తెలుగు కావ్యాలు – కుమారసంభవం (4)

నన్నెచోడదేవుని ‘కుమార సంభవం’ (4)

“వీంగు నపారసత్త్వ గుణవిస్ఫురణం బరమేశ్వరోరువా
మాంగమునందు మున్నుదయమై నియమస్థితి గొల్చి తద్దయున్
లోంగొని పేర్మితో నఖిలలోకములుం దగగాచుచున్నవే
దాంగు ననంతు విష్ణు గమలాధిపు సంస్తుతి దేల్తు సమ్మతిన్.”

ఉత్పలమాల వృత్తంలోని పద్యం – కుమార సంభవం, ప్రథమాశ్వాసం, నాల్గవ పద్యం ఇది.

ఈ పద్యాన్ని స్మరించుకోవడానికి ముఖ్యమైన కారణం, ఈ పద్యం ప్రథమ పాదంలోనూ, మూడవ పాదంలోనూ వాడిన ‘వీంగు’ ‘లోంగొని’ అనే పదాలూ, వీటితో ‘వామాంగము ‘ ‘వేదాంగు ‘ అనే పదాలలోని పూర్ణబిందుపూర్వకాక్షరం ‘గ’ కు చెల్లించిన ప్రాసమైత్రి.

ఈ ‘వీంగు’ ‘లోంగొను’ అనే పదాలు ఖండబిందు యుక్తంగా ‘వీఁగు’ ‘లోఁగొను’ అనే వాటికి పూర్వరూపాలు.  ఇప్పుడు ఇవి ఖండబిందువును కూడా విడిచిపెట్టి బిందురహితంగా ‘వీగు’ ‘లోగొను’ అనే రూపాలలో మిగిలి ఉన్నాయి.

ఈ ప్రయోగాలనే నన్నెచొడుని ప్రాచీనతకు నిదర్శనాలుగా పూజ్యులు మానవల్లి వారు చూపి, నన్నయ కవిత్వంలో గానీ, ఆ తరువాతి కవుల ప్రయోగాలలో గానీ ఇలాంటి ప్రయోగాలు లేని కారణంగా నన్నెచొడుని నన్నయకంటే పూర్వునిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. “నన్నెచోడుడు నన్నయకంటె పూర్వుడని కుమార సంభవము నందలి వ్యాకరణ ఛ్ఛందో విశేషాత్మకాపూర్వపద ప్రయోగములు సహస్ర ముఖముల ఘోషించుచున్నవి” అంటూ పూజ్యులు మానవల్లి వారు చూపిన ఉదాహరణలలో రెండు పద్యాలు ఈ క్రిందివి:

“పోండిగ నగజ తపశ్శిఖి
మూండు జగంబులను దీవ్రముగఁ బర్విన బ్ర
హ్మాండము గాఁచిన కాంచన
భాండముక్రియఁ దాల్చెఁ దత్ప్రభాభాసితమై.” (షష్టాశ్వాసం, 157వ పద్యం)

“వీండేమి సేయుఁ బంచిన
వాం డుండఁగ నిక్కమునకు వధ్యుఁడుగా నా
ఖండలుఁడు గాక యేసిన
వాండుండఁగ నేమిసేయు వరశర మనిలోన్.” (దశమాశ్వాసం, 155వ పద్యం).

పూర్ణార్ధ బిందుప్రాసము — అంటే దీర్ఘముమీది అరసున్నను నిండుసున్నగా చేసి సిధ్ధపూర్ణానుస్వార పూర్వాక్షరముతో ప్రాసను చెల్లించడం అన్నది పై పద్యాలలోని ఛ్ఛందోవిశేషం. నన్నయకానీ, ఆ తరువాతి కవులుగానీ ఈరకపు ప్రాసను ఎక్కడా వాడి యుండలేదనీ, ఇట్టి ప్రాసమైత్రి నన్నయకు పూర్వం వుండియుండును కాబట్టి నన్నెచోడుడు నన్నయకు పూర్వుడు కావలయుననీ, ‘ఇది పూర్ణార్ధబిందుప్రాసముకాదు, కవి ఈ శబ్దములను పూర్ణబిందుయుతములుగనే వాడాడు’ అనుకున్నా, పూర్వమొకప్పుడు పూర్ణమై యుండిన బిందువు తరువాత్తరువాత ఖండబిందువయినట్లు భాషాచరిత్రనుబట్టి తెలుస్తుంది కాబట్టి, అప్పుడుకూడా నన్నయకంటె నన్నెచోడుడు పూర్వుడే అవుతాడు అన్నది మానవల్లివారి వాదన.

