తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (2)
భారతీయులమైన మనకు చాలా భాషలే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన కొన్ని భాషలలో, సంస్కృతం సంస్కృతమే (గీర్వాణము అన్న వేరే మాట కూడాఉంది.
అయితే, ఈ మాట ఇప్పుడు అంతగా ఎక్కువ ప్రచారంలో లేదన్నది వాస్తవం). ఇంకా – హిందీ హిందీనే. కన్నడం కన్నడమే. మళయాలం మళయాలమే.
తమిళానికి అరవం అన్న వేరే మాట ఉందిగాని, ఈ మాట కూడా ఇప్పుడు అంత ఎక్కువ ప్రచారంలో లేదు (తమిళులకు అరవవాళ్ళు అన్న మాట కూడా ఒకప్పుడు
వాడుకలో ఉండినది నిజం. ఇప్పుడంతగా వాడుకలో లేదు). ఇవన్నీ ఇలా ఉండగా, ఒక్క తెలుగు మాత్రమే తెలుగు, ఆంధ్రము రెండూను! ఈ రెండు
మాటలూ ఒకదానికి ఒకటి సమానంగానూ, ఒకదానికన్నా ఒకటి ఏమాత్రమూ తక్కువ కాదన్నట్లుగానూ – జాతి పరంగానూ, మాట్లాడే భాష పరంగానూ,
ఎలా చూసినా సమానార్ధకంగానూ, అప్పుడూ ఇప్పుడూ సమానంగా వాడుకలో ఉన్నాయి! ఇది ఎందుకు ఇలాగ? అని ఆలోచించుకుంటూ పోతే ఇంకాస్త
అయోమయం తప్ప ఒకింత ఆమోదయోగ్యమైన సంగతులను తెలియజేసే సమాచారం ఏదీ ముందుకు ఒక పట్టాన రాదు.
తెలుగును గురించి తెన్ (తెనుగు) – దక్షిణ దిగ్వాచకమనీ, త్రికళింగం పోను పోనూ త్రిలింగం తెలుగు అయిందనీ, త్రిలింగ భూమి కావడం వలన తెలుగు
అయిందనీ, తైలాంగు, తెల్ లేదా తెలీవాహ నదీ తీరప్రాంత వాసులవడం వలన తెలుగువాళ్ళయ్యారనీ… ఇలా వివిధాలయిన వివరణలున్నాయి. ఈ
వివరణలోని సంగతులన్నీ దక్షిణభారతానికి అంటే కృష్ణా గోదావరీ పరీవాహక ప్రాంతాలకూ, కళింగానికి (గోదావరికి ఉత్తర భూభాగానికి కళింగమన్న పేరు
మొదటినుంచీ వాడుకలో ఉంది) చెందినవి అయి ఉన్నాయి. ఇక ఆంధ్ర ప్రదం ప్రాచీనతను గురించిన మాట ఎప్పుడు ఎక్కడ వచ్చినా సంగతులు (ఋగ్వేద)
బ్రాహ్మణాల కాలం అయిన క్రీ.పూ.1500-1000 ప్రాంతందాకా వెళతాయి. ఋగ్వేదానికి చెందినదైన ఐతరేయ బ్రాహ్మణంలోని శునశ్శేపుని కథలో వచ్చిన
ఆంధ్ర జాతి ప్రస్తావన ఇంధుకు ఉదాహరణగా చెప్పడం ఇప్పటికి బహుళ ప్రసిధ్ధమై అందరికీ తెలిసినది అయిపోయింది.
