తెలుగు మాట, పాట, పద్యం (4)

తెలుగులో శతక సాహిత్యంలో అధిక్షేప శతకానిది ఒక ప్రత్యేకమైన శాఖ అయితే, అందులో వేణుగోపాల శతకానిది ఒక విశిష్ఠ స్థానం అన్నది తెలిసినదే! ఈ శతకాన్ని రచించినది పోలిపెద్ది వేంకటరాయ కవి.  ఇతడు కార్వేటి సంస్థాన కవులలో ప్రముఖుడు అని చెబుతారు.

వేణుగోపాల శతకంలోని పద్యాలలో తెలుగు నానుడులు, సామెతలు అనదగినవి చాలా (పద్యాలకు అనువైన భాషలో)  పద్యాలలోకి ఎక్కి కనబడతాయి. వాటిలో కొన్ని మంచివాటిని పద్యాలలోంచి ఏరి విడిగాతీసి చూపించడం ఇక్కడ జరిగింది:

పొరుగూరి కేగిన పోవునే దుర్దశ
కాదె పెండిలి సన్నికల్లు దాచ
డొంకల డాగ పిడుగుపాటు తప్పునే    (డొంకలలో దాక్కుని పిడుగుపాటునుంచి తప్పుకోగలమా? అని)
కాలడ్డ నిలుచునే గాంగ ఝరము       (గంగా ప్రవాహాన్ని కాలడ్డుపెట్టి ఆపగలమా?)
ఇంకిపోవునే అనావృష్టి జలధి            (దేశంలో అనావృష్టివలన సముద్రం ఇంకిపోతుందా?)
అర్కుడుదయింప చెడునె గుహా తిమిరము  (గుహలో చీకటి సూర్యోదయంతో తొలుగుతుందా?)

పెట్టిపోసిన నాడె చుట్టాల రాకడ
సేవ చేసిన నాడె క్షితినాదు మన్నన
విభవంబు గల నాడె వెనువెంట తిరుగుట   (ఇవన్నీ సమానార్ధకాలే!)

‘అభావ విరక్తి’ అని ఒక అవస్థ వుందని, దానికి ఈ క్రిందివి వుదాహరణలనీ ఒక పద్యంలో చెప్పి…

శక్తి చాలని నాడు సాధుత్వం వహించడం
విత్తహీనుడు ధర్మ వృత్తి తలచడం
వ్యాధి పీడితుడు దైవతాభక్తి దొరలాడడం
పని పోవ మౌనవర్తనం దాల్చడం
రమణి లేకున్న విరక్తి మంచిది అనడం
భారము పైబడ్డ (పుడు) బరువెఱుంగడం (బరువు గుఱించి ఉపన్యాసాలివ్వడం)…

ఇత్యాది ‘అభావ విరక్తు’ ల వలన, తత్కాల విరక్తుల వల్ల ఫలితంలేదంటూ….

తినక చవి చొరకయె లోతు తెలియబడునె (తినక రుచి, దిగక లోతూ తెలియడం సాద్యం అవుతుందా?) అనే సామెత చెప్పబడింది.

ఆశకు ముదిమియు అర్ధికి సౌఖ్యంబు
ధనపరాయణునకు ధర్మచింత
అల్పవిద్యునకు అహంకారదూరత
పాపభీరుత సంతానబాహ్యునకు
కలదనెడువార్త కలదె లోకములయందు… (దీనికి ఏమీ వివరణ అవసరంలేదు కదా!)

ఈతకు మిక్కిలి లోతు లేదు
కవిజనంబుల కెఱుంగనివి లేవు

మెఱుపు దీపంబౌనె మేఘంబు గొడుగౌనె
అల యెండమావులు జలంబు లౌనె
కాని వస్తువు పట్టుకో కాంక్షచేత
పెనుగు మాత్రంబెగాని లభింపదేమి….

పొయిపాలికే పాలు పొంగుటెల్ల
ఆఱిపోయెడి దివ్వె కధిక దీప్తి
కట్టనిల్వని చెర్వు గడియలోపల నిండు
బ్రతుకజాలని బిడ్డ బారెడుండు
పెరుగుటయు విఱుగుటకని యెఱుగలేక
అదిరిపడుచుండు నొక్కొక్క అల్పజనుడు….

