తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

ఆంధ్రుల లేదా తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర గురించిన ఈ notes లో తొలి వెయ్యేళ్ళు అంటే క్రీస్తు శకాబ్దం మొదలుకొని ఆపై వెయ్యేళ్ళదాకా అని అనుకున్నది.
అయితే, ఇది నిజానికి ఇంకో రెండువందల పాతికేళ్ళు ముందుకు వెళ్ళి అదనంగా మరో రెండువందలపాతికేళ్ళు కలిసి మొత్తం పన్నెందువందల పాతిక
సంవత్సరాలవుతుంది. దీనికి కారణం, శాతవాహనుల పరిపాలనతో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర మొదలవుతుంది/మొదలుపెట్టుకోవాలనుకుంటే,
శాతవాహనుల పాలన క్రీ.పూ.225 లో మొదలై క్రీ.శ.225 తో అంతమయిందని చరిత్రకారులంటారు గాబట్టి. శాతవాహనుల పరిపాలనలో తెలుగువాళ్ళ
సాంఘిక చరిత్రకు కూడా క్రీ.పూ.225 నుంచి ఆధారలు దొరకాలి.

శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి. ఆంధ్ర భృత్యులని మాటకూడా ఉంది. దీనిమీద లేచినవివాదం ఇంకా ఎటూ తెలకుండానూ ఉంది. ఆంధ్రులైన భృత్యులా?
ఆంధ్రులకు భృత్యులా? ఆంధ్రులు వేరే రాజవంశం వారై, వారికి శాతవాహనులు సామంతరాజులా? అని మీమాంస. అదెలా ఉన్నా, నాలుగున్నర శతాబ్దాల
వీరి పరిపాలన మాత్రం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లిందని చెప్పుకోవాలి. నాలుగున్నర శతాబ్దాలు ఒకే రాజవంశం ఒక భూభాగాన్ని నిరాటంకంగా పరిపాలించడం
అంత సులభంగా జరిగే పని కాదు. అయినా శాతవాహనుల విషయంలో అది సాధ్యమైంది. తరానికి 25 సంవత్సరాల చొప్పున (చరిత్ర పరిశోధనలో తరానికి 25
సం.గా వేసుకుని లెక్కిస్తారని చదివాను) నాలుగున్నర శతాబ్దాలకు 18 తరాలవుతుంది. అంటే తరం నుంచి తరానికి సాగే జ్ఞాపకాల ప్రవాహంలో
పరిస్థితులలోనూ పరిపాలకులకు చెందిన విషయాలలోనూ ఏవిధమైన మార్పూ లేకుండా 18 తరాలు గడవడం, జ్ఞాపకాల, అనుభవాల ప్రవాహం నిరాటంకంగా
కొనసాగడం అన్నది చరిత్రలో ఒక అరుదైన సందర్భం, ఒక luxury గానే చెప్పుకోవాలి. ఆ సందర్భాన్ని, ఆ luxury ని  శాతవాహనుల పరిపాలనలో
అప్పటి ప్రజలు అనుభవించారు.

ఈ సుఖాన్ని అనుభవించిన వాళ్ళలో తెలుగు మాతృభాషగా ఉండిన తెలుగువాళ్ళూ ఉన్నారు. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. అప్పుడు, అంటే
శాతవాహనుల పరిపాలనా కాలం నాటికి, ఆంధ్రులు తెలుగువాళ్ళూ ఒక్కటి కాదా? అని. కాదనే నేను అనుకుంటాను. అయితే గనక, ఆంధ్రులైన
శాతవాహనులు తమ మాతృభాష అయిన తెలుగును వదిలి ప్రాకృతాన్ని ఎందుకు ఆశ్రయిస్తారు? శాతవాహనుల కాలంలో ప్రాకృతం రాజబాష, ప్రజల భాష
కూడాను! ప్రాకృతంలోనే కదా గాథాసప్తశతిలోని గాథలన్ని ఉన్నాయి! అయితే, అప్పటికి తెలుగింకా పూర్తిగా పరిణతిచెందిన భాషగా కాకుండానన్నా
ఉండిఉండాలి. అలా అనుకోవడానికీ వీలు లేదు.  కారణం, గాథాసప్తశతిలో అక్కడక్కడా కనుపించే అత్తా (అత్త), అద్దాఏ (అద్దం) లాంటి కొన్ని తెలుగు
పదాలు, తెలుగు అప్పటికే పూర్తిగా పరిణతి చెందిన భాషగా ఉండినదనీ, ఎంత పరిణతి అంటే, అందులోని కొన్ని మాటలు వేరే భాషలోకి వెళ్ళగలిగేంత పరిణతి
చెందిన భాషగా శాతవాహనుల కాలంనాటికే ఉండినదనీ, పూజ్యులు కీ.శే.తిరుమల రామచంద్ర గారు తమ వ్యాసాలలో ఇప్పటికే నిరూపించి ఉన్నారు కాబట్టి!

అదలా ఉంచితే, “ఆంధ్రశ్చ బహువః” అనే మాట ఒకటి ఉంది. దీని అర్ధం ఆంధ్రులు పలువురు అని. అంటే, పలు జాతుల ప్రజలు కలిసి ఆంధ్రులు
అయ్యారని ఇది సూచిస్తుంది. ఇది నానుడి. ప్రజల నాలుకలపైనుంచి వచ్చిన మాట. దీనికి నిదర్శనాలు, ఆధారాలూ దొరకవు. తరం నుంచి తరానికి ఇలా
దిగుమతి అయిన జ్ఞానంలో నిజం బొత్తిగా ఉండదు అనుకోవడం సాహసమే అవుతుంది. ఈ పలు జాతుల ప్రజలలో తెలుగు మాతృ భాషగా కలిగిన తెలుగువాళ్ళూ
ఉండిఉండవచ్చు. కాదనటానికి లేదు. బలమైన, ప్రభావవంతమైన జాతి కావడం మూలాన పోనుపోను ఆంధ్రులంటే, తెలుగువాళ్ళన్నది స్థిరపడి పోయి
ఉంటుందనుకోవాలి.

తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర: అంధ యుగం – గ్రంథ యుగం

తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర: అంధ యుగం – గ్రంథ యుగం

తెలుగువాళ్ళ సాంఘిక చరిత్రను గురించిన ముఖ్యమైన సమాచారాన్ని, సంగతులను సేకరించుకుని ఒకచోట రాసుకోవడానికి వీలుగా ఇదేమిరకమైన విభజన అనిపించినా, నాకు మాత్రం ఇది ఒక విధమైన (convenient) స్థూల విభజనలాగానే అనిపిస్తుంది.

ఇందులో, అంధ యుగం అని నేను విభజించుకున్నది – తారీకంటూ లేని/తెలియని తొలినాళ్ళ నుంచి క్రీ.శ.1000 సం. దాకా (అంటే గీత గీసినట్లు వెయ్యవ సంవత్సరందాకా అని కాకుండా ఆ ప్రాంతాలదాకా) ఈ అంధ యుగంలోకి చేర్చుకుంటాను. కారణం – వ్రాతలో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్రను గురించి తెలిపే ఆధారాలేవీ ఈ యుగంలో దొరకవు గాబట్టి. దొరికిన శిలాశాసనాలన్నీ దానశాసనాలు. ఇందులో పెద్దగా సామాన్యజనుల సాంఘిక చరిత్రకు సంబంధించిన అంశాలేమీ వుండవు. అందువలన, ఈ యుగానికి చెందిన జనజీవనానికి సంబంధించిన ఆసక్తికరమైన అదనపు సమాచారం చిన్నదైనా సేకరించడం చాలా కష్టం, challenging గా ఉండే పని.

ఇక రెండవది  గ్రంథ యుగం – పేరు సూచించేటట్లుగానే, రాజరాజు కోరికతో నన్నయ మహనీయుని చేతులమీదుగా క్రీ.శ.1050 ప్రాంతంలో మొదలైన గ్రంథ రచన, ఆ తరువాత శతాబ్దాలుగా నిరాటంకంగా సాగి, ఇప్పటికీ సాగుతూనే ఉంది. పోను పోను కాలంలో వ్రాత అనేది  పరిణతిచెంది సర్వ సామన్యమైన తరువాత సంగతులన్నీ గ్రంథస్థం చేయబడినాయి.  శాసనాలు చాలమటుకు రాజుల చరిత్రనే చెప్పాయి. తాళపత్రాలు మిగతా సంగతులతో పాటు, అప్పుడప్పుడూ జనసామాన్యం జీవన విశేషాలను చెప్పాయి. అయితే, ఈ యుగానికి సంబంధించి అదనపు సమాచారం పెద్దగా సేకరించగలిగింది ఏమీ లేదనే అనిపిస్తుంది. ఉన్నదేదో ఇప్పటికే పెద్దలచేత బయటపెట్టబడింది గాబట్టి. ఈ యుగంలో కూడా, వెతకడానికి మిగిలి ఉన్నవిగా చెప్పాల్సినవి దొరకకుండాపోయిన ప్రసిధ్ధకవులవే గానీ, అంత ప్రసిధ్ధులు కానివారివి గానీ రచనలు. కాలగర్భంలో కలిసిపోయినవిగా అనుకోబడుతున్నవాటిని వెలికి తీసి వెలుగుచూపించడానికి కొంత అదృష్టంతో సహా ఇంకా చాలా కలిసిరావాలి.

అలాగని ఈ గ్రంథయుగంలో ఇక వెదకడానికి ఏమీ లేదని అనుకోవడంకూడా తెలివైన మాటకాదు. ఎందుకంటే, తెలుగువాళ్ళ చరిత్రకు సంబంధించిన చాలానే సంగతులు ఇంకా అపరిష్కృతాలుగా మిగిలున్నవి ఉన్నాయి. ఉదాహరణకి, శాతవాహను లెవరు? వీళ్ళు పుట్టుకతో ఆంధ్రులేనా? అనే ప్రశ్నకు ఇది final అని చెప్పుకోదగిన సమాధానం ఇంతవరకూ లేదు. అలాగే, కాకతీయులు ఎవరు? అన్న ప్రశ్నకూ, ‘కాకతి’ అనే మాట ఏ అర్ధాన్ని సూచిస్తుంది? కాకతి శక్తి ఎవరు? ఇలాంటి ప్రశ్నలకూ ఇది అంతిమం, దీనికిక తిరుగులేదు అని చెప్పుకోదగ్గ, అందరూ ఒప్పుకోదగిన, ఒప్పుకున్న సమాధానం లేదు, నాకు తెలిసినంతవరకూ, నేను చదివున్నంతవరకూ. ఇలాగే, పల్లవులు ఇక్కడివారా? బయటనుంచి వచ్చిన వారా? పల్లవ అనే మాటకు ఏమిటి అర్ధం? బృహత్ఫలాయన, శాలంకాయన, ఇత్యాది చిన్న చిన్న రాజవంశాలవారు ఇక్కడివారేనా? లేక బయటినుంచి వచ్చినవారా? ఇక్కడివారే అయితే వీరి పూర్వులు ఎవరు? ఈ వంశనామాలు దేనిని సూచిస్తాయి? ఇవి వంశనామాలేనా లేక గోత్రనామాలా? గోత్రనామాలే వంశనామాలుగా ఎందుకయ్యాయి? ఇలాంటి ప్రశ్నలకూ సరయిన convincing సమాధానాలు దొరకవలసే ఉంది ఇంకా!

