తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (4)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (4)

ఆంధ్రులు ఆంధ్రులుగానే ఉండకుండా వారి రాజ వంశానికి పేరుగా సాతవాహన అనే పదాన్ని రూపకల్పన చేసుకున్నారు. ఏ అద్భుత క్షణాలలో ఈ పదరూపకల్పన
జరిగిందోగాని చరిత్రలో బహుళ ప్రసిధ్ధమై చిరస్థాయిగా ఈ పదం నిలిచిపోయింది. తరువాతి కాలంలో  ఈ పదం శాలివాహన, శాతవాహన గా రూపాంతరం కూడా
చెందింది. ఇందులోని శాలివాహన పదంతో ఒక శకం ప్రారంభం జరిగింది. తొలి, అసలురూపమైన సాతవాహన పదం మహారాష్ట్రీ ప్రాకృత పదం. మహారాష్ట్రీప్రాకృతం నుంచే నేటి మరాటీ పుట్టింది కాబట్టి, ఇప్పటి మరాటీ భాషలో ‘సాతవాహన’ పదానికి అర్ధం ఈ క్రింది విధంగా సూచించబడింది (ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి – చరిత్ర చర్చ):

“సాద – ఏడు Seven or Several
సాత – ప్రతిధ్వని An echo, a hollowing or calling to
సాతు – ధాన్యవిశేషము Barley
వాహ(ణేం) – ప్రవహించు, ప్రవహింపజేయు, విత్తనములు చల్లు (to sow), దున్ను, పండించు, వ్యవసాయము చేయు (to till)…”

పై అర్ధాలను బట్టి, సాతవాహన శబ్దసంపుటికి ‘ధాన్యమును పండించువాడు’ అని పూర్వ మహారాష్టీ ప్రాకృతంలో అర్ధం అని విదితమవుతుంది అన్నారు. ఈ సాతవాహన పదం సంస్కృతంలో శాలివాహన అన్న పదానికి సరిపోయేదిగా చెప్పబడింది.

“నూనూగు మీసాల నూత్న యౌవనమున – శాలివాహనసప్తశతి నుడివితి ” అని కాశీఖండంలో శ్రీనాథుడు పేర్కొన్నది. ఇక  శాతవాహన అన్న రూపం అర్వాచీన రూపం. ఆధునిక వ్యవహారంలోనే తప్ప, పురాణ రాజనామావళులలో గానీ, శాతవాహనుల శాసనాలలో గానీ, పరంపరాగతమైన ప్రసిధ్ధ వ్యవహారంలో గానీ ఈరూపం లేదని చెప్పారు. అందువలన, శాతవాహన శబ్దానికి ఆద్య రూపమైన సాతవాహన శబ్దం మహారాష్ట్రీ ప్రాకృతంలోనిది కాబట్టి, ఆంధ్రులైన శాతవాహనుల మాతృబాష కూడా మాహారాష్ట్రీ ప్రాకృతమన్నది అంగీకార యోగ్యమవుతుంది.తమచే నిర్మించబడిన రాజవంశానికి ఎవరూ తమది కాని పరాయి భాషలో నామకరణం చేసుకోరు కదా!సాతవాహన శబ్దం సూచించే అర్ధాన్ని బట్టి, శాతవాహనులు జాతిపరంగా ఆంధ్రులు, వృత్తిపరంగా ధాన్యమును పండించే కృషీవల కుటుంబులు అన్నది సాధకమవుతుంది. ప్రాకృతం అంటే మహారష్ట్రీ ప్రాకృతమే అన్న మాట కూడా మొదటినుంచీ వ్యవహారంలో ఉంది.

“ఊరినడుమ – గ్రామ మధ్య – గామామే”

శబ్దశాస్త్రం (Philology) లో అంతర్భాగమైన స్వరశాస్త్రం (Phonology) గురించి రాస్తూ, శ్రీమాన్ మేడేపల్లి వెంకటరమణాచార్యులుగారు వారి ‘ప్రాకృతభాషోత్పత్తి’ అనే పుస్తకంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఆ ఉదాహరణ పాఠం ఇది:

“ఊరినడుమ” అని చెప్పుటకు “గ్రామ”, “మధ్య” అను రెండు పదములుండవలెను. ఈ పదద్వయమును సమాసముగా చేసినచో “గ్రామమధ్య” అని యగును. యుక్తముగా నుచ్చరించుట కలవాటు లేనివాడు, అశిక్షితుడు, ప్రమాదముతో నుచ్చరించువాడు “మధ్య” కు “మజ్ఝ” యని కాని, “మద్దె” యని కాని పలుకును. మరల నీ శబ్ద రూపము “మాజ్ఝ” లేక “మాధ” యని మాఱి యంతతో నిలువక “మా” లేక “మహ” యయి కొనకు “మా” లేక “మే” యయినది. ఇట్లు “గ్రామమధ్య” శబ్దము “గామమా” లేక “గామమే” యని మాఱినది. గూర్జరీ, హిందీ, మరాటీ భాషలలో నిదియే రూపము.”

ఈ ఉదాహరణ తాత్పర్యం – సంస్కృతం నుండి ప్రాకృతం (తదితర భాషలు) పుట్టాయన్నది – ఇక్కడ సుగ్రాహ్యమే!అసలుకు, సంస్కృతం ముందా లేక ప్రాకృతం ముందా అన్నది చాలా పెద్ద చర్చకు సంబంధించిన విషయం. ఎన్నెన్నో వాదోపవాదాలు జరిగాయి. ఇరువైపుల వాదనలనూ ఉదాహరణ, ఉపపత్తులతో సహా ఒకింతగా సమీక్షించిన మీదట, శ్రీ పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రిగారు తమ “ప్రాకృత గ్రంథకర్తలూ, ప్రజాసేవానూ” వ్యాసంలో (1933 వ సంవత్సరం డిశెంబరు నెల చివరివారంలో రాజమహేంద్రవరంలో మూడురోజుల పాటు జరిగిన గిడుగువారి సప్తతితమ జన్మదిన మహోత్సవ సభకు అధ్యక్షులుగా వ్యవహరించిన పంచాగ్నులవారు గిడుగువారికి సమర్పించిన అభినందన సంపుటమైన ‘వ్యాస సంగ్రహం’ లోనిది ఈ సుదీర్ఘ వ్యాసం) తేల్చినది – “వీటివల్ల తెలినది ఏమిటంటే – అన్నిభాసలకూ అసలు మాతృక ప్రాకృతమే అనీ, సంస్కృతాది భాషలు ఈ మాతృకకు పుత్రికలు అనీ.  ఇది పై సందర్భాల చర్చచేత తేలిన తాత్పర్యాంశం” అని. నాకయితే, ఈ తాత్పర్యాంశం నా పరిమిత బుధ్ధికి ఒకింత నేల విడిచి చేస్తున్న సాము లాగా అనిపించినా, ఈ విషయమై ఆ సంగతిని తగినవిధంగా విశదపరచగలిగేటంత పాండిత్యమూ, ప్రజ్ఞా ఏమాత్రమూ లేనివాడనవడం చేత, ఈ సంగతులన్నిటినీ విని (లేదంటే చదివి) ఊరకుండడమే క్షేమమని అనుకుంటూ ఉంటాను.

కనుక, సంస్కృతం, ప్రాకృతం – ఈ రెండు భాషలలో ఏది ముందు ఏది వెనక అయినప్పటికీ, ప్రాచీన భారతదేశంలో సంస్కృతం అనీ ప్రాకృతం అనీ రెండే భాషలుండేవి గాబట్టీ, ప్రాకృతం ప్రజల భాష కాబట్టీ, వృత్తి చేత కర్షకులైన ఆంధ్ర శాతవాహనుల భాష ప్రాకృతం అవడంలో అసందర్భమేమీ లేదు.

శ్లో. అయి రమణీయా రమణీయ,
సరఓ వి మణోహరో తుమం చ సాహీణో,
అణుకూల పరియణాయే,
మన్నే తం నత్థి జం ణత్థి.

తా కింపి పదోసవిణోదమేత్తనుహ అం మణహరుల్లావం,
సా హేయి అపువ్వకహం సురసం మహిళాయణమణోజ్జం.

కుతూహలుడనే కవి మహారాష్ట్రీ ప్రాకృతంలో వ్రాసిన లీలావతి కథ అనే కావ్యంలోనిది ఈ శ్లోకం. ఈ శ్లోకానికి అర్ధం:

అయి రమణీయా = రాత్రి రమణీయంగా ఉంది.
రమణీయ సరఓ వి మణోహరో = దానికి తగినట్లే శరత్కాలమూ మనోహరంగా ఉంది.
తుమం చ సాహీణో = (ప్రేమాస్పదుడవైన) నీవునూ (నాకు) స్వాధీనుడవై ఉన్నావు.
అణుకూల పరియణాయే = పరిజనులు కూడా అనుకూలురుగా వున్నారు.
మన్నే తం నత్థి జం ణత్థి = (అట్లాంటి) నాకు లేనిది లేదనే అనుకుంటాను.
తా కింపి = కనుకా, ఏదేనా
పదోస విణోదమేత్త సుహ అం = ఈ ప్రదోషకాలాపువినోదానికి తగినట్టిదిగాను
మణహరుల్లాసం = మనసుకు ఉలాసాన్ని కలిగించేదిగానూ (అయినట్టి)
అపువ్వకహం = అపూర్వమైన (ఇంతకు ముందు ఎవ్వరూ చెప్పి ఉండనట్టిది)
సురసం = చక్కని రసం జాలువారే దాన్ని
మహిళాయణ మణోజ్జం = మహిళాజనానికి ఇంపుగొలిపేది (అయినట్టి కథను)
సా హేయి = సాధించండి (అంటే చెప్పండి అని ఒక ప్రియురాలు ప్రియునితో అంది).

