హొయసలుల దేవాలయం (1)
ఆలయ నిర్మాణంలోనూ, తత్సంబంధ శిల్పకళలోనూ హొయసలులది ఒక ప్రత్యేకమైన శైలి. ఇప్పుడు ‘కర్ణాటక’ గా పిలవబడుతున్న ప్రాంతాన్ని హొయసలులు క్రీ.శ.1000-1346 మధ్య కాలంలో, దాదాపు 350 సంవత్సరాల కాలం పరిపాలించారు. స్వతంత్ర రాజవంశం కావడానికి ముందు వీరు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా వుండి, క్రీ.శ.1117 లో తమకు తాముగా స్వతంత్రాన్ని ప్రకటించుకుని రాజ్యాధికారాన్ని చేపట్టారు. వీరిలో మొదటి స్వతంత్ర రాజు విష్ణువర్ధనుడు, క్రీ.శ.12వ శతాబ్దం ప్రథమ దశకంలో రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఈయన పరిపాలనా కాలంలో నిర్మించబడిన ఆలయం, బేలూరులోని చెన్నకేశవాలయం. ఈ దేవాలయం క్రీ.శ.1117 సం.లో పశ్చిమ చాళుక్యుల నుంచి హొయసలులు స్వతంత్రులైన విజయానికి చిహ్నంగా నిర్మించబడి, విష్ణువర్ధన మహారాజుచే ప్రారంభించబడినదని చెబుతారు. బేలూరు చెన్నకేశవాలయం హొయసలుల ఆలయ నిర్మాణ శైలికి నమూనాలుగా చెప్పే మూడు దేవాలయాలలో ఒకటి, మొదటిదీను. మిగతా రెండూ, హాలేబీడు లోని హొయసలేశ్వర/కేదారేశ్వర ఆలయాలు, సోమనాథపూరు లోని మరో చెన్నకేశవాలయం.
హొయసలులు వారు పరిపాలించిన మూడున్నర శతాబ్దాల కాలంలో మొత్తంగా 958 ప్రదేశాలలో దాదాపు పదిహేను వందలదాకా ఆలయాలు నిర్మింపజేశారని చెబుతారు. ఈ దేవాలయాలలో చాలాభాగం కర్ణాటక రాష్ట్రంలోని ‘మల్నాడు’ గా పిలవబడే ప్రాంతంలో నిర్మింపజేశారనీ, కాలగతిలో పోయినవి పోగా వీటిలో ఇప్పటికి దాదాపుగా ఒక వంద దాకా దేవాలయాలు మాత్రమే నిలిచి ఉన్నాయనీ చెబుతారు.





