శ్రీనాథుని పద్యపు ప్రథమ పాదంలోని ‘దావగొను’ అనే పదానికి సంబంధించి విశేషంగా చర్చ జరిగింది. నిఘంటువులలో కనుపించని పదం ఇది. శ్రీనాథుడు ఈ పదాన్ని ‘విన్నావా? చెవిన పెట్టావా?’ అన్న అర్ధంలో వాడాడనేది స్పష్టం. ఈ పదం స్థానంలో ‘తావు గొనవా’, ‘తావి గొనవా’, ‘తాల్మి గొనవా’, ‘త్రావ గనునా’ ఇత్యాది పదాలను ఉంచి, అప్పట్లో చర్చలో పాల్గొన్న పెద్దలు, అర్ధం పొసిగేలా చేయాలని ప్రయత్నించారుగాని, ఈ పదాలలో ఏదీ శ్రీనాథుడు చెప్పిన ‘దావ గొనవా’ అన్న పదం చేకూర్చిన అందాన్ని అక్కడ ఇవ్వలేక పోవడంతో అలాగే వదిలేయక తప్పిందికాదు. ఇలాగే, మూడవ పాదంలో ‘తగవా మగవారల దూఱ’ అన్న చోట కూడ అర్ధానికి తగినట్లుగా మాటల పొంతన సరిగా కుదిరినట్లు కనుపించదు. ‘తప్పు నీ దగ్గర పెట్టుకుని, కోపగించుకున్నాడని పతిమీద పోట్లాడడం తగునా?’ అని చెప్పడం అక్కడి సందర్భం. సందర్భానికి సరిపోయేట్లుగా లేవనిపించినప్పిటికీ, పద్యపు నడకను దృష్టిలో ఉంచుకుని చూసినప్పుడు, ఆ పదాలను శ్రీనాథుడు చెప్పినట్లుగానే ఉంచేయడం మేలనిపించి ఎటువంటి మార్పూ చేయకుండా అలాగే ఉంచేయడం జరిగింది. తెలుగు భాషా సాహిత్యాలపైన మక్కువ గల వారికి, శ్రీనాథుడు తెనిగించిన ‘గాథా సప్తశతి’ లభించి ఉన్నట్లయితే అందులో ఇంకా ఇలాంటివే ఎన్నెన్ని ఆసక్తికరమైన, సుందరమైన భాషా ప్రయోగాలు వెలుగు చూసి వుండేవో గదా! అనిపించక మానదు.
ఇదిలా ఉండగా, ఆశ్చర్యకరమైన విషాయాలేమిటంటే, క్రీ.శ. 1931 దాక శ్రీనాథుని ‘శాలివాహన సప్తశతి’ కావ్యం లభ్యమై ఉండినదనడానికి నిదర్శనాలు ఉన్నాయి. క్రీ.శ.1931 లో జరిగిన కాకతీయ చారిత్రక మహోత్సవాలలో భాగంగా జరిగిన గ్రంథ ప్రదర్శనలో శ్రీనాథుని ‘సప్తశతి’ ప్రదర్శించబడినట్లుగా ‘కాకతీయ సంచిక’ కు అనుబంధమైన ‘ఉత్సవమున ప్రదర్శించిన గ్రంథములు’ పట్టికలో ఉన్నట్లుగానూ, ఆచార్య బిరుదురాజు రామరాజుగారి తాతగారి వద్ద ఉండిన ప్రతిని ప్రదర్శనకోసం ఇవ్వగా, ప్రదర్శనానంతరం ఆ ప్రతి తిరిగి వారి వద్దకు చేరలేదని చెబుతారని ‘అలబ్ధ కావ్య పద్య ముక్తావళి’ లో ఉల్లేఖాన్ని బట్టి తెలుస్తుంది. ఇదే కాకుండా, మాన్యులు మానవల్లి రామకృష్ణ కవిగారు ఈ పద్యాన్ని, తాము ఉధ్ధరించి ప్రచురించిన నన్నెచోడుని ‘కుమార సంభవం’ ప్రథమ భాగంలో ఉదాహరిస్తూ, ఇది శ్రీనాథుని సప్తశతిలో నాల్గవ ఆశ్వాసంలోనిదని పేర్కొన్నారనీ, ఇందు మూలకంగా కవిగారి వద్ద శ్రీనాథుని సప్తశతి ప్రతి ఉండినదేమో, చెప్పలేం అనీ, కూడ ఈ గ్రంథంలోని ఉల్లేఖాన్నిబట్టి తెలుస్తుంది.
ఏదేమైనా, కాల ప్రవాహంలో ఏమంత వెనుకటిది కాని, క్రీ.శ.1931 దాకా లభ్యమై వుండిన శ్రీనాథుని ‘సప్తశతి’ అప్పటిలోనే ముద్రణ భాగ్యానికి నోచుకోక పోవడం ఆంధ్రుల దురదృష్టం. సాహిత్యాభిలాషులూ, పెద్దలూ, ప్రచురణకర్తలూ పూనుకుని వెదికితే ఇప్పటికయినా శ్రీనాథుడు తెనిగించిన ‘సప్తశతి’ ప్రతి లభించవచ్చునేమోనని అనుకోవడం అత్యాశ కాదు గదా!
(‘భారతి’ లో స్వర్గీయ తిరుమల రామచంద్ర గారి వ్యాసాలు, డా.రవ్వా శ్రీహరి గారి సంపాదకత్వంలో వెలువడిన ‘అలబ్ధ కావ్య పద్య ముక్తావళి’ గ్రంధం ఈ వ్యాస రచనలో సంప్రదించడం జరిగింది.)