రాజరాజు – నన్నయ (4) కు లింకు ఇక్కడ
రాజరాజు కోరిక మేరకు సంస్కృత మహాభారత ఆంధ్రీకరణ యజ్ఞాన్ని ప్రారంభించిన నన్నయ తన కవిత్వపు రీతికి ‘అక్షర రమ్యత’ ను ఒక లక్షణంగా చేసుకుని కవిత్వం చెప్తానని చెప్పుకున్నాడు ‘సారమతిం కవీంద్రులు’ అన్న పద్యంలో (ఆం.మ.భా.అవతారిక 26వ పద్యం). (ఈ భావాన్నే ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి కొన్ని వందల సంవత్సరాల తరువాత కొఱవి గోపరాజు తన సింహాసనా ద్వాత్రింశిక లో ‘పదజ్ఞత’ నెరిగి కవిత్వం చెప్తానని చెప్పుకున్నాడు. ‘అక్షర రమ్యత’ అన్న పదం కంటే ‘పదజ్ఞత’ అన్న పదానికి భావంలో గాఢత ఎక్కువనేది చెప్పకనే తెలుస్తుంది).
తెలుగులో పద్య రచనకు కావాల్సిన నియమాలను తానుగానే ఏర్పరచుకుంటూ రచన చేయాల్సిన అవసరం నన్నయది. తెలుగు సాహిత్య చరిత్రలో మరే కవికీ లేని అవసరం ఇది. మొదలెట్టడమే సంస్కృత శ్లోకంతో మొదలెట్టాడు నన్నయ అని నింద మోపడం చాలా తేలిక. నన్నయ ఉన్నది క్రీ.శ.11 శతాబ్దపు పూర్వార్ధంలో అనీ, అప్పటకి తెలుగులో కావ్యం మాట అటుంచి, పద్య నిర్మాణమే సరిగా కుదురుకోలేదనీ ఒక్కసారి గుర్తుకుతెచ్చుకుంటే నన్నయ మీద ఇలాంటి నింద మోపం.
ప్రాకృతం పూర్తిగా తెరమరుగైపోయి, సంస్కృతం రాజ్యమేలుతున్న రోజులవి. పక్కన తమిళంలోనూ, కన్నడంలోనూ అప్పటికే సాహింత్యం ఉంది. తెలుగు పద్యం తన ప్రత్యేకతను చాటుకోవడానికి వీలుగా, సంస్కృత, తమిళ, కన్నడ భాషలలో పద్య నిర్మాణానికి వాడుతూండిన ఛందస్సుకు సంబంధించిన నియమాలకు కొంచెమన్నా భిన్నంగా తెలుగు పద్యాలకు నియమాలు ఉండాలని నన్నయ సంకల్పించడం అసహజమేమీ కాదు. ఇందుకోసం నన్నయ ఆలోచించి ప్రవేశ పెట్టినవే ‘యతి (వడి, వళి)’, ‘ప్రాస’ అనే రెండు నియమాలు. నన్నయ ఏర్పరచిన పధ్ధతిలో తెలుగు పద్యానికి ఇవి ప్రత్యేకమైనవి.తెలుగు పద్యం సంస్కృత లేదా ఇతర ద్రావిడ భాషా పద్యాలతో ఈ రెండు విషయాలలోనే భేదిస్తుంది.
పద్య పాదంలో ఒక నియత స్థానంలో పద్యపాదపు ప్రధమాక్షరాన్ని గానీ లేదా దాని మిత్రాక్షరాన్ని గానీ ఉంచడం యతి (వడి) నియమం. సంస్కృతంలో ఇది ఇలా ఉండదు. సంస్కృత శ్లోకానికి యతి ఉంటుంది గాని, అది విశ్రాంతి రూపమైనదే తప్ప(అంటే యతి స్థానంలో పదం విరిగితే చాలు) పాద ప్రధమాక్షరం గానీ దాని మిత్రాక్షరం గానీ పునరావృతం కావాలన్న నియమం లేదు. కన్నడములో గూడా ఈ వడి నియమం లేదు.
పద్యంలోని నాలుగు పాదాల్లోనూ రెండవ అక్షరాలు సమానములై ఉండాలనే నియమం ‘ప్రాస’. తెలుగులో నన్నయ తెచ్చి పెట్టిన ఈ నియమాన్నే ‘ద్వితీయాక్షరపు ఆట’ అని స్వర్గీయ పండిత ఉమాకాంత విద్యాశేఖరులు ఎద్దేవా చేసినప్పటికీ, ఇది తెలుగు పద్యానికే పరిమితమైనది. నన్నయ తెచ్చి పెట్టిన ఈ నియమం వల్ల అనవసర పదజాలం పద్యంలో చేరాల్సి రావడం (ప్రాస నియమాన్ని పాటించడంకోసం) జరిగి కవిత్వం పలచ బడిందని వారి భావన. పద్య రచనలో సరైన ప్రవీణ్యం లేని వాళ్ళు పద్య రచనకు పూనుకోవడం వల్ల జరిగే అనర్ధం ఇది.
ప్రాస, యతి నియమం పాటించకుండా రాసిన పద్యాలు మనకు పనికిరావని చెప్పిన ఒక చక్కటి పద్యం, కొఱవి గోపరాజు రచించిన ‘సింహాసనా ద్వాత్రిం శిక’ లోనిది -
“పలుతెఱంగు లైన పలుకులు గలిగియు
బ్రాలు వళ్ళు లేని బేలుకవిత
వన్నెలెల్ల గూర్చి వ్రాయుచో గాటుక
వన్నె లేని ప్రతిమవ్రాత బోలు”
నన్నయ పెట్టిన ఈ ప్రాస, యతి నియమాల వల్ల తెలుగు పద్యం మరీ బిగిసి పోయి ప్రజలకు దూరమైందనే మాటకు ఇప్పటి వరకూ దొరికిన అజ్ఞాత కర్తృకాలైన ఎన్నో చాటు పద్యాలు సమాధానం చెప్తాయి.
రాజ రాజు (4) కు లింకు