వలపు రూపెరుగదు
ఆకలిలో నాల్క అరుచి యెరుంగదు
కోపం బెదుటి గొప్పకొద్దు లెఱుంగదు
నిదుర సుఖం బెఱుంగదు
హరునకైనను నివి గెల్వ నలవికాదు
ఇతరులైనట్టి మానవులెంతవారు….

పైన చూపినవన్నీ అదనంగా వివరణ యేమీ అవసరంలేకుండానే అర్ధమయ్యేవీ,  తక్కువ మాటలలో చక్కటి నిజాలను చెప్పేవీను! వాటిల్లో కొన్ని ఇప్పటికీ  సామెతలుగా అదపాదడపా నిత్యవ్యవహారంలో పెద్దవాళ్ళనోట వినిపిస్తూనే వున్నాయి కూడానూ!

*****

తెలుగులో అధిక్షేప శతకాలు రచించిన వారిలో కూచిమంచి తిమ్మకవి, జగ్గ కవి అని ఇద్దరు కవులున్నారు.  వీరిద్దరూ అన్నదమ్ములని తెలుస్తూనేవుంది కదా! కూచిమంచి తిమ్మకవి రచించిన శతకం శ్రీ భర్గ శతకం, జగ్గ కవి రచించిన శతకం శ్రీ భక్తమందార శతకం. వీరు  క్రీ.శ.18 వ శతాబ్దానికి చెందిన వారు. వీరిలో కూచిమంచి జగ్గకవి తెలుగులో మొట్టమొదటి అధిక్షేప ప్రబంధకర్తగా ప్రసిధ్ధుడు.  ఆ ప్రబంధం పేరు ‘చంద్రరేఖా విలాపము’. ఇందులోని కవిత్వ స్థాయిని C.P.Brown దొర కూడా మెచ్చుకున్నాడని ఎక్కడో చదివినట్లు గుర్తు.

ఆ సంగతి అలా వుంచి, ప్రస్తుత విషయానికి వస్తే – వీరిరువురు రచించిన అధిక్షేప శతకాలను  ఇప్పుడు తలుచుకోవడానికి కారణం, వీరిరువురూ వారి శతకాలలోని పద్యాలలో వాడిన పరభాషా పదాలను గుఱించి ముచ్చటించుకోవడానికి! పరభాషా పదాలలో వీరు మక్కువపడి అన్నట్లుగా ఒకటికి రెండుసార్లు వాడిన పదం  ‘ఇల్ల’. ఈ పదం తమిళ భాషలోనిది.  ‘లేదు’ అని తమిళంలో ఈ మాటకు అర్ధం. ఎందుకు అంత మక్కువపడి ఈ పదాన్ని వీరు వాడారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. ‘ఇల్లె’ అనే ఈ మాటకు బదులు తెలుగు పదం ‘లేదు’ అన్నది వాడొచ్చు, ఛందోభంగం ఏమీ కాదు. (సుఖం ఇల్లె, సుఖం లేదు – తేడా ఏమీ లేదు).

“కోపంబెక్కువ; తాల్మి యిల్ల, పరుషోక్తుల్ పెల్లు, సత్యంబు తీల్”

కూచిమంచి తిమ్మకవి – శ్రీ భర్గ శతకము లోనిది ఈ శార్దూల పద్య ప్రథమ పాదం. ఈ పాదంలో  చివరిపదం   ‘తీల్’ అనేది కూడా పరభాషా పదమే, జగ్గకవి భక్తమందార శతకంలోని ఒక పద్యంలో ఈ పదం ‘తీర్’ అని కనిపించింది, నేను చూసిన పుస్తకంలో.  ఇది అచ్చు తప్పు అయివుండాలి. ఈ పదం తీల్/తీర్ ఏ భాషా పదమోగాని, అర్ధం మాత్రం ‘లేదు’ అనే అన్నది సందర్భాన్ని బట్టి అర్ధమై పోతుంది!

కూచిమంచి జగ్గకవి రచించిన శ్రీ భక్తమందార శతకం నుండి ఈ క్రింది పద్య పాదాలు:

“దానంబిల్లె, దయారసంబు నహి, సద్ధర్మంబు తీర్, మీపద
ధ్యానంబున్ గడులొచ్చు…..”

