తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (2)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (2)

భారతీయులమైన మనకు చాలా భాషలే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన కొన్ని భాషలలో, సంస్కృతం సంస్కృతమే (గీర్వాణము అన్న వేరే మాట కూడాఉంది.
అయితే, ఈ మాట ఇప్పుడు అంతగా ఎక్కువ ప్రచారంలో లేదన్నది వాస్తవం). ఇంకా – హిందీ హిందీనే. కన్నడం కన్నడమే. మళయాలం మళయాలమే.
తమిళానికి అరవం అన్న వేరే మాట ఉందిగాని, ఈ మాట కూడా ఇప్పుడు అంత ఎక్కువ ప్రచారంలో లేదు (తమిళులకు అరవవాళ్ళు అన్న మాట కూడా ఒకప్పుడు
వాడుకలో ఉండినది నిజం. ఇప్పుడంతగా వాడుకలో లేదు). ఇవన్నీ ఇలా ఉండగా, ఒక్క తెలుగు మాత్రమే తెలుగు, ఆంధ్రము రెండూను! ఈ రెండు
మాటలూ ఒకదానికి ఒకటి సమానంగానూ, ఒకదానికన్నా ఒకటి ఏమాత్రమూ తక్కువ కాదన్నట్లుగానూ – జాతి పరంగానూ, మాట్లాడే భాష పరంగానూ,
ఎలా చూసినా సమానార్ధకంగానూ, అప్పుడూ ఇప్పుడూ సమానంగా వాడుకలో ఉన్నాయి! ఇది ఎందుకు ఇలాగ? అని ఆలోచించుకుంటూ పోతే ఇంకాస్త
అయోమయం తప్ప ఒకింత ఆమోదయోగ్యమైన సంగతులను తెలియజేసే సమాచారం ఏదీ ముందుకు ఒక పట్టాన రాదు.

తెలుగును గురించి తెన్ (తెనుగు) – దక్షిణ దిగ్వాచకమనీ, త్రికళింగం పోను పోనూ త్రిలింగం తెలుగు అయిందనీ, త్రిలింగ భూమి కావడం వలన తెలుగు
అయిందనీ, తైలాంగు, తెల్ లేదా తెలీవాహ నదీ తీరప్రాంత వాసులవడం వలన తెలుగువాళ్ళయ్యారనీ… ఇలా వివిధాలయిన వివరణలున్నాయి. ఈ
వివరణలోని సంగతులన్నీ దక్షిణభారతానికి అంటే కృష్ణా గోదావరీ పరీవాహక ప్రాంతాలకూ, కళింగానికి (గోదావరికి  ఉత్తర భూభాగానికి కళింగమన్న పేరు
మొదటినుంచీ వాడుకలో ఉంది) చెందినవి అయి ఉన్నాయి. ఇక ఆంధ్ర ప్రదం ప్రాచీనతను గురించిన మాట ఎప్పుడు ఎక్కడ వచ్చినా సంగతులు (ఋగ్వేద)
బ్రాహ్మణాల కాలం అయిన క్రీ.పూ.1500-1000 ప్రాంతందాకా వెళతాయి. ఋగ్వేదానికి చెందినదైన ఐతరేయ బ్రాహ్మణంలోని శునశ్శేపుని కథలో వచ్చిన
ఆంధ్ర జాతి ప్రస్తావన ఇంధుకు ఉదాహరణగా చెప్పడం ఇప్పటికి బహుళ ప్రసిధ్ధమై అందరికీ తెలిసినది అయిపోయింది.

శునశ్శేపుని ఉదంతంలో చివరన విశ్వామిత్రుడు తన నూరుగురు కుమాళ్ళలోని మొదటి యాభైమందిని శపించే సందర్భంలో ఈ ఆంధ్ర జాతి ప్రస్తావన వస్తుంది. ఈ
శునశ్శేపుని కథ ఐతరేయబ్రాహ్మణంలో ప్రక్షిప్తమైన కథ అని ఒక మాట కూడా పండిత అభిప్రాయమై ఉంది (A.B. Keith – “Rigveda Brahmanas” 1920, ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి – “చరిత్ర చర్చ” 1989). ఈ అభిప్రాయం ప్రకారం ఇది పురాణాల కాలమైన క్రీ.పూ.3 వ శతాబ్దానికి చెందుతుంది. అంటే ఉత్తరభారతంలో మౌర్యుల పరిపాలనా కాలం అవుతుంది.