అందువలన, (నా విభజనలో) అంధయుగంలోనే కాదు, గ్రంథయుగంలోని సంగతులకు సంబంధించిన సమాచారమూ సమగ్రమేమీ కాదు! అందులోకూడా ఇంకా తెలియాల్సింది ఉందనే అనుకోవాలి. చరిత్ర గురించి రాయడం out of fashion అయిపోయి చాల రోజులే అయింది. ఒకప్పుడు, 1970 ల దాకా కూడా, చరిత్ర గురించి రాయడం ఒక యజ్ఞంగా తీసుకుని కృషి చేసిన వాళ్ళున్నారు. ప్రచురించిన పత్రికలూ ఉన్నాయి. అవన్నీ గ్రంథాలయాల్లో భద్రంగానే ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుతూనే ఉన్నారు, రాయడానికి సాహసించకపోయినా!

కీ.శే. సురవరం ప్రతాపరెడ్డిగారు తమ ఆంధ్రుల సాంఘిక చరిత్రలో శాతవాహనుల కాలం నుండి క్రీ.శ.వెయ్యి దాకా ఆంధ్రుల సాంఘిక చరిత్రను గ్రంథస్థం చేయాలని అభిలషించారుగాని, ఏ కారణం చేతనో, అది కార్యరూపం దాల్చలేదు. ముందు చెప్పుకున్నట్లుగానే, వెయ్యి తరువాత ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాయడానికి తగినన్ని ఆధారాలు ఉన్నందువలన వీలయ్యే పనే! వెయ్యికి ముందు చరిత్ర రాయడానికి సరయిన ఆధారాలు ‘sources’ లేకపోవడం అనడం కంటే లభ్యంకాకపోవడం వలన అంత సులభంగా జరగే పనికాదు.

అందువలన ఆంధ్రుల చరిత్రలో తొలి వెయ్యేళ్ళు ఓరకంగా అంధయుగమే! అలా అన్నంత మాత్రాన, ఇక కృషి చెయ్యడానికి ఏమీ లేదని కాదు; చేయగలిగినంత ఉంది…ఉంటుంది!

కీసరగుట్ట

కీసరగుట్ట - శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం

హైదరాబాదు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంటుంది కీసర (కీసర గుట్ట). ప్రసిధ్ధ శైవక్షేత్రం.

క్రీ.శ. తొలి శతాబ్దాలలో ఆంధ్ర దేశాన్ని (వేంగీ దేశాన్ని) పరిపాలించిన రాజవంశాలలో ఒకటైన విష్ణుకుండినులకు, ఈ కీసరకు సంబంధం ఉందని ఒక మాట ఉంది. ఈ రాజవంశం రాజులలో ఒకడైన రెండవ మాధవ వర్మ పరిపాలనా కాలం అయిన క్రీ.శ.4-5 శతాబ్దాలలో ఈ కీసర రాజధానిగా ఉండేదని చెబుతారు.
విష్ణుకుండిన రాజులలో రెండవ మాధవ వర్మ చాలా ప్రసిధ్ధుడు. రాజ్యాన్ని బాగా విస్తరింపజేసి విష్ణుకుండినుల ప్రభను ఒక వెలుగు వెలిగించిన దీటైన రాజు. ఈయన వైదికమతాభినివిష్టుడనీ, అగ్నిష్టోమ, వాజపేయ, పౌండరీక, అశ్వమేధ, రాజసూయ ఆది క్రతువులను చేశాడనీ చరిత్ర పరిశోధకులు చెప్పారు. పదకొండుసార్లు అశ్వమేధ యాగాన్ని చేయడం వలన ఈయన రాజ్యకాలంలో పదకొండు సార్లు దిగ్విజయ యాత్ర సాగించి ఉంటాడనీ చరిత్ర పరిశోధకులు అంటారు. అప్పటిలో బలవంతులైన వాకాటకులను పోరులో ఓడించి, సంధిలో భాగంగా వాకాటక రాజు కుమార్తెను వివాహం చేసుకుని, తదనంతరం రెండు రాజ్యాలకూ వారసుడు అయ్యాడని కూడా చరిత్ర పరిశొధకులు ఊహించారు. ఇంత ప్రసిధ్ధుడైన రాజుతో సంబంధం కలిగి ఉండిన ఈ క్షేత్రం కూడా అంత ప్రసిధ్ధమైనదే! శివరాత్రి నాడు ఏటా జరిగే ఉత్సవాలకు హైదరాబాదు నుండి ప్రత్యేకంగా బస్సులను వేస్తారు. జనం తండోపతండాలుగా వెళ్ళి ఉత్సవంలో పాల్గొంటారు.

కొండ (‘గుట్ట’ అనే అనాలనుకుంటాను!) మీద ఆలయం. మెట్లు ఎక్కుతూండగా కనిపిస్తుంది ఆలయ గోపురం. కొండ (‘గుట్ట’) మీద ఆలయ ప్రాంగణంలో ఏ వైపు చూసినా శివలింగాకృతులు కనిపించి అబ్బుర పరుస్తాయి. కొండ మీదనుంచి చుట్టు scenery చూడడానికి బాగానే ఉంటుంది. ఈ మధ్యనే వెళ్ళి నప్పుడు తీసినవి ఫోటోలు ఇక్కడ కొన్ని. ఈ ఫోటోలు 2 megapixel లెన్స్ తో ఉన్న సెల్ ఫోనుతో తీసినవి. ఈ ఫోటోలలో చివరి నాలుగు ఫోటోలూ dimensions లో పెద్దవి. వాటి మీద ఎక్కడైనా సరే click చేస్తే, image ని original dimensions లో చూడడానికి వీలవుతుంది.