ఇక అసలు పద్యం యొక్క అర్ధం విషయానికొస్తే:

‘వీంగు (వీఁగు) – అపార సత్త్వగుణ – విస్ఫురణన్ – పరమేశ్వరు (ని) – ఉరు వామాంగము నందు’ — విజృంభించు అపారమైన  సత్త్వగుణముయొక్క స్ఫూర్తితో పరమేశ్వరుని (శరీరంలో) యెడమభాగమందు,

‘మున్ను – ఉదయమై – నియమస్థితి – కొల్చి’ — పూర్వం ఉద్భవించి నిష్ఠతో  అతనిని సేవించి,

‘తద్దయున్ – లోంగొని (లోఁగొని) – పేర్మితో – అఖిల లోకములుం – తగ కాచుచున్న’ — (అతని అనుగ్రహముతో) ఎల్లలోకములను ప్రేమతో వశపరచుకొని సముచితముగా కాచుచున్న,

‘వేదాంగున్ – అనంతున్ – విష్ణున్ – కమలాధిపున్’ — వేదమునే శరీరముగా గలవాడూ, అంతములేనివాడూ, కమలాధిపుడూ అయిన విష్ణువును,

‘సంస్తుతిన్ – తేల్తు – సమ్మతిన్’ — మంచి స్తోత్రముతో, సమ్మతితో, సంతోషపెట్టెదను.

ఈ పద్యంలో పైకి కనబడేది విష్ణు స్తుతి. అంతరంగా, విష్ణువు ఉద్భవానికీ, ఆయన సముచితంగా అఖిల జగత్తునూ కాచుకోవడానికీ కారణమైనది శివతత్త్వమే అన్నది లీలామాత్ర ధ్వని.

 

తెలుగు కావ్యాలు – కుమారసంభవం (3)

తెలుగు కావ్యాలు – కుమారసంభవం (3)

“హరి వికచామలాంబుజసహస్రము పూంచి మృగాంకునం దవి
స్ఫురిత మలాసితాబ్జమని పుచ్చగ జాచిన చేయి జూచి చం
దురు డది రాహు సావి వెఱ దుప్పలదూలగ జాఱుచున్న న
య్యిరువుర జూచి నవ్వు పరమేశ్వరు డీవుత మా కభీష్టముల్.”

చంపకమాల వృత్తంలో ఉన్న పద్యం ఇది, కుమార సంభవం, ప్రథమాశ్వాసం మూడవ పద్యం.

ఇందులో ఒక చిత్రమైన సన్నివేశం ఊహించబడి, పద్యంగా వర్ణించబడింది.

ఎక్కడా మచ్చంటూ లేనటువంటి వెయ్యి తామరలతో విష్ణువు శివుని శిరస్సును పూజిస్తూంటాడు. విష్ణువుచే అలా పూజలో సమర్పించబడిన తామరపుష్పాలలో, మచ్చకలిగిన (అంటే స్వఛ్ఛమైనది కాని) ఒక తామరపూవుగా భ్రమింపజేస్తూ అకస్మాత్తుగా శివుని జటాజూటంలోని చంద్రునివదనం, మృగాంక సహితంగా, కనుపించి విష్ణువును కలవరపాటుకు గురిచేయగా, కలత చెందిన మనస్సుతో విష్ణువు ఆ మలినపుష్పాన్ని తీసివేసే ఉద్దేశ్యంతో చేయిచాస్తాడు. అలా విష్ణువుచే చాచబడిన (నీల వర్ణం కలిగిన) చేతిని తనను మింగడానికి సమీపిస్తున్న రాహువుగా భ్రమసి, చంద్రుడు శివజటాజూటాన్ని వీడి పారిపోయే ప్రయత్నంలో ఉండగా,
భ్రాంతికిలోనయిన ఆ ఇరువురి చేష్టలను చూసి పరమేశ్వరుడు నవ్వుకుంటుంటాడు – ఇదీ ఆ సన్నివేశం.

