“ఉ. శారదరాత్రు లుజ్జ్వలలసత్తర తారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధ బంధురో
దారసమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచిపూరములం బరిపూరితంబులై.”
తెలుగు పద్యం ఒక పధ్ధతిగా నన్నయతోనే మొదలైంది. నన్నయచే ఆంధ్రీకరించబడిన మహాభారత భాగంలో, అరణ్యపర్వం, చతుర్ధాశ్వాసం 142వ పద్యం ఇది. నన్నయ చివరి పద్యం.
“వర్షాకాలం గడిచి, చలి కాలం అప్పుడప్పుడే మొదలౌతున్న రోజుల నాటి రాత్రులు. చంద్రుడు కర్పూర పరాగం లాంటి వెన్నెలను కురిపిస్తున్నాడు. ఇలాంటి చంద్రుణ్ణి చూసి అప్పుడే వికసించినటువంటి తెల్లకలువల నుంచి వెలువడుతూన్న గంధాన్ని తనలో కలుపుకుని గాలి మత్తుగా వీస్తొంది. అలా కాస్తూన్న వెన్నెలనూ ఇలా వీస్తూన్న గాలినీ వహించి చుక్కలు మైమరచి మెరుస్తూంటే ఆ మెరుపులో రాత్రులు ఇంకా మెరిసిపోతున్నాయి” అన్నది ఈ పద్యపు భావం.
పై ఫొటోకి తెలుగులో పద్యాన్ని ఊహించుకుంటున్నప్పుడు, నా మనస్సులో మెదలిన పద్యం నన్నయగారి ఈ పద్యం. పై ఫొటోలో వెన్నెల ఎంతగా కనిపిస్తుందో నేను చెప్పలేనుగాని, నన్నయగారి ఈ పద్యం నిండా వెన్నెల పరుచుకుని కనిపిస్తుంది.
ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వర్ణించడానికి అంతే అహ్లాదకరమైన చింతనలో మనసుండాలి, చిత్తంతో మనిషుండాలి. ఈ పద్యం లిఖించేటప్పుడు నన్నయగారు కూడా అంతే ఆహ్లాదకరమైన చిత్తంతో వుండి వుంటాడని నేననుకుంటాను. అప్పటికిక స్వస్తి చెప్పుకుని, మిగతాది మరుసటి దినానికి వాయిదా వేసుకుని, మామూలుగానే నిద్రకుపక్రమించి వుంటాడనీ నేననుకుంటాను. అయితే, తెల్లవారేసరికి పరిస్థితులు మారిపోయాయి. అలా మారిన ఆ పరిస్థితులు ఎలాంటివో, ఆ మారిన పరిస్థితులు నన్నయ భారత ఆంధ్రీకరణం అర్ధంతరంగా ఆగిపోవడానికి ఎందుకు దారితీశాయో ఇదమిధ్ధంగా తేల్చి చెప్పుకోవడానికి సరిపడా ఆధారాలేవీ చరిత్రలో మిగలలేదు. అది ఇప్పటికీ ఒక mystery గానే మిగిలిపోయింది.
ఏదేమైనా, నన్నయ చివరి పద్యం ఒక బధామయ సన్నివేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని నాకనిపిస్తుంది. ఆ బాధకు ఒక కారణం ఆ పద్యంలో నిండుగా వున్న ఆహ్లాదకరమైన సన్నివేశమే అని కూడా నేననుకుంటాను! తాను వెన్నెలలాగా నిండుగా మెరుపులు కురిపిస్తూ, తన వెనుక ఎంతకూ వీడని ఒక చిక్కుముడిలాంటి చీకటినీ, రహస్యాన్నీ బంధించి దాచి ఉంచడం లాంటిది ఆ సన్నివేశం!!