స్వగతాలు (3) : జ్ఞాపకం

జ్ఞాపకం

ప్రతి జ్ఞాపకానికీ వేలిముద్ర లాంటి ఒక personal ముద్ర వుండడమన్నది వాటి నైజం.

Memory loss అంటే?
జ్ఞాపకం పోవడం….అంతే!

ముఫ్ఫై నలభై ఏండ్లుగా వెంట పడి వున్న ఒక జ్ఞాపకాన్ని
ఎలక్ట్రానిక్ కాగితం మీదికి – అదే కంప్యూటర్ స్క్రీన్ మీదికి – వ్రాయడానికి ఎంత సమయం పడుతుంది?
ఒక గంటా?
రెండు గంటలా?
మూడూ? నాలుగూ? ….. పోనీ ఒక రోజు!

జ్ఞాపకం పోవడం అంటే
ఒక memory మన నుంచి వేరై పోవడం – అంతే!

Memory ని Memory గానే మాటలలో మూట కట్టి బయటికి నెట్టేయడంలో పోయే ప్రతి జ్ఞాపకం, తన వెంట ఒక తనువంత అనుభూతి బరువును తీసుకొని పయనమై పోయినట్లనిపించకపోవడం తెలియకుండా జరిగిపోతుంది.

వ్యక్తి హరువును జ్ఞాపకాల బరువు నిర్ణయించడమన్న తెలియని నిజం, తేలికైపోయిన జ్ఞాపకాల బీరువాలోని చీకటిలోనికి తొంగి చూసుకుని ఒకానొక రోజు తముళ్ళాడుకోవాల్సి రావడం జరిగినప్పుడు, ఒక్కసారిగా తెలిసి భయపెట్టే క్షణం రాకూడదనుకుంటాను!

అన్నీ అయి పోయి

ఎప్పటికైనా సరే, చెప్పడానికి ఇక ఏమీ మిగలకుండా అయిపోయి మిగలడం మాటలలో చెప్పలేనంత misery!

Memory loss అంటే?
శిథిలానికి సిధ్ధమౌతూన్న ఒక ఖాళీ అయిపోయిన గది!

స్వగతాలు (2) : ఏడుపు

ఏడుపు

బాగా రాయని నాటకాన్ని ఆడి బతుకులో గెలుపొందడం ఏలాగ? అన్నది ఇక్కడ సమస్య.

కొత్తగా బతకడం మొదలెట్టిన ఏ మనిషికైనా
ఇక్కడ కష్టం చేసే శరీరంకన్నా
మతలబు చేసే బుధ్ధికే బతకగలిగే అవకాశాలు మెండని అర్ధమవడానికి ఆట్టే కాలం పట్టదు.
ఇది అనైతికం అన్న సందేహం ఒక పక్కనుంచి కలుగుతూనే వున్నా
బుధ్ధి మాత్రం మతలబు చేయగలిగే బుధ్ది వైపుకే పరుగులు పెడుతూ వుంటుంది.

మనిషికి తెలివిగల బుధ్ధి వున్నందుకే ఇది జరుగుతూంటుందన్నది
ప్రతి యేడూ మార్కెట్లో పదీపదిహేను రూపాయలకు తక్కువ దొరకని కిలో టమోటాలు
మడి దగ్గర అర్ధరూపాయకు కూడా అమ్ముడవని సందర్భాల్లో అర్ధమవుతుంది.
అదే ఇంకా బాగా అవే టమోటాలు అర్ధ రూపాయకూ అమ్ముడవక
రోడ్ల మీద లారీల చక్రాల కింద చితికి పచ్చడైన దృశ్యంలో ఇంకా బాగా అర్ధమవుతుంది.
ఈ నాటకాన్నంతా చూసే మనకే ఇలా వుంటే,
మొదటినుంచీ పిల్లల్లా చూసుకుంటూ పెంచి ఆశలు పెంచుకుంటూ పోయిన వాడి కెంతుండాలి…
శోకం?
శోకమా?! ….(కాదుకాదు….ఇందులో మచ్చుకైనా మట్టివాసన పలకడంలేదు.)
ఏడుపు! ….(అవునవును …ఏడుపే! ఎంత కన్నీళ్ళ మయంగా వున్నదీ మాట!!)

మళ్ళీ ఒకసారి మన ‘లేపాక్షి’ గురించి…(2)

‘లేపాక్షి’ ని గురించిన ప్రస్తావన ఎప్పుడు, ఎక్కడ వచ్చినా, లేపాక్షి కి మరో పేరు అనుబంధించబడి వినబడుతుంది. ఆ పేరు ‘బసవన్న’! ‘లేపాక్షి’ ని ‘బసవన్న’ ను విడదీయలేని అనుబంధంతో పెనవేసుకునిపోయి, ఎంతగానో ప్రసిధ్ధి చెందింది ‘లేపాక్షి బసవన్న’ అనే పేరు! లేపాక్షి కి వెళ్ళి ఈ బసవన్నను దర్శించుకోనిదే, ఆ వెళ్ళిన వాళ్ళకు లేపాక్షి సందర్శనం పూర్తి అయినట్లుగా భావింపబడదు అనడం అతిశయోక్తి కానే కాదు!