యజ్ఞాలలోని వివిధ క్రియలను, అందులో వేద మంత్రాల వినియోగాన్ని గురింది విశద పరిచేవి బ్రాహ్మణాలు. సుయవన పుత్రుడైన అజీగర్తుడు వేద పురోహితుడు.
ఒకానొక సందర్భంలో దురాశపడి 300 గోవులకోసమై కొడుకైన శునశ్శేపుని తనచేతులతోనే నరికి బలి ఇవ్వడానికి అంగీకరిస్తాడు. కానీ, శునశ్శేపుడు
అజీగర్తుని నుండి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునే కోరికతో విశ్వామిత్రుని అండ చేరుతాడు, అతనిని తండ్రిగా చేసుకునే తలంపుతోనే! ఆ పై సంభాషణ ఇలా
సాగుతుంది:

అజీగర్తుడు: (విశ్వామితుని ఉద్దేశించి) ఓ ఋషీ! నా పుత్రుని నాకు ఇవ్వండి!
విశ్వామిత్రుడు: ఇవ్వను. దేవతలు ఇతనిని నాకు ఇచ్చారు.
ఇట్లా చెప్పి విశ్వామిత్రుడు శునశ్శేపునికి పేరు మార్చి దేవరాత వైశ్వామిత్ర అని నూతన నామకరణం చేస్తాడు. ఆ తరువాత అజీగర్తుడు కొడుకును
బతిమాలుకుంటాడు.
అజీ: (శునశ్శేపుని ఉద్దేశించి) పుత్రా, (తల్లిదండ్రులం) మేమిద్దరం నిన్ని పిలుస్తున్నాం. నీవు అంగిరస అజీగర్త పుత్రుడవు. ఓ ఋషీ! నీవు నీ తండ్రి
తాతల గృహాన్ని విడువవద్దు. మా వద్దకు రమ్ము.
శునశ్శేపుడు: నేను శూద్రుడుకూడా ముట్టని ఆ వస్తువును (కత్తిని) నీ చేతిలో ఉండగా చూశాను. ఓ అంగిరసా! నీవు 300 ఆవులను నా కంటె
ఎక్కువనుకున్నావు.
అజీగర్తుడు: పుత్రా! చేసినదానికి నేను పశ్చాతాప పడుతున్నాను. ఆ పాపాన్ని నివారించుకుని నీకు 100 ఆవులను ఇస్తున్నాను.
శునశ్శేపుడు: ఒకసారి పాపం చేగలిగినవాడు మరొకసారి పాపం చేస్తాడు. నీవు శూద్రత్వం నుండి ముక్తిని పొందలేదు. నీవు చేసిన పాపం ఏ విధంగానూ
నివారింపబడదు.
(ఈ సంభాషణ పాఠాన్ని రాహుల్ సాంకృత్యాయన్ “ఋగ్వేద ఆర్యులు” నుండి తీసుకున్నాను).

ఈ సంభాషణలో అజీగర్తుడు శునశ్శేపుని ‘ఓ ఋషీ!’ అని సంబోధించడాన్ని బట్టి శునశ్శేపుడు అప్పటికే పెద్దవాడని, ఋషిత్వాన్ని పొందినవాడని అర్ధమవుతుంది. (ఐతరేయ బ్రాహ్మణంలోని కొన్ని ఋక్కులు కాడా వసిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, అయాస్యుడు, అజీగర్తుడు, శునశ్శేపుడు – వీరంతా సమకాలీకులని చెబుతాయని పెద్దల వ్రాతలవలన అర్ధమవుతుంది). శునశ్శేపుడిని రక్షించే క్రమంలో విశ్వామిత్రుడు అతనిని తన పుత్రునిగా చేసుకుంటాడు. విశ్వామిత్రునికి అప్పటికే నూర్గురు పుత్రులు. అందులో యాభై మంది మధుఛ్ఛందుని కంటే పెద్దవారు. ఈ యాభై మందీ శునశ్శేపుని దత్తతను, దాని ఫలితంగా శునశ్శేపునికి కలిగే పెద్దరికాన్ని ఒప్పుకోవడానికి అంగీకరించరు. ఇది విశ్వామిత్రునికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఫలితంగా వచ్చిన మాటలలో ఈ యాభై మందీ, వారి సంతానం ఆర్య భూములకావల ‘ఆంధ్ర, పుండ్ర, శబర, పులింద, మూతిబ ఇత్యాది జాతులలో కలిసిపోండ’ని శపిస్తాడు. వారే ఈ జాతుల ప్రజలనీ, ఆర్య జాతి సమ్మేళణం ఈ జాతుల ప్రజలతో జరిగిందనీ ఈ కథ తాత్పర్యం. ఈ ఫలితాన్ని సాధించడానికే ఈ ఉదంతాన్ని ఐతరేయ బ్రాహ్మణంలో ప్రక్షిప్తీకరించడం జరిగిందనీ కూడా అనుకోవాల్సి ఉంటుంది. పురాణాల కాలమైన క్రీ.పూ.3 వ శతాబ్దిలో ఇది జరిగింది అనాలి.