పంచాగ్నుల ఆదినారాయణ్శాస్త్రిగారు తమ “ప్రాకృతగ్రంథకర్తలూ, ప్రజాసేవానూ” వ్యాసంలో చెప్పిన అర్ధాన్ని పై అర్ధవివరణకి అధారంగా తీసుకుని చెప్పడం జరిగింది. ఈ వ్యాసంలోనే సందర్భవశాన ఈ లీలావతి కథ గురించి వారు చెప్పిన విషయాలు ఇవి:

“ప్రాకృతవాఙ్మయంలో లీలావతి కథకు అగ్రస్థానం ఇస్తారు. ఆంధ్రులమైన మనం తప్పకుండా ఇయ్యాలి. ఏమంటే – అది ఆంధ్రదేశమునకు సంబంధించిన వక చారిత్రక కథ అనీ, అందులో ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలు వర్ణింపబడ్డాయనీ శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు చాలారోజులక్రింద భారతిలో 2,3 వ్యాసాలు ప్రకటించారు.  గ్రంథం కూడా త్వరలో ప్రకటిస్తామన్నారు.  ఆంధ్రులు ఆయనచేత త్వరలో ఆ గ్రంథం ప్రకటిత మయ్యేట్టు యత్నించాలి.”

మరి ఈ గ్రంథం ప్రకటితమయిందా? అంటే నాకు తెలిసినంతలో లేదు. శ్రీ మానవల్లివారు సేకరించిన ఈ గ్రంథం ప్రతి ఏమయిందో తెలీదు. కనీసం భారతిలో వ్యాసాలన్నా చూద్దామంటే, ఇప్పటివరకూ యత్నించినంతలో నాకు దొరకలేదు,ఇంకా వెదకడానికి కుదరడంలేదు. ఆయన సేకరించిన గ్రంథప్రతి ఇప్పుడు లభ్యమవుతూందా? అంటే సందేహమే! అయినా ప్రయత్నించేవారెవరు? ఆయన చెప్పినట్లు, అందులో వర్ణించబడిన అప్పటి ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలకు సంబంధించిన సమాచారం,ఇంకా పైన ఉదాహరించిన శ్లోకంలో వంటి సహజమైన, మనోహరమైన వర్ణనలూ, తెలుగులో చదువుకోవడానికి వీలయేట్లుగా పరిష్కరించబడి ఉన్నది కాలగర్భంలో కలిసిపోయిందనే అనుకోవాలా?!

***

కవిగారు (మానవల్లివారు “కవిగారు” గా ఆంధ్ర సాహిత్యలోకంలో ప్రసిధ్ధులు) సంపాదించి ముద్రించలేక పోయిన ఈ  లీలావతి కథ   కావ్యాన్ని తలుచుకున్నప్పుడల్లా,  నాకు విశాఖపట్నంలో కవిగారు (మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు) అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయిన నుడికడలి   అచ్చతెనుగు పదాల నిఘంటువు గుర్తొసుంది. ఈ అముద్రిత అసంపూర్తి నిఘంటువు ప్రస్తావన శ్రీశ్రీ గారి   అనంతం ,  అబ్బూరి వరదరాజేశ్వరరావుగారి  కవనకుతూహలం  ఇత్యాది పుస్తకాల్లో వస్తుంది. అసంపూర్తిగానైనా ఈ అచ్చతెనుగు పదాల నిఘంటువుని సంపాదించి ప్రచురిస్తే భాషకు సంబంధించినది కాబట్టి ఎప్పటికైనా ఉపయోగం అనిపిస్తుంది.  ఇలాంటివే ఇంకా ఎన్నెన్నో మంచి పుస్తకాలు. ముఖ్యంగా టేకుమళ్ళ కామేశ్వరరావుగారి   నా వాఙ్మయ మిత్రులు  పుస్తకం చదువుతున్నప్పుడు ప్రస్తావన కొచ్చి అబ్బురపరిచేవి. అముద్రితాలుగా మిగిలిపోయినవీ, ఇప్పుడు అలభ్యం కాటగిరీ లోకి వెళ్ళిపోయినవీ ఎన్నెన్నో పుస్తకాలు! ఆంధ్రపత్రిక వారి ఆధ్వర్యంలో వెలువడిన  భారతి   మాసపత్రిక గురించి వేరే చెప్పక్కరలేదు! అందులో ప్రచురితాలైన చరిత్ర, సాహిత్య సంబంధ వ్యాసాలలో అత్యుత్తమైన వాటిని ఏరి ఒకటి రెండు సంపుటాలుగా నన్నా ప్రచురిస్తే బాగుంటుందని ఆలోచన! వీటిల్లో ఏ ఒకటిరెండు సాధించగలిగినా  జన్మ ధన్యమైనట్లుగా అనిపిస్తుంది. సమయం, శక్తి, డబ్బు వీలుచిక్కినంతలో వీటికోసం ఖర్చుపెట్టడం ఉపయోగం అని ఎప్పటినించో ఉన్నా,  అమలుపరుచుకోవాలని ఈ మధ్యనే తీసుకున్న నిర్ణయం!

కనుక, ఈ బ్లాగుకు ఇది ఆఖరి పోస్టు. This blog may now be treated as closed for all purposes!

ధన్యవాదాలు!

సెలవు!

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (3)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (3)

వేదాలకు సంబంధించిన పరిభాషలో ‘బ్రహ్మ’ అంటే మంత్రమనీ, వేదమంత్రాల వినియోగాన్ని విశదీకరించి, వివరించేవి కాబట్టి బ్రాహ్మణాలని పెద్దలు చెబుతారు. ఐతరేయ బ్రాహ్మణం ఋగ్వేదానికి చెందినది. సోమయాగ నిర్వాహణకు సంబంధించిన విషయాల విశదీకరణ ఐతరేయ బ్రాహ్మణానికి ప్రథాన విషయం. ఇది ఏకవ్యక్తికృతమనీ, ఆ వ్యక్తి మహీదాస ఐతరేయుడనీ సంప్రదాయ వచనం. ఇందులోని విషయం మొత్తం నలభై అధ్యాయాలుగా విభజించబడింది. ఈ నలభై అధ్యాయాలూ మళ్ళీ ఒక్కొక పంచికకు ఐదు అధ్యాయాలు చొప్పున ఎనిమిది పంచికలుగా అమర్చబడింది. ఈ ఎనిమిది పంచికలలో చివరి రెండు పంచికలు, అంటే ఏడు, ఎనిమిది పంచికలు (చివరి పది అధ్యాయాలు) భాష పరంగానూ, అందులోని విషయం పరంగానూ చూస్తే, అర్వాచీనకాలికాలనీ, ప్రక్షిప్తాలనీ పెద్దలు చెబుతారు. (A.B. Keith – “Rigveda Brahmanas” 1920;  మల్లాది సూర్యనారాయణ శాస్త్రి – “సంస్కృత వాఙ్మయ చరిత్ర – ప్రథమ సంపుటం – వేద వాఙ్మయం” – ప్రథమ ముద్రణ 1936). ఇందులోని ఏడవ పంచికలో శునశ్శేపుని వృత్తాంతం ఉంది.

అప్పటిలో జనశ్రుతిలో ఉన్న శునశ్శేపుని కథను, ఆంధ్ర పుండ్ర పుళిందాది జాతుల ఉనికికి నిదర్శనంగానూ, ఉత్పత్తికి సంబంధించిన కథగానూ ఐతరేయ బ్రాహ్మణానికి అనుసంధానం చేయబడి చెప్పబడింది. ఆంధ్రుల ప్రాచీనత్వానికి సంబంధించిన మాట ఎప్పుడు వచ్చినా, ఐతరేయ బ్రాహ్మణంలోని శునశ్శేపుని వృత్తాంతాన్ని నిదర్శనంగా చూపి, చరిత్రలో ఆంధ్రుల ఉనికి ఇక్కడినుంచి ఉందన్నది చెప్పబడిందే తప్ప, ఈ వృత్తాంతానికి సంబంధించిన సాంఘిక నేపథ్యాన్ని, ఇందులో ఆంధ్రుల ప్రస్తావన రావడానికి దారి తీసిన పరిస్థితులను కాస్తంతైన critical గా అన్వీక్షించే ప్రయత్నం జరిగినట్లుగా నేను చదివినంతలో నా దృష్టికి రాలేదు. శునశ్శేపుని వృత్తాంతంలో ఆంధ్ర పుండ్ర పుళిందాది జాతుల ఉనికికి సంబంధించిన నిర్ధారణ తప్ప వేరే తెలియదగింది ఏమీ లేదా?! అన్నది నా ప్రశ్న, సందేహం.అంతమాత్రమే కాదేమో! అని నా అనుమానం.