లేపాక్షి శ్రీ వీరభద్రాలయానికి ఒక కిలోమీటరు లోపు (రెండు మూడు ఫర్లాంగుల కంటె ఎక్కువ దూరం వుండదనుకుంటాను!) దూరంలోనే బసవన్న శిల్పం వుంటుంది. కాలి నడకన వెళ్ళవచ్చును.  ఏకశిల నుంచి మలచబడిన ఈ బసవన్న శిల్పం కూడా, లేపాక్షి, శ్రీ వీరభద్రాలయంలోని మిగతా శిల్పాల లాగా,  జీవకళతో మెరిసిపోతూ వుంటుంది.  మొత్తం శిలనే బసవన్నగా మలిచిన అధ్బుత శిల్పం ఇది. దేశంలోనే పరిమాణంలో అతి పెద్ద (8.1 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తు పరిమాణంతో) బసవన్న శిల్పంగా ‘లేపాక్షి బసవన్న’ ను చెబుతారు! తీరుగా కూర్చుని శ్రీ వీరభద్రాలయం కేసి స్తున్నట్లుగా మలచబడింది. బసవన్న వెనక నిలబడి, కొమ్ముల మధ్య నుంచి ధృష్టి సారించి చూస్తే శ్రీ వీరభద్రాలయంలోని  ఏకశిలపై మలచబడి వున్న నాగలింగం కనబడుతుంది.

అన్ని హంగులతో మలచబడి వున్న’లేపాక్షి బసవన్న’ ఫోటోలు, ఇక్కడ ‘slide-show’ గా!

This slideshow requires JavaScript.

మళ్ళీ ఒకసారి మన ‘లేపాక్షి’ గురించి…(1)

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం, అసంపూర్తి కళ్యాణమండపానికి పక్కన ఒకే రాతి మీద మలచిన విఘ్నేశ్వర మరియు నాగలింగ శిల్పాలున్నాయి. ఈ ప్రతిమలున్న పెద్ద శిల వున్నది, ప్రధాన ఆలయానికి సరిగ్గా వెనకవైపు అవుతుంది.

ఏకశిలలో మలచిన ఈ ప్రతిమల వెనకా ఒక కథ వుంది. ఈ ఆలయ నిర్మాణానికి నియోగించబడిన శిల్పులలో, ఒక కుర్ర శిల్పి పనితనానికి సంబంధించిన కథ అది. ఆలయ నిర్మాణం జోరుగా సాగుతున్న రోజులలో ఒకనాటి రోజు, మధ్యాహ్నం భోజన విరామ సమాయానికి, భోజనం తయారవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఆ కుర్ర శిల్పి తల్లి చెప్పడంతో, ఆ మధ్య కాలంలో ఖాళీగా కుర్చోవడం ఇష్టం లేని అతను, తిరిగి అతని తల్లి వద్ద నుండి భోజనం తయారయిందని కబురు వచ్చేంతలోనే, ఆ శిలపై ఈ రూపాలను మలిచాడనీ…

అలా అంత తక్కువ వ్యవధిలోనే శిలను అద్భుతమైన శిల్పంగా మలచ గలిగిన తన కుమారుని ప్రతిభకు ఆశ్చర్య పోయిన ఆ తల్లి, తన్మయంలో ఇంగితం మరచి కుమారుని ఎదుటనే అతని ప్రతిభను గొప్పగా పొగిడిందనీ, అలా ఆమె పొగిడిన తరువాత కొద్ది సేపటికే  అందరూ ఆశ్చర్య పోయే లాగా శిల్పం మలచ బడి వున్న శిల మధ్యలోకి పైనుంచి క్రిందివరకూ ఒక సన్నని పగులు ఏర్పడిందనీ, శిలలో ఏర్పడిన ఆ పగులు కారణంగా శిల్పం  లోపం కలది అయిపొయిందనీ ప్రచారంలో వున్న కథ!

కథ సంగతెలా వున్నా, ఏక శిలపై విఘ్నేశ్వర, నాగలింగ శిల్పాలు చూడడానికి అద్భుతంగా వుంటాయి. నాగలింగ శిల్పంలో పడగ విప్పి వున్న ఏడు తలల నాగరాజు, శిల్పం చెక్కబడి వున్న శిల సహజంగానే ఎత్తుగా వుండడం వలన చాలా gigantic గా, పేరుకు తగినట్లు magnanimous గా కనిపిస్తుంది.

ఆ ఫోటోలు మొదట విఘ్నేశ్వరునివి, ఆ తరువాత నాగరాజువి ఇప్పుడు, ఇక్కడ…slide show గా!

This slideshow requires JavaScript.

ప్రాకృతికం – పల్లె అందం

“ణిప్పణ్ణ సస్సరిధ్ధీ సచ్చందం గాఇ పామరో సరఏ,
దలిఅ ణవసాలి తండుల ధవల మిఅంకాసు రాఈసు.”

శాతవాహన ప్రభువులలో ఒకడైన హాలమహారాజు చే సంకలించబడిన గాథా సప్తశతి అనే పేరున్న ప్రాకృత గాథల సంకలన గ్రంథంలో ఏడవ శతకంలోని ఎనభైతొమ్మిదవ గాథ ఇది.

“నిష్పన్న సస్య ఋధ్ధిః స్వఛ్ఛందం గాయతి పామరః శరది,
దలితనవశాలి తండుల ధవల మృగాంకాసు రాత్రిషు.”

అని పై ప్రాకృత గాథకు సంస్కృత ఛాయ.

‘కోర్కె తీరగా పంట పండింది. దంచిన కొత్త బియ్యపు పిండి ఆరబోసినట్లున్న శరత్కాలపు వెన్నెలరాత్రిలో ఆనందంతో రైతు గొంతు విప్పి పాట పాడు తున్నాడు’ అని ఈ గాథకు పెద్దలు చెప్పిన అర్ధం. భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించే ఒక పల్లెటూరి రైతు జీవితంలో దైవం అనుగ్రహిస్తే పదే పదే పునరావృతమయ్యే ఒక సన్నివేశాన్నీ, ఆ సన్నివేశంలోని సౌందర్యాన్నీ కనులకు కట్టినట్లు అతి తక్కువ మాటలలో వర్ణించి చూపెట్టే ఈ గాథను ఎన్ని సార్లు చదివినా, మననం చేసుకున్నా, తనివి తీరనట్లుంటుంది.