“క్రతువుల్ సేసెదనంటినా, బహుపదార్ధంబిల్లె!…”

అదలా వుంచితే, కూచిమంచి జగ్గకవి భక్త మందార శతకంలో నాకు బాగా ఆసక్తి కరంగా అనిపించిన ఒక మాట ‘దేమస’ అనే మాట. ఈ మాట బ్రౌన్ నిఘంటువులోనికి కూడా ఎక్కలేదు. ఇది ఇప్పుడు ‘తమాషా’ అన్న అర్ధంలో వాడకంలో వుంది.  భక్తమందార శతకంలోని ఆ పద్యం, మత్తేభం:

“రసికోత్తంసులు సత్కులీనులు మహాద్రాఘిష్ఠ సంసార ఘో
రసముద్రాంతరమగ్నులై దరికి జేరన్ లేక విభ్రాంతిచే
పసులం గాచిన మోటుకొయ్య దొరలం బ్రార్ధింతు రెంతేని దే
మసగాదే యిది యెంచిచూచినను రామా! భక్త మందారమా!”

సామెతలూ, వాటి సంగతులు(5)

నీతి లోకానుభవ ప్రతిబింబము. లోకోక్తులే క్రమముగా నీతులు అవుతున్నాయి. లోకోక్తులకు లోకానుభవం నుంచి తెలుసుకున్న నిజాలు, నేర్చుకున్న పాఠాలూ ప్రాతిపదిక. ‘ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలువుతాయి’ అన్న సామెతకు కూడా లోకానుభవం నుంచి తెలుసుకున్న నిజమే ప్రాతిపదిక.

పూర్వ కాలంలో, వ్యాపారం రెండు విధాలుగా జరెగేది. చిన్న చిన్న వ్యాపారులు వస్తువులను బళ్ళమీద ఒక ఊరి నుండి ఇంకొక వూరికి తిప్పుతూ చేసే చిల్లర వస్తువుల వ్యాపారం ఒకటి. రెండవ రకం, బాగా ధనవంతులైన వ్యాపారులు ఓడల మీద సరుకులను విదేశాలకు తీసుకువెళ్ళి చేసే వ్యాపారం. దైవం అనుకూలించనప్పుడు, అదృష్టం కలిసిరానప్పుడు, సముద్ర యానంలో సంభవించిన ఏ తుఫాను లోనో సరుకులను తీసుకెళుతూండిన  ఓడలు గల్లంతై పెద్ద పెట్టున నష్టపోయి తెల్లవారేసరికల్లా ధనవంతుడు దరిద్రుడై మిగలడం, దేశంలో పొరుగూళ్ళలో చేస్తూండిన చిన్న సరుకుల వ్యాపారమే దైవం అనుకూలించడం వలన బాగా కలిసొచ్చి కొద్ది రోజుల్లోనే బాగా ధనవంతుడై బళ్ళలో చేస్తూండిన వ్యాపారం వృధ్ధి చెంది ఓడల కెక్కి విదేశాలకు మళ్ళడం లాంటి సందర్భాలూ సన్నివేశాలూ నిజజీవితంలోనివి కథలలో కెక్కి కనిపిస్తూంటాయి.

‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి’ అన్న సామెత ఇలాంటి దృష్టాంతాలనుంచి పుట్టిందే. ఇందులో, కాలం కలిసొస్తే బండి ఓడవడం, కలిసి రానప్పుడు ఓడ బండవడం సరియైనది. అయితే, సుమతీ శతక కర్త అయిన బద్దెన మంత్రి ఈ సామెతను కలిమి లేముల్లాగా ఓడలు బళ్ళ మీదా, బళ్ళు ఓడల మీదా వస్తాయి అంటూ కలిమి లేముల ప్రసక్తి తెచ్చి వాటి రాకపోకలను అన్వయించడానికి చేసిన ప్రయత్నంలో, అన్వయం అంత బాగా కుదరక పోయినప్పటికీ, లోకం సరిపెట్టుకుంది. కానీ, భాస్కర శతక కర్త అయిన మారయగారి వెంకయ గారు దీని అర్ధాన్నే పూర్తిగా మార్చి వేశాడు. కష్టాల్లో పరస్పర సహకారం అన్న అర్ధంలో దృష్టాంతంగా దీనిని వాడాడు.  సరిపెట్టుకుందామని చూసినా సరే, సరిగా అన్వయం కుదరని సందర్భం ఇందులోది. నీటిపై ఓడలో బళ్ళు ప్రయాణించడం, నేల మీద బళ్ళపై ఓడలు ప్రయాణించడం లోకానుభవానికి దృష్టాంతాలుగా సాధారణంగా దొరికే సన్నివేశాలు కావు. అందువలన, సుమతీ శతకంలోనూ, భాస్కర శతకంలోనూ వాడబడిన రూపాలు సరియయినవి కావు. అన్వయానికి కుదరని రూపాలని తేలుతుంది.