‘హరి – వికచ – అమల – అంబుజ – సహస్రము – పూనిచి’ –వికసించినటువంటి నిర్మలమైనట్టి వేయి తామరలను సమర్పించి, హరి (శివునికి పూజ చేసేటప్పుడు)….

‘మృగాంకున్ – అందున్ – అవిస్ఫురిత – మల – అసిత – అబ్జమని’ –వాటిలో చంద్రుని మాలిన్యముచే నల్లనైన వికసించని తామరపూవుగా అనుకుని…

‘పుచ్చగ – జాచిన – చేయి చూచి’ –తొలగించుటకు చాచిన చేతిని చూసి…

‘చందురుడు – అది – రాహు సావి – వెఱన్ – తుప్పలతూలగ – జాఱుచున్నన్’ –చంద్రుడు దానిని (తనను కబళించడానికి వస్తున్న) రాహువని తలచి, ఆ భయంతో మిక్కిలిగా చలించి పారిపోయే చర్యలో ఉండగా…

‘అయ్యిరువుర – జూచి – నవ్వు – పరమేశ్వరుడు – ఈవుత – మాకు – అభీష్టముల్’ (భ్రమలో వింత వింత చర్యలకు పాల్పడియున్న) ఆ ఇరువురినీ చూచి నవ్వు పరమేశ్వరుడు మా కోరికలను తీర్చు గాక!

ఇందులో ‘అయ్యిరువురన్’ అనే మాట, నా జ్ఞాపకాలను ఒక్కసారిగా మా హైస్కూలు 10వ తరగతి గదిలోకి తీసుకువెళ్ళి మా తెలుగు మాష్టారిముందు బాసింపట్లు వేయించి కూర్చోబెడతాయి.

‘అయ్యిరువురన్’ అనేది యడాగమానికీ, ఆపై  త్రికసంధికి మంచి ఉదాహరణ. బాలవ్యాకరణం, సంధి/సమాస పరిఛ్ఛేదాలలోని మూడు సూత్రాలు ‘ఆ’ ‘ఇరువురన్’ అనే రెండు మాటలను ఒకటిగా సంధిస్తాయి. దీనిని వివరిస్తూ మా తెలుగు మాష్టారు ‘ఆ, ఈ, ఏ లు త్రికములు’ అనే సూత్రంతో మొదలు పెట్టేవారు. అప్పుడు ఈ పదాలు ‘ఆ + ఇరువురన్’ అని వాటి సాధారణ రూపంలో వుంటాయి. ఆ తరువాత వరుసగా -

‘సంధి లేని చోట స్వరంబుకంటె పరంబయిన స్వరంబునకు యడాగమంబగు’ (బాల వ్యా.సంధి.3)

ఆ + యిరువురన్

‘త్రికంబుమీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు’ (బాల వ్యా.సమాస.14)

ఆ + య్యిరువురన్

‘ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు ఆఛ్ఛికంబగు దీర్ఘంబు హ్రస్వంబగు’ (బాల వ్యా.సమాస.13)

అ + య్యిరువురన్ = అయ్యిరువురన్ గా  మారి మిగులుతుంది చివరికి.

ఎన్నిసార్లు ఈ త్రికసంధి సూత్రాలను practice చేయించారో చెప్పలేను…ఆ రోజులలో నిద్రలో లేపి అడిగినా అక్షరం పొల్లుపోకుండా చెప్పగలిగి ఉండేవాళ్ళం.

తెలుగు భాషపై ఏమాత్రం పట్టు సాధించాలన్నా బాలవ్యాకరణం జోలికిపోకుండా సాధ్యమవుతుందంటే నాకు సందేహమే!

