ప్రాకృతికం – పల్లె అందం

“ణిప్పణ్ణ సస్సరిధ్ధీ సచ్చందం గాఇ పామరో సరఏ,
దలిఅ ణవసాలి తండుల ధవల మిఅంకాసు రాఈసు.”

శాతవాహన ప్రభువులలో ఒకడైన హాలమహారాజు చే సంకలించబడిన గాథా సప్తశతి అనే పేరున్న ప్రాకృత గాథల సంకలన గ్రంథంలో ఏడవ శతకంలోని ఎనభైతొమ్మిదవ గాథ ఇది.

“నిష్పన్న సస్య ఋధ్ధిః స్వఛ్ఛందం గాయతి పామరః శరది,
దలితనవశాలి తండుల ధవల మృగాంకాసు రాత్రిషు.”

అని పై ప్రాకృత గాథకు సంస్కృత ఛాయ.

‘కోర్కె తీరగా పంట పండింది. దంచిన కొత్త బియ్యపు పిండి ఆరబోసినట్లున్న శరత్కాలపు వెన్నెలరాత్రిలో ఆనందంతో రైతు గొంతు విప్పి పాట పాడు తున్నాడు’ అని ఈ గాథకు పెద్దలు చెప్పిన అర్ధం. భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించే ఒక పల్లెటూరి రైతు జీవితంలో దైవం అనుగ్రహిస్తే పదే పదే పునరావృతమయ్యే ఒక సన్నివేశాన్నీ, ఆ సన్నివేశంలోని సౌందర్యాన్నీ కనులకు కట్టినట్లు అతి తక్కువ మాటలలో వర్ణించి చూపెట్టే ఈ గాథను ఎన్ని సార్లు చదివినా, మననం చేసుకున్నా, తనివి తీరనట్లుంటుంది.

అచ్చమైన ఆప్యాయతతో రైతు కాళ్ళకు అంటుకునే పొలంలోని మట్టీ, మట్టిని తడిపి తమకంతో తబ్బిబ్బయ్యే నీరూ, స్వచ్చంగా వీచే గాలీ, రాబోయే పంటమీదా, పచ్చదనం మీదా కారుణ్యంతో కాచే ఎండ, కాలం కనికరించి అన్ని కలిసొస్తే ఏ దిక్కుకేసి చూసిన కళ్ళ నిండుగా కనిపించే పచ్చదనం….ఇవన్నీ పల్లెటూరు అనే పడతికి ప్రకృతి తనంత తానుగా తొడిగి చూపించిన నిలువెత్తు ఆభరణాలు. జీవితంలో ఏ కొంత భాగమైన పల్లెటూరిలో గడపడం అన్నది సంభవించిన ఏ వ్యక్తికైనా వీటి సహజ సౌందర్యం ఏమంత కష్ట పడకుండానే మనసుకు తట్టి కనులకు కడుతుంది.

ఆధునిక జీవన శైలిలో, పొట్టకూటికోసం అనుకున్నా, మరెందుకోసం అనుకున్నా, తనదైన పల్లెటూరిని విడిచి పట్టణానికి వలస వెళ్ళల్సి రావడం సంభవించిన వ్యక్తికి, తలచుకునే సందర్భం దొరికినప్పుడల్లా, వాటి సహజ సౌందర్యం మనసును పూర్తిగా కమ్మేసి, ఆ దృశ్యాలను విడిచి పెట్టి  ప్రస్తుతంలోకి రావడానికి ఒక పట్టాన ఇష్టపడక మనసు మొరాయిస్తూనూ వుంటుంది.  తప్పనివి అయినా కాకపోయినా, తెచ్చిపెట్టుకున్నవి అయినా కాకపోయినా….ఈ వియోగాలు ఇప్పటి జీవితంలో తప్పించుకోలేని అంతర్భాగాలయిపోయాయి. అంగీకరించాలిసిందే తప్ప, అందులో బాధపడాలిసింది కూడా ఏమీ లేదనే అనుకోవాలి!

పల్లెటూరితో సంబంధం వున్నవాళ్ళు మరోసారి ఆ సౌందర్యాన్ని మననం చేసుకోవడానికి వీలుగానూ, సంబంధం లేని వాళ్ళు ఆ సౌందర్యాన్ని మరోసారి చూడడానికి వీలుగానూ, నా ఫోటోలు కొన్ని slide show గా…. ఇప్పుడు, ఇక్కడ! ఇక్కడ ఒక్క మాట! ఈ ఫోటోలన్నీ బస్సులో ప్రయాణిస్తూ తీసినవి. అందువలన, అక్కడక్కడా ఒకటి రెండు ఫోటోలు straight గా వుండకుండా, కొంచెం angled గా కనిపిస్తాయి. అయితే, angled గా వున్నా, అందులో వున్నది ప్రకృతి  కాబట్టి, వాటి సౌందర్యానికి ఏమీ భంగం కలగలేదనే అనుకుంటాను!

This slideshow requires JavaScript.

