“తెలుగు పత్రికల సాహిత్య సేవ” – డా|| తిరుమల రామచంద్ర (పరిచయ వ్యాసం : భాగం -4)
‘సుజన రంజని’ తరువాత చెప్పుకోదగ్గ పత్రిక ‘తత్త్వబోధిని’. ఇది చెన్నపురి వేదసమాజం వారి ఆధ్వర్యాన 1864 లో వెలువడి 1870 దాకా నడిచింది. ఋగ్వేద సంహిత సస్వరంగా తెలుగు లిపిలో తొలిసారిగా ఈ పత్రికలోనే ప్రచురణ అయిందట.
తెలుగు పత్రికలలో సంపాదకీయాలు ప్రారంభించినవారు మహామహోపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నం పంతులుగారు. సాహిత్యలోకంలో ఈయన పేరు వినని వారు అరుదు. గ్రాంధిక భాషాభిమాని. ఈయన సంపాదకత్వంలో వెలువడిన ‘ఆంధ్రభాషా సంజీవని’ లో సారస్వత విషయ చర్చలు, సాంఘిక రాజకీయ విషయాలూ, గ్రంధ సమీక్షలు కవితలు మొదలయినవి ప్రచురితమయ్యేవట. వడ్డాది సుబ్బారాయుడు గారి శోక గీతం (elegy – తెలుగులో అప్పటిలో ఇది ఒక ప్రసిధ్ధ శోక గీతం) ఇందులోనే ప్రచురితమయిందట. (వడ్డాది సుబ్బారాయుడు గారు వసురాయ కవి గా ప్రసిధ్ధులు. ఈయన పిల్లలకోసం రచించిన భక్త చింతామణి శతకం ‘హిందూజన సంస్కారిణి’ అనే పత్రికలో మొదటగా అచ్చయి తరువాత 1893 లో పుస్తక రూపంగా వెలువడింది. ఆ తరువాత, అప్పటిలోనే – అంటే తెలుగు పుస్తకాలు పునర్ముద్రణ భాగ్యానికి నోచుకోవడమే కష్టమై ఉండిన ఆ
రోజులలో – ఈ చిన్న పుస్తకం 21 సార్లు పునర్ముద్రణ పొందిందట! తెలుగు సాహిత్యంలో ఏ పుస్తకమైనా ఇంత తక్కువ కాలంలో ఇన్ని సార్లు పునర్ముద్రణ పొందడం అనేది ‘భక్త చింతామణి’ శతకానికే చెల్లిందని చెబుతారు. ఈయనకు పద్దెనిమిదేళ్ళ కొడుకు అకస్మాత్తుగా మరణించడంతో పుత్ర వియోగం సంభవించింది. అతనికి చిన్నతనంలోనే వివాహమైంది. భర్త పోయిన కొన్నాళ్ళకు ఆమె కూడా స్వర్గస్తురాలయింది. ఈ శోకంలో
ఆయన వ్రాసినదే ఈ శోకగీతం – elegy!). తెలుగు సాహిత్యంలో ఇదే తొలి శోకగీతం అని వ్రాశారు రామచంద్ర గారు ఈ సందర్భంలో.
‘ఆంధ్రభాషా సంజీవిని’ కి సమాకాలికమైన పత్రిక ‘పురుషార్ధ ప్రదాయని’. సాహిత్యలోకంలో ఇది చాలా ప్రసిధ్ధమైన పత్రిక. ఉమా రంగనాయకులు గారి సంపాదకత్వంలో బందరు (మచిలీపట్నం) నుండి వెలువడడం 1872 లో మొదలై ఆ తరువాత దాదాపు 20 సంవత్సరాలు నిరాటంకంగా సాహిత్య సేవ చేసింది. అన్ని శాఖలలోనూ సాహిత్యం విరివిగా వృధ్ధి చెందాలన్నది ఈ పత్రిక ఆశయం అని చెప్పబడింది. మహాభారత టిప్పణి, పుస్తక
విమర్శలు, వైద్య విషయాలు, వింతలూ విశేషాలూ, సామెతల గురించిన సంగతులు, సమస్యాపూరణలు, ప్రకృతి శాస్త్ర విషయాలు, భాష, మతము, నీతి, వ్యవసాయం, వర్తకం, కళలు, చేతిపనులు, కథలు, లోక వ్యవహారములు, ధర్మశాస్త్ర విహయాలు…ఇలా ఒకటేమిటి, సకల విషయాలపై ఈ పత్రిక వార్తలను, వ్యాసాలనూ ప్రచురించిందట. దీనిలో ఆంగ్ల విభాగం కూడా వుండేదట! ఆంధ్ర మహాభారతానికి గుంటూరు ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూలు ఉపాధ్యాయులుగా పనిచేస్తూండిన పరవస్తు వెంకటరంగాచార్యులు గారు ఆంగ్లంలో వ్రాసిన టిప్పణులను ఈ పత్రిక ప్రచురించింది. ఈ పత్రిక అప్పటిలో బహుళ ప్రచారంలో ఉండేదనటానికి నిదర్శనాలుగా 1872 లో ప్రచురితాలయిన పాఠకుల ఉత్తరాలను రెండింటిని రామచంద్రగారు ఇందులో ప్రచురించారు. అసలు పేర్లతో కాకుండా, ‘జి.