లోకానుభవాలను సామెతల రూపంలో నీతి బోధకాలుగా చెప్పే ప్రక్రియలో, అతి తక్కువ మాటలలో చెపాల్సిన విషయాన్ని చెప్పడానికి వీలుగా మాటల్ని వడపోసి వడపోసి కూర్చగా అయినవే సామెతలు.  వాటిలో వ్యర్ధ పదాలూ, అర్ధ రహితమైన మాటలు సాధారణంగా ఉండవు.  ప్రతి మాట వెనుకా ఏదో బలమైన కారణం, అర్ధవంతమైన అనుభవ సారం తప్పకుండా ఉంటుంది. అందువల్ల ఈ సామెత ‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి’ అన్న రూపమే అసలైనదీ, లోకానుభవ సిధ్ధమైనదీను!

సామెతలూ, వాటి సంగతులు(4)

“ఓడల బండ్లును వచ్చును
ఓడను నాబండ్ల మీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు కలిమిలేమి వసుధను సుమతీ!”

సుమతీ శతకం లోని ఈ పద్యంలో కూడ ఈ ‘ఓడలు బండ్ల’ సామెత వాడబడి కనిపిస్తుంది. ఇందులో కూడా ఓడలు బండ్ల మీదా, బండ్లు ఓడల మీదా వస్తాయి అన్న అర్ధంలోనే సుమతీ శతకకారుడైన బద్దెన మంత్రి కూడా వాడాడు. అయితే, జీవితాల్లో కలిమి లేముల రాకపోకలతో  తారుమారవుతూండే పరిస్థితులను సూచించే అర్ధంలోనే బద్దెన ఈ సామెతను వాడాదన్నది స్పష్టం.

సుమతీ శతక కర్తృత్వ విషయంలో వివాదములున్నప్పటికీ, ఇది బద్దెన చేత వ్రాయబడినాదిగానే ప్రసిధ్ధం.  జనసామాన్యం చేత బద్దెన అని పిలవబడిన భద్ర భూపతి క్రీ.శ.13వ శతాబ్దానికి చెందిన వ్యక్తి.  కనుక సుమతీ శతకం కూడా 13వ శతాబ్దానికి చెందినదే అనుకుంటే, ఈ సామెత చరిత్ర కూడ 13వ శతాబ్దం కంటె వెనకకు వెళుతుంది. లోకంలో బహుళ ప్రచారంలో ఉంటేనే కదా, పద్యాలలోకి ఎక్కేది! అయితే, అప్పట్లో ఈ సామెత బద్దెన చేత పైన సూచించిన అర్ధంలో వాడబడితే, భాస్కర శతక కర్త అయిన మారయగారి వెంకయ చేత తన పద్యంలో వేరే అర్ధంలో, అంటే కష్టాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం అన్న అర్ధం సూచితమయ్యేలా వాడాడు. దీని వలన  ఈ సామెత అర్ధాన్ని గురించి పండితులలో అప్పటికే అభిప్రాయ బేధాలు ఉన్నాయని అనుకోవాల్సి ఉంటుంది. అయితే, చివరికి సుమతీ శతక కర్తయైన బద్దెన సూచించిన అర్ధమే జనామోదం పొంది నిలిచిపోయిందని కూడా అనుకోవాల్సి ఉంటుంది. ఇరువురి పద్యాలలోనూ ఈ సామెత ఉన్న రూపం ఒకటే. ‘ఓడలు బండ్ల మీద వస్తాయి, బండ్లు ఓడల మీద వస్తాయి’ అని. ఇందులో ‘రావడం’ అన్నదే గాని ఇప్పుడున్న విధంగా ‘అవడం’ లేదు. పద్యంలో ఛందస్సు కోసం ‘వచ్చు’ ను చేర్చి ఉన్నట్లయితే, ఆ తప్పు మొదటగా సుమతీ శతక కర్తయైన బద్దెనదే అవుతుంది. అలా కాకుండా, అవసరమైనప్పుడు ‘ఓడలను బండ్లు లాగుతాయి, బండ్లను ఓడలు లాగుతాయి’ అన్నట్లుగా ఉండిన ఈ సామెత, వాడకంలో కాల క్రమేణా అసలు రూపం పోగొట్టుకుని ‘లాగుతాయి’ కాస్తా ‘లావుతాయి’, ‘లవుతాయి’ గా మారి, చివరికి ‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి’ అని మారి ఉన్నట్లయితే, ఈ రూపమే జనసామాన్యనికి ఇష్టమైనదిగా అనుకోవాల్సి ఉంటుంది.