తెలుగు కావ్యాలు – కుమారసంభవం (2)

నన్నెచోడదేవుని ‘కుమార సంభవం’ (2)

“శ్రీవాణీంద్రామరేంద్రార్పిత మకుట మణిశ్రేణిధామాంఘ్రి పద్మా
జీవోద్యత్కేసరుం డాశ్రితజనలషితాశేషవస్తుప్రదుం డా
దేవాధీశుండు నిత్యోదితు డజుడు మహాదేవు డాద్యుండు విశ్వై
కావాసుం డెప్పుడున్ మా కభిమతములు ప్రీతాత్ముడై యిచ్చుగాతన్.”

నన్నెచోడుని ‘కుమార సంభవం’ లోని మొదటి పద్యం ఇది. స్రగ్ధర వృత్తంలో ఉన్న పద్యం.

ఆరంభం ఒక అవస్థ అని మనకు నానుడి. పద్యానికైన, గేయానికైనా,  కావ్యానికైనా, కథకైనా, నవలకైన — దేని రచనకైనా సరే, ఆరంభం అనేది ఒక అవస్థ అని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు.  ఈ అవస్థను ఒకింత దాటెయ్యడానికన్నట్లుగా , కావ్య రచన నేరుగా కథతో మొదలు కానక్కర లేకుండా ప్రార్ధనాత్మకమైన శ్లోకంతోనో, పద్యంతోనో మొదలయ్యేలా పూర్వకవులు చేశారని నేను అనుకుంటాను.

నన్నయగారి భారతం కూడా ‘శ్రీవాణీ’ అన్న మూడు అక్షరాలతోనే మొదలవుతుంది.  అయితే, నన్నె చోడుని ‘కుమార సంభవం’ తొలి పద్యంలో ‘శ్రీవాణీం’ అని  మగణంగా ఉన్న ఈ మూడు అక్షరాల తరువాత వచ్చిన ‘ద్రామరేం’ అనే మూడు అక్షరాలు ‘ర’ గణము అయి ఉండడం వలన, ఒక కావ్యాన్ని ఏకవి అయితే మగణం వెంట రగణంతో మొదలు పెట్టి చెబుతాడో ఆకవి తప్పక అకాల మరణం పాలవుతాడన్న దానికి దృష్టాంతంగా నన్నెచోడుడు యుధ్ధంలో అకాలమరణం చెందాడని ఒక మాట ప్రచారంలో ఉంది. ఈ దృష్టాంతాన్ని తెలిపే అధర్వణఛ్ఛందం లోని కంద పద్యం:

“మగణమ్ము గదియ రగణము
వగవక కృతి మొదల నిలిపువానికి మరణం
బగు నిక్కమండ్రు, మడియడె
యగునని యిది తొల్లి టెంకణాదిత్యుండనిన్.”

పై పద్యంలోని ‘టెంకణాదిత్యుడు’ అనే పదం నన్నెచోడుని సూచిస్తుండి. ‘కుమార సంభవం’ అవతారికలోని పద్యాలను బట్టి నన్నెచొడుడు సూర్యవంశ క్షత్రియుడు, కాశ్యప గోత్రుడు. వివేకబ్రహ్మ అని పేరుపొందినవాడు.  పాకనాటి యందు ఇరువదిఒక్క వేయిటికి అధీశుడగు చోడబల్లికీ, హైహయరాజవంశజ అయిన శ్రీసతికీ కుమారుడు. కలుపొన్న, కలుకోడి చిహ్నాలుగా గలిగినట్టి ‘ఒరయూరు’ కు అధిపతి అయినట్టివాడు. టెంకణాదిత్యునిగా కూడా వ్యవహృతుడు. నన్నెచోడుని అకాలమరణాన్ని తెలిపే ఈ ఐతిహ్యం ఎంతవరకు నమ్మశక్యమైనదో చప్పలేము. అయితే, అకారణంగా పద్యం ఎలా పుడుతుంది? అన్న ప్రశ్నకూ సరయిన సమాధానం దొరకదు. కాబట్టి, ఇలాంటివి సమాధానం దొరికీ దొరకకుండానూ, reason కి అందీ
అందకుండానూ అలా మిగిలి ఉంటేనే బాగుంటుందనుకుంటాను. ఈ సంగతులను ఇక్కడితో వదిలి, పద్యం యొక్క భావం వైపుకు దృష్టి సారిస్తే -