వియోగం (2)

ఇంటిలో సంధ్య వేళ దీపం, పరుచుకోబోతూన్న చీకటిని పారద్రోలే తొలి వెలుగు. అప్రయత్నంగానే కనులు మొగిడ్చి ఆ వెలుగుకు నమస్కరించడం మన సంస్కృతిలో భాగమై పోయింది, ఆ వెలుగుని దైవ సమానంగా భావిస్తాం గనుక!  దైవ సమానం గనుకనే ఆ వెలుగు వివాహం అయిన స్త్రీకి భర్తను జ్ఞాపకం తెస్తుందని ఊహించాడు వెయ్యేళ్ల క్రితమే ఊరూ పెరూ తెలియని ఒక సామాన్య ప్రాకృత కవి.  ఆ క్షణం వెలుగై అతను ఆమె కళ్ళ ముందే ఉన్నాడు గాని, భౌతికంగా అతడు దగ్గరగా ఉండే సందర్భం, అవకాశం దగ్గరలో లేదనే భావన, ఆలోచన మనస్సును బాధకు గురిచేస్తే, ఆమె కన్నీటి పర్యంతం అయింది.  ఇది అతి పవిత్రమైన, మాటలతో వర్ణించి చెప్పగాలేని వియోగ బాధ.  ఈ బాధను ఇలా ఊహించడానికి అంతే పవిత్రమైన హృదయం ఉండాలి.  అతనెవరో గాని, ఆ ప్రాకృత కవికి అంతటి పవిత్ర హృదయం ఉందనడానికి ఏమాత్రం సందేహపడనక్కర లేదు.

పై ప్రాకృత గాథకు నేను చేసుకున్న తెలుగు స్వేఛ్ఛానువాదం:

“ఇంటిలోన సందె దీపమ్ము వెలిగించునట్టి తరుణాన
ఒంటరై యున్న తరుణి హృదిన ప్రవాసుడైన పతి తలపు మెరిసె;
కంట నిండిన నీరు ధారలగు రీతి భీతి గొలుప
ఇంట దీపమ్మా కన్నీట నారునోయని మోమావంకకు తా చాటు చేసె.”

వియోగం (1)

వియోగం ఒక అవస్థ. తప్పనిసరి పరిస్థితులలో వేరైపోయి ఒకరినొకరు చేరుకోలేని దూరాలలో ఉండాల్సి వచ్చిన స్త్రీపురుషుల హృదయాలను తెరిచి చూడడం గనుక చేయగలిగితే, అక్కడ అన్యులకు అర్ధంకాకుండా కనిపించే ఒక surrealistic చిత్రం లాంటి భాధామయ దృశ్యం అది.

అది హృదయమంత అనాది. ఆకలి దాని పునాది. సంపాదించుకు రావాల్సిన బాధ్యత పురుషుడిపై ఎప్పుడు పడిందో అప్పుడే వియోగావిర్భావానికి బీజమూ పడింది. దూరాలకు బయటకు వెళ్ళే పురుషుడు తన స్త్రీని వెనుక వొంటరిగా వదిలి వెళ్ళక తప్పదు. ఇది ఒక తప్పనిసరి స్థితి. ఈ స్థితి కి సంబంధించిన ఊహ కవుల చిత్తాల్లో ఎన్నెన్నో కల్పనలకు దారి తీసింది. ఎన్నెనో బాధామయ దృశ్యాలను కవిత్వీకరించి చూపించేలా చేసింది.

వియోగం అనగానే నా తలపునకు వచ్చే మొట్టమొదటి బాధామయ చిత్రం హాలుని ‘గాథా సప్తశతి’ కాలానికి, అంటే క్రీ.శ.19-24 సం.ల రోజులకు చెందినది. ఒక మహా బాధామయ సన్నివేశాన్ని అంతే గొప్పదైన, ఉదాత్తమైన రీతిలో కళ్ళకుకట్టినట్లుగా కవిత్వీకరించి చూపిస్తుంది ఈ గాథ. భారతీయ సాహిత్యం మొత్తంలో వెదికినా, తప్పనిసరి పరిస్థితులలో తన పతికి దూరమై ఉంటున్న ఒక స్త్రీ వియోగ బాధను ఇంత ఉదాత్తంగా చిత్రించి చూపిన పద్యం గాని, పాట గాని, దీనితో సరితూగ గలిగినది వేరే ఉంటుందంటే నాకు సందేహమే!

“పిఅ సంభరణ పలోట్టంత వాహధారా నివాఆ భీఆఏ
దిజ్జఇ వంకగ్గీవాఏ దీవఓ పహిఠ జాయయా.”                    (3వ శతకం -22వ గాథ)

దీని సంస్కృత చాయ:

“ప్రియ సంస్మరణ ప్రలుఠ ద్భాష్ప ధారానిపాతభీతయా
దీయతే వక్రగ్రీవయా దీపకః పథిక జాయయా.”

భర్త వ్యాపార నిమిత్తం దూరం వెళ్ళి పరదేశంలో ఎక్కడున్నాడే తెలియకుండా ఉన్నాడు. సంజె వేళ అయింది.  ఆమే ఇంటిలో దీపం పెడుతోంది. కనుల ఎదుట వెలిగిన దీపం ఆమెకు వెంటనే భర్తను తలపులలోకి తెచ్చింది. తలపులలో అతను మెదిలినదే  తడవుగా, కనులలో కన్నీళ్ళు నిండి ధార కట్టడానికి సిధ్ధమయ్యాయి.  చెంపల మీదుగా క్రిందకు జారి పడడానికి సిధ్ధంగా ఉన్న కన్నీళ్ళు ఎదురుగా ఉన్న దీపాన్ని ఆర్పివేస్తాయేమో అన్న భయంతో ఆమె తన ముఖాన్ని అటుగా తిప్పి దీపం పెడుతున్నది. ఇది ఈ గాథ భావం. ఈ సన్నివేశం, భావం కరిగించలేని హృదయం ఉండగలదా!?

