శ్రీనాథుడు ఆంధ్రీకరించిన ‘శాలివాహన సప్తశతి’ ఇప్పుడు అలభ్యం. అందులోనివిగా చెప్పుకునే ఐదు పద్యాలు మాత్రమే ఇప్పుడు లభ్యమై ఉన్నాయి. ఈ అయిదింటిలో రెండు వినుకొండ వల్లభరాయని ‘క్రీడాభిరామం’ లో ఉన్నాయి. మిగతా మూడూ విడిగా లభ్యమై ఉన్నాయి. ఈ మూడింటిలో ప్రసిధ్ధమైనది ‘వారణ సేయ దావ గొనవా’ అనే పద్యం. క్రీ.శ.1960 సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మాసాల భారతి సంచికలలో ఈ పద్యం పై ‘తెలుగు మఱుగులు’ శీర్షికన చర్చ జరిగింది. ఈ పద్యానికి మూలమైన ప్రాకృత గాథ పాఠం, దాని సంస్కృత చాయ, చర్చ చివరన పెద్దలు అంగీకరించిన శ్రీనాథుని పద్య పాఠం (ఉత్పలమాల వృత్తంలో) వరుసగా:
“కస్స వ ణ హోఇ రోసో దష్టూయ పియాఏ సవ్వణం అహరమ్
సభమర ఉపమగ్ఘాఇణి వారిఅవామే సహసు ఏహ్మిమ్”
“కస్యవా న భవతి రోషో దృష్ట్వా, ప్రియాయాః సవ్రణ మధరమ్
సభ్రమర పద్మా ఘ్రాణశీలే! వారితవామే! సహస్వేదానీమ్.”
“వారణసేయ దావ గొనవా? నవ వారిజ మందు తేటి క్రొ
వ్వారుచునుంట నీ వెరుగవా? ప్రియ వాతెఱ గంటు కంటి కె
వ్వారికి కెంపు రాదు? తగవా మగవారల దూఱ? నీ విభుం
డారసి నీ నిజం బెరుగు నంతకు నంతకు నోర్వు నెచ్చెలీ!”
శ్రీనాథుని ఈ పద్యం పై ఒకింత ఆసక్తి కరంగా జరిగిన చర్చ సారాంశం ఇది – అప్పటికి (అంటే క్రీ.శ.1960 నాటికి) లభ్యమవుతూండిన ప్రాకృత ‘గాథా సప్తశతి’ లో శ్రీనాథుని ‘వారణ సేయ’ పద్యానికి మూలమైన ప్రాకృత గాథ లేదు. అయితే, ధ్వన్యాలోక ప్రవర్తకుడైన ఆనందవర్ధనాచార్యుని ‘ధ్వన్యాలోకం’ లో ఈ ప్రాకృత గాథ ఉదాహరించబడి ఉంది. ఆనందవర్ధనాచార్యుని ‘ధ్వన్యాలోకా’ నికి అభినవగుప్తపాదులవారి లోచన వ్యాఖ్యలో ఈ ప్రాకృత గాథకు సంస్కృత ఛాయతోపాటు సవిస్తర వ్యాఖ్య ఉంది.
ఈ ప్రాకృత గాథను స్వర్గీయ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు క్రింది విధంగా తెనిగించారు:
“ఎవరి కలుక గలుగదే ప్రియురాలి కె
మ్మోవి కాటుగన్న? ముగుద! తేంట్లు
ముసరియున్న తమ్మి మూరుకొంటివి వల
దన్న వినక! సైపవమ్మ యిపుడు.”
“ఓ చెలీ! వలదని ఎంత వారించినా విన్నావా, చెవిన పెట్టావా? అప్పుడే వికసిస్తూన్న కమలంలో కనిపించకుండా తేనెటీగ మకరందాన్ని చప్పరిస్తూ వుంటుందని నీకు తెలియదా? ఇప్పుడు చూడు, నీ పెదవిపై ఏర్పడిన ఈ గంటు నీ ప్రియునికి (పతికి) కోపం తెప్పించిందంటే తెప్పించదా మరి? ఇందులో అతని తప్పేమున్నది? దానికి అతనితో తగవా? నిజం తెలిసిన మీదట అతని కోపం ఉపశమించి నీ దరి చేరేవరకూ నీవు సహించి ఊరక ఉండవలసినదే, తప్పదు మరి!” అని ఈ గాథ తాత్పర్యం. ఇందులో ధ్వని ఊహకందనిదేం కాదు. ఈ ధ్వని తెలుగులో ఇంకో స్వతంత్ర పద్యానికి కారణమైనదని ఈ క్రింది పద్యం వలన తెలుస్తుంది.
“మాకంద ఫల రసంబుల
నాకలిగొని మేము గ్రోలు నా కొమ్మలలో
చీకటినప్పుడు నొక చిలు
కేగతినో మోవి గఱచె నెఱుగవె చెలియా!”
కవి ఎవరో తెలియని ‘ఉమా మహేశ్వరము’ అనే పేరున్న ఒక అలభ్య కావ్యంలోనిదిగా లభ్యమైన ఒకే ఒక్క పద్యం ఇది. వెల్లటూరి లింగయమంత్రి కృత ‘సరసాంధ్ర వృత్తరత్నాకరం’ అనే ఛందో గ్రంథంలో ఇది ఉదాహరింపబడింది.