శునశ్శేపుని ఉదంతంలో చివరన విశ్వామిత్రుడు తన నూరుగురు కుమాళ్ళలోని మొదటి యాభైమందిని శపించే సందర్భంలో ఈ ఆంధ్ర జాతి ప్రస్తావన వస్తుంది. ఈ
శునశ్శేపుని కథ ఐతరేయబ్రాహ్మణంలో ప్రక్షిప్తమైన కథ అని ఒక మాట కూడా పండిత అభిప్రాయమై ఉంది (A.B. Keith – “Rigveda Brahmanas” 1920, ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి – “చరిత్ర చర్చ” 1989). ఈ అభిప్రాయం ప్రకారం ఇది పురాణాల కాలమైన క్రీ.పూ.3 వ శతాబ్దానికి చెందుతుంది. అంటే ఉత్తరభారతంలో మౌర్యుల పరిపాలనా కాలం అవుతుంది.
యజ్ఞాలలోని వివిధ క్రియలను, అందులో వేద మంత్రాల వినియోగాన్ని గురింది విశద పరిచేవి బ్రాహ్మణాలు. సుయవన పుత్రుడైన అజీగర్తుడు వేద పురోహితుడు.
ఒకానొక సందర్భంలో దురాశపడి 300 గోవులకోసమై కొడుకైన శునశ్శేపుని తనచేతులతోనే నరికి బలి ఇవ్వడానికి అంగీకరిస్తాడు. కానీ, శునశ్శేపుడు
అజీగర్తుని నుండి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునే కోరికతో విశ్వామిత్రుని అండ చేరుతాడు, అతనిని తండ్రిగా చేసుకునే తలంపుతోనే! ఆ పై సంభాషణ ఇలా
సాగుతుంది:
అజీగర్తుడు: (విశ్వామితుని ఉద్దేశించి) ఓ ఋషీ! నా పుత్రుని నాకు ఇవ్వండి!
విశ్వామిత్రుడు: ఇవ్వను. దేవతలు ఇతనిని నాకు ఇచ్చారు.
ఇట్లా చెప్పి విశ్వామిత్రుడు శునశ్శేపునికి పేరు మార్చి దేవరాత వైశ్వామిత్ర అని నూతన నామకరణం చేస్తాడు. ఆ తరువాత అజీగర్తుడు కొడుకును
బతిమాలుకుంటాడు.
అజీ: (శునశ్శేపుని ఉద్దేశించి) పుత్రా, (తల్లిదండ్రులం) మేమిద్దరం నిన్ని పిలుస్తున్నాం. నీవు అంగిరస అజీగర్త పుత్రుడవు. ఓ ఋషీ! నీవు నీ తండ్రి
తాతల గృహాన్ని విడువవద్దు. మా వద్దకు రమ్ము.
శునశ్శేపుడు: నేను శూద్రుడుకూడా ముట్టని ఆ వస్తువును (కత్తిని) నీ చేతిలో ఉండగా చూశాను. ఓ అంగిరసా! నీవు 300 ఆవులను నా కంటె
ఎక్కువనుకున్నావు.
అజీగర్తుడు: పుత్రా! చేసినదానికి నేను పశ్చాతాప పడుతున్నాను. ఆ పాపాన్ని నివారించుకుని నీకు 100 ఆవులను ఇస్తున్నాను.
శునశ్శేపుడు: ఒకసారి పాపం చేగలిగినవాడు మరొకసారి పాపం చేస్తాడు. నీవు శూద్రత్వం నుండి ముక్తిని పొందలేదు. నీవు చేసిన పాపం ఏ విధంగానూ
నివారింపబడదు.
(ఈ సంభాషణ పాఠాన్ని రాహుల్ సాంకృత్యాయన్ “ఋగ్వేద ఆర్యులు” నుండి తీసుకున్నాను).
