ప్రకృతి - మరికొన్ని ‘నలుపు తెలుపు’ (black and white) చిత్రాలలో…
హొయసలుల ఆలయ నిర్మాణ శైలిని పట్టి చూపించేవి మరో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటిలో మొదటిది – ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయాన్ని ‘జగతి ‘ అనే ఒక ఎత్తైన నక్షత్రాకారపు పీఠం పైన నిర్మించడం అనేది. ‘జగతి’ వలన వొనగూడే మరో ముఖ్యమైన ఉపయోగం, ఇది ఆలయం చుట్టూ ప్రదక్షిణ పథంలా కూడా ఉపయోగపడుతుంది. ‘జగతి’ పైకి వెళ్ళడానికి మెట్లు ఉండడం, మెట్లకు ఇరువైపులా ద్వారపాలకులు ఉండడం, వారి వసించి ఉండడానికి అన్నట్లుగా చిన్నచిన్న గుడులుండడం, ముందు వైపు నుంచే కాక, కుడి ఎడమ పక్కల నుంచి కూడా మెట్ల మీదుగా జగతి పైకి వెళ్ళ గలిగే సౌకర్యాన్ని కల్పించడం, ఇలా ఉన్న ప్రతి చోటా ద్వారపాలకులు, వారికోసం చిన్న చిన్న గుడులూ ఉండడం – ఇలా చేసిన నిర్మాణాలు మొత్తం కలిసి ప్రధాన దేవాలయానికి ఒక నిండైన రూపాన్ని ఇవ్వడం హొయసలుల కాలంలో నిర్మితాలయిన దేవాలయాలలో చూడవచ్చు.
హొయసలుల కాలంలో నిర్మించబడిన ఆలయాలను చూసిన ఎవరికైనా, హొయసల శిల్పులకు నక్షత్రాకృతి పై ఎంతగానో మక్కువ అన్నది అర్ధమవుతుంది. ఆలయంలో ఏ మూలను చూసినా నక్షత్రాకృతి ఏదో రూపంలో దర్శనమిస్తుంది. గోపురాన్ని కూడా నక్షత్రాకృతిలో మలచడాన్ని చూస్తాం.
దేవాలయం మొదలు నుంచి శిఖరం దాకా నక్షత్రాకృతిలోనే శిల్పాన్ని కొనసాగించి దేవాలయం మొత్తానికి ఒక అందమైన రూపాన్ని ఇవ్వడంలో హొయసల శిల్పులు బహుశః వారు నిర్మించిన దేవాలయాలు కూడ భూమి మీద నక్షత్రాల లాగా కలకాలం మెరుస్తూ ఉండిపోవాలని ఆశించారేమో అనిపిస్తుంది.
ఆలయ నిర్మాణంలో హొయసలులది ఒక ప్రత్యేకమైన శైలి. వారి శైలికి అలంకరణ పట్టుగొమ్మ లాంటిదని చెప్పవచ్చు. కాలి గోటితో సహా అత్యంత సూక్ష్మమైన వివరాలు కూడా రాతిపై మలచి చూపించిన నైపుణ్యం హొయసలుల కాలంనాటి శిల్పులది. శిల్పంకోసం వారు ఎంచుకున్న chloritic schist (soft soap-stone) అనే రకపు రాయి హయసల శిల్పుల శిల్పకళా నైపుణ్య ప్రదర్శనకు ఎంతగానో సహాయ పడిందని చెబుతారు. కర్ణాటక రాష్ట్రంలోని ‘మల్నాడు’ ప్రాంతంలో ఈ రాయి విరివిగా లభ్యం కావడం ఆలయ నిర్మాణంలో హొయసల శిల్పులు ఈ రకపు రాయిని వాడడానికి దోహదం చేసిన కారణాలలో ఒకటి. తవ్వి తీసినపుడు మెత్తగా ఉండి, భూమి ఉపరితల వాతావరణంలో కాలం గడిచే కొలదీ ఇనుములా గట్టిపడిపోయే లక్షణం ఈ రకపు రాతిది. ఈ లక్షణాన్ని అనువుగా మలచుకుని, అనన్య సామాన్యమైన రీతిలో శిల్పాలను మలచి చూపించారు హొయసల శిల్పులు.
శిల్పాన్ని అలంకరించి చూపడంలో హొయసల శిల్పుల తరువాతనే ఎవరైనా అన్నట్లుగా ఉంటుంది వారి శిల్ప రచన. అందమైన అలంకరణతో నింపబడకుండానూ, మలచబడకుండానూ దేవాలయంలో ఎక్కడా ఒక్క అంగుళం మేర ప్రదేశం కూడా కనబడదు అన్నట్లుగా ఉంటుంది. దేవాలయ ప్రాంగణమంతటా ఎటుచూసినా సరే సౌందర్యమే కనబడేలా చేసి సందర్శకులను దైవ దర్శనానికి ప్రసన్నమైన మనఃస్థితితోనూ, ప్రశాంత చిత్తంతోనూ పంపించడాన్ని వారు తద్వారా ఆశించారనుకోవడంలో తప్పులేదనుకుంటాను.
ఆలయ నిర్మాణంలోనూ, తత్సంబంధ శిల్పకళలోనూ హొయసలులది ఒక ప్రత్యేకమైన శైలి. ఇప్పుడు ‘కర్ణాటక’ గా పిలవబడుతున్న ప్రాంతాన్ని హొయసలులు క్రీ.శ.1000-1346 మధ్య కాలంలో, దాదాపు 350 సంవత్సరాల కాలం పరిపాలించారు. స్వతంత్ర రాజవంశం కావడానికి ముందు వీరు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా వుండి, క్రీ.శ.1117 లో తమకు తాముగా స్వతంత్రాన్ని ప్రకటించుకుని రాజ్యాధికారాన్ని చేపట్టారు. వీరిలో మొదటి స్వతంత్ర రాజు విష్ణువర్ధనుడు, క్రీ.శ.12వ శతాబ్దం ప్రథమ దశకంలో రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఈయన పరిపాలనా కాలంలో నిర్మించబడిన ఆలయం, బేలూరులోని చెన్నకేశవాలయం. ఈ దేవాలయం క్రీ.శ.1117 సం.లో పశ్చిమ చాళుక్యుల నుంచి హొయసలులు స్వతంత్రులైన విజయానికి చిహ్నంగా నిర్మించబడి, విష్ణువర్ధన మహారాజుచే ప్రారంభించబడినదని చెబుతారు. బేలూరు చెన్నకేశవాలయం హొయసలుల ఆలయ నిర్మాణ శైలికి నమూనాలుగా చెప్పే మూడు దేవాలయాలలో ఒకటి, మొదటిదీను. మిగతా రెండూ, హాలేబీడు లోని హొయసలేశ్వర/కేదారేశ్వర ఆలయాలు, సోమనాథపూరు లోని మరో చెన్నకేశవాలయం.
హొయసలులు వారు పరిపాలించిన మూడున్నర శతాబ్దాల కాలంలో మొత్తంగా 958 ప్రదేశాలలో దాదాపు పదిహేను వందలదాకా ఆలయాలు నిర్మింపజేశారని చెబుతారు. ఈ దేవాలయాలలో చాలాభాగం కర్ణాటక రాష్ట్రంలోని ‘మల్నాడు’ గా పిలవబడే ప్రాంతంలో నిర్మింపజేశారనీ, కాలగతిలో పోయినవి పోగా వీటిలో ఇప్పటికి దాదాపుగా ఒక వంద దాకా దేవాలయాలు మాత్రమే నిలిచి ఉన్నాయనీ చెబుతారు.