‘శ్రీ – వాణీ – ఇంద్ర – అమరేంద్ర – అర్పిత – మకుట – మణిశ్రేణి – ధామ – అంఘ్రిపద్మ – ఆజీవ – ఉద్యత్కేసరుండు ‘ అంటే ‘విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు తమ శిరస్సులను మోపగా వారివారి కిరీటములలో పొదగబడివున్న మణుల కాంతులు తనయొక్క పాదపద్మములకు ఆకరువులుగా గలిగినవాడునూ…

‘ఆశ్రితజన – లషిత – అశేష – వస్తుప్రదుండు’ అనగా ‘ఆశ్రయించిన జనుల సమస్త కోరికలను తీర్చువాడునూ…

‘ఆ దేవాధీశుండు – నిత్యోదితుడు – అజుడు – మహాదేవుడు – ఆద్యుండు – విశ్వైకావసుండు’ – ఇవన్నీ ఈశ్వరునికి విశేషణాలుగా చెప్పబడిన మాటలు; అయిన ఆ మహాదేవుడు…

‘ఎప్పుడున్ -  మాకు – అభిమతములు – ప్రీతాత్ముడై – యిచ్చుగాతన్’ అనగా ‘సంతోషము చెందిన మనసు కలవాడై మా కోరిన కోరికలెల్ల సకలవేళలందునూ తీర్చును గాక!

నన్నెచోడుడు ఈ కావ్యాన్ని తన గురువు, మహాతపస్సంపన్నుడు, శ్రీశైల నివాసి అయిన జంగమ మల్లికార్జున శివయోగికి అంకితమిస్తూ చెప్పినట్లుగా (‘అంకిత’ మన్న మాట ఈ కావ్యంలో ఎక్కడా వాడక పోయినా, ఆ అర్ధం ధ్వనించే విధంగా) చెప్పాడు.

ఈ కావ్యానికి కారకులయిన మువ్వురిలో ఇద్దరు – అనగా క్రుతికర్తయైన నన్నెచోడుడు, క్రుతిభర్తగా అనుకుంటే జంగమ మల్లికార్జున శివయోగి – శైవులు. మూడవ వ్యక్తి, తానుగా కావ్యనాయకుడైన శివుడు!  అందుచేత, కావ్యారంభంలోని ఈ పద్యంలో వాడబడిన విశేషణాలన్నిటిలో అంతా శివమయంగానూ, శివాధిపత్యం ధ్వనించే విధంగానూ చేసి చూపెట్టడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు కదా!

 

తెలుగు కావ్యాలు – కుమారసంభవం (1)

నన్నెచోడదేవుని ‘కుమార సంభవం’ (1)