A.B. Keith గారి అభిప్రాయం ప్రకారం ఐతరేయబ్రాహ్మణ రచనా కాలం క్రీస్తుపూర్వం ఎనిమిదివందల సంవత్సరములకంటే అనంతరం కాదు, అలాగే అందులోని ప్రక్షిప్తాల రచనా కాలం క్రీస్తుపూర్వం మూడువందల సంవత్సరముల కంటే తరువాత కాదు. స్థూలంగా ఈ కాల నిర్ణయం పండితులందరి ఆమోదాన్ని పొందింది కూడా! అయితే, క్రీ.పూ.300 సంవత్సరాల కాలం నాటికే ఆంధ్ర సామ్రాజ్యం ఉన్నత దశలో ఉన్నట్లూ, ఆంధ్ర సామ్రాజ్యంలో అప్పుడు 30 దుర్గాలూ, ఒక లక్ష కాల్బలమూ, రెండువేల అశ్వములు, వేయి ఏనుగుల బలము ఉన్నట్లు మౌర్యసామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తమౌర్యుని ఆస్థానంలో రాయబారి గా ఉన్న మెగాస్తనీసు వ్రాతలను బట్టి తెలుస్తుందని ఆంధ్ర చరిత్రకారులలో శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు మొదలైనవారు వ్రాశారు (తెలుగు విజ్ఞాన సర్వస్వం, మూడవ సంపుటం). ఇందువలన, అప్పటికే ఒక సామ్రాజ్య నిర్మాతలైన ఆంధ్రులను గురించి అదే కాలంలో ప్రక్షిప్తీకరించినదిగా చెప్పబడుతూన్న, అంగీకరించబడుతూన్న శునశ్శేపుని కథలో ఆంధ్రులు నీచజాతికి చెందినవారుగానూ, సాంస్కృతికంగా అథములుగానూ ఎందుకు వర్ణించబడ్డారు? (ఐతరేయబ్రాహ్మణంలోని ఈ భాగానికి చెందిన వ్యాఖ్యలలోని ఒక వ్యాఖ్యలో విశ్వామిత్రుడు వీళ్ళను “మీ సంతానం అభక్ష్య భక్షణం చేయుగాక” అని శపించినట్లుగా కూడా చెప్పబడింది (రాహుల్ సాంకృత్యాయన్ – ఋగ్వేద ఆర్యులు)). ఆర్య ఋషి అయిన విశ్వామిత్రుడు ఆంధ్ర తదితర జాతికి చెందిన వారలను, వారి జీవన పధ్ధతులను ఇంతగా గర్హించడానికి కారణం ఏమిటి? ఇది అర్ధం కావాలంటే కాలంలో కొన్ని శతాబ్దాలు వెనకకు వెళ్ళి, మూలాలనుంచి స్థూలంగానైనా సమీక్షించుకుంటూ రావాలి.

హరప్ప-మొహెంజొదారొ కాలం నాటి  సాంఘిక నేపథ్యానికి (social setting కి) పూర్తిగా భిన్నమైన సాంఘిక నేపథ్యాన్ని (social setting ని) ఋగ్వేదం భారత దేశానికి ఇచ్చింది. హరప్ప-మొహెంజొదారొ లు ఒక గుర్తుగా నిలిచిన సింధు నాగరికత వర్ధిల్లిన కాలం క్రీ.పూ.2600 నుండి క్రీ.పూ.1750 ధాకా. ఈ మధ్య కాలంలో – కనిపించే నిజం, మనిషి, అతని శరీరం చేసే శ్రమ (అటు భూమిని నమ్ముకుని గానీ, లేక ఇటు వర్తకాన్ని నమ్ముకుని గానీ), శ్రమ మీద నమ్మకం, శాంతి – ఇవే ప్రధానంగా ఉండి అప్పటి జీవనం గడిచిందని పురావస్తు తవ్వకాలలో బయటపడ్డ అవశేషాల విశేషాలు, అధారాలు చెబుతాయి. ఋగ్వేదం దీనిని పూర్తిగా మార్చి వేసింది. మనిషి శ్రమ కన్నా, దైవం – దైవ కృప, దానికోసం ప్రార్ధన, యజ్ఞం, కనిపించే నిజాన్ని కాదని కనిపించని నిజం కోసం తపన, యోచన, యుధ్ధం, జయం, జయం కోసం తపన, భయం – ఇవి ముఖ్యమైన విలువలుగా మారాయి. ఇదే అప్పటికి ఆధునికతగా, సంస్కృతిగా చెప్పబడింది, అయింది.  ఇందులో ఒదగని ప్రతిదీ, హేయమైనది, గర్హ్యమైనదీ అయింది. దీనికి ప్రాతినిధ్యం వహించే ఋగ్వేద పూర్వపు సంస్కృతికి చెందిన జాతుల, తెగల జనులు దస్యులయ్యారు. ఆ కారణంగా దమనానికి అర్హులయ్యారు. తొలి రోజులలో వేద సంబంధ క్రతువులన్నిటిలోనూ హింస ఉంది. ఒక ఉత్సవంగా జరిగిన హింస ఇది. ఆ నాగరికతలో ఇది అంతర్భాగం. ఆడుతూ పాడుతూ ఆహ్లాదంలో జరిపిన హింస ఇది. ఒక సహస్రాబ్దం పైగానే ఇది కొనసాగింది. మొదలవడం జంతువులతోనే అయినా, ఇది పోనుపోనూ నరమేధం అన్న ప్రక్రియ దాకానూ వెళ్ళింది (ఐతరేయ బ్రాహ్మణంలోని శునశ్శేపుని వృత్తాంతమే దీనికి నిదర్శనం). ఇది పరాకాష్ఠ. క్రీ.పూ.6వ శతాబ్దం ఉత్తరార్ధంలో గౌతముడు బుధ్ధుడై ఈ హింసను నిరసించి అహింసను ప్రబోధించడంతో దీనికి ప్రభావవంతమైన అడ్డుకట్ట పడింది. అప్పటికే ఈ సంస్కృతితో విసిగి వేసారి ఉన్న సామన్యులు తండోపతండాలుగా బుధ్ధుని ప్రబోధనలకు ఆకర్షితులై ఆ వైపు మరలడంతో నిరసన ప్రత్యక్షంగానూ, బహిరంగంగానూ వ్యక్తమైంది. వేదం ఏ సంస్కృతినైతే ఆచరణలో పెట్టిందో, ప్రబోధించిందో ఆ సంస్కృతితో పాటు, ఆ సంస్కృతికి సంబంధింధిన భాష అయిన సంస్కృతమూ నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టివేయబడ్డాయి. సామన్యుడి బాష అయిన పాలీ, ప్రాకృతాలకు జనాదరణ బాగా పెరిగింది. బుధ్ధుని బోధనలన్నీ పాలీ భాషలోనే గ్రంథస్తం చేయబడినాయి. ప్రజలే కాక ప్రభువులూ దీనిని అనుసరించక తప్పలేదు. ఆ ప్రభువువులలో ఒకరు  ఆంధ్రులు. బౌధ్ధాన్ని నిస్సంకోచంగా అనుసరించారు. అయితే, బుధ్ధుడు విష్ణుమూర్తి అవతారాలలో ఒక అవతారంగా చేయబడినట్లుగానే, ఆంధ్రులు విశ్వామిత్రుని అర్ధ సంతానం (తొలి యాభై మంది) లో అగ్రగణ్యులుగా శునశ్శేపుని కథ ద్వారా చేయబడడం అన్నది ఇక్కడ ఇంకొక ఆసక్తిని రేకెత్తించే అంశం!

బౌధ్ధం రంగ ప్రవేశం తరువాత, ఆ కాలంలో ఆర్య సంస్కృతి ఆదరణ కోల్పోవడం అన్నది, అందులో హింసకు సంబంధించి అభిప్రాయ బేదాలు తలెత్తడ మన్నది, తత్ఫలితంగా ఆర్య గణాలలో (జనాలలో) ఏర్పడిన వేర్పాటు (division) అన్నది వ్యూహాత్మకంగా శునశ్శేపునిని కథ ద్వారా చెప్పబడిందని నేననుకుంటాను. విశ్వామిత్రునికి వందమంది సంతానం అన్నది, అందులో మధుఛ్ఛందసుని కంటే పెద్దవారు ఆయన నిర్ణయాన్ని ధిక్కరించడమన్నదీ, వారు పోను మధుఛ్ఛందసుని తరువాతి యాభైమంది పుత్రులూ అతడి నిర్ణయాన్ని ఆమోదించి అనుసరించడమన్నదీ ఆర్యులలో చీలికను వ్యూహాత్మకంగా చెప్పడమే అనుకుంటాను. విశ్వామితుడు ఈ కథలో ఒక వ్యక్తి కాదు, ఆ సంస్కృతి మొత్తానికీ ప్రతినిధి! ఆయన ప్రాతినిధ్యం వహించిన సంస్కృతిని ధిక్కరించిన జాతులలో ప్రప్రథమంగా వినిపించే పేరు ఆంధ్రులది!