హాలుడు, శ్రీనాథుడు, గాథా సప్తశతి (4)

శ్రీనాథుని పద్యపు ప్రథమ పాదంలోని ‘దావగొను’ అనే పదానికి సంబంధించి విశేషంగా చర్చ జరిగింది. నిఘంటువులలో కనుపించని పదం ఇది. శ్రీనాథుడు ఈ పదాన్ని ‘విన్నావా? చెవిన పెట్టావా?’ అన్న అర్ధంలో వాడాడనేది స్పష్టం. ఈ పదం స్థానంలో ‘తావు గొనవా’, ‘తావి గొనవా’, ‘తాల్మి గొనవా’, ‘త్రావ గనునా’ ఇత్యాది పదాలను ఉంచి, అప్పట్లో చర్చలో పాల్గొన్న పెద్దలు, అర్ధం పొసిగేలా చేయాలని ప్రయత్నించారుగాని, ఈ పదాలలో ఏదీ శ్రీనాథుడు చెప్పిన ‘దావ గొనవా’ అన్న పదం చేకూర్చిన అందాన్ని అక్కడ ఇవ్వలేక పోవడంతో అలాగే వదిలేయక తప్పిందికాదు. ఇలాగే, మూడవ పాదంలో ‘తగవా మగవారల దూఱ’ అన్న చోట కూడ అర్ధానికి తగినట్లుగా మాటల పొంతన సరిగా కుదిరినట్లు కనుపించదు.  ‘తప్పు నీ దగ్గర పెట్టుకుని, కోపగించుకున్నాడని పతిమీద పోట్లాడడం తగునా?’ అని చెప్పడం అక్కడి సందర్భం. సందర్భానికి సరిపోయేట్లుగా లేవనిపించినప్పిటికీ, పద్యపు నడకను దృష్టిలో ఉంచుకుని చూసినప్పుడు, ఆ పదాలను శ్రీనాథుడు చెప్పినట్లుగానే ఉంచేయడం మేలనిపించి ఎటువంటి మార్పూ చేయకుండా అలాగే ఉంచేయడం జరిగింది. తెలుగు భాషా సాహిత్యాలపైన మక్కువ గల వారికి, శ్రీనాథుడు తెనిగించిన ‘గాథా సప్తశతి’ లభించి ఉన్నట్లయితే అందులో ఇంకా ఇలాంటివే ఎన్నెన్ని ఆసక్తికరమైన, సుందరమైన భాషా ప్రయోగాలు వెలుగు చూసి వుండేవో గదా! అనిపించక మానదు.

ఇదిలా ఉండగా, ఆశ్చర్యకరమైన విషాయాలేమిటంటే, క్రీ.శ. 1931 దాక శ్రీనాథుని ‘శాలివాహన సప్తశతి’ కావ్యం లభ్యమై ఉండినదనడానికి నిదర్శనాలు ఉన్నాయి. క్రీ.శ.1931 లో జరిగిన కాకతీయ చారిత్రక మహోత్సవాలలో భాగంగా జరిగిన గ్రంథ ప్రదర్శనలో శ్రీనాథుని ‘సప్తశతి’ ప్రదర్శించబడినట్లుగా ‘కాకతీయ సంచిక’ కు అనుబంధమైన ‘ఉత్సవమున ప్రదర్శించిన గ్రంథములు’ పట్టికలో ఉన్నట్లుగానూ, ఆచార్య బిరుదురాజు రామరాజుగారి తాతగారి వద్ద ఉండిన ప్రతిని ప్రదర్శనకోసం ఇవ్వగా, ప్రదర్శనానంతరం ఆ ప్రతి తిరిగి వారి వద్దకు చేరలేదని చెబుతారని ‘అలబ్ధ కావ్య పద్య ముక్తావళి’ లో ఉల్లేఖాన్ని బట్టి తెలుస్తుంది. ఇదే కాకుండా, మాన్యులు మానవల్లి రామకృష్ణ కవిగారు ఈ పద్యాన్ని, తాము ఉధ్ధరించి ప్రచురించిన నన్నెచోడుని ‘కుమార సంభవం’ ప్రథమ భాగంలో ఉదాహరిస్తూ, ఇది శ్రీనాథుని సప్తశతిలో నాల్గవ ఆశ్వాసంలోనిదని పేర్కొన్నారనీ, ఇందు మూలకంగా కవిగారి వద్ద శ్రీనాథుని సప్తశతి ప్రతి ఉండినదేమో, చెప్పలేం అనీ, కూడ ఈ గ్రంథంలోని ఉల్లేఖాన్నిబట్టి తెలుస్తుంది.