తెలుగు భాషలోని కావ్యాలలో నన్నె చోడదేవుని ‘కుమార సంభవా’ నిది ఒక విశిష్టమైన స్థానం. తంజావూర్ సరస్వతీమహలు గ్రంథాలయంనుంచి ఈ కావ్యాన్ని ఉధ్ధరించి క్రీ.శ.1908వ సంవత్సరంలో తమ స్వంత ప్రచురణగా స్వర్గీయ మానవల్లి రామకృష్ణకవిగారు ప్రచురించిన తరువాత,  తెలుగు సాహితీ లోకంలో ఈ కావ్యం రేపినంత దుమారం మరే కావ్యామూ రేపలేకపోయిందనడంలో అతిశయోక్తి లేదన్నది సాహితీవేత్తలందరూ ఎరిగినదే. కావ్యం లోపలి విషయం కంటె, ఈ కావ్యానికి తాము వ్రాసిన ఉపోద్ఘాతంలో ఈ కావ్యకర్తయైన నన్నెచొడదేవుడు క్రీ.శ.940 ప్రాంతంవాడనీ, తత్కారణంగా క్రీ.శ.1020-30ల నాటి నన్నయ భట్టారకుని కంటె ముందువాడానీ,  ఆ కారణాన తెలుగు సాహిత్యంలో ఆదికవి బిరిదానికి నిజమైన అర్హుడనీ మానవల్లి
కవిగారు చేసిన నిర్ణయం ఈ కావ్యం రేపిన దుమారానికి ముఖ్య కారణం అనికూడా అందరకూ తెలిసినదే! ఆ తరువాత జరిగిన తర్జనభర్జనలో, పలువురు సాహిత్తివేత్తలు వారికి తోచిన ఆధారాలతో పలురకాలుగా చేసిన నన్నె చోడదేవుని జీవిత కాలనిర్ణయం తరువాతగూడా, నన్నెచోడుని జీవితకాలం ఇది అని ఇదమిధ్ధంగా, స్పష్టంగా చెప్పగలగడానికి తగినటువంటి అధారాలు లేనికారణంగా, చివరికి అందరికీ ఒకింత అంగీకారంగా నన్నెచోడుడు క్రీ.శ.1125-30 ప్రాంతములవాడని తేల్చుకుని సరిపెట్టుకోవలిసి వచ్చిందన్నదీ విదితమే! కనుక, ఇప్పటికి తెలిసినంతవరకు, తెలుగులో కుమారసంభవ కర్తయైన నన్నెచోడుడు క్రీ.శ.12వ శతాబ్దంవాడనీ, నన్నయకు పూర్వుడుకాడనీ, నిజానికి ఒక శతాబ్దం తరువాతివాడనీ అనుకుని ముందుకు వెళ్ళడం చేయవలసిన
పని.

పేరొకటే అయినప్పటికీ, తెలుగు కుమారసంభవంలోని సతీ వృత్తాంతం, గజాననోత్పత్తి, దక్షాధ్వర ధ్వంసం అనే అంశాలను విడిచి పెడితే, రెండింటి కథా ఒకటే అయినప్పటికినీ, నన్నెచొడుని కుమారసంభవం సంస్కృతంలో మహాకవి కాళిదాసు రచించిన కుమారసంభావానికి అనుకరణగానీ, అనువాదంగానీ కాదని పెద్దల నిర్ణయం. నన్నెచోడుడు మిక్కిలి స్వతంత్రుడైన ఆంధ్ర కవి అనీ, వర్ణనప్రియుడనీ, కుమారసంభవంలో ఈ కవి చేసిన సుదీర్ఘ వర్ణనలన్నీ కూడా స్వకపోలకల్పితాలే అనీ, కాళిదాసు కుమారసంభవంలోని శ్లోకాలలో చాలా తక్కువ వాటికి (వేళ్ళపై లెక్కింపదగినన్ని వాటికి) మాత్రమే తెలుగు కుమారసంభవంలో ఆంధ్రీకరణములనదగినవి కనిపిస్తాయనీ, నిజానికి కాళిదాసు అంతటి కవిచే తలవూయించగలిగిన పద్యాలు కొన్ని తెలుగు కుమారసంభవకావ్యంలో వున్నాయనీ కూడా పెద్దలు చెబుతారు.

తెలుగు కుమారసంభవం పండ్రెండాశ్వాసాల కావ్యం. కొన్నికొన్ని చోటల ఇందులోని వర్ణనలు ఒకింత ప్రౌఢంగా వుండి, పెద్దలు పరిణతబుధ్ధులు మాత్రమే ఆయా తావులలోని అంశాలను చదవడానికి అర్హులనీ, చదివిన దానిని తగిన విధంగా అర్ధంచేసుకోవడానికి అనువైన సమర్ధత కలిగి ఉంటారని అనిపింపజేస్తుంది.

ఒక్కొక్క ఆశ్వాసంలోని కథ బహుసంక్షిప్త రూపంలో –

ఆశ్వాసం (1): దక్షుని  ప్రార్థనను మన్నించి ఆదిశక్తి సతీదేవి అనే పేరుమీద దక్షునికి కూతురుగా జన్మించి, పరమశివుని వివాహమాడడం, వారిరువురికీ గజాననుడు ఆవిర్భవించడం, దక్షుడు తన కూతుళ్ళనందరనూ చూడాలనే ఇఛ్ఛతో వెళ్ళి కశ్యప ప్రభృతులైన తన అల్లుళ్ళచే సన్మానితుడై ఆనందాంతరంగుడవడం.