ఏదేమైనా, అదృష్టాలు మారితే సంపన్నుడు బికారి కావడం, బికారి సంపన్నుడు కావడం అన్న సందర్భానికి సరిపోయేట్లుగానే ఈ సామెత ఇప్పుడు మిగిలి ఉంది.

సామెతలూ, వాటి సంగతులు (3)

“ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి” అని తెలుగులో ఒక సామెత ఉంది.  దీనిని అదృష్టం కలిసి రాకపోతే పరిస్థితులు తారుమారై ఈ రోజు భాగ్యవంతుడు రేపటికల్లా బికారి కావచ్చు, ఈ రోజుటి బికారి రేపటికి భాగ్యవంతుడు కావచ్చు గనుక మనిషిని మనిషిగా గౌరవించాలి గాని ఉన్న సంపదను చూసుకుని మిడిసిపడడం తగదు అన్న అర్ధంలో ఒక హెచ్చరికగా వాడ బడుతోంది.

తెలుగులో ఈ సామెత  భాస్కర శతకం రచించ బడిన రోజుల నుంచీ ఉంది.  దీనికి నిదర్శనం భాస్కర శతకంలోనే ఉంది.  భాస్కర శతకంలో మూడవ పద్యం:

“అక్కరపాటు వచ్చు సమయంబున జుట్టము లొక్క రొక్కరి
న్మక్కువ నుధ్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమే సుమీ
యొక్కట; నీటిలో మెరక నోడల బండ్లను బండ్లనోడలున్
దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా!”

బేధమల్లా, ఈ పద్యంలో భాస్కర శతకకర్తగా భావింప బడుతూన్న మారయగారి వెంకయ ఇప్పుడు వాడబడుతూన్న ‘ఓడలు బళ్ళు అవుతాయి’ అన్నరూపంలో కాకుండా, ‘ఓడల బండ్లు వచ్చుట’ అన్న రూపంలో వాడాడు. అర్ధం విషయంలో సందేహం లేకుండా స్పష్టత కోసంగా ‘నీటిలో, మెరక’ అన్న పదాలు గూడా వాడాడు.  దీనిని బట్టి చూస్తే ఈ సామెత పూర్వం ‘ఓడలు బళ్ళు లాగుతాయి, బళ్ళు ఓడలు లాగుతాయి’ అన్న రూపంలో ఉండి, రాను రాను ‘ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి’ అని మారినట్లుగా కనిపిస్తుంది.

భాస్కర శతకంలో ఈ సామెత వాడబడిన సందర్భములో విశదమయ్యే అర్ధానికీ, ఇప్పుడు వాడ బడుతూన్న అర్ధానికి కూడా తేడా కనిపిస్తుంది.  భాస్కర శతకంలో ఇది ‘ఆపత్కాలంలో పరస్పర సహకారం’ అన్న అర్ధంలో వాడబడి కనిపిస్తూండగా, ఇప్పుడు దానికి సంబంధం లేని అదృష్టంతో తారు మారు కాగలిగే పరిస్థితులకు సూచకంగా వాడబడుతోంది.

సామెతలూ, వాటి సంగతులు(2)

నగవు

ఆస్తులు పోగొట్టించిందొక నగవు
నిండు సభలో వలువలు ఒలిపించిందదే నగవు
ఆపై అడవుల పాల్జేసిందీ అదే నగవు…

దోసిట నెత్తురు తర్పణపట్టించుకొందొక నగవు
ఆపై తరుణి తలవెంట్రుకలకు పూయించిందీ అదే నగవు…

తొడ కొట్టించిందొక నగవు
ఆపై తొడలు విరగకొట్టించించుకుందీ అదే నగవు…

రాజసూయావసరాన తలతీయించుకుందొక సుదీర్ఘ నగవు
తలనూ మీసాలనూ అర్ధభాగం గొరిగింపించుకుందింకొక అనర్ధావేశపు నగవు…