విశ్వామిత్రుని శాప పాఠం పై కూడా భిన్నమైన వివరణలు ఉన్నాయి. “You shall have the lowest castes for your descendants.  Therefore are many of the most degraded classes of men, the rabble for the most part, such as the Andhras, Pundras, Sabaras, Pulindas and Mutibas, descendants of Viswamitra.” అని  Martin Haag….

“Your offspring shall inherit the ends (of the earth).  These are the people the Andhras, Pundras, Sabaras, Pulindas and Mutibas who live in large numbers beyond the borders.  Most of the Dasyus are the descendants of Viswamitra.” అని A.B. Keith ….ఇలా! (“ఆంధ్ర వాఙ్మయారంభ దశ – ప్రథమ సంపుటము – పాఙ్నన్నయ యుగము” దివాకర్ల వెంకటావధాని – 1960).

పురాణాలు (ముఖ్యంగా వాయు, మత్స్య మరియు మార్కండేయ పురాణాలు) ఉత్తర కొంకణాన్ని అపరాంతం అన్నాయి. వింధ్య, సత్పూరా పర్వత శ్రేణులు,
వాటిల్లో పుట్టి ప్రవహించి అరేబియాసముద్రంలో కలిసే నర్మద, తాపీ నదుల తీర ప్రదేశాలలో పుండ్రులు, పుళిందులు, శబరులు జీవనం సాగిస్తుండేవారనీ చెప్పాయి (“Early History of the Dekkan” – R.G. Bhandarkar – 1895). ఈ జాతుల ప్రజలతో కలిపి చెప్పబడిన ఆంధ్రులుకూడా ఆ ప్రాంతం వారే అయి ఉంటారనుకోవడం అసంగతం కాదు. ఇక్కడి ఈ ఆంధ్రులకూ, ఇక్కడి నుండి చూస్తే చాలా దిగువన కృష్ణా గోదావరీ ప్రాంత వాసులై ఉండిన తెలుగు వాళ్ళకు ఏవిధంగా సంబంధం కుదిరింది? వీరిరువురూ ఒకే జాతివారు ఎలాగయ్యారు? వీరిరువురి భాషా ఒకే భాష ఎలాగయ్యింది? ఇవి సందేహాలు, అర్ధంలేనివి కావు.

ఫొటోగ్రఫీ : Images 2012 (48) – “చిటారుకొమ్మన…”

చిటారుకొమ్మన….. చిగురాకులలో….. ఒకే (సీతాకోక) చిలుక, రెండు ఫోటోలు!

చిటారుకొమ్మన….

bfly images 2012 (18)చిగురాకులలో….

bfly images 2012 (19)

స్వగతాలు (12): పసితనమూ, పోయిన వసంతమూ….

పసితనమూ, పోయిన వసంతమూ….

shades of future-2ఏ అనవసరపు ఆవేశానికీ లోనుకాకుండా
నింపాదిగానూ, ఒకింత నిర్మోహంగానూ చూడగలిగే కన్ను
చూడలేనిది ఏదీ ఉండదు.
పసితనమూ, వార్ధక్యమూ
పత్రహరితమూ, పోయిన వసంతమూ
అన్నీటినీ ఆ కన్ను అదే కరుణతో వీక్షిస్తుంది.

వెలిగే దీపం చీకటి వాకిట్లో మరీ హుందాగా మెరిసేటట్లుగా
అందం అప్పుడప్పుడూ ఒక్కొక సందర్భాన్నీ అంటిపెట్టుకుని ఉంటుంటుంది.
అందువలన, సౌందర్యాన్ని సృష్టించడమంటే ఎప్పటికప్పుడు సందర్భాన్ని కల్పించడమో, మేలుకొల్పడమో అవుతుంటుంది.