అచ్చమైన ఆప్యాయతతో రైతు కాళ్ళకు అంటుకునే పొలంలోని మట్టీ, మట్టిని తడిపి తమకంతో తబ్బిబ్బయ్యే నీరూ, స్వచ్చంగా వీచే గాలీ, రాబోయే పంటమీదా, పచ్చదనం మీదా కారుణ్యంతో కాచే ఎండ, కాలం కనికరించి అన్ని కలిసొస్తే ఏ దిక్కుకేసి చూసిన కళ్ళ నిండుగా కనిపించే పచ్చదనం….ఇవన్నీ పల్లెటూరు అనే పడతికి ప్రకృతి తనంత తానుగా తొడిగి చూపించిన నిలువెత్తు ఆభరణాలు. జీవితంలో ఏ కొంత భాగమైన పల్లెటూరిలో గడపడం అన్నది సంభవించిన ఏ వ్యక్తికైనా వీటి సహజ సౌందర్యం ఏమంత కష్ట పడకుండానే మనసుకు తట్టి కనులకు కడుతుంది.

ఆధునిక జీవన శైలిలో, పొట్టకూటికోసం అనుకున్నా, మరెందుకోసం అనుకున్నా, తనదైన పల్లెటూరిని విడిచి పట్టణానికి వలస వెళ్ళల్సి రావడం సంభవించిన వ్యక్తికి, తలచుకునే సందర్భం దొరికినప్పుడల్లా, వాటి సహజ సౌందర్యం మనసును పూర్తిగా కమ్మేసి, ఆ దృశ్యాలను విడిచి పెట్టి  ప్రస్తుతంలోకి రావడానికి ఒక పట్టాన ఇష్టపడక మనసు మొరాయిస్తూనూ వుంటుంది.  తప్పనివి అయినా కాకపోయినా, తెచ్చిపెట్టుకున్నవి అయినా కాకపోయినా….ఈ వియోగాలు ఇప్పటి జీవితంలో తప్పించుకోలేని అంతర్భాగాలయిపోయాయి. అంగీకరించాలిసిందే తప్ప, అందులో బాధపడాలిసింది కూడా ఏమీ లేదనే అనుకోవాలి!

పల్లెటూరితో సంబంధం వున్నవాళ్ళు మరోసారి ఆ సౌందర్యాన్ని మననం చేసుకోవడానికి వీలుగానూ, సంబంధం లేని వాళ్ళు ఆ సౌందర్యాన్ని మరోసారి చూడడానికి వీలుగానూ, నా ఫోటోలు కొన్ని slide show గా…. ఇప్పుడు, ఇక్కడ! ఇక్కడ ఒక్క మాట! ఈ ఫోటోలన్నీ బస్సులో ప్రయాణిస్తూ తీసినవి. అందువలన, అక్కడక్కడా ఒకటి రెండు ఫోటోలు straight గా వుండకుండా, కొంచెం angled గా కనిపిస్తాయి. అయితే, angled గా వున్నా, అందులో వున్నది ప్రకృతి  కాబట్టి, వాటి సౌందర్యానికి ఏమీ భంగం కలగలేదనే అనుకుంటాను!

This slideshow requires JavaScript.

చంద్రగిరి!

చంద్రగిరి! చిత్తూరు జిల్లాలో -  ప్రపంచ ప్రసిధ్ధి చెందిన పుణ్య క్షేత్రం, ఆంధ్రుల ఇల వేలుపు, అత్యంత భక్తి శ్రధ్ధలతో కొలిచే దైవం శ్రీ వేంకటేశ్వరుని దివ్య ధామం అయిన – తిరుపతి కి 11 కి.మీ. దూరంలో వున్న ఊరు! ఈ ఊరి పేరు వినగానే ఆంధ్రుల చరిత్రలో జగజ్జగేయమానంగా వెలిగిన  విజయనగర సామ్రాజ్యం, ఆ వెంటనే శ్రీ కృష్ణదేవరాయలు, ఆ వెనువెంటనే ఆయనకు పితృసమానుడూ, గురువు అయిన తిమ్మరుసు గుర్తుకు రావడం మామూలే! తిమ్మరుసయ్య ఇక్కడే పుట్టి, విద్యాబుధ్ధులు నేర్చి అంతవాడయ్యాడని ఐతిహ్యం! కృష్ణదేవరాయలు తిరుపతి యాత్రకు వచ్చినప్పుడల్లా ఇక్కడే బస చేసేవాడని చెబుతారు.

ఇక్కడ ఇప్పుడు చూడడానికి ఒక రాజమహలు, రాణీ మహలూ ఉన్నాయి. రాజ మహలు మూడు అంతస్తులలోనూ, రాణీ మహలు రెండు అంతస్తులలోనూ ఉంటాయి. రాజ మహలులోనే ఆర్కియాలనీ డిపార్టుమెంటువారు నిర్వహిస్తూన్న మ్యూజియం వుంది.

ఇవి కాక, వీటికి దగ్గరలోనే రోడ్డుకు ఇవతలి వైపున, ఎప్పటిదో… ఇప్పుడు పాడుబడిపోయిన స్థితిలో వున్న ఒక చిన్న దేవాలయము కనిపిస్తుంది. ఎప్పటినుంచి ఈ దేవాలయం ఈ స్థితిలో వుందో తెలీదు.

ఇవి అన్నీ కలిసి వున్న ఒక slide show ఇప్పుడు, ఇక్కడ!

This slideshow requires JavaScript.

