రాజరాజు – నన్నయ (9)

రాజ రాజ నరేంద్రుడు ఆంధ్ర దేశాన్ని క్రీ.శ.1022 నుండి 1063 వరకూ పరిపాలించాడని చరిత్ర పరశోధకుల నిర్ణయం. రాజ రాజు తరువాత అతని కుమారుడు కుళోత్తుంగ చోడుడు రాజ్యాదికారాన్ని చేపట్టవలసి ఉండగా, అతడు మాతామహులదైన చోళ రాజ్యానికి అధిపతియై అటు వెళ్ళిపోవడంతో ఆంధ్ర దేశంలో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ఇతిని పినతండ్రియైన విజయాదిత్యుని అధికారంలో రాజ్యం ఉన్నా, రాజ రాజు మరణానంతరం ఆ సింహాసనం దక్కించుకోవడానికి రాజుల మధ్య మొదలైన యుధ్ధాలతో రాజ్యంలో దదాపు అరాజక పరిస్థితులు ఏర్పడి కావ్య రచనకు కావాల్సిన శాంతియుత వాతావరణం లేకుండా పోయింది.

ఈ పరిస్థితులే నన్నయ మహాభారత రచన అర్ధంతరంగా ఆగిపోవడానికి కారణంగా చెప్పుకుని త్రుప్తిపడాలిసిందే తప్ప వేరే కారణం ఊహించలేం.

“ఎఱుక గలవారి చెరితలు
గఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగిన దానిని
మఱువ కనుష్ఠించునది సమంజసబుధ్ధిన్.”

“తనయుండు తల్లిదండ్రులు
పనిచినపని సేయడేని పలుకెదలో జే
కొనడేని వాడు తనయుం
డనబడునే పితృధనమున కర్హుండగునే.”

“అలిగిన నలుగక యెగ్గులు
పలికిన మఱి వినని యట్ల ప్రతివచనంబుల్
పలుకక బన్నము వడి యెద
దలపక యున్నవాడె ధర్మజ్ఞుడిలన్.”

(అయిపోయింది)

రాజరాజు – నన్నయ (8)

నన్నయ మహాభారత ఆంధ్రీకరణం అరణ్య పర్వం, చతుర్థాశ్వాసం 142వ పద్యం దగ్గర ఆగిపోయింది.  ఆ పద్యం ఇది:

“ఉ. శారదరాత్రు లుజ్జ్వలలసత్తర తారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధ బంధురో
దారసమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచిపూరములం బరిపూరితంబు లై.”

వర్షాకాలం గడిచి, చలి కాలం అప్పుడప్పుడే మొదలౌతున్న రోజుల నాటి రాత్రులు.  చంద్రుడు కర్పూర పరాగం లాంటి వెన్నెలను కురిపిస్తున్నాడు. ఇలాంటి చంద్రుణ్ణి చూసి అప్పుడే వికసించినటువంటి తెల్లకలువల నుంచి వెలువడుతూన్న గంధాన్ని తనలో కలుపుకుని గాలి మత్తుగా వీస్తొంది.  అలా కాస్తూన్న వెన్నెలనూ ఇలా వీస్తూన్న గాలినీ వహించి చుక్కలు మైమరచి మెరుస్తూంటే ఆ మెరుపులో రాత్రులు ఇంకా మెరిసిపోతున్నాయి. ఇదీ ఈ పద్యపు భావం.

ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వర్ణించడానికి అంతే అహ్లాదకరమైన చింతన కావాలి. ఈ పద్యాన్ని రచించిన నాటి రాత్రి (రాత్రి గానే నేను భావించుకుంటున్నాను) అంతే ఆహ్లాదకరమైన చిత్తంతో ఆనాటికి స్వస్తి చెప్పుకుని నిద్ర కుపక్రమించుంటాడు నన్నయ. తెల్లవారే సరికి మారిన పరిస్థితులను గురించి తెలియజెప్పగల అధారాలేవీ చరిత్రలో మిగలలేదు.  మిగిలినదల్లా కట్టుకధలుగా భావించబడుతూన్న ఒకటి రెండు కథలు మాత్రమే. వాటిల్లో ఒకటి చిత్రాంగీ సారంగధరులకు సంబంధించినది, లోక ప్రసిధ్ధమైనది. ఈ కధలో అనైతికమైన, ఏహ్యమైన రాజరాజు ప్రవర్తనకు మనసు కలతచెంది నన్నయ మహాభారత ఆంధ్రీకరణాన్ని అపివేశాడని ఐతిహ్యం. ఆంధ్ర మహాభారతం అవతారికలో నన్నయ వర్ణించిన రాజరాజుకూ, ఈ కథలోని రాజరాజుకూ సంబంధమే లేనట్లుగా ఉంటుంది ఈ కథలో రాజ రాజు ప్రవర్తన.  అయినప్పటికీ, పోతన గారన్నట్లు ‘రాజుల్ మత్తులు’…మత్తులే గాదు ఉన్మత్తులు గూడా.  ఏనాటికి ఏరాజు చిత్తం ఎలా మారుతుందో ఎవ్వరూ ఊహించలేనిది.  అకారణంగా కథలెలా పుడతాయి మరి? అదలా ఉంచితే, సారంగధరుడూ, చిత్రాంగీ కల్పిత వ్యక్తులే తప్ప వీ రిరివురూ నిజ వ్యక్తులుగా పరిగణింపబడడానికి  సంబంధించిన చారిత్రక ఆధారాలేమీ లేవని చరిత్రపరిశోధకులు చెబుతారు.

