(8)
గంగనూ, హిమాలయాలనూ దాటి ఆవల పీఠభూమిని చేరుకుని, ఒకరి వెనుకాల ఒకరంగా, ఆరుగురమూ కొన్ని నెలల పాటు నడిచాం. నడిచి నడిచి, చివరకు ఒక రోజు, ఇక నడిచే సత్తువ లేక అందరికంటే ముందు నేను కుప్పకూలి పోయాను. నా తరువాత వరుసగా భీమార్జున నకుల సహదేవులూ పడి పోయారు. ఒక్క ధర్మరాజు, ఆయన వెనుక అనుసరిస్తూ ఒక శునకమూ ముందుకు సాగిపోయారు.
పడిపోయినా నేనింకా స్పృహలోనే ఉన్నాను. కళ్ళు మూసుకు పోతున్నాయి. శరీరంలో సత్తువ పూర్తిగా నశించి, మరణానికి అతి చేరువలో ఉన్నట్లు నాకు అర్ధమైంది. ఆ స్థితిలో, నాకు కొంచెం దూరంలో ఏదో ఈడ్చుకు వస్తున్నట్లు శబ్దం, ఆ అనంత నిశ్శబ్దంలో వినిపించి నన్ను భయ కంపితురాలిని చేసింది. ఆ శబ్దం అంతకంతకూ చేరువై, చివరకు “నేను, భీముడను” అని చెప్పే వరకూ నా శరీరం కంపిస్తూనే ఉంది. భీముని ఆ మాటతో ప్రాణం కాస్తంత పదిల పడి, కనులు తెరిచి చూసే ప్రయత్నం చేశాను. కుదర లేదు. “చూశావా…అర్జున, నకుల సహదేవులు మువ్వురూ….” అన్నాడు భీముడు. అర్ధమైంది. “అన్న ధర్మజుడు ఇంకా నడుస్తూ వెళ్ళి పోయాడు. నీవూ, నేనూ ఇలా మిగిలాం. బాధగా ఉన్నదా పాంచాలీ?” అన్నాడు భీముడు.
“తప్పని ఈ పరిస్థితికి బాధెందుకు? అయినా, నీవు పక్కన ఉండగా నాకు బాధేమిటి?” కష్టం మీద గొంతు పెగుల్చుకుని అన్నాను. “అవును, నీ కోసం నేనేమైనా చేస్తాను. చెప్పు, ఇప్పుడు ఏమి చెయ్యమంటావ్?” అడిగాడు భీముడు. నేను నవ్వే ప్రయత్నం చేస్తూ అన్నాను “నాకు తెలుసు. నా కోసం నువ్వేమైనా చేస్తావు. భూమికి చెందిన పురుషుడివి నువ్వు. భూమికి చెందిన పడతిని నేను. మన ఇరువురి లక్షణాలూ ఒకటే. అందుచేత మిగిలిన నలుగురి కంటే నీకే నేను బాగా అర్ధమయ్యాను. నీలాంటి పురుషుడిని పుత్రునిగా కన్న స్త్రీ, పతినిగా పొందిన స్త్రీ ఇద్దరూ సుఖ పడతారు. మన ఆరుగురకూ మరో జన్మంటూ ఉంటే, ఆ జన్మలో నువ్వు అగ్రజుడిగా పుట్టు. నీ నీడలో మనం అందరం సుఖంగా ఉందాం!”.
ఇవి నా ఆఖరు మాటలు. ఆ తరువాత…
(సమాప్తం)