ఆశ్వాసం (2): అదేవిధంగా దక్షుడు శివుని చూడడానికి వెళ్ళగా శివుడు ఆయనను తక్కిన అల్లుళ్ళవలె సత్కరించకపోవడం, అందులకు ఆయన కోపంచెంది ప్రతిగా శివుని అవమానించ దలచి తాను చేయు యజ్ఞానికి అతనిని ఆహ్వానించక తన కూతురైన సతీదేవికి మాత్రమే ఆహ్వానం పంపడం, తన భర్తయైన శివుని ఆహ్వానింపకపోవడంపై సతీదేవి తండ్రియైన దక్షుని అధిక్షేపించడం, దానికి ప్రతిగా దక్షుడు శివుని నిందించడం, దానికామె పట్టరాని కోపంతో యోగాగ్నియందు ఆత్మాహుతి చేసుకోవడం, గజాననుడు
ప్రమథగణాలతో వెళ్ళి దక్షుని యాగాన్ని ధ్వంసంచేసి, దక్షుని బందీనిగా చెసుకుని పరమేశ్వరుని వద్దకు తీసుకురావడం, ఫరమశివుడు దక్షుని క్షమించి యగఫలాన్ని అనుగ్రహించి అతనిని ప్రజాపతిగా నియమించడం.

ఆశ్వాసం (3): సతీదేవి హిమవంతునికి కుమార్తెగా జన్మించడం, హిమవంతుని దగ్గరకు నారదమహర్షి వచ్చి పార్వతిని చూసి ఆమె పరమేశ్వరునికి భార్య అవుతుందని చెప్పడం, శివుడు తపస్సుచేసుకోవడానికి హిమవత్పర్వతానికి రాగా, హిమవంతుడు ఆయన పరిచర్యకై పార్వతిని నియోగించడం.

ఆశ్వాసం (4): తారకాసురుడనే రాక్షసుడు తమను పెట్టే బాధలకు తట్టుకోలేక దేవతలు బ్రహ్మదేవునితో మొరపెట్టుకోగా, ఆయన పార్వతీ  పరమేశ్వరుల కుమారుడు తారకుని సంహరించగలడని చెప్పడం, పార్వతీ పరమేశ్వరుల సంయోగాన్ని కల్పించడంకోసం ఇంద్రుడు మన్మథుని నియోగించడం, మన్మథుడు సపరివారంగా ఈశ్వరుని తపోవనమునకు వెళ్ళడం, వసంతుడు శివ తపోవనంలో అకాల వసంతోదయాన్ని కల్పించడం.

ఆశ్వాసం (5): వాసంతకుసుమాలంకృతయై తనను సేవించడానికి వచ్చిన పార్వతిని చూసి శివుడు చలించడం, తన మనోవికారానికి కారణం మన్మథుడని తెలుసుకొన్న శివుడు తన మూడవ కంటి అగ్నిచే మన్మథుని భస్మీపటలం చేయడం, పతిని పోగొట్టుకుని రతి విలపించడం, భర్తకై విలపించు రతిని ఆకాశవాణి ఊరడించడం, పార్వతి విరహతాపము చెందడం, చెలికత్తెలు శిశిరోపచారములను చేయడం.

ఆశ్వాసం (6): పార్వతి తండ్రియైన హిమవంతుని అనుమతితో తపోవనానికి వెళ్ళడం, ఆమె ఒక మునిపల్లెను చేరి అక్కడనున్న జంగమ మల్లికార్జునుని వద్ద దీక్ష గైకొని తపోవేషధారిణియై గంగాతీరాన ఆశ్రమాన్ని ఏర్పరచుకుని ఘోర తపస్సును చేయడం, ఒక్కొక్క ఋతువులో పార్వతీదేవి తపోవర్ణనం.