ఆంధ్రుల చరిత్ర : బృహత్ఫలాయనులు

‘బృహత్ఫలాయన’ మహారాజ జయవర్మ

ఆంధ్ర దేశాన్ని శాతవాహనులు దాదాపు నాలుగువందల సంవత్సరాలు పరిపాలించారు.  వారి పాలన స్థూలంగా క్రీ.పూ.225 నుండి క్రీ.శ.225 దాకా సాంగిదని చరిత్రకారులు చెబుతారు.  శాతవాహనుల తరువాత ఆంధ్ర దేశాన్ని పాలించిన ప్రసిధ్ధ రాజవంశం ‘ఇక్ష్వాకు’ వంశం.  ఈ వంశం పురాణ ప్రసిధ్ధి చెందినది.  వీరి పాలన తరువాత ఆంధ్ర దేశాన్ని చిన్న చిన్న రాజవంశాలు పాలించాయి. బ్రృహత్ఫలాయన, శాలంకాయన, ఆనందగోత్రులు అనే పేర్లతో వున్న ఈ రాజవంశాలకి ఈ పేర్లు వారి ‘గోత్ర’ నామాల మీదుగానే వచ్చాయని చెబుతారు. బృహత్ఫలాయనులది బృహత్ఫలాయన గోత్రం, శాలంకాయనులది శాలంకాయన గోత్రం, ఆనందగోత్రులది (వారి పేరులోనే వున్నట్లుగా) ఆనంద గోత్రం…ఇలాగ!  బృహత్ఫలాయనుల విషయంలోనే కాదు, శాలంకాయన మరియు ఆనందగోత్రుల విషయంలోనూ వారి శాసనాలలో ఎక్కడా వారి వంశ నామం చెప్పబడి వుండక పోవడం వలన ‘గోత్ర’ నామాలే వాళ్ళ వాళ్ళ వంశ నామాలయ్యాయి! చరిత్రకారులు వాళ్ళను గోత్రనామాలతోనే పిలుచుకోవాల్సి వచ్చింది! (ఇది ఇంచుమించు ఎలాంటిదంటే, పల్లవులను ‘భారద్వాజు’ లనీ, కాదంబులను ‘మానవ్యు’ లనీ పిలుచుకోవడం లాంటిదని చెబుతారు!)

బృహత్ఫలాయన వంశానికి చెందిన రాజు ఆంధ్ర చరిత్రలో ఇప్పటివరకూ ఒక్కడే ఒక్కడు కనిపిస్తాడు.  ఆ రాజు పేరు ‘జయ వర్మ’. ఈయన తన పరిపాలనా కాలంలో వేయించిన ఒక తామ్ర శాసనం వలన ఈయనకు సంబంధించిన చరిత్ర కొద్దిగానయినా బయటపడింది.  ఆ తామ్ర శాసనం నేటి గుంటూరు జిల్లా, తెనాలి కి దగ్గరిలోని ‘కొండముది’ అనే గ్రామంలో దొరకడం వలన, ఈ శాసనానికి ‘కొండముది’ తామ్ర శాసనం అనే పేరు వచ్చింది. ఈ ‘కొండముది’ తామ్ర శాసనం వలననే ‘బృహత్పలాయన’ అనే పేరుతో ఒక గోత్రం వుందన్నది వెలుగులోకి వచ్చిందని పెద్దలు చెబుతారు. ఈ గోత్ర నామం (‘బృహత్ఫలాయన స గొత్తొ’ అన్న మాటలలో) ఈ ఒక్క శాసనంలో తప్ప వేరే ఎక్కడా ఇంతవరకూ లభించకపోవడం అందుకు కారణం అని కూడా చెబుతారు.

కొండముది శాసనం ఒక దాన శాసనం! ఇందులో ‘మహేశ్వర’, ‘బృహత్ఫలాయన’ అన్న రెండు మాటలు తప్ప మిగతా అంతా ప్రాకృతంలో వుంటుంది.  ఈ శాసనంలోని రాజముద్రికలో జయవర్మ మహారాజు పేరు కనబడుతున్నది.  ఈయన బృహత్ఫలాయన గోత్రుడు. మహేశ్వర పాద భక్తుడుగా అందులో వర్ణించబడినాడు.

ఈ ‘కొండముది’ దాన శాసనంలో ఈ మహారాజు తన రాజ్యంలో వున్న ‘కూడూరుహార’ లోని ‘పంతూరు’ అనే గ్రామాన్ని ఎనమండుగురు బ్రాహ్మణులకు (బ్రాహ్మదేయంగా) ఇచ్చి వున్నానని కూడూరు లోని తన ‘వ్యాపృతు’ నకు ఈ శాసనంద్వారా తెలియజేశాడు. ఇక్కడ వాడిన ‘వ్యాపృత’ అనే మాట రాజ్యంలోని (Administrative) విభాగాలకు సంబంధించిన కొంత సమాచారాన్ని వెలుగులోకి తెచ్చి చూపెడుతుంది. అప్పటిలో రాజ్యంలోని భూభాగం పరిపాలనా సౌలభ్యం కోసం ‘ఆహారా’ లుగా విభజించబడి, ఒక్కొక్క ‘ఆహారము’ ఒక్కొక్క అధికారి చేతులలో పెట్టబడి వుండేది, ఆ అధికారి హోదాను ‘వ్యాపృత’ నామంతో పిలిచేవారు. ఈ ‘వ్యాపృత’ పదం ‘వియపత’ అన్నరూపంలో అశోకుని శాసనాలలో కనిపిస్తుంది. ఈ పదానికి పాణిని చెప్పిన ఇంకొక రూపమే ‘ఆయుక్త’. ఈ రెండూ కూడా శాతవాహనుల ‘ఆమకు’ లకు, ఆ తరువాతి కాలంలోని ‘విషయపతు’ లకు సమానమైవని చెబుతారు. ఈ ‘వ్యాపృత’ పదానికి ప్రాకృత రూపమైన ‘వాపతమ్’ జయవర్మ వేయించిన కొండముది శాసనంలోనూ, పల్లవ రాజైన యువమహారాజ శివ స్కందవర్మ వేయించిన ‘మైదవోలు’ శాసనంలోనూ కనిపిస్తుంది. దీనిని బట్టీ, మైదవోలు, కొండముది శాసనాలలోని లిపి కూడా ఒకేరకంగా వున్నట్లు అనిపించడాన్నిబట్టీ, బృహత్పలాయన జయవర్మ, యువమహారాజ శివ స్కందవర్మ సమకాలీనులయి వుండవచ్చన్న అభిప్రాయానికి Dr.Hultzsch వంటి లిపి శాస్త్రజ్ఞులు (epigraphists) వచ్చారు!  (పల్లవ యువ మహారాజ శివస్కందవర్మ వేయించిన ఈ ‘మైదవోలు’ తామ్ర శాసనానికి ఆంధ్ర చరిత్రలో ఒక ప్రముఖ స్థానం వుంది. దేశపరమైన ‘ఆంధ్ర’ శబ్దం ప్రయోగం మొట్టమొదటగా ఈ శాసనంలో జరగడం, ఇందువలన ఈయన పరిపాలనా కాలమైన క్రీ.శ.మూడవ శతాబ్దం నుంచే ‘ఆంధ్ర’ శబ్దం దేశ సూచకంగా వాడుకలో వుండినదని ఈ శాసనంలోని ‘అంథాపథీయో’ అనే మాటల వలన తెలియడం, ఈ శాసన ప్రాముఖ్యానికి గల కారణాలు!)