ఏదేమైనా,  కాల ప్రవాహంలో ఏమంత వెనుకటిది కాని, క్రీ.శ.1931 దాకా లభ్యమై వుండిన శ్రీనాథుని ‘సప్తశతి’ అప్పటిలోనే ముద్రణ భాగ్యానికి నోచుకోక పోవడం ఆంధ్రుల దురదృష్టం. సాహిత్యాభిలాషులూ, పెద్దలూ, ప్రచురణకర్తలూ పూనుకుని వెదికితే ఇప్పటికయినా శ్రీనాథుడు తెనిగించిన ‘సప్తశతి’ ప్రతి లభించవచ్చునేమోనని అనుకోవడం అత్యాశ కాదు గదా!

(‘భారతి’ లో స్వర్గీయ తిరుమల రామచంద్ర గారి వ్యాసాలు, డా.రవ్వా శ్రీహరి గారి సంపాదకత్వంలో వెలువడిన ‘అలబ్ధ కావ్య పద్య ముక్తావళి’ గ్రంధం ఈ వ్యాస రచనలో సంప్రదించడం జరిగింది.)

హాలుడు, శ్రీనాథుడు, గాథా సప్తశతి (3)

శ్రీనాథుడు ఆంధ్రీకరించిన ‘శాలివాహన సప్తశతి’ ఇప్పుడు అలభ్యం. అందులోనివిగా చెప్పుకునే ఐదు పద్యాలు మాత్రమే ఇప్పుడు లభ్యమై ఉన్నాయి. ఈ అయిదింటిలో రెండు వినుకొండ వల్లభరాయని ‘క్రీడాభిరామం’ లో ఉన్నాయి. మిగతా మూడూ విడిగా లభ్యమై ఉన్నాయి. ఈ మూడింటిలో ప్రసిధ్ధమైనది ‘వారణ సేయ దావ గొనవా’ అనే పద్యం. క్రీ.శ.1960 సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మాసాల భారతి సంచికలలో ఈ పద్యం పై ‘తెలుగు మఱుగులు’ శీర్షికన చర్చ జరిగింది. ఈ పద్యానికి మూలమైన ప్రాకృత గాథ పాఠం, దాని సంస్కృత చాయ, చర్చ చివరన పెద్దలు అంగీకరించిన శ్రీనాథుని పద్య పాఠం (ఉత్పలమాల వృత్తంలో) వరుసగా:

“కస్స వ ణ హోఇ రోసో దష్టూయ పియాఏ సవ్వణం అహరమ్
సభమర ఉపమగ్ఘాఇణి వారిఅవామే సహసు ఏహ్మిమ్”

“కస్యవా న భవతి రోషో దృష్ట్వా, ప్రియాయాః సవ్రణ మధరమ్
సభ్రమర పద్మా ఘ్రాణశీలే! వారితవామే! సహస్వేదానీమ్.”

“వారణసేయ దావ గొనవా? నవ వారిజ మందు తేటి క్రొ
వ్వారుచునుంట నీ వెరుగవా? ప్రియ వాతెఱ గంటు కంటి కె
వ్వారికి కెంపు రాదు? తగవా మగవారల దూఱ? నీ విభుం
డారసి నీ నిజం బెరుగు నంతకు నంతకు నోర్వు నెచ్చెలీ!”

శ్రీనాథుని ఈ పద్యం పై ఒకింత ఆసక్తి కరంగా జరిగిన చర్చ సారాంశం ఇది – అప్పటికి (అంటే క్రీ.శ.1960 నాటికి) లభ్యమవుతూండిన ప్రాకృత ‘గాథా సప్తశతి’ లో శ్రీనాథుని ‘వారణ సేయ’ పద్యానికి మూలమైన ప్రాకృత గాథ లేదు. అయితే, ధ్వన్యాలోక ప్రవర్తకుడైన ఆనందవర్ధనాచార్యుని ‘ధ్వన్యాలోకం’ లో ఈ ప్రాకృత గాథ ఉదాహరించబడి ఉంది. ఆనందవర్ధనాచార్యుని ‘ధ్వన్యాలోకా’ నికి అభినవగుప్తపాదులవారి లోచన వ్యాఖ్యలో ఈ ప్రాకృత గాథకు సంస్కృత ఛాయతోపాటు సవిస్తర వ్యాఖ్య ఉంది.

ఈ ప్రాకృత గాథను స్వర్గీయ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు క్రింది విధంగా తెనిగించారు:

“ఎవరి కలుక గలుగదే ప్రియురాలి కె
మ్మోవి కాటుగన్న? ముగుద! తేంట్లు
ముసరియున్న తమ్మి మూరుకొంటివి వల
దన్న వినక! సైపవమ్మ యిపుడు.”

“ఓ చెలీ! వలదని ఎంత వారించినా విన్నావా, చెవిన పెట్టావా? అప్పుడే వికసిస్తూన్న కమలంలో కనిపించకుండా తేనెటీగ మకరందాన్ని చప్పరిస్తూ వుంటుందని నీకు తెలియదా? ఇప్పుడు చూడు, నీ పెదవిపై ఏర్పడిన ఈ గంటు నీ ప్రియునికి (పతికి) కోపం తెప్పించిందంటే తెప్పించదా మరి? ఇందులో అతని తప్పేమున్నది? దానికి అతనితో తగవా? నిజం తెలిసిన మీదట అతని కోపం ఉపశమించి నీ దరి చేరేవరకూ నీవు సహించి ఊరక ఉండవలసినదే, తప్పదు మరి!” అని ఈ గాథ తాత్పర్యం. ఇందులో ధ్వని ఊహకందనిదేం కాదు. ఈ ధ్వని తెలుగులో ఇంకో స్వతంత్ర పద్యానికి కారణమైనదని ఈ క్రింది పద్యం వలన తెలుస్తుంది.