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (2)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (2)

భారతీయులమైన మనకు చాలా భాషలే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన కొన్ని భాషలలో, సంస్కృతం సంస్కృతమే (గీర్వాణము అన్న వేరే మాట కూడాఉంది.
అయితే, ఈ మాట ఇప్పుడు అంతగా ఎక్కువ ప్రచారంలో లేదన్నది వాస్తవం). ఇంకా – హిందీ హిందీనే. కన్నడం కన్నడమే. మళయాలం మళయాలమే.
తమిళానికి అరవం అన్న వేరే మాట ఉందిగాని, ఈ మాట కూడా ఇప్పుడు అంత ఎక్కువ ప్రచారంలో లేదు (తమిళులకు అరవవాళ్ళు అన్న మాట కూడా ఒకప్పుడు
వాడుకలో ఉండినది నిజం. ఇప్పుడంతగా వాడుకలో లేదు). ఇవన్నీ ఇలా ఉండగా, ఒక్క తెలుగు మాత్రమే తెలుగు, ఆంధ్రము రెండూను! ఈ రెండు
మాటలూ ఒకదానికి ఒకటి సమానంగానూ, ఒకదానికన్నా ఒకటి ఏమాత్రమూ తక్కువ కాదన్నట్లుగానూ – జాతి పరంగానూ, మాట్లాడే భాష పరంగానూ,
ఎలా చూసినా సమానార్ధకంగానూ, అప్పుడూ ఇప్పుడూ సమానంగా వాడుకలో ఉన్నాయి! ఇది ఎందుకు ఇలాగ? అని ఆలోచించుకుంటూ పోతే ఇంకాస్త
అయోమయం తప్ప ఒకింత ఆమోదయోగ్యమైన సంగతులను తెలియజేసే సమాచారం ఏదీ ముందుకు ఒక పట్టాన రాదు.

తెలుగును గురించి తెన్ (తెనుగు) – దక్షిణ దిగ్వాచకమనీ, త్రికళింగం పోను పోనూ త్రిలింగం తెలుగు అయిందనీ, త్రిలింగ భూమి కావడం వలన తెలుగు
అయిందనీ, తైలాంగు, తెల్ లేదా తెలీవాహ నదీ తీరప్రాంత వాసులవడం వలన తెలుగువాళ్ళయ్యారనీ… ఇలా వివిధాలయిన వివరణలున్నాయి. ఈ
వివరణలోని సంగతులన్నీ దక్షిణభారతానికి అంటే కృష్ణా గోదావరీ పరీవాహక ప్రాంతాలకూ, కళింగానికి (గోదావరికి  ఉత్తర భూభాగానికి కళింగమన్న పేరు
మొదటినుంచీ వాడుకలో ఉంది) చెందినవి అయి ఉన్నాయి. ఇక ఆంధ్ర ప్రదం ప్రాచీనతను గురించిన మాట ఎప్పుడు ఎక్కడ వచ్చినా సంగతులు (ఋగ్వేద)
బ్రాహ్మణాల కాలం అయిన క్రీ.పూ.1500-1000 ప్రాంతందాకా వెళతాయి. ఋగ్వేదానికి చెందినదైన ఐతరేయ బ్రాహ్మణంలోని శునశ్శేపుని కథలో వచ్చిన
ఆంధ్ర జాతి ప్రస్తావన ఇంధుకు ఉదాహరణగా చెప్పడం ఇప్పటికి బహుళ ప్రసిధ్ధమై అందరికీ తెలిసినది అయిపోయింది.

శునశ్శేపుని ఉదంతంలో చివరన విశ్వామిత్రుడు తన నూరుగురు కుమాళ్ళలోని మొదటి యాభైమందిని శపించే సందర్భంలో ఈ ఆంధ్ర జాతి ప్రస్తావన వస్తుంది. ఈ
శునశ్శేపుని కథ ఐతరేయబ్రాహ్మణంలో ప్రక్షిప్తమైన కథ అని ఒక మాట కూడా పండిత అభిప్రాయమై ఉంది (A.B. Keith – “Rigveda Brahmanas” 1920, ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి – “చరిత్ర చర్చ” 1989). ఈ అభిప్రాయం ప్రకారం ఇది పురాణాల కాలమైన క్రీ.పూ.3 వ శతాబ్దానికి చెందుతుంది. అంటే ఉత్తరభారతంలో మౌర్యుల పరిపాలనా కాలం అవుతుంది.

యజ్ఞాలలోని వివిధ క్రియలను, అందులో వేద మంత్రాల వినియోగాన్ని గురింది విశద పరిచేవి బ్రాహ్మణాలు. సుయవన పుత్రుడైన అజీగర్తుడు వేద పురోహితుడు.
ఒకానొక సందర్భంలో దురాశపడి 300 గోవులకోసమై కొడుకైన శునశ్శేపుని తనచేతులతోనే నరికి బలి ఇవ్వడానికి అంగీకరిస్తాడు. కానీ, శునశ్శేపుడు
అజీగర్తుని నుండి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునే కోరికతో విశ్వామిత్రుని అండ చేరుతాడు, అతనిని తండ్రిగా చేసుకునే తలంపుతోనే! ఆ పై సంభాషణ ఇలా
సాగుతుంది:

అజీగర్తుడు: (విశ్వామితుని ఉద్దేశించి) ఓ ఋషీ! నా పుత్రుని నాకు ఇవ్వండి!
విశ్వామిత్రుడు: ఇవ్వను. దేవతలు ఇతనిని నాకు ఇచ్చారు.
ఇట్లా చెప్పి విశ్వామిత్రుడు శునశ్శేపునికి పేరు మార్చి దేవరాత వైశ్వామిత్ర అని నూతన నామకరణం చేస్తాడు. ఆ తరువాత అజీగర్తుడు కొడుకును
బతిమాలుకుంటాడు.
అజీ: (శునశ్శేపుని ఉద్దేశించి) పుత్రా, (తల్లిదండ్రులం) మేమిద్దరం నిన్ని పిలుస్తున్నాం. నీవు అంగిరస అజీగర్త పుత్రుడవు. ఓ ఋషీ! నీవు నీ తండ్రి
తాతల గృహాన్ని విడువవద్దు. మా వద్దకు రమ్ము.
శునశ్శేపుడు: నేను శూద్రుడుకూడా ముట్టని ఆ వస్తువును (కత్తిని) నీ చేతిలో ఉండగా చూశాను. ఓ అంగిరసా! నీవు 300 ఆవులను నా కంటె
ఎక్కువనుకున్నావు.
అజీగర్తుడు: పుత్రా! చేసినదానికి నేను పశ్చాతాప పడుతున్నాను. ఆ పాపాన్ని నివారించుకుని నీకు 100 ఆవులను ఇస్తున్నాను.
శునశ్శేపుడు: ఒకసారి పాపం చేగలిగినవాడు మరొకసారి పాపం చేస్తాడు. నీవు శూద్రత్వం నుండి ముక్తిని పొందలేదు. నీవు చేసిన పాపం ఏ విధంగానూ
నివారింపబడదు.
(ఈ సంభాషణ పాఠాన్ని రాహుల్ సాంకృత్యాయన్ “ఋగ్వేద ఆర్యులు” నుండి తీసుకున్నాను).

ఈ సంభాషణలో అజీగర్తుడు శునశ్శేపుని ‘ఓ ఋషీ!’ అని సంబోధించడాన్ని బట్టి శునశ్శేపుడు అప్పటికే పెద్దవాడని, ఋషిత్వాన్ని పొందినవాడని అర్ధమవుతుంది. (ఐతరేయ బ్రాహ్మణంలోని కొన్ని ఋక్కులు కాడా వసిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, అయాస్యుడు, అజీగర్తుడు, శునశ్శేపుడు – వీరంతా సమకాలీకులని చెబుతాయని పెద్దల వ్రాతలవలన అర్ధమవుతుంది). శునశ్శేపుడిని రక్షించే క్రమంలో విశ్వామిత్రుడు అతనిని తన పుత్రునిగా చేసుకుంటాడు. విశ్వామిత్రునికి అప్పటికే నూర్గురు పుత్రులు. అందులో యాభై మంది మధుఛ్ఛందుని కంటే పెద్దవారు. ఈ యాభై మందీ శునశ్శేపుని దత్తతను, దాని ఫలితంగా శునశ్శేపునికి కలిగే పెద్దరికాన్ని ఒప్పుకోవడానికి అంగీకరించరు. ఇది విశ్వామిత్రునికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఫలితంగా వచ్చిన మాటలలో ఈ యాభై మందీ, వారి సంతానం ఆర్య భూములకావల ‘ఆంధ్ర, పుండ్ర, శబర, పులింద, మూతిబ ఇత్యాది జాతులలో కలిసిపోండ’ని శపిస్తాడు. వారే ఈ జాతుల ప్రజలనీ, ఆర్య జాతి సమ్మేళణం ఈ జాతుల ప్రజలతో జరిగిందనీ ఈ కథ తాత్పర్యం. ఈ ఫలితాన్ని సాధించడానికే ఈ ఉదంతాన్ని ఐతరేయ బ్రాహ్మణంలో ప్రక్షిప్తీకరించడం జరిగిందనీ కూడా అనుకోవాల్సి ఉంటుంది. పురాణాల కాలమైన క్రీ.పూ.3 వ శతాబ్దిలో ఇది జరిగింది అనాలి.

విశ్వామిత్రుని శాప పాఠం పై కూడా భిన్నమైన వివరణలు ఉన్నాయి. “You shall have the lowest castes for your descendants.  Therefore are many of the most degraded classes of men, the rabble for the most part, such as the Andhras, Pundras, Sabaras, Pulindas and Mutibas, descendants of Viswamitra.” అని  Martin Haag….

“Your offspring shall inherit the ends (of the earth).  These are the people the Andhras, Pundras, Sabaras, Pulindas and Mutibas who live in large numbers beyond the borders.  Most of the Dasyus are the descendants of Viswamitra.” అని A.B. Keith ….ఇలా! (“ఆంధ్ర వాఙ్మయారంభ దశ – ప్రథమ సంపుటము – పాఙ్నన్నయ యుగము” దివాకర్ల వెంకటావధాని – 1960).