నువ్వు ఉండవు.
అయినా నిన్ను గురించిన సందర్భాలు కొన్నైనా చిత్రాలుగా మారి చిత్తాన్ని అలంకరించి ఉండడమే జ్ఞాపకం.
ఇది సహజం.

నేను ఉంటాను.
అయినా నన్ను గురించిన సందర్భం ఏదీ నీ చిత్తాన్ని  అలంకరించి ఉండకుండడమూ నాకు జ్ఞాపకమే!
అసహజమైనా సౌందర్యమే!

అందుకే అంటాను
నింపాదిగానూ, ఒకింత నిర్మోహంగానూ చూడగలిగే కన్ను
చూడలేనిది ఏదీ ఉండదు.

అడవి గాచిన వెన్నెలలా, ఎవరికీ చెందని విషాదం కూడా ఒక్కొకప్పుడు మహా సౌందర్యానికి కారణమౌతుందన్నది నిజం!

స్వగతాలు (11): చెట్టు – హరితాత్మ (ఒక జ్ఞాపకం)

చెట్టు – హరితాత్మ (ఒక జ్ఞాపకం)

ఇంత తీయగా ఉంటుంది గనుకనే నీ జ్ఞాపకపు గాయాన్ని నేను ఎన్నటికీ  మానిపోనీయను.

ఎక్కు పెట్టిన బాణానికి గురి తప్పడం కూడా తెలిసే ఉంటుంది.
ఎడారికి దాహాన్ని గురించిన స్పృహ మొదటినుంచీ ఉంటుంది.

ఎంత పకడ్బందీగా రాసుకున్నా విఫలం అయ్యే కొన్ని ప్రేమ కథల్లోనూ గాథల్లోనూ  లాగా
అయిన గాయాన్ని
ఎవరిదో ఒక విరహ గీతంలా పెదవులపై మోస్తూ తిరగడంలో ఎంత సుఖముందో నీకేం తెలుసు?
నువ్వు జ్ఞాపకంగా ఉండడంలో ఎన్ని వేల గేయాలున్నాయో నాకిప్పుడు బాగా తెలుసు.

ఎంతగా కాంక్షించి చూసుకున్నా సఫలం కాని కొన్ని ప్రేమ కథల్లోనూ గాథల్లోనూ లాగా
మరిచిపోవడం తప్పనిసరి అయిన ప్రతిసారీ నేను నీ మోహం లోనుంచి తప్పుకుని ఏదో ఒక గాయంలోకో, గేయంలోకో, జ్ఞాపకాల తోయంలోకో లీనం అయిపోవడానికి ప్రయత్నిస్తాను. సఫలం చెందుతాను కూడా!

నన్ను నేను తప్పిపోగొట్టుకోవడంలో ఎంత సుఖముందో నీకేం తెలుసు?
వాడిపోయిన, మోడైపోయిన ప్రతి పూవునుంచి చెట్టునుంచి నన్ను నేను కొంచెం కొంచెంగా దక్కించుకోవడంలో ఎంత సుఖం ఉందో ఇప్పుడు నాకు మాత్రమే తెలుసు.

ఎప్పుడైనా నేనిప్పుడు
నువ్వు ఉండకుండా ఉండే నీ జ్ఞాపకాల లోకంలో ఇలా చెట్టు చెట్టుకీ ఒక హరితాశ్రువునై పరిభ్రమిస్తూ కనబడతాను.
నువ్వుండని ప్రతిచోటా నీ కంటే నిజంగా నాకు నీ జ్ఞాపకమే హరితాత్మ!

స్వగతాలు (10): రంగుల కల -4

రంగుల కల -4

ఏదైనా సరే  ఒక విలక్షణతతో విశ్వాన్ని సమ్మోహపరచాలని కాంక్షించే ప్రతి చిన్న పువ్వుకూ
ఏదో ఒకనాటికి ఎవరిదో ఒకరి సాన్నిధ్యంలో కనులు మొగిడ్చి తన్మయానికి లొంగి పోయే తరుణం రానే వస్తుంది.