“మాకంద ఫల రసంబుల
నాకలిగొని మేము గ్రోలు నా కొమ్మలలో
చీకటినప్పుడు నొక చిలు
కేగతినో మోవి గఱచె నెఱుగవె చెలియా!”

కవి ఎవరో తెలియని ‘ఉమా మహేశ్వరము’ అనే పేరున్న ఒక అలభ్య కావ్యంలోనిదిగా లభ్యమైన ఒకే ఒక్క పద్యం ఇది. వెల్లటూరి లింగయమంత్రి కృత ‘సరసాంధ్ర వృత్తరత్నాకరం’ అనే ఛందో గ్రంథంలో ఇది ఉదాహరింపబడింది.

హాలుడు, శ్రీనాథుడు, గాథా సప్తశతి (2)

“అగ్ని రస్మి జన్మనా జాతవేదా
ఘృతం మేచక్షు రమృతం మేఆసన్”

‘నేను అగ్నిని, పుట్టుకతోనే అంతా తెలిసినవాడను, నెయ్యి నా కన్ను, అమృతం నా నోటిలో ఉంది’ అని వామదేవుడు ఋగ్వేదంలో అగ్నిని స్తుతించాడు. అమృతం నోటిలో ఉన్నందువలన అగ్ని అపవిత్రతకు బాహ్యుడు. ఆయన ఎక్కడ ఉన్నా పవిత్రుడేను. ఉత్తమ గుణాలున్న మానవుని అగ్నితో పోల్చడం ద్వారా హాలుడు ఉత్తముని అగ్ని సమానుని చేసి చూపించాడు పై గాథలో. ఆ కారణాన, ఉత్తముడైన మానవునికి అపవిత్రతా దోషం లేదు అని సూచించాడు.  హాలుడు ఎంత సహృదయుడో, అతని ఆలోచనలు ఎంత ఉదాత్తమైనవో తెలియజెప్పడానికి ఈ ఒక్క గాథా చాలు.

అవడానికి మహారాజు అయినప్పటికీ, హాలుని మనస్సంతా ఆ కాలపు సామాన్య జనజీవితంలోని సుఖదుఃఖాలూ, కష్టనష్టాలకు సంబంధించిన సంగతుల చుట్టూనే తిరుగుతూండేది అనడానికి ‘గాథా సప్తశతి’ నిలువెత్తు సాక్ష్యం. ప్రాకృతం ఆ కాలపు జనుల భాష, అదే రాజ భాష కూడ అయింది. కవితాత్మ కలిగి ఉన్నప్పటికిన్నీ, కవులుగా పేరు పడని సామాన్య జనానీకంలోని ఎందరో వ్యక్తులు – అలఅస్స, మాణస్స, మఅరందస్స, రాఅవగ్గస్స, విగ్గహస్స, వంగవిఅరస్స, అణంగస్స, పాలిఅస్స, ఇత్యాది నామధేయాలతో ఉండిన వ్యక్తులు – ఎందరెందరో రోజువారీ జీవనపు సంఘటనలలోని సంతోషలనూ, దుఃఖాలనూ, ప్రేమికుల వియోగాలనూ, విరహాలనూ, వినోదాలనూ, విలాసాలనూ, పల్లె సంబరాలనూ, పెళ్ళి సంబరాలనూ, అలంకారాలనూ, అనుభూతులనూ, ఇలా ఎన్నెన్నిటినో గాథలలో బంధిస్తే, వాటిల్లో ఉత్తమమైన వాటన్నిటినీ సేకరించి గుది గూర్చి గ్రంథంగా చేసాడు హాలుడు. శాతవాహన రాజుల కాలపు జనుల జీవనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే దృశ్యకావ్యం ‘గాథా సప్తశతి’.

‘గాథా సప్తశతి’ సౌందర్యానికి ముగ్ధుడై, నూనూగు మీసాల నూత్న యవ్వనం నాటికే ‘గాథా సప్తశతి’ ని ‘శాలివాహన సప్తశతి’ గా తెలుగులోకి అనువదించానని చెప్పుకున్నాడు శ్రీనాథుడు. కవిత్వం చెప్పడంలో అనన్య సామాన్యమైన ధారాశుధ్ధి, ప్రతిభ కలిగివుండి, అనతికాలంలోనే మహాకవి బిరుదాన్ని పొందివుండి, రాజాస్థానాలలో పొందిన సన్మానాలతోను, గడించిన ధనంతోనూ జీవితాన్ని సుఖంగా గడపగలిగివుండి కూడ సామాన్య జన జీవితంలోకి అడుగు పెట్టకుండా వుండలేక పోయిన వ్యక్తి శ్రీనాథుడు. సందర్భం దొరికినప్పుడల్లా, సంగతులను తన చాటువులలో బంధించి భావి తరాలకు అందించాడు.