పురాణాలు (ముఖ్యంగా వాయు, మత్స్య మరియు మార్కండేయ పురాణాలు) ఉత్తర కొంకణాన్ని అపరాంతం అన్నాయి. వింధ్య, సత్పూరా పర్వత శ్రేణులు,
వాటిల్లో పుట్టి ప్రవహించి అరేబియాసముద్రంలో కలిసే నర్మద, తాపీ నదుల తీర ప్రదేశాలలో పుండ్రులు, పుళిందులు, శబరులు జీవనం సాగిస్తుండేవారనీ చెప్పాయి (“Early History of the Dekkan” – R.G. Bhandarkar – 1895). ఈ జాతుల ప్రజలతో కలిపి చెప్పబడిన ఆంధ్రులుకూడా ఆ ప్రాంతం వారే అయి ఉంటారనుకోవడం అసంగతం కాదు. ఇక్కడి ఈ ఆంధ్రులకూ, ఇక్కడి నుండి చూస్తే చాలా దిగువన కృష్ణా గోదావరీ ప్రాంత వాసులై ఉండిన తెలుగు వాళ్ళకు ఏవిధంగా సంబంధం కుదిరింది? వీరిరువురూ ఒకే జాతివారు ఎలాగయ్యారు? వీరిరువురి భాషా ఒకే భాష ఎలాగయ్యింది? ఇవి సందేహాలు, అర్ధంలేనివి కావు.

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

ఆంధ్రుల లేదా తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర గురించిన ఈ notes లో తొలి వెయ్యేళ్ళు అంటే క్రీస్తు శకాబ్దం మొదలుకొని ఆపై వెయ్యేళ్ళదాకా అని అనుకున్నది.
అయితే, ఇది నిజానికి ఇంకో రెండువందల పాతికేళ్ళు ముందుకు వెళ్ళి అదనంగా మరో రెండువందలపాతికేళ్ళు కలిసి మొత్తం పన్నెందువందల పాతిక
సంవత్సరాలవుతుంది. దీనికి కారణం, శాతవాహనుల పరిపాలనతో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర మొదలవుతుంది/మొదలుపెట్టుకోవాలనుకుంటే,
శాతవాహనుల పాలన క్రీ.పూ.225 లో మొదలై క్రీ.శ.225 తో అంతమయిందని చరిత్రకారులంటారు గాబట్టి. శాతవాహనుల పరిపాలనలో తెలుగువాళ్ళ
సాంఘిక చరిత్రకు కూడా క్రీ.పూ.225 నుంచి ఆధారలు దొరకాలి.

శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి. ఆంధ్ర భృత్యులని మాటకూడా ఉంది. దీనిమీద లేచినవివాదం ఇంకా ఎటూ తెలకుండానూ ఉంది. ఆంధ్రులైన భృత్యులా?
ఆంధ్రులకు భృత్యులా? ఆంధ్రులు వేరే రాజవంశం వారై, వారికి శాతవాహనులు సామంతరాజులా? అని మీమాంస. అదెలా ఉన్నా, నాలుగున్నర శతాబ్దాల
వీరి పరిపాలన మాత్రం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లిందని చెప్పుకోవాలి. నాలుగున్నర శతాబ్దాలు ఒకే రాజవంశం ఒక భూభాగాన్ని నిరాటంకంగా పరిపాలించడం
అంత సులభంగా జరిగే పని కాదు. అయినా శాతవాహనుల విషయంలో అది సాధ్యమైంది. తరానికి 25 సంవత్సరాల చొప్పున (చరిత్ర పరిశోధనలో తరానికి 25
సం.గా వేసుకుని లెక్కిస్తారని చదివాను) నాలుగున్నర శతాబ్దాలకు 18 తరాలవుతుంది. అంటే తరం నుంచి తరానికి సాగే జ్ఞాపకాల ప్రవాహంలో
పరిస్థితులలోనూ పరిపాలకులకు చెందిన విషయాలలోనూ ఏవిధమైన మార్పూ లేకుండా 18 తరాలు గడవడం, జ్ఞాపకాల, అనుభవాల ప్రవాహం నిరాటంకంగా
కొనసాగడం అన్నది చరిత్రలో ఒక అరుదైన సందర్భం, ఒక luxury గానే చెప్పుకోవాలి. ఆ సందర్భాన్ని, ఆ luxury ని  శాతవాహనుల పరిపాలనలో
అప్పటి ప్రజలు అనుభవించారు.

ఈ సుఖాన్ని అనుభవించిన వాళ్ళలో తెలుగు మాతృభాషగా ఉండిన తెలుగువాళ్ళూ ఉన్నారు. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. అప్పుడు, అంటే
శాతవాహనుల పరిపాలనా కాలం నాటికి, ఆంధ్రులు తెలుగువాళ్ళూ ఒక్కటి కాదా? అని. కాదనే నేను అనుకుంటాను. అయితే గనక, ఆంధ్రులైన
శాతవాహనులు తమ మాతృభాష అయిన తెలుగును వదిలి ప్రాకృతాన్ని ఎందుకు ఆశ్రయిస్తారు? శాతవాహనుల కాలంలో ప్రాకృతం రాజబాష, ప్రజల భాష
కూడాను! ప్రాకృతంలోనే కదా గాథాసప్తశతిలోని గాథలన్ని ఉన్నాయి! అయితే, అప్పటికి తెలుగింకా పూర్తిగా పరిణతిచెందిన భాషగా కాకుండానన్నా
ఉండిఉండాలి. అలా అనుకోవడానికీ వీలు లేదు.  కారణం, గాథాసప్తశతిలో అక్కడక్కడా కనుపించే అత్తా (అత్త), అద్దాఏ (అద్దం) లాంటి కొన్ని తెలుగు
పదాలు, తెలుగు అప్పటికే పూర్తిగా పరిణతి చెందిన భాషగా ఉండినదనీ, ఎంత పరిణతి అంటే, అందులోని కొన్ని మాటలు వేరే భాషలోకి వెళ్ళగలిగేంత పరిణతి
చెందిన భాషగా శాతవాహనుల కాలంనాటికే ఉండినదనీ, పూజ్యులు కీ.శే.తిరుమల రామచంద్ర గారు తమ వ్యాసాలలో ఇప్పటికే నిరూపించి ఉన్నారు కాబట్టి!

అదలా ఉంచితే, “ఆంధ్రశ్చ బహువః” అనే మాట ఒకటి ఉంది. దీని అర్ధం ఆంధ్రులు పలువురు అని. అంటే, పలు జాతుల ప్రజలు కలిసి ఆంధ్రులు
అయ్యారని ఇది సూచిస్తుంది. ఇది నానుడి. ప్రజల నాలుకలపైనుంచి వచ్చిన మాట. దీనికి నిదర్శనాలు, ఆధారాలూ దొరకవు. తరం నుంచి తరానికి ఇలా
దిగుమతి అయిన జ్ఞానంలో నిజం బొత్తిగా ఉండదు అనుకోవడం సాహసమే అవుతుంది. ఈ పలు జాతుల ప్రజలలో తెలుగు మాతృ భాషగా కలిగిన తెలుగువాళ్ళూ
ఉండిఉండవచ్చు. కాదనటానికి లేదు. బలమైన, ప్రభావవంతమైన జాతి కావడం మూలాన పోనుపోను ఆంధ్రులంటే, తెలుగువాళ్ళన్నది స్థిరపడి పోయి
ఉంటుందనుకోవాలి.

తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర: అంధ యుగం – గ్రంథ యుగం

తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర: అంధ యుగం – గ్రంథ యుగం

తెలుగువాళ్ళ సాంఘిక చరిత్రను గురించిన ముఖ్యమైన సమాచారాన్ని, సంగతులను సేకరించుకుని ఒకచోట రాసుకోవడానికి వీలుగా ఇదేమిరకమైన విభజన అనిపించినా, నాకు మాత్రం ఇది ఒక విధమైన (convenient) స్థూల విభజనలాగానే అనిపిస్తుంది.

ఇందులో, అంధ యుగం అని నేను విభజించుకున్నది – తారీకంటూ లేని/తెలియని తొలినాళ్ళ నుంచి క్రీ.శ.1000 సం. దాకా (అంటే గీత గీసినట్లు వెయ్యవ సంవత్సరందాకా అని కాకుండా ఆ ప్రాంతాలదాకా) ఈ అంధ యుగంలోకి చేర్చుకుంటాను. కారణం – వ్రాతలో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్రను గురించి తెలిపే ఆధారాలేవీ ఈ యుగంలో దొరకవు గాబట్టి. దొరికిన శిలాశాసనాలన్నీ దానశాసనాలు. ఇందులో పెద్దగా సామాన్యజనుల సాంఘిక చరిత్రకు సంబంధించిన అంశాలేమీ వుండవు. అందువలన, ఈ యుగానికి చెందిన జనజీవనానికి సంబంధించిన ఆసక్తికరమైన అదనపు సమాచారం చిన్నదైనా సేకరించడం చాలా కష్టం, challenging గా ఉండే పని.