గడ్డిపరక కైనా సరే,
వెనక్కి వాలి, వెన్నిచ్చి, కనులు మూసుకుని కాస్త సేద దీరినపుడు
నలిగి పోతున్నానన్న బాధకన్నా
నన్నే గదా ఆపు చేసుకున్నాడన్న స్పృహ, సంతోషమూ లోపల ఉండకుంటే తప్ప
మళ్ళీ లేచి కూర్చోలేదనుకుంటాను.

క్షణాలుగా గడిచిపోతుంటుంది యవ్వనం
యుగాలుగా గడుస్తూ ఉంటుంది వార్ధక్యం!

అన్నీ అయిపోయాక
కళ్ళ రెప్పల వెనుక బారులుగా తీరి ఉన్న నీళ్ళ చారల దారులలో
ఎవరిదో తెలియని ఒక విశ్వ మొహక గళం తనను తాను తప్పిపోగొట్టుకుని
ఆలాపించే అంతులేని శోకాశోక గీతానికి పారవశ్య సూచకంగానో నిదర్శనంగానో అన్నట్లుగా
ఎప్పుడూ ఒక నీటి బొట్టు కనుపించీ కనుపించకుండా కంటి రెప్పలనంటి
వేళ్ళాడుతూ ఉండడం ఒకానొక మధురాతి మధురమైన జ్ఞాపకం!

***

స్వగతాలు (9): రంగుల కల -3

రంగుల కల -3

ఎందుకో గాని
ఈ రంగుల ముందు నా మాటలు
ఎప్పుడూ మౌనంగా వుండడాన్నే
ఇష్టపడతాయి!

అదెందుకో గాని
విరిసినా విరియక ఉన్నా వాడినా
పువ్వెప్పుడూ ఒక మధుర స్వప్నానికి ఆనవాలులాగానే ఉంటుంది.
ప్రియమైన లోగిలి వైపుకు ఇంకా మొదలేకాని ఒకానొక కలల ప్రయాణంలోకి వేయ జూడబోయిన తొలి అడుగులా
విరిసినా విరియక ఉన్నా వాడినా
ఎలా ఉన్నా పువ్వెప్పుడూ ఒక మధురానుభూతిలాగానే ఉంటుంది.

ఎంతకూ మోహపడని యవ్వనాన్ని భరించి ఉండడం ఎంత కష్టమో
ఎంతకూ మోదపడని హృదయాన్ని ధరించి ఉండడమూ అంతే కష్టం!

లోలోపల మధురంగా జ్వలించలేని మనుషులున్న చోటున
పువ్వు వికసించినా వికసించకున్నా పెద్దగా తేడా ఉండదు.

నీకోసమే అన్నట్లుగా విరిసి విప్పారి ఉన్న విరి తనువును
తనకుతానుగా చేయి చాచి స్పృశించలేని మనిషికి మోహస్పర్శ ఎలాంటిదో ఎప్పటికీ తెలియదు!

స్వగతాలు (8): రంగుల కల -2

రంగుల కల -2

మనిషిగా
ఉన్నంతకాలం ఇంత సామాన్యంగా, స్వచ్చంగా మెరవడానికి
ఎన్నెన్ని యాగాల యుగాల యోగాల ఫలితాల్ని ధరించి ఉండాలో అనుకోవడం అత్యూహ కాదు కదూ…

ఇంత తోడుతోడుగా, సామీప్యంలో ఉన్నంతకాలం ఉండడానికీ…
ఉంటూ చూడడానికీ చూడబడడానికీ…

ఈ రంగులదొక వింత లోకం.
కమ్ముకుంటున్న ఉషోదయం లాంటిదో, అస్తమయం లాంటిదో వెలుతురు వర్ణం
ఒకానొక ఇంకా మొదలుకాని సంగతిని సూచిస్తున్నట్లుగా ఉంటుంది.
ఎన్నో వింతలను రాత్రి మోసుకు వస్తుంది.
భయపడతాం భయపెడతాం గానీ, స్వతహాగా చీకటి ఒక సాధువు.
చూడాలని వెలిగిస్తే చిన్నచిన్న సంగతులను కూడా దివ్యంగా వెలిగించి చూపెడుతుంది.

ఈ అనంతమైన విశ్వంలో
ప్రతి రేణువంత ప్రాణికి కూడా  ఒక ప్రత్యేకమైన ఉనికి ఉంటుంది.
ఎటొచ్చీ, సానుభూతితో సంయమనంతో చూసే చూపే మనిషికి ఉండాలి.