హాలుడు, శ్రీనాథుడు, గాథా సప్తశతి (1)

మౌర్య సామ్రాజ్య పతనం తరువాత, దక్షిణ భారతం మొత్తాన్నీ, ఉత్తర భారతంలో కొంతభాగాన్నీ కలిపి ఏక మొత్తంగా కొన్ని సంవత్సరాల కాలమైనా పాలించిన  దక్షిణాది రాజవంశం శాతవాహన రాజవంశం. ఈ ప్రసిధ్ధ రాజవంశం క్రీ.పూ.225 నుండి క్రీ.శ.225 దాకా, అంటే దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు రాజ్య పాలన సాగించి, ఆ క్రమంలో పురాణాలలోకి కూడా ఎక్కిన  ఘనతను సాధించుకుంది.

శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి.  ఈ వంశపు రాజులలో హాల మహారాజు ఒకడు. ఇతడు క్రీ.శ.19-24 సంవత్సరాల మధ్య కాలంలో  రాజ్యపాలన చేశాడని చరిత్రకారులు చెబుతారు. (హాలుడు అశ్మక రాజ్యంలోని ప్రతిష్ఠానమును పరిపాలిస్తూ ఉండినాడని ప్రాకృతంలో రచింపబడిన  ‘లీలావతి’ కావ్యం చెబుతుంది). పరిపాలించినది ఆరేళ్ళే అయినప్పటికీ, శాతవాహన వంశపు రాజులందరిలోకీ హాలుడు జగత్ప్రసిధ్ధుడు కావడానికి కారణం ఆ మహారాజు సంకలించి ప్రపంచానికి అందించిన ‘గాథా సప్తశతి’ గ్రంథం. (ప్రస్తావ వశాన, ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. హాలుని ఆస్థానంలో వుండిన శ్రీపాలితుడనే మహాకవి, హాలుని దర్శించుకోవడానికి వచ్చిన వారిలో కవులు కొందరు ఆ మహారాజు సమక్షంలో వినిపించిన గాథలలో ఉత్తమమైన గాథలను సేకరించి సంకలించాడనే మాట కూడ ప్రచారంలో ఉంది. అయితే, ఇందులో నిజానిజాలు ఏమైనప్పటికీ, హాలుడు విని మెచ్చిన వాటినే శ్రీపాలితుడు కూడ మెచ్చడం జరిగి ఉంటుందనుకోవడానికి ఏమీ సందేహ పడనవసరం లేదు కదా!). గాథా సప్తశతి లోని ఏడు వందల గాథలలో దేనికది అనాటి సమాన్య జనజీవనంలోని ఏదో ఒక పార్శ్వాన్ని భావి తరాలకు గ్రంథస్తం చేసి చూపించడంలో సఫలీకృతమై కనిపిస్తుంది. హాలుడు పరిపాలించిన ఆ ఆరేళ్ళ కాలం ప్రాకృత వాఙ్మయానికి స్వర్ణ యుగమని కూడా చెబుతారు.

‘గాథా సప్తశతి’ ని హాలుడు సంకలించడమే కాదు, తాను రచించిన కొన్ని గాథలను అందులో చేర్చాడు కూడా. హాలుడు రచించిన గాథలలో అతని వ్యక్తిత్వానికి ప్రతిబింబా లనదగినవి ఉన్నాయి. వాటిలో అత్యుత్తమమైన గాథ, హాలుని సహృదయతనూ, సున్నితమైన మనస్తత్త్వాన్ని తెలియ చెప్పే గాథ, ఇది:

“పాణఉడీఅ వి జలిఊణ హుతవఓ జలఇ జణ్ణ వాడమ్మి
ణ హు తే పరిహరిఅవ్వా విసమదసా సంఠిఆ పుంసా.”

దీని సంస్కృత ఛాయ:

“పానకుట్యామపి జ్వలిత్వా హుతవహో జ్వలతి యజ్ఞవాటేపి,
నహితే పరిహర్తవ్యా విషమదశా సంస్థితాః పురుషాః”

అగ్నిహోత్రుడు యజ్ఞవాటిలో ఎలా మండుతాడో, కల్లు పాకలోనూ అలానే మండుతాడు. అలాగని అగ్నిహోత్రుని అపవిత్రుడైనాడని వదిలి పెట్టడం కుదురుతుందా? కుదరదు. అలాంటిదే ఉత్తములైన వారి సాంగత్యం. కొన్ని కొన్ని పరిస్థితులలో తమకు తగని ప్రదేశాలలో వారు ఉండడం, మనం చూడడం సంభవించినంత మాత్రాన, వారి సాంగత్యాన్ని వదులుకో చూడడం తగదు. దాని వలన మనకే నష్టం. ఇదీ ఈ గాథ అర్ధం.

సాహిత్యంలో ప్రకృతి – (2)

“ఖరసిప్పర ఉల్లిహిఆఇ కుణఇ పహిఓ హిమాగమ పహాఏ,
ఆచమణ జలోల్లిహిఅ హత్థఫంస మసిణాఇ అంగాఇ.”