ఇక రెండవది  గ్రంథ యుగం – పేరు సూచించేటట్లుగానే, రాజరాజు కోరికతో నన్నయ మహనీయుని చేతులమీదుగా క్రీ.శ.1050 ప్రాంతంలో మొదలైన గ్రంథ రచన, ఆ తరువాత శతాబ్దాలుగా నిరాటంకంగా సాగి, ఇప్పటికీ సాగుతూనే ఉంది. పోను పోను కాలంలో వ్రాత అనేది  పరిణతిచెంది సర్వ సామన్యమైన తరువాత సంగతులన్నీ గ్రంథస్థం చేయబడినాయి.  శాసనాలు చాలమటుకు రాజుల చరిత్రనే చెప్పాయి. తాళపత్రాలు మిగతా సంగతులతో పాటు, అప్పుడప్పుడూ జనసామాన్యం జీవన విశేషాలను చెప్పాయి. అయితే, ఈ యుగానికి సంబంధించి అదనపు సమాచారం పెద్దగా సేకరించగలిగింది ఏమీ లేదనే అనిపిస్తుంది. ఉన్నదేదో ఇప్పటికే పెద్దలచేత బయటపెట్టబడింది గాబట్టి. ఈ యుగంలో కూడా, వెతకడానికి మిగిలి ఉన్నవిగా చెప్పాల్సినవి దొరకకుండాపోయిన ప్రసిధ్ధకవులవే గానీ, అంత ప్రసిధ్ధులు కానివారివి గానీ రచనలు. కాలగర్భంలో కలిసిపోయినవిగా అనుకోబడుతున్నవాటిని వెలికి తీసి వెలుగుచూపించడానికి కొంత అదృష్టంతో సహా ఇంకా చాలా కలిసిరావాలి.

అలాగని ఈ గ్రంథయుగంలో ఇక వెదకడానికి ఏమీ లేదని అనుకోవడంకూడా తెలివైన మాటకాదు. ఎందుకంటే, తెలుగువాళ్ళ చరిత్రకు సంబంధించిన చాలానే సంగతులు ఇంకా అపరిష్కృతాలుగా మిగిలున్నవి ఉన్నాయి. ఉదాహరణకి, శాతవాహను లెవరు? వీళ్ళు పుట్టుకతో ఆంధ్రులేనా? అనే ప్రశ్నకు ఇది final అని చెప్పుకోదగిన సమాధానం ఇంతవరకూ లేదు. అలాగే, కాకతీయులు ఎవరు? అన్న ప్రశ్నకూ, ‘కాకతి’ అనే మాట ఏ అర్ధాన్ని సూచిస్తుంది? కాకతి శక్తి ఎవరు? ఇలాంటి ప్రశ్నలకూ ఇది అంతిమం, దీనికిక తిరుగులేదు అని చెప్పుకోదగ్గ, అందరూ ఒప్పుకోదగిన, ఒప్పుకున్న సమాధానం లేదు, నాకు తెలిసినంతవరకూ, నేను చదివున్నంతవరకూ. ఇలాగే, పల్లవులు ఇక్కడివారా? బయటనుంచి వచ్చిన వారా? పల్లవ అనే మాటకు ఏమిటి అర్ధం? బృహత్ఫలాయన, శాలంకాయన, ఇత్యాది చిన్న చిన్న రాజవంశాలవారు ఇక్కడివారేనా? లేక బయటినుంచి వచ్చినవారా? ఇక్కడివారే అయితే వీరి పూర్వులు ఎవరు? ఈ వంశనామాలు దేనిని సూచిస్తాయి? ఇవి వంశనామాలేనా లేక గోత్రనామాలా? గోత్రనామాలే వంశనామాలుగా ఎందుకయ్యాయి? ఇలాంటి ప్రశ్నలకూ సరయిన convincing సమాధానాలు దొరకవలసే ఉంది ఇంకా!

అందువలన, (నా విభజనలో) అంధయుగంలోనే కాదు, గ్రంథయుగంలోని సంగతులకు సంబంధించిన సమాచారమూ సమగ్రమేమీ కాదు! అందులోకూడా ఇంకా తెలియాల్సింది ఉందనే అనుకోవాలి. చరిత్ర గురించి రాయడం out of fashion అయిపోయి చాల రోజులే అయింది. ఒకప్పుడు, 1970 ల దాకా కూడా, చరిత్ర గురించి రాయడం ఒక యజ్ఞంగా తీసుకుని కృషి చేసిన వాళ్ళున్నారు. ప్రచురించిన పత్రికలూ ఉన్నాయి. అవన్నీ గ్రంథాలయాల్లో భద్రంగానే ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుతూనే ఉన్నారు, రాయడానికి సాహసించకపోయినా!

కీ.శే. సురవరం ప్రతాపరెడ్డిగారు తమ ఆంధ్రుల సాంఘిక చరిత్రలో శాతవాహనుల కాలం నుండి క్రీ.శ.వెయ్యి దాకా ఆంధ్రుల సాంఘిక చరిత్రను గ్రంథస్థం చేయాలని అభిలషించారుగాని, ఏ కారణం చేతనో, అది కార్యరూపం దాల్చలేదు. ముందు చెప్పుకున్నట్లుగానే, వెయ్యి తరువాత ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాయడానికి తగినన్ని ఆధారాలు ఉన్నందువలన వీలయ్యే పనే! వెయ్యికి ముందు చరిత్ర రాయడానికి సరయిన ఆధారాలు ‘sources’ లేకపోవడం అనడం కంటే లభ్యంకాకపోవడం వలన అంత సులభంగా జరగే పనికాదు.

అందువలన ఆంధ్రుల చరిత్రలో తొలి వెయ్యేళ్ళు ఓరకంగా అంధయుగమే! అలా అన్నంత మాత్రాన, ఇక కృషి చెయ్యడానికి ఏమీ లేదని కాదు; చేయగలిగినంత ఉంది…ఉంటుంది!

కీసరగుట్ట

కీసరగుట్ట - శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం

హైదరాబాదు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంటుంది కీసర (కీసర గుట్ట). ప్రసిధ్ధ శైవక్షేత్రం.

క్రీ.శ. తొలి శతాబ్దాలలో ఆంధ్ర దేశాన్ని (వేంగీ దేశాన్ని) పరిపాలించిన రాజవంశాలలో ఒకటైన విష్ణుకుండినులకు, ఈ కీసరకు సంబంధం ఉందని ఒక మాట ఉంది. ఈ రాజవంశం రాజులలో ఒకడైన రెండవ మాధవ వర్మ పరిపాలనా కాలం అయిన క్రీ.శ.4-5 శతాబ్దాలలో ఈ కీసర రాజధానిగా ఉండేదని చెబుతారు.
విష్ణుకుండిన రాజులలో రెండవ మాధవ వర్మ చాలా ప్రసిధ్ధుడు. రాజ్యాన్ని బాగా విస్తరింపజేసి విష్ణుకుండినుల ప్రభను ఒక వెలుగు వెలిగించిన దీటైన రాజు. ఈయన వైదికమతాభినివిష్టుడనీ, అగ్నిష్టోమ, వాజపేయ, పౌండరీక, అశ్వమేధ, రాజసూయ ఆది క్రతువులను చేశాడనీ చరిత్ర పరిశోధకులు చెప్పారు. పదకొండుసార్లు అశ్వమేధ యాగాన్ని చేయడం వలన ఈయన రాజ్యకాలంలో పదకొండు సార్లు దిగ్విజయ యాత్ర సాగించి ఉంటాడనీ చరిత్ర పరిశోధకులు అంటారు. అప్పటిలో బలవంతులైన వాకాటకులను పోరులో ఓడించి, సంధిలో భాగంగా వాకాటక రాజు కుమార్తెను వివాహం చేసుకుని, తదనంతరం రెండు రాజ్యాలకూ వారసుడు అయ్యాడని కూడా చరిత్ర పరిశొధకులు ఊహించారు. ఇంత ప్రసిధ్ధుడైన రాజుతో సంబంధం కలిగి ఉండిన ఈ క్షేత్రం కూడా అంత ప్రసిధ్ధమైనదే! శివరాత్రి నాడు ఏటా జరిగే ఉత్సవాలకు హైదరాబాదు నుండి ప్రత్యేకంగా బస్సులను వేస్తారు. జనం తండోపతండాలుగా వెళ్ళి ఉత్సవంలో పాల్గొంటారు.

కొండ (‘గుట్ట’ అనే అనాలనుకుంటాను!) మీద ఆలయం. మెట్లు ఎక్కుతూండగా కనిపిస్తుంది ఆలయ గోపురం. కొండ (‘గుట్ట’) మీద ఆలయ ప్రాంగణంలో ఏ వైపు చూసినా శివలింగాకృతులు కనిపించి అబ్బుర పరుస్తాయి. కొండ మీదనుంచి చుట్టు scenery చూడడానికి బాగానే ఉంటుంది. ఈ మధ్యనే వెళ్ళి నప్పుడు తీసినవి ఫోటోలు ఇక్కడ కొన్ని. ఈ ఫోటోలు 2 megapixel లెన్స్ తో ఉన్న సెల్ ఫోనుతో తీసినవి. ఈ ఫోటోలలో చివరి నాలుగు ఫోటోలూ dimensions లో పెద్దవి. వాటి మీద ఎక్కడైనా సరే click చేస్తే, image ని original dimensions లో చూడడానికి వీలవుతుంది.

మళ్ళీ ఒకసారి మన ‘లేపాక్షి’ గురించి…(2)

‘లేపాక్షి’ ని గురించిన ప్రస్తావన ఎప్పుడు, ఎక్కడ వచ్చినా, లేపాక్షి కి మరో పేరు అనుబంధించబడి వినబడుతుంది. ఆ పేరు ‘బసవన్న’! ‘లేపాక్షి’ ని ‘బసవన్న’ ను విడదీయలేని అనుబంధంతో పెనవేసుకునిపోయి, ఎంతగానో ప్రసిధ్ధి చెందింది ‘లేపాక్షి బసవన్న’ అనే పేరు! లేపాక్షి కి వెళ్ళి ఈ బసవన్నను దర్శించుకోనిదే, ఆ వెళ్ళిన వాళ్ళకు లేపాక్షి సందర్శనం పూర్తి అయినట్లుగా భావింపబడదు అనడం అతిశయోక్తి కానే కాదు!