స్వగతాలు (7): రంగుల కల -1

రంగుల కల

అవును, ఇది ఒక రంగుల కల!
ఈ కల ఎప్పటికప్పుడు పరుచుకుంటున్న మంచు తెరలా కళ్ళను కమ్మేసి కలవరపెడుతూనే ఉంటుంది.
ఎందుకో తెలియని భావోద్రేకాన్ని భరించి ఉండడం ఎంత కష్టమో, కళ్ళముందు కమ్ముకుంటున్న ఈ రంగుల కలనూ పక్కకు నెట్టి విడిగా చూడడమూ అంతే కష్టంగా ఉంటుంది.

flowers, clrs (18)తల వంచుకుని నడుస్తూనే ఉంటామా…
అడుగులు ముందుకు పడుతూనే ఉంటాయా…
ఇంతలో ఏదో ఒక ఊహించని మూలనుంచి ఒక వర్ణమో, వర్ణాల సముదాయమో తెలియకుండా వచ్చి తమ ఉనికిని తెలుపుకుంటున్నట్లవుతుంది.
అదెందుకలా అవుతుందన్న దానికి సమాధానాం దొరకదు గాని,
తల అటుగా తిప్పి చూస్తే, ఇదిగో ఇలా చూడాలన్నట్లుగా వాటికవే చూపులకు దారి పరిచినట్లవుతుంది.

flowers, clrs (19)చంద్రుడితో పాటే పోయే వెన్నెలలా,
ప్రియుడి వెంట ప్రేయసి పోతుందని ఎవరో ఒక పూర్వ కవి ఉత్ప్రేక్షించినట్లు,
వర్ణంతో పాటుగానే నా కంటి చూపూ పోతుంది.

flowers, clrs (20)వర్ణ సౌందర్యం, వర్ణ సముదాయాల సమ్మేళనల సౌందర్యం. నాకొక తన్మయ నయనానందకర సమ్మోహ భీభత్సం!

flowers, clrs (21)విరియడానికి వేసటతో వేచి చూస్తున్నట్లుగా కనుపించే వర్ణం, పువ్వు వెంట ఒకానొక  తన్మయాన్ని గాలిలోకి నిరంతరంగా నిశ్వాసిస్తూనే ఉంటుంది;
మొగ్గగా విలసిల్లడానికి ముందే, ఒకా నొక …కాదు కాదు, అనేకానేక తమోహ రణాల సమీకరణాలను అణువణువునా నింపుకుని గదా అది అవతరించేది!

కీసరగుట్ట

కీసరగుట్ట - శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం

హైదరాబాదు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంటుంది కీసర (కీసర గుట్ట). ప్రసిధ్ధ శైవక్షేత్రం.

క్రీ.శ. తొలి శతాబ్దాలలో ఆంధ్ర దేశాన్ని (వేంగీ దేశాన్ని) పరిపాలించిన రాజవంశాలలో ఒకటైన విష్ణుకుండినులకు, ఈ కీసరకు సంబంధం ఉందని ఒక మాట ఉంది. ఈ రాజవంశం రాజులలో ఒకడైన రెండవ మాధవ వర్మ పరిపాలనా కాలం అయిన క్రీ.శ.4-5 శతాబ్దాలలో ఈ కీసర రాజధానిగా ఉండేదని చెబుతారు.
విష్ణుకుండిన రాజులలో రెండవ మాధవ వర్మ చాలా ప్రసిధ్ధుడు. రాజ్యాన్ని బాగా విస్తరింపజేసి విష్ణుకుండినుల ప్రభను ఒక వెలుగు వెలిగించిన దీటైన రాజు. ఈయన వైదికమతాభినివిష్టుడనీ, అగ్నిష్టోమ, వాజపేయ, పౌండరీక, అశ్వమేధ, రాజసూయ ఆది క్రతువులను చేశాడనీ చరిత్ర పరిశోధకులు చెప్పారు. పదకొండుసార్లు అశ్వమేధ యాగాన్ని చేయడం వలన ఈయన రాజ్యకాలంలో పదకొండు సార్లు దిగ్విజయ యాత్ర సాగించి ఉంటాడనీ చరిత్ర పరిశోధకులు అంటారు. అప్పటిలో బలవంతులైన వాకాటకులను పోరులో ఓడించి, సంధిలో భాగంగా వాకాటక రాజు కుమార్తెను వివాహం చేసుకుని, తదనంతరం రెండు రాజ్యాలకూ వారసుడు అయ్యాడని కూడా చరిత్ర పరిశొధకులు ఊహించారు. ఇంత ప్రసిధ్ధుడైన రాజుతో సంబంధం కలిగి ఉండిన ఈ క్షేత్రం కూడా అంత ప్రసిధ్ధమైనదే! శివరాత్రి నాడు ఏటా జరిగే ఉత్సవాలకు హైదరాబాదు నుండి ప్రత్యేకంగా బస్సులను వేస్తారు. జనం తండోపతండాలుగా వెళ్ళి ఉత్సవంలో పాల్గొంటారు.

