“సురకాముకజనమనోహారిణీ వరూధినీ! ఆ
ధరామరవర వేషధారుని వంచనాకృతి నీ
ఎరుకకు రాదుకదా ఏనాటికీ! హా! ఎంతటి పా
మరకాంతనైన నీసాటి ఏమరుపాటు కందుమే?”
వరూధిని, అహల్య – వీరిరువురూ ఒకేరకమైన మోసానికి గురియైనవారు. తేడా ఒక్కటే. అహల్యకు అది వెంటనే తెలిసింది. వరూధినికి ఎప్పటికీ తెలియలేదు. తెలిసిన ఆమె పాషాణమైపోయి మిగిలింది. ఆమెను మామూలు మనిషిని చేయడానికి మళ్ళీ దేముడే వేరే అవతారంలో రావల్సివచ్చింది. తెలీని ఈమె ఏబాధా లేకుండా జీవనం సాగించింది. మనుజన్మానికి కూడా కారణమైంది. ఇందులో ఇంతకీ తెలియవచ్చిందేమిటి? తెలియడంలో సుఖముందా? తెలియకపోవడంలో సుఖముందా? జ్ఞానం మంచిదా? అజ్ఞానం మంచిదా? అజ్ఞానమే క్షేమదాయకమని అనిపిస్తుంది ఈ దృష్టాంతంలో! Ignorance always turns out to be a bliss! అంచేతా, అజ్ఞానమే ఆనందానికి హేతువనీ,
“కించిదవజ్ఞానమేగా విజ్ఞానసుజ్ఞానములన్
మించి ఎంచిజూడగను రంజత్కరమౌ నిలలోన్!”
అని ఎవరైనా ఆశువుగా తెలుగులో శ్లోకం చెప్తే, అలోచించాలి తప్ప చెప్పిన వారిపై ఒక్కపెట్టున ఎగిరిపడగూడదనుకుంటా!
శ్రీనాథుని దొరకకుండాపోయిన ‘శాలివాన సప్తశతి’ లోని ‘వారణసేయ దావగొనవా?’ పద్యపు నడకను దృష్టిలో పెట్టుకుని పారడీగా చెప్పిన పద్యం పైది. పారడీ రెండు రకాలుగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు. పద్యంగానీ, వచనంగానీ మాటల వొరవడికి ఇమిటేషనుగా చెప్పేది ఒకరకం. రెండోది, ఒక రచయితదో రచయిత్రిదో శైలికి, రచనలలోని overall philosophy కి పారడీగా చెప్పేది. సరిగ్గా చెప్తే, రెండూ అందగిస్తాయి. విశ్వనాథవారిని ‘పాషాణ పాక ప్రభో’ అని పిలవగలిగిన దమ్మున్న జరుక్ శాస్త్రి, ఆ ఒక్కమాటే అనేసి ఊరుకోలే! దానికి తగ్గట్టు ఇనపముక్క లాంటి ఒక పద్యంగూడా చెప్పాడు. ఆ పద్యం ఇది:
“కించిత్ తిక్త కషాయ బాడబ రస క్షే పాతిరే కాతి వా
క్సంచార ప్రచయావకాశములలో కవ్యుద్ఘ! గండాశ్మముల్
చంచల్లీల నుదాత్త వాగ్గరిమతో సాధించి వేధించుమా!
పంచారించి ప్రవహ్లికావృతి కృతిన్ పాషాణ పాక ప్రభో!”
ఇంత దిట్టమైన పద్యంచెప్పగల ప్రతిభ వున్నవాడు కాబట్టే, జరుక్ శాస్త్రి ‘వాగుడు’ ని ఎంతెంతవారైనా సహించి ఊరుకున్నారు. విశ్వనాథవారి ఏఒక్క పద్యానికో ఇది పారడీ కాదు. స్థూలంగా వారు పద్యంచెప్పే రీతి మొత్తానికి పారడీ! ఇక పద్యానికి పద్యం, పాటకు పాట లేదా మాటకు మాటగా చెప్పే పారడీకి జరుక్ శాస్త్రిదే ఇంకో ఉదాహరణ శ్రీశ్రీ ‘సిందూరం రక్తచందనం కావాలోయ్’ గేయానికి పారడీ, బాగా ప్రసిధ్ధి చెందిందే:
“మాగాయా కందిపచ్చడీ, ఆవకాయా పెసరప్పడమూ
తెగిపోయిన పాతచెప్పులూ, పిచ్చాడి ప్రలాపం, కోపం
వైజాగ్ లో కారా కిళ్ళీ, సామానోయ్ సరదా పాటకు!”
ఈ గేయానికి ‘సరదా పాట!’ అని పేరు కూడా పెట్టాట్ట జరుక్ శాస్త్రి.
‘మొదట్నించీ అందులో ఏదో ఉందనిపిస్తూ, చివరికొచ్చే సరికి ఏమీ లేకుండా వేళ్ళాడబడిపోయేదే భావకవిత్వం అంటే!’ అని ఒక అభిప్రాయం చాలరోజులక్రిందట భావకవిత్వాన్ని నిరసించిన ఒకవర్గం కవులలో ఉండేదట. భావకవిత్వం అంటే తెలుగులో కృష్ణశాస్త్రి (కృష్ణశాస్త్రే) జ్ఞాపకానికొస్తాడు. ఆ కారణంచేత, భావకవిత్వం మీద విమర్శ కూడా మొదట కృష్ణశాస్త్రికే తగులుతున్నట్లుగా అనిపిస్తుంది. అనంతపంతుల రామలింగస్వామిగారని ఒక పారడీ కవి చెప్పిన ఈ క్రింది పద్యం కృష్ణశాస్త్రి కవిత్వాన్నే కాక భావకవిత్వ ధోరణిలో వెలువడిన కవిత్వానికంతటికీ ఒక హేళణ, ఒక చక్కటి పారడీ!
“రెండు కాకులు కూర్చుండె బండమీద;
ఒండెగిరి పోయె; అంత అందొండు మిగిలె
రెండవది పోయె; పిదప అందొండు లేదు
బండ మాత్రము పాప మందుండి పోయె!”