పల్లవ శివ స్కందవర్మ రాజ్యం చేస్తున్న కాలంలో (అంటే క్రీ.శ.మూడవ శతాబ్దం ఉత్తరార్ధంలో) బృహత్ఫలాయనులు వేంగిని పరిపాలిస్తూండే వారనీ, ఇక్ష్వాకులు ఆంధ్ర దేశాన్ని (అంటే శ్రీశైలం, దక్షిణ కోసల మరియు గోదావరీ ఉత్తర కోస్తా తీర ప్రాంతం అంతా కలిసివున్న ప్రదేశాన్ని) పాలిస్తూండేవారనీ కూడా ఒక అభిప్రాయానికి చరిత్రకారులు రావడం జరిగింది.  దీనిని బట్టి చూస్తే, ఇక్ష్వాకుల పరిపాలనా కాలం, బృహత్ఫలాయన జయవర్మ రాజ్యం చేసిన కాలం, పల్లవుల రాజ్య కాలం అన్నీ సమకాలికాలై కనిపిస్తాయి. ఈ రాజుల పరిపాలనా కాలం క్రీ.శ.మూడవ శతాబ్దం!

అయితే, నాణానికి ఒక వైపు లాంటి పై అభిప్రాయానికి, రెండవ వైపు లాంటి వేరొక అభిప్రాయం కూడా వుంది! ఆ అభిప్రాయం ప్రకారం, మైదవోలు శాసనాన్ని యువమహారాజు శివస్కందవర్మ, తన తండ్రి (బప్ప) రాజ్యం చేస్తున్న కాలంలో ఇచ్చాడని, ఈ శాసనంలోని లిపినీ, బృహత్ఫలాయన జయవర్మ ఇచ్చిన ‘కొండముది’ శాసనంలోని లిపినీ పోల్చి చూస్తే, జయవర్మ యొక్క కొండముది శాసనం మైదవోలు శాసనం కంటే కనీసం ఒక తరం ముందుదనీ, కాబట్టి జయవర్మ, పల్లవ శివస్కందవర్మ కంటే కనీసం ఒక తరం ముందు రాజ్యం చేసి వుంటాడనీ కూడా చెబుతారు. చారిత్రకంగా కూడా ఇదే నిజమైనదన్న అభిప్రాయం కూడా వుంది!  కృష్ణకు దక్షిణాన వున్న ప్రాంతాల దాకా కూడా జయవర్మ అధికారం చెల్లిందనీ, ఆ దిగువన అంతా పల్లవ రాజ్యం క్రింద వుండినదనీ కూడా ఇక్కడ నిర్ణయించుకోవచ్చు.

బృహత్ఫలయాన వంశ మూలపురుషుడు ఎవరో తెలుసుకోవడానికి ఏ ఆధారమూ లేదు.  కొండముది శాసనంలో కూడా ఈ ప్రస్తావనలేక పోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాదాపుగా సమకాలీకులైన  పల్లవ, శాలంకాయనుల శాసనాలలో ఈ ఆచారం పాటింపబడి వుండడం ఇందుకు కారణం! కొండముది శాసనంలో, జయవర్మ తన తండ్రి పేరును తెలుపకపోయి వుండడం వలన, జయవర్మ తనకు తానుగానే తన ఒక్కడి కృషిద్వారా రాజ్యాన్ని దక్కించుకుని, తద్వారా బృహత్ఫలాయన వంశానికి మూలపురుషుడై,  ఆ వంశంలో ఒక్కడే ఒక్క రాజుగా చరిత్రలో మిగిలిపోయాడా? అన్న సందేహం కూడా కలుగుతుంది. అయితే, ఈ సందేహం తీరడానికి సరిపోయే ఆధారాలేవీ చరిత్రలో మిగలలేదు, మిగిలినా ఇప్పటివరకూ లభ్యం కాలేదు!

(ఈ చిన్న వ్యాసం వ్రాయడంలో సంప్రదించిన ప్రముఖుల పుస్తకాలు: (1) Early history of the Andhra Country – Dr.K. Gopalachari (2) ఆంధ్రుల చరిత్రము – (ప్రథమ భాగం) – చిలుకూరి వీరభద్రరావుగారు      (3) చరిత్ర చర్చ – ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి.)