గాథసప్తశతి 4వ శతకం 30వ గాథ ఇది. ఈ గాథను చెప్పిన కవి పేరు పసణ్ణస్స. ‘అతనొక పథికుడు, పాదచారుడు. అది చలి కాలం. ఆ నాటి రాత్రి సన్నని పదునైన నూగు గలదైన గడ్డి ప్రాంతంలో (వేడిమి కోసం) పడుకున్నాడు. ఫలితంగా శరీరం మీద అనాచ్ఛాదిత భాగమంతా గీసుకుపోయింది. మంచుతో నిండి ఉన్న ఉదయాన నిద్ర లేవగానే తడిచేతితో ఒంటి మీద (గాయాలైన చోటల) రాచుకుని హాయిని పొందుతున్నాడు’ అని ఈ గాథ అర్ధం.  

గాథాసప్తశతిలోని ప్రతి గాథా ఒక రమ్యమైన కథను చెబుతుంది. గ్రామ జీవనంలోని ఎన్నెన్నో పార్శ్వాలు ఈ గాథలలో దర్శనమిస్తాయి. వస్తుపరంగా ఏ గాథా భూమిని విడిచి వెళ్ళదు. ప్రకృతితోనూ, ప్రాకృతికమైన విషయాలతోనూ అనుబంధించుకుని ఉన్న గాథలలోనూ సహజ సౌందర్యం ఏవిధమైన ఆర్భాటమూ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా దర్శనమిస్తుంది.

“అవిరల పడంత ణవజలధారా రజ్జు ఘడిఅం పఅత్తేణ,
అపహుత్తో ఉక్ఖేత్తుం రసఇవమేహో మహిం ఉఅహ.”

గాథసప్తశతి 5వ శతకంలోని 36వ గాథ ఇది. ‘వర్షాకాలం. కుండపోతగా కురుస్తూ బలమైన జలధారలనే పగ్గాలను కట్టి మేఘుడు భూమిని తనవైపు లాగే ప్రయత్నం చేస్తున్నాడు.  కానీ ఎంత ప్రయత్నించినా లాగలేక పోతున్నాడు. మూల్గుతున్నాడు. ఆ మూల్గులే ఉరుములు’ అని ఈ గాథ అర్ధం.

“ని గ్రామాసో అవిక్షత్
ని పద్వంతో ని పక్షిణః
ని శ్వేనా సక్ష్చిదర్థినః”

ఋగ్వేదంలోని 10వ మండలం 127వ సూక్తంలో 5వ ఋక్కు ఇది. ఈ ఋక్కు అర్ధం ‘గ్రామం సద్దుమణిగింది. పాదచారులు ఆగిపోయారు. పక్షులు సద్దుచేయడంలేదు. వేటాడే డేగలు కూడా సంచరించడం లేదు’ అని పెద్దల వివరణ. అతి తక్కువ అలతి అలతి మాటలతో గ్రామజీవనంలో ఒక రాత్రికి సంబంధించిన చిత్రణ ఇది. విశ్వామిత్ర వంశ స్థాపకుడైన సోభరిపుత్ర కుశికుడు ఈ ఋక్కును రచించాడని చెబుతారు. ఈ ఋక్కు గాయత్రి ఛ్ఛందంలో ఉందని కూడా చెబుతారు.

ప్రకృతిని ఎలా చూడాలో చెప్పేవారు కవులనీ, అలాంటి కవులలో ఉత్తములైన వాళ్ళు ఋగ్వేదాన్ని అందించారనీ పెద్దల మాట. ఋగ్వేద ఋషి ప్రకృతిని చూసిన విధానానికీ, ఆ తరువాతి కాలంలో కవులు ప్రకృతిని చూసిన విధానానికీ చాలా తెడా ఉందని కూడా పెద్దల మాట. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే అన్ని విపత్కర పరిస్థితులలోనూ, తాము చేసే యుధ్ధాలలోనూ తమకే విజయం కలగాలనీ, తమ శత్రువులు అపజయం పాలయే విధంగా దేవతలు సహాయపడాలనీ భక్తితో, శ్రధ్ధతో వినయపూర్వకంగా ఆర్యులు చేసిన ఆలాపనలే ఋక్కులు అయిఉండడం, పై అభిప్రాయానికి కారణం కావచ్చని నేను భావిస్తాను. ప్రకృతిని వర్ణించే సందర్భాల్లోనూ ఈ పధ్ధతినే ఆర్య ఋషులు పాటించారు. ఉదాహరణకి ఉదయాన్ని వర్ణించే ఒక సందర్భంలో ‘ఉషస్సు’ ను ఒక దేవతగా భావించి స్తుతించడాన్ని ఈ క్రింది ఋక్కులో  చూడవచ్చు:

“ఇదముత్యత్ పురుతమం పురస్తా జ్జ్యోతిస్తమసో వయునా వదస్థాత్
నూనం దివో దుహితరో విభాతీర్గాతుం కృణ వన్నుష సోజనాయా”

ఇది వామదేవుడు అనే ఋషి చెప్పిన ఋక్కు. ఋగ్వేదం 4వ మండలం 51వ సూక్తం లోనిది. ఈ ఋక్కు అర్ధం “చీకటి మధ్యనుండి అదిగదిగో తూర్పు దిక్కున శక్తివంతమైన అతి విశాలమైన జ్యోతి లేచింది. నిశ్చయంగా గణముల హితమును చేకూరుస్తూ దివస్సు యొక్క పుత్రికలు ‘ఉషస్సులు’ ప్రకాశిస్తున్నాయి” అని పెద్దల వివరణ.