ఈ సంభాషణలో అజీగర్తుడు శునశ్శేపుని ‘ఓ ఋషీ!’ అని సంబోధించడాన్ని బట్టి శునశ్శేపుడు అప్పటికే పెద్దవాడని, ఋషిత్వాన్ని పొందినవాడని అర్ధమవుతుంది. (ఐతరేయ బ్రాహ్మణంలోని కొన్ని ఋక్కులు కాడా వసిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, అయాస్యుడు, అజీగర్తుడు, శునశ్శేపుడు – వీరంతా సమకాలీకులని చెబుతాయని పెద్దల వ్రాతలవలన అర్ధమవుతుంది). శునశ్శేపుడిని రక్షించే క్రమంలో విశ్వామిత్రుడు అతనిని తన పుత్రునిగా చేసుకుంటాడు. విశ్వామిత్రునికి అప్పటికే నూర్గురు పుత్రులు. అందులో యాభై మంది మధుఛ్ఛందుని కంటే పెద్దవారు. ఈ యాభై మందీ శునశ్శేపుని దత్తతను, దాని ఫలితంగా శునశ్శేపునికి కలిగే పెద్దరికాన్ని ఒప్పుకోవడానికి అంగీకరించరు. ఇది విశ్వామిత్రునికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఫలితంగా వచ్చిన మాటలలో ఈ యాభై మందీ, వారి సంతానం ఆర్య భూములకావల ‘ఆంధ్ర, పుండ్ర, శబర, పులింద, మూతిబ ఇత్యాది జాతులలో కలిసిపోండ’ని శపిస్తాడు. వారే ఈ జాతుల ప్రజలనీ, ఆర్య జాతి సమ్మేళణం ఈ జాతుల ప్రజలతో జరిగిందనీ ఈ కథ తాత్పర్యం. ఈ ఫలితాన్ని సాధించడానికే ఈ ఉదంతాన్ని ఐతరేయ బ్రాహ్మణంలో ప్రక్షిప్తీకరించడం జరిగిందనీ కూడా అనుకోవాల్సి ఉంటుంది. పురాణాల కాలమైన క్రీ.పూ.3 వ శతాబ్దిలో ఇది జరిగింది అనాలి.
విశ్వామిత్రుని శాప పాఠం పై కూడా భిన్నమైన వివరణలు ఉన్నాయి. “You shall have the lowest castes for your descendants. Therefore are many of the most degraded classes of men, the rabble for the most part, such as the Andhras, Pundras, Sabaras, Pulindas and Mutibas, descendants of Viswamitra.” అని Martin Haag….
“Your offspring shall inherit the ends (of the earth). These are the people the Andhras, Pundras, Sabaras, Pulindas and Mutibas who live in large numbers beyond the borders. Most of the Dasyus are the descendants of Viswamitra.” అని A.B. Keith ….ఇలా! (“ఆంధ్ర వాఙ్మయారంభ దశ – ప్రథమ సంపుటము – పాఙ్నన్నయ యుగము” దివాకర్ల వెంకటావధాని – 1960).
పురాణాలు (ముఖ్యంగా వాయు, మత్స్య మరియు మార్కండేయ పురాణాలు) ఉత్తర కొంకణాన్ని అపరాంతం అన్నాయి. వింధ్య, సత్పూరా పర్వత శ్రేణులు,
వాటిల్లో పుట్టి ప్రవహించి అరేబియాసముద్రంలో కలిసే నర్మద, తాపీ నదుల తీర ప్రదేశాలలో పుండ్రులు, పుళిందులు, శబరులు జీవనం సాగిస్తుండేవారనీ చెప్పాయి (“Early History of the Dekkan” – R.G. Bhandarkar – 1895). ఈ జాతుల ప్రజలతో కలిపి చెప్పబడిన ఆంధ్రులుకూడా ఆ ప్రాంతం వారే అయి ఉంటారనుకోవడం అసంగతం కాదు. ఇక్కడి ఈ ఆంధ్రులకూ, ఇక్కడి నుండి చూస్తే చాలా దిగువన కృష్ణా గోదావరీ ప్రాంత వాసులై ఉండిన తెలుగు వాళ్ళకు ఏవిధంగా సంబంధం కుదిరింది? వీరిరువురూ ఒకే జాతివారు ఎలాగయ్యారు? వీరిరువురి భాషా ఒకే భాష ఎలాగయ్యింది? ఇవి సందేహాలు, అర్ధంలేనివి కావు.




