లేపాక్షి శ్రీ వీరభద్రాలయానికి ఒక కిలోమీటరు లోపు (రెండు మూడు ఫర్లాంగుల కంటె ఎక్కువ దూరం వుండదనుకుంటాను!) దూరంలోనే బసవన్న శిల్పం వుంటుంది. కాలి నడకన వెళ్ళవచ్చును.  ఏకశిల నుంచి మలచబడిన ఈ బసవన్న శిల్పం కూడా, లేపాక్షి, శ్రీ వీరభద్రాలయంలోని మిగతా శిల్పాల లాగా,  జీవకళతో మెరిసిపోతూ వుంటుంది.  మొత్తం శిలనే బసవన్నగా మలిచిన అధ్బుత శిల్పం ఇది. దేశంలోనే పరిమాణంలో అతి పెద్ద (8.1 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తు పరిమాణంతో) బసవన్న శిల్పంగా ‘లేపాక్షి బసవన్న’ ను చెబుతారు! తీరుగా కూర్చుని శ్రీ వీరభద్రాలయం కేసి స్తున్నట్లుగా మలచబడింది. బసవన్న వెనక నిలబడి, కొమ్ముల మధ్య నుంచి ధృష్టి సారించి చూస్తే శ్రీ వీరభద్రాలయంలోని  ఏకశిలపై మలచబడి వున్న నాగలింగం కనబడుతుంది.

అన్ని హంగులతో మలచబడి వున్న’లేపాక్షి బసవన్న’ ఫోటోలు, ఇక్కడ ‘slide-show’ గా!

This slideshow requires JavaScript.

మళ్ళీ ఒకసారి మన ‘లేపాక్షి’ గురించి…(1)

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం, అసంపూర్తి కళ్యాణమండపానికి పక్కన ఒకే రాతి మీద మలచిన విఘ్నేశ్వర మరియు నాగలింగ శిల్పాలున్నాయి. ఈ ప్రతిమలున్న పెద్ద శిల వున్నది, ప్రధాన ఆలయానికి సరిగ్గా వెనకవైపు అవుతుంది.

ఏకశిలలో మలచిన ఈ ప్రతిమల వెనకా ఒక కథ వుంది. ఈ ఆలయ నిర్మాణానికి నియోగించబడిన శిల్పులలో, ఒక కుర్ర శిల్పి పనితనానికి సంబంధించిన కథ అది. ఆలయ నిర్మాణం జోరుగా సాగుతున్న రోజులలో ఒకనాటి రోజు, మధ్యాహ్నం భోజన విరామ సమాయానికి, భోజనం తయారవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఆ కుర్ర శిల్పి తల్లి చెప్పడంతో, ఆ మధ్య కాలంలో ఖాళీగా కుర్చోవడం ఇష్టం లేని అతను, తిరిగి అతని తల్లి వద్ద నుండి భోజనం తయారయిందని కబురు వచ్చేంతలోనే, ఆ శిలపై ఈ రూపాలను మలిచాడనీ…

అలా అంత తక్కువ వ్యవధిలోనే శిలను అద్భుతమైన శిల్పంగా మలచ గలిగిన తన కుమారుని ప్రతిభకు ఆశ్చర్య పోయిన ఆ తల్లి, తన్మయంలో ఇంగితం మరచి కుమారుని ఎదుటనే అతని ప్రతిభను గొప్పగా పొగిడిందనీ, అలా ఆమె పొగిడిన తరువాత కొద్ది సేపటికే  అందరూ ఆశ్చర్య పోయే లాగా శిల్పం మలచ బడి వున్న శిల మధ్యలోకి పైనుంచి క్రిందివరకూ ఒక సన్నని పగులు ఏర్పడిందనీ, శిలలో ఏర్పడిన ఆ పగులు కారణంగా శిల్పం  లోపం కలది అయిపొయిందనీ ప్రచారంలో వున్న కథ!

కథ సంగతెలా వున్నా, ఏక శిలపై విఘ్నేశ్వర, నాగలింగ శిల్పాలు చూడడానికి అద్భుతంగా వుంటాయి. నాగలింగ శిల్పంలో పడగ విప్పి వున్న ఏడు తలల నాగరాజు, శిల్పం చెక్కబడి వున్న శిల సహజంగానే ఎత్తుగా వుండడం వలన చాలా gigantic గా, పేరుకు తగినట్లు magnanimous గా కనిపిస్తుంది.

ఆ ఫోటోలు మొదట విఘ్నేశ్వరునివి, ఆ తరువాత నాగరాజువి ఇప్పుడు, ఇక్కడ…slide show గా!

This slideshow requires JavaScript.

చంద్రగిరి!

చంద్రగిరి! చిత్తూరు జిల్లాలో -  ప్రపంచ ప్రసిధ్ధి చెందిన పుణ్య క్షేత్రం, ఆంధ్రుల ఇల వేలుపు, అత్యంత భక్తి శ్రధ్ధలతో కొలిచే దైవం శ్రీ వేంకటేశ్వరుని దివ్య ధామం అయిన – తిరుపతి కి 11 కి.మీ. దూరంలో వున్న ఊరు! ఈ ఊరి పేరు వినగానే ఆంధ్రుల చరిత్రలో జగజ్జగేయమానంగా వెలిగిన  విజయనగర సామ్రాజ్యం, ఆ వెంటనే శ్రీ కృష్ణదేవరాయలు, ఆ వెనువెంటనే ఆయనకు పితృసమానుడూ, గురువు అయిన తిమ్మరుసు గుర్తుకు రావడం మామూలే! తిమ్మరుసయ్య ఇక్కడే పుట్టి, విద్యాబుధ్ధులు నేర్చి అంతవాడయ్యాడని ఐతిహ్యం! కృష్ణదేవరాయలు తిరుపతి యాత్రకు వచ్చినప్పుడల్లా ఇక్కడే బస చేసేవాడని చెబుతారు.

ఇక్కడ ఇప్పుడు చూడడానికి ఒక రాజమహలు, రాణీ మహలూ ఉన్నాయి. రాజ మహలు మూడు అంతస్తులలోనూ, రాణీ మహలు రెండు అంతస్తులలోనూ ఉంటాయి. రాజ మహలులోనే ఆర్కియాలనీ డిపార్టుమెంటువారు నిర్వహిస్తూన్న మ్యూజియం వుంది.

ఇవి కాక, వీటికి దగ్గరలోనే రోడ్డుకు ఇవతలి వైపున, ఎప్పటిదో… ఇప్పుడు పాడుబడిపోయిన స్థితిలో వున్న ఒక చిన్న దేవాలయము కనిపిస్తుంది. ఎప్పటినుంచి ఈ దేవాలయం ఈ స్థితిలో వుందో తెలీదు.

ఇవి అన్నీ కలిసి వున్న ఒక slide show ఇప్పుడు, ఇక్కడ!

This slideshow requires JavaScript.

ఆంధ్రుల చరిత్ర : బృహత్ఫలాయనులు

‘బృహత్ఫలాయన’ మహారాజ జయవర్మ

ఆంధ్ర దేశాన్ని శాతవాహనులు దాదాపు నాలుగువందల సంవత్సరాలు పరిపాలించారు.  వారి పాలన స్థూలంగా క్రీ.పూ.225 నుండి క్రీ.శ.225 దాకా సాంగిదని చరిత్రకారులు చెబుతారు.  శాతవాహనుల తరువాత ఆంధ్ర దేశాన్ని పాలించిన ప్రసిధ్ధ రాజవంశం ‘ఇక్ష్వాకు’ వంశం.  ఈ వంశం పురాణ ప్రసిధ్ధి చెందినది.  వీరి పాలన తరువాత ఆంధ్ర దేశాన్ని చిన్న చిన్న రాజవంశాలు పాలించాయి. బ్రృహత్ఫలాయన, శాలంకాయన, ఆనందగోత్రులు అనే పేర్లతో వున్న ఈ రాజవంశాలకి ఈ పేర్లు వారి ‘గోత్ర’ నామాల మీదుగానే వచ్చాయని చెబుతారు. బృహత్ఫలాయనులది బృహత్ఫలాయన గోత్రం, శాలంకాయనులది శాలంకాయన గోత్రం, ఆనందగోత్రులది (వారి పేరులోనే వున్నట్లుగా) ఆనంద గోత్రం…ఇలాగ!  బృహత్ఫలాయనుల విషయంలోనే కాదు, శాలంకాయన మరియు ఆనందగోత్రుల విషయంలోనూ వారి శాసనాలలో ఎక్కడా వారి వంశ నామం చెప్పబడి వుండక పోవడం వలన ‘గోత్ర’ నామాలే వాళ్ళ వాళ్ళ వంశ నామాలయ్యాయి! చరిత్రకారులు వాళ్ళను గోత్రనామాలతోనే పిలుచుకోవాల్సి వచ్చింది! (ఇది ఇంచుమించు ఎలాంటిదంటే, పల్లవులను ‘భారద్వాజు’ లనీ, కాదంబులను ‘మానవ్యు’ లనీ పిలుచుకోవడం లాంటిదని చెబుతారు!)