వై. Friend of the good’ అనే పేరుతో ఒకరు – ‘ఈ దివ్యమైన పత్రిక శాశ్వతముగ ప్రతి నెలకు తప్పకుండ అచ్చువేయబడి ప్రకటితమై వృధ్ధి బొందేటట్లు భగవంతుడు కరుణించి దీవించుగాక” అని దీవనలు కురిపిస్తే, ‘దురాచార మర్దనుడు’ అనే పేరుతో ఇంకొక పాఠకుడు ఉద్యోగం వల్ల వచ్చిన హోదాను దురుపయోగం చెస్తున్న వారిని గురించి “ఓ పురుషార్ధ ప్రదాతోత్తమా, ఈ విశేషము వింటిరా – కొందరు తహశ్శీల్ దారి మొదలగు నౌకరీ చేయువారు తమ జీవిత విశేషము చేత బండ్లు సవారీ లెక్కి వీధులవెంట వచ్చునపుడు ఆయా పంచలను కూర్చునియున్న జనులందరు లేచి దండప్రణామంబులు గావించుచుండ వలెనట!” అంటూ ఈ అనభిలషణీయమైన విషయాన్ని గురించి ఇంకా వ్రాసి చివరన “…కాబట్టి ముందైనను గ్రమముగ నడుచుకొని నట్టయిన బాగుగనుండును.” అని ముగిస్తాడు. దీనిని బట్టి ఆకాలపు స్థితిగతులు తెలుసుకోవచ్చును అంటారు రామచంద్రగారు ఈ సందర్భంగా! నిజమే గదా!
‘స్వధర్మ ప్రకాశిని’ – ఈ పత్రిక కూడా బందరు (మచిలీపట్నం) నుండి వెలువడినదే. 1873 లో మొదలై 1876 దాకా తొలి దశలో ప్రకటితమై, మధ్యలో ఆగిపోయి, పునఃప్రత్యక్షమై 1924 నుండి 1932 దాకా నడిచింది. దీని సంపాదకులు, ద్వైతం కోటేశ్వరశర్మ శాస్త్రి, కనపర్తి మార్కండేయశర్మ అనే ఇద్దరు గురు శిష్యులు. ఇరువురూ గొప్ప విద్వాంసులు. ఇందులో ప్రామణికమైన శంకరాచార్య చరిత్ర, 36 గురు మంత్రుల చరిత్ర (1100-1700) అనేవి ప్రచురితమయ్యాయట. ఈ రెండు కూడా చాలా విలువైనవి అనిపిస్తుంది. ముఖ్యంగా 36 గురు మంత్రుల చరిత్ర అనేది ఇప్పుడు అందుబాటులో ఉన్నట్లయితే చరిత్రకు సంబంధించి విద్యార్థులకూ, పరిశోధకులకూ కూడా ఉపయోగకరంగా వుండేదేమో అనిపిస్తుంది! (ఈ పుస్తకాలన్నీ ఏమయి పోయాయి? ఎవరికీ పట్టనట్లు అలా అంతరించిపోయాయా? ఇప్పుడు కష్టపడి వెదికినా కూడా దొరకవా? అన్న సందేహం కూడా కలుగుతుంది.)
‘సకల విద్యాభివర్ధని’ – ఈ పత్రిక కూడా 1872 లో మొదలై ఏడేళ్ళపాటు అంటే 1879 దాక నడిచింది. ఈ పత్రిక తెలుగుదేశంలో మొట్టమొదటి మహామహోపాధ్యాయులైన పరవస్తు వేంకట రంగాచార్యులవారి సహకారంతో విశాఖపట్టణం నుండి వెలువడేదట. ఈ పత్రికలో కవిచరిత్రలు, వైద్యం, జ్యోతిషం వంటి అంశాలపై సంగతులు ప్రశ్నోత్తరాల రూపంలో వెలువడేవట. (ఇది ఎంత మంచి ఆలోచన!). పరవస్తువారి శాకుంతలం అనువాదం ఈ పత్రికలోనే అచ్చయిందట. ఈ అనువాదం వలన కలిగిన ప్రోత్సాహంతోనే వీరేశలింగంగారు కూడా శాకుంతలం అనువాదానికి పూనుకున్నారట. పరవస్తు వారిని గురించి ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఇక్కడ ఒకటి రామచంద్రగారు చెప్పారు. అదేమిటంటే, పరవస్తువారు విఙ్ఞాన సర్వస్వాన్ని సంస్కృత భాషలో 125 (అవును, నూట ఇరవై అయిదు) సంపుటాలుగా రచించారట. అందులో రెండు సంపుటాలు ప్రచురించారట. (మిగతా సంపుటాలు ఏమయినాయో తెలీదు! దీనిని ఏమనాలి?)