ఆశ్వాసం (7) : శివుడు మారువేషంలో పార్వతి వద్దకు వచ్చి ఆమె తపస్సుకు మెచ్చి ఆమెకు సాక్షాత్కరించడం, శివుడు కన్యావరణార్థం సప్తర్షులను హిమవంతుని వద్దకు పంపించడం.

ఆశ్వాశం (8): అలా వెళ్ళిన సప్తర్షులు వివాహనిశ్చయం చేసుకుని తిరిగి రావడం, శివుడు పెండ్లికొడుకయి బ్రహ్మాదులతో పెళ్ళికి తరలి వెళ్ళడం, హిమవంతుడు మగపెళ్ళివారికి ఎదురు సన్నాహం పంపడం, ఆనాటి రాత్రి విటీ విట శృగారక్రీడల వర్ణనం.

ఆశ్వాసం (9): పార్వతీ పరమేశ్వరుల వివాహం, తంబురునారదుల గానం, రంభాదుల నాట్యం, దేవతల ప్రార్థనమీద శివుడు మన్మథుని పునరుజ్జీవితుని చేయడం, వసంతోత్సవం, జలక్రీడలు, పార్వతీ పరమేశ్వరులు కైలాసపర్వతానికి వెళ్ళడం, వారి మధ్య శృగార వర్ణనం.

ఆశ్వాసం (10): పార్వతీ పరమేశ్వరులు శయనమందిరంలో ఉన్నపుడు అగ్ని అందు ప్రవేశించడం, శివుడు అగ్నిపై తన వీర్యాన్ని చల్లడం, అగ్ని దానిని గ్రహించి శరవణ సరస్సుకు వెళ్ళడం, అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నులు అగ్ని వలన శివుని వీర్యాన్ని గ్రహించి గర్భవతులవడం, వారు వారి గర్భస్థ పిండాలను సరోవరగర్భంలో పెట్టి వెళ్ళిపోవడం, అవన్ని ఏకమై కుమారుడు ఉద్భవించడం, నారదుడు ఆ కుమారుని తేజోవిషేషాలను గురించి ఇంద్రునకు చెప్పగా అతడు కుమారునిపై యుధ్ధంచేసి ఓడిపోయి శివుని శరణు వేడడం, పార్వతీ పరమేశ్వరులా కుమారుని తమ కుమారునిగానే గణనచేసి తారకాసురుని వధించడానికై
దేవతల సేనానాయకునిగా అభిషేకించడం,  కుమారుని క్రౌంచాచల భేదనం, దేవతలు బృహస్పతి కొడుకైన సుమతిని తారకాసురుని వద్దకు రాయబారినిగా పంపడం, తారకుడు దూతను నిందించి వధించ బూనడం, శుక్రుని ధర్మోపదేశం, తారకుడు దేవసభకు దూతను పంపడం, యుధ్ధం నిశ్చయమవడం, శుక్రుడు మరలా తారకునకు రాజనీతిని ఉపదేశించి యుధ్ధాన్ని నివారించబూనడం, తారకుడు నిరాకరించడం.

ఆశ్వాసం (11): ఇరు పక్షాలూ చతురంగబలాలతో యుధ్ధభూమిని చేరి ఘోర యుధ్ధం చేయడం.

ఆశ్వాసం (12): కుమారతారకాసురులు ఒకరికొకరుగా యుధ్ధం చేయడం, కుమారుని చేతిలో తారకుడు నిహతుడవడం, కుమారుని దేవతలు అభినందించడం, విజయలక్ష్మీశోభితుడై కుమారుడు తల్లిదండ్రులను దర్శించడం, పరమేశ్వరుడు కుమారునకు ఈశ్వర తత్త్వోపదేశం చేయడం.

ముందుగానే చెప్పినట్లుగా, సంక్షిప్తంగా ఇదీ తెలుగు ‘కుమారసంభవం’ కథ. ఇక్కడినుంచి ఒక్కో ఆశ్వాసంలో భాషాసౌందర్యంతోనూ, భావసౌందర్యంతోనూ మెరుసిపోతూండే మంచి మంచి పద్యాలను అన్వీక్షణం చేస్తూ ఈ వ్యాసం ముందుకు సాగుతుంది.