అయితే, వామదేవుని ఈ ఋక్కులో ఉషస్సును ‘ఉషస్సులు’ అని బహువచనంలో చెప్పడం చూస్తాం. దీనికి కారణం ఏమైఉంటుందని వెదకడం మొదలెడితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి.

సాహిత్యంలో ప్రకృతి – (1)

“ణిప్పణ్ణ సస్సరిద్దీ సచ్ఛందం గాఇ పామరో సరఏ,
దలిఅ ణవసాలి తండుల ధవల మిఅంకాసు రాఈసు”

హాల మహారాజు కూర్చిన ప్రాకృత గాథా సప్తశతిలోని, ఏడవ శతకంలో 89వ గాథ ఇది. ఈ గాథ అర్ధం ‘(శాతవాహన రాజుల కాలంలో) ఒక శరత్కాలపు రాత్రి. వరి చేను బాగా పండి (కనుల ఎదుట కనిపిస్తూ) ఉంది. కొత్త బియ్యం దంచి చేసిన పిండి ఆరబోసినట్లుగా ఉన్న తెల్లని వెన్నెలలో (పట్టలేని ఆనందంతో) తనకుతానుగా తోసుకొచ్చిన పాటను పాడుతున్నాడు కర్షకుడు’ అని.

కనుల ఎదుట అలతి మాటలతో అలవోకగా ఒక వర్ణ చిత్రాన్ని రచించి చూపిస్తుంది ఈ గాథ. భూమిని నమ్ముకుని బ్రతుకుతున్న ఒక గ్రామీణుడికి ఇంతకంటే ఆనందాన్నిచ్చే సందర్భం వేరొకటుండబోదంటే అతిశయోక్తి కాదు.

దక్షిణ భారతదేశం చేసుకున్న పుణ్యంకొద్దీ ఇక్కడ జన్మించిన కొద్ది మంది మహా వ్యక్తులలో హాల మహారాజు ఒకడు. అతడి కృషే లేకుంటే ఈ గాథ, ఇంకా ఇలాంటివే ఎన్నో హృద్యమైన గాథలు గ్రంథస్థం కాకుండా ఎటుపోయేవో ఊహించలేం.

“అయి రమణీయా రమణీయ, సరఓ వి మణోహరో తుమంచ సాహిణో,
అనుకూల పరియణాయే, మన్నే తం నత్థి జం ణత్థి.
తా కింపి పదోసవిణోదమేత్తసుహ అం మణహరుల్లావం,
సా హేయి అపువ్వకహం సురసం మహిళాయణమణోజ్జం.”

ప్రాకృత వాఙ్మయంలో ప్రసిధ్ధమైన ‘లీలావతి కథ’ లోనిది ఈ శ్లోకం. ‘లీలావతి కథ’ ఆంధ్ర దేశానికి సంబంధించిన చారిత్రిక కథ అనీ, అందులో ఆంధ్ర దేశంలోని అనేక ప్రాంతాలు వర్ణించ బడినాయనీ మొదటగా గుర్తించి చెప్పినవారు మాన్యులు స్వర్గీయ మానవల్లి రామకృష్ణ కవిగారు. పై శ్లోకం అర్ధం ఇది:

“రాత్రి రమణీయంగా ఉంది. దానికి తగినట్లే శరత్కాలమూ మనోహరంగా ఉన్నది. ప్రేమాస్పదుడవైన నీవూ నాకు స్వాధీనుడవై ఉన్నావు. పరిజనులుకూడా అనుకూలురుగా ఉన్న నాకు లేనిది అంటూ ఏదీ లేదని అనుకుంటాను. కనుకా, ఏదేనా, మనస్సుకు ఇంపుపుట్టించే సంభాషణ గలదిగానూ, ఈ ప్రదోషకాలపు వినోదానికి తగినట్టిదిగానూ ఉన్న కొత్త కథ, చక్కని రసం వుట్టిపడేదాన్ని, మహిళాజనానికి ఇంపు పంపాదించేదాన్నీ సాధించండి (అంటే చెప్పండి)” అని విశద పరచి చెప్పిన వారు స్వర్గీయ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు.

రాత్రి రమణీయకతను వాచ్యంగా చెప్పకుండా పాత్ర మనఃస్థితి ద్వారా చదువరికి అర్ధమయ్యేలా చెప్పడం పైన ఉదాహరించిన గాథలోనూ, ఈ శ్లోకంలోనూ కనిపిస్తుంది. రసం (ఇక్కడ కాసేపు భావం అని అనుకుంటే) ఎప్పుడూ వ్యంగ్యమే కావాలి తప్ప, వాచ్యం కారాదన్న భారతీయ (రస) సిధ్ధాంతంలోని ముఖ్యాంశాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని అనుసరిస్తూ చెప్పిన కవిత్వం ఇది.  ఉత్తమమైనది.