బృహత్ఫలాయన వంశానికి చెందిన రాజు ఆంధ్ర చరిత్రలో ఇప్పటివరకూ ఒక్కడే ఒక్కడు కనిపిస్తాడు.  ఆ రాజు పేరు ‘జయ వర్మ’. ఈయన తన పరిపాలనా కాలంలో వేయించిన ఒక తామ్ర శాసనం వలన ఈయనకు సంబంధించిన చరిత్ర కొద్దిగానయినా బయటపడింది.  ఆ తామ్ర శాసనం నేటి గుంటూరు జిల్లా, తెనాలి కి దగ్గరిలోని ‘కొండముది’ అనే గ్రామంలో దొరకడం వలన, ఈ శాసనానికి ‘కొండముది’ తామ్ర శాసనం అనే పేరు వచ్చింది. ఈ ‘కొండముది’ తామ్ర శాసనం వలననే ‘బృహత్పలాయన’ అనే పేరుతో ఒక గోత్రం వుందన్నది వెలుగులోకి వచ్చిందని పెద్దలు చెబుతారు. ఈ గోత్ర నామం (‘బృహత్ఫలాయన స గొత్తొ’ అన్న మాటలలో) ఈ ఒక్క శాసనంలో తప్ప వేరే ఎక్కడా ఇంతవరకూ లభించకపోవడం అందుకు కారణం అని కూడా చెబుతారు.

కొండముది శాసనం ఒక దాన శాసనం! ఇందులో ‘మహేశ్వర’, ‘బృహత్ఫలాయన’ అన్న రెండు మాటలు తప్ప మిగతా అంతా ప్రాకృతంలో వుంటుంది.  ఈ శాసనంలోని రాజముద్రికలో జయవర్మ మహారాజు పేరు కనబడుతున్నది.  ఈయన బృహత్ఫలాయన గోత్రుడు. మహేశ్వర పాద భక్తుడుగా అందులో వర్ణించబడినాడు.

ఈ ‘కొండముది’ దాన శాసనంలో ఈ మహారాజు తన రాజ్యంలో వున్న ‘కూడూరుహార’ లోని ‘పంతూరు’ అనే గ్రామాన్ని ఎనమండుగురు బ్రాహ్మణులకు (బ్రాహ్మదేయంగా) ఇచ్చి వున్నానని కూడూరు లోని తన ‘వ్యాపృతు’ నకు ఈ శాసనంద్వారా తెలియజేశాడు. ఇక్కడ వాడిన ‘వ్యాపృత’ అనే మాట రాజ్యంలోని (Administrative) విభాగాలకు సంబంధించిన కొంత సమాచారాన్ని వెలుగులోకి తెచ్చి చూపెడుతుంది. అప్పటిలో రాజ్యంలోని భూభాగం పరిపాలనా సౌలభ్యం కోసం ‘ఆహారా’ లుగా విభజించబడి, ఒక్కొక్క ‘ఆహారము’ ఒక్కొక్క అధికారి చేతులలో పెట్టబడి వుండేది, ఆ అధికారి హోదాను ‘వ్యాపృత’ నామంతో పిలిచేవారు. ఈ ‘వ్యాపృత’ పదం ‘వియపత’ అన్నరూపంలో అశోకుని శాసనాలలో కనిపిస్తుంది. ఈ పదానికి పాణిని చెప్పిన ఇంకొక రూపమే ‘ఆయుక్త’. ఈ రెండూ కూడా శాతవాహనుల ‘ఆమకు’ లకు, ఆ తరువాతి కాలంలోని ‘విషయపతు’ లకు సమానమైవని చెబుతారు. ఈ ‘వ్యాపృత’ పదానికి ప్రాకృత రూపమైన ‘వాపతమ్’ జయవర్మ వేయించిన కొండముది శాసనంలోనూ, పల్లవ రాజైన యువమహారాజ శివ స్కందవర్మ వేయించిన ‘మైదవోలు’ శాసనంలోనూ కనిపిస్తుంది. దీనిని బట్టీ, మైదవోలు, కొండముది శాసనాలలోని లిపి కూడా ఒకేరకంగా వున్నట్లు అనిపించడాన్నిబట్టీ, బృహత్పలాయన జయవర్మ, యువమహారాజ శివ స్కందవర్మ సమకాలీనులయి వుండవచ్చన్న అభిప్రాయానికి Dr.Hultzsch వంటి లిపి శాస్త్రజ్ఞులు (epigraphists) వచ్చారు!  (పల్లవ యువ మహారాజ శివస్కందవర్మ వేయించిన ఈ ‘మైదవోలు’ తామ్ర శాసనానికి ఆంధ్ర చరిత్రలో ఒక ప్రముఖ స్థానం వుంది. దేశపరమైన ‘ఆంధ్ర’ శబ్దం ప్రయోగం మొట్టమొదటగా ఈ శాసనంలో జరగడం, ఇందువలన ఈయన పరిపాలనా కాలమైన క్రీ.శ.మూడవ శతాబ్దం నుంచే ‘ఆంధ్ర’ శబ్దం దేశ సూచకంగా వాడుకలో వుండినదని ఈ శాసనంలోని ‘అంథాపథీయో’ అనే మాటల వలన తెలియడం, ఈ శాసన ప్రాముఖ్యానికి గల కారణాలు!)

పల్లవ శివ స్కందవర్మ రాజ్యం చేస్తున్న కాలంలో (అంటే క్రీ.శ.మూడవ శతాబ్దం ఉత్తరార్ధంలో) బృహత్ఫలాయనులు వేంగిని పరిపాలిస్తూండే వారనీ, ఇక్ష్వాకులు ఆంధ్ర దేశాన్ని (అంటే శ్రీశైలం, దక్షిణ కోసల మరియు గోదావరీ ఉత్తర కోస్తా తీర ప్రాంతం అంతా కలిసివున్న ప్రదేశాన్ని) పాలిస్తూండేవారనీ కూడా ఒక అభిప్రాయానికి చరిత్రకారులు రావడం జరిగింది.  దీనిని బట్టి చూస్తే, ఇక్ష్వాకుల పరిపాలనా కాలం, బృహత్ఫలాయన జయవర్మ రాజ్యం చేసిన కాలం, పల్లవుల రాజ్య కాలం అన్నీ సమకాలికాలై కనిపిస్తాయి. ఈ రాజుల పరిపాలనా కాలం క్రీ.శ.మూడవ శతాబ్దం!

అయితే, నాణానికి ఒక వైపు లాంటి పై అభిప్రాయానికి, రెండవ వైపు లాంటి వేరొక అభిప్రాయం కూడా వుంది! ఆ అభిప్రాయం ప్రకారం, మైదవోలు శాసనాన్ని యువమహారాజు శివస్కందవర్మ, తన తండ్రి (బప్ప) రాజ్యం చేస్తున్న కాలంలో ఇచ్చాడని, ఈ శాసనంలోని లిపినీ, బృహత్ఫలాయన జయవర్మ ఇచ్చిన ‘కొండముది’ శాసనంలోని లిపినీ పోల్చి చూస్తే, జయవర్మ యొక్క కొండముది శాసనం మైదవోలు శాసనం కంటే కనీసం ఒక తరం ముందుదనీ, కాబట్టి జయవర్మ, పల్లవ శివస్కందవర్మ కంటే కనీసం ఒక తరం ముందు రాజ్యం చేసి వుంటాడనీ కూడా చెబుతారు. చారిత్రకంగా కూడా ఇదే నిజమైనదన్న అభిప్రాయం కూడా వుంది!  కృష్ణకు దక్షిణాన వున్న ప్రాంతాల దాకా కూడా జయవర్మ అధికారం చెల్లిందనీ, ఆ దిగువన అంతా పల్లవ రాజ్యం క్రింద వుండినదనీ కూడా ఇక్కడ నిర్ణయించుకోవచ్చు.

బృహత్ఫలయాన వంశ మూలపురుషుడు ఎవరో తెలుసుకోవడానికి ఏ ఆధారమూ లేదు.  కొండముది శాసనంలో కూడా ఈ ప్రస్తావనలేక పోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాదాపుగా సమకాలీకులైన  పల్లవ, శాలంకాయనుల శాసనాలలో ఈ ఆచారం పాటింపబడి వుండడం ఇందుకు కారణం! కొండముది శాసనంలో, జయవర్మ తన తండ్రి పేరును తెలుపకపోయి వుండడం వలన, జయవర్మ తనకు తానుగానే తన ఒక్కడి కృషిద్వారా రాజ్యాన్ని దక్కించుకుని, తద్వారా బృహత్ఫలాయన వంశానికి మూలపురుషుడై,  ఆ వంశంలో ఒక్కడే ఒక్క రాజుగా చరిత్రలో మిగిలిపోయాడా? అన్న సందేహం కూడా కలుగుతుంది. అయితే, ఈ సందేహం తీరడానికి సరిపోయే ఆధారాలేవీ చరిత్రలో మిగలలేదు, మిగిలినా ఇప్పటివరకూ లభ్యం కాలేదు!

(ఈ చిన్న వ్యాసం వ్రాయడంలో సంప్రదించిన ప్రముఖుల పుస్తకాలు: (1) Early history of the Andhra Country – Dr.K. Gopalachari (2) ఆంధ్రుల చరిత్రము – (ప్రథమ భాగం) – చిలుకూరి వీరభద్రరావుగారు      (3) చరిత్ర చర్చ – ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి.)