఒక ప్రసిధ్ధమైన చాటుపద్యం, బిపిన్ చంద్ర పాల్ గారి ఆంగ్లోపన్యాసాన్ని ఒక సభలో తెలుగులో అనువదిస్తూన్న సందర్భంలో, సభ జరుగుతూ ఉండంగానే, మనసులో ఊహించుకుని ఆశువుగా ఆయన చదివిన పద్యం, ఎవ్వరూ మరిచిపోలేనిది:
“భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియబట్టి.”
ఆ రోజులలో విశేషమైన ప్రజాదరణ పొందిన పద్యం చిలకమర్తివారి ఈ చాటు పద్యం. ఎంతగా ప్రసిధ్ధమైనదంటే, విజయవాడలో కృష్ణానది వంతెన గోడలమీద పెన్సిళ్ళతో వ్రాయబడిందట, హరికథలలోకి కూడా ఎక్కిందట!