భూభవను నిలిచునున్న నేలతోసహా
పెకలింపించి అకాశమార్గాన లంక చేర్చిందొక అనౌచిత్యకార్యపు నగవు…

తోకకు నిప్పంటింపించుకొందొక తృణీకారపు నగవు
ఆపై ఆ తోకనే అంత లంకనూ తగులబెట్టింపించుకొందొక అహంభావపు నగవు…

నగవులేగా తొలినించీ తగవులన్నిటినీ తెగనివ్వని తప్పిదాలు
ఆవంకనేగా మరింకొకటి రెండు జతచేసి
‘నవ్వు నాలుగు విధాల చేట’న్న నానుడి చేశారు పెద్దలు!

సామెతలూ, వాటి సంగతులు.

‘ఒక సంగతికి దృష్టాంతముగా లోకులు వాడుకగా చెప్పే మాట’ అని తెలుగు సామెతకు బ్రౌణ్య నిఘంటుకారులు ఇచ్చిన నిర్వచనం.  లోకులు వాడుకగా చెప్పే మాట గాబట్టి సామెతకు ‘లోకోక్తి’ అని ఇంకొక పేరు. సంభాషించేటప్పుడు సందర్భానికి తగినట్లుగా సామెతను తగిలించి సంభాషించడం ఒక కళ. దీనికి సామెతల మీద తగినంత పరిజ్ఞానం ఉండడమే కాకుండా, తగినన్ని సామెతలు బుధ్ధిలో నిక్షిప్తమై ఉండాలి. అవసరానికి తగినట్లుగా అవి జ్ఞాపకం రావడంగూడా అంతే ముఖ్యం.  నిన్న మొన్నటిదాకా, కొంతమంది పెద్దల సంభాషణలలో, వ్రాతలలో సామెతల వాడకం చాలా విరివిగా కనిపించేది.  ఏకారణంచేతనో ఇప్పుడది కొంత తగ్గిందనే చెప్పాలి.  సామెతలు మౌఖిక సాహిత్యంలో ఒక భాగం.  వాటిని కాపాడుకోవడం, వాడకాన్ని పునరుధ్ధరించడం, పెంచడం భాషాభివృధ్ధి దృష్త్యా ఒక అవసరం.

ప్రతి సామెత పుట్టుకకూ మూలమై  తప్పనిసరిగా చిన్నదో, పెద్దదో ఒక కథ ఉంటుంది.  బ్రౌణ్య నిఘంటుకారులు దీనినే తమ నిర్వచనంలో ‘సంగతి’ అన్నారు.  ఈ కథకు లేదా సంగతి కి అత్యంత సంక్షిప్త రూపంగా సామెత పుడుతుంది.  ఉదాహరణకు:

కసి తీరక మసి పూసుకున్నాడు” అనే సామెత. మన్మధుడిని దగ్ధం చేసినా పరమశివునికి కోపంతీరక ఆ బూడిదను ఒంటికి రాసుకున్నడట.  ఈ సామెత పుట్టుకకు ఈ సంగతి మూలం.

పెన్న దాటితే పెరుమాళ్ళ సేవ” అని ఒక నానుడి ఉంది.  దీనికి మూలం పెన్నానది తీరాన గల (నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం – దొడ్ల వారి సంస్థానం) రంగనాధుని ఆలయంలో జరుగుతూండిన నృత్యసేవ అట.

హంస కుయ్యగానే ఛస్తుందని” ప్రతీతి.  దీనికి దృష్టాంతమేదో తెలియదు.

మనం సర్వ సాధారణంగా వినే “గాదిద గుడ్డు, కంకర పీసూ” అనే నానుడి.  ఇది God the good! Conquer peace! అనే ఆంగ్ల లోకోక్తి కి అపభ్రంశ, గ్రామ్య రూపంగా తెలుస్తుంది. ఇక -

“ఇరుసున కందెన బెట్టక పరమేశ్వరుని బండియైనా బాఱదు”

తినక తీపూ చేదూ తెలియవు, దిగక లోతూ పాతూ తెలియవు”

“బాధ వచ్చు దినములును భాగ్యము వచ్చు దినములును తెలియవు.”

ఇలాంటి సామెతలకు వేరే దృష్టాంతాలు అవసరంలేదు. సర్వ జనావళి నిత్యానుభవాలే ఈ సామెతల పుట్టుకకు దృష్టాంతాలుగా చెప్పుకోవచ్చు.