కొండ (‘గుట్ట’ అనే అనాలనుకుంటాను!) మీద ఆలయం. మెట్లు ఎక్కుతూండగా కనిపిస్తుంది ఆలయ గోపురం. కొండ (‘గుట్ట’) మీద ఆలయ ప్రాంగణంలో ఏ వైపు చూసినా శివలింగాకృతులు కనిపించి అబ్బుర పరుస్తాయి. కొండ మీదనుంచి చుట్టు scenery చూడడానికి బాగానే ఉంటుంది. ఈ మధ్యనే వెళ్ళి నప్పుడు తీసినవి ఫోటోలు ఇక్కడ కొన్ని. ఈ ఫోటోలు 2 megapixel లెన్స్ తో ఉన్న సెల్ ఫోనుతో తీసినవి. ఈ ఫోటోలలో చివరి నాలుగు ఫోటోలూ dimensions లో పెద్దవి. వాటి మీద ఎక్కడైనా సరే click చేస్తే, image ని original dimensions లో చూడడానికి వీలవుతుంది.

స్వగతాలు (6) : జ్ఞాపకం -2

జ్ఞాపకం (2)

ఒకప్పటి అతి గాఢమైన ప్రేమ కూడా
ఇప్పటికి ఒక అగాఢమైన, అస్పష్టమైన జ్ఞాపకాల సముదాయంగా అంతమై మిగలొచ్చని ఒక మాట!

ఏది పరమ నిజం (absolute truth)?
ఏదీ కాదు.
సంబంధ నిజమో (relative truth)?
అన్నీ!
నీవూ నేనూ, నీ ప్రేమా నా ప్రేమా…. ఇలా అన్నీ!

చూడగలిగితే, చదవ గలిగితే, కాలంలో ఎప్పుడూ ఒక అప్రకటిత దాన శాసనం శిలామయమై క్షణానికో మారు లిఖించబడి వుండి కనబడుతూ వుంటుంది!

ఇదివరకే పడివున్న అక్షరాల అడుగుజాడలలో తడబడుతూ నడుస్తూండేవే
నీవీ నావీ, ఇంకా మనలాంటి వాళ్ళవే అందరివీ, జ్ఞాపకాలు.

చిక్కుపడిపోయి వున్న కురులలోకి వేళ్ళు పోనిచ్చి, ఉదయం అరవిప్పారిన కన్నులతో ఆవులిస్తూ బడలికగా పురివిప్పుకుంటున్నట్లు కదిపినప్పుడల్లా, హటాత్తుగా రాలిపడే ఒక వాడిపోయిన మల్లెపూవు లాంటిది ఈ జ్ఞాపకం.

కళ్ళు నులుముకుని చూడాల్సి వచ్చేటంత అపనమ్మకంగా, నమ్మశక్యం కానంత నిర్నిమిత్తంగా,
ఒక మధురాతి మధురమైన స్మృతిని జ్ఞప్తికి తెచ్చి ఒళ్ళు ఝల్లుమనిపిస్తుంటుంది.

కురులమధ్య కవోష్ణంలో కాలిపోయి మిగిలిన అప్పుడెప్పటిదో మోహాన్నీ, మొహాన్నీ
అక్షరాలా ఈ అక్షరాల జలపాతంలో తడుపుకుని తృష్ణ తీర్చుకుంటూ
నేనిక్కడ ఎన్నాళ్ళుగా నయినా సరే పడి ఉంటూనే ఉంటాను….

అటూ ఇటూ ఒకేసారి మండుతూన్న సూర్యునిలా
ఉదయం సాయంత్రం, పగలూ రాత్రీ అనే ప్రాపంచిక సంగతులను వేటినీ పట్టించుకోకుండా
ఇలా…..