ఇక రెండవది, వేములవాడ భీమకవి తో సంబంధం ఉన్న ఒక కథ. నిస్సందేహంగా తెలుగులో అత్యంత ప్రతిభావంతులైన కవులలో ఈయనకు స్థానం ఉంది.  శ్రీనాథుడు ఈయనను తాను పూర్వకవులలో గౌరవించే మొట్టమొదటి వానిగా చెప్పుకోవడం ఇందుకు తార్కాణం.  అయితే, ఈయన రచించిన గ్రంధమేదీ ఇప్పటికీ లభ్యం కాకపోవడం దురదృష్టకరం. ఈయనవిగా చెప్పబడుతూ లభించిన పద్యాలు ఇప్పటిదాకా 53. అందులో 38 చాటువులు, అన్నీ లోకప్రసిధ్ధమైనవే.  నన్నయ కంటే ముందుగానే తెలుగులో ఈయన ‘రాఘవ పాండవీయం’ అనే ఒక ద్వ్యర్ధి కావ్యాన్ని రచించాడనీ, ఓర్వలేక నన్నయగారు ఆ కావ్యాన్ని తగులబెట్టించారనీ కథ.  ప్రతిగా నన్నయ రాసిన ‘ఆంధ్ర శబ్దచింతామణి’ ని  భీమకవి గోదావరి పాలు చేశాడని కూడా కథ. ఇదే కాకుండా, అధర్వణుడనే కవి వ్రాసిన భారతాన్ని కూడా రాజరాజు దృష్టికి రాకుండా నన్నయ అగ్నికి ఆహుతి చేశాడని కూడా కథ.  ఈ దుష్కార్యాల ప్రభావం నన్నయ మీద పడిందనీ, దాని ఫలితమే నన్నయ భారత రచన అర్ధంతరంగా ఆగిపోవడమనీ తరతరాలుగా జనంసామాన్యంలో ప్రచారమై ఉన్న కథ.

ఈ కథల్లో నిజానిజాలు ఏమైనప్పటికీ, నన్నయ భారత రచన పైన చూపిన పద్యంతో ఆగిపోవడం మాత్రం నిజం.

రాజరాజు – నన్నయ (7)

నన్నయ రచిత ఆంధ్ర మహాభారత భాగం చాలామటుకు సంస్కృత పద భూయిష్టంగా ఉంటుందన్నది ఒక మాట.  సంస్కృత పదాలు తత్సమీకరించీ, తత్భవంచెందించీ విస్తృతంగా వాడబడి కనిపిస్తాయి నన్నయ ఆంధ్రీకరించిన భారత భాగంలో. తెలుగు భాషకున్న అజంతత్వమనే లక్షణమూ, తెలుగు భాష ప్రధమా విభక్తి ప్రత్యయాలయిన ‘డు, ము, వు, లూ’ సంస్కృత పదాల తత్సమ, తద్భవీకరణలకు అనువుగానూ, ప్రోత్సాహకంగానూ ఉండి ఈ ప్రక్రియను సులభతరం చేశాయని చెప్పుకోవాలి.  భాష కల్పించిన సౌలభ్యం లేకపోతే నన్నయ చేయగలిగింది కూడా ఏమీ లేదు. 

నన్నయ రచిత భారత భాగంలో పద్యానికి నన్నయ సమకూర్చి పెట్టిన ప్రత్యేకమైన నడకలూ, కొన్ని కొన్ని పదాలను నన్నయ ఉపయోగించిన తీరూ, ఆ తరువాత కవులకు మార్గదర్శకంగా నిలిచాయి. ఇట్లాంటి వాటిల్లో చెప్పుకో దగ్గ ఒక గమ్మత్తయిన ప్రయోగం ‘ఇంతకు ఇంతయు’ అనే జంట పదానికి సంబంధించినది. ఈ జంట పదం నన్నయ వాడిన ఈ రూపంలో  తెలుగు సాహిత్యం మొత్తంలోనే చాలా అరుదుగా వాడబడి కనిపిస్తుంది. ఈ జంట పదం సౌందర్యానికి ముగ్ధుడయ్యీ, ముచ్చటపడీ శ్రీనాధుడు తన పద్యంలో ఉపయోగించుకున్నాడు.  ‘ఇంతకు ఇంతయు’ అన్న ఈ జంట పదం నన్నయ భారతంలో (ఆదిపర్వం 5వ అధ్యాయం 27వ వచనం, 28వ పద్యం) ఇలా వాడబడి కనిపిస్తుంది:

“27.వ. అంత నాదిత్యుండు నాకాశంబున కరిగిన, కొడుకుంజూచి కుంతి తద్దయు విస్మయంబంది యెద్దియుం జేయునది నేరక…

28. తరువోజ.ఏలయమ్ముని నాకు నిచ్చె నిమ్మంత్ర మిమ్మంత్ర శక్తియే నెఱుగంగ వేడి
యేల పుత్త్రకుగోరి యెంతయు భక్తి నినుదలంచితి భీతినినుడును నాకు
నేల సద్యోగర్భమిచ్చె గుమారుడేల యప్పుడుదయించె నింకెట్టు
లీలోకపరివాదమే నుడిగింతు నింతకు నింతయు నెఱుగరె జనులు”

శ్రీనాధుడీ జంట పదాన్ని తన శాలివాహన సప్త శతిలో వాడుకున్నాడు.  ఈ గ్రంధం ఇప్పటికీ అలభ్యం.  అయితే, అందులోనిదని చెప్పబడే ఒక్కటే ఒక్క పద్యం, సాహితీ లోకంలో కొన్ని దశాబ్దాలక్రితం చాలా తర్జన భర్జనలకూ వాదోపవాదలకూ కారణమైన ఈ పద్యంలో ఈ జంట పదాన్ని శ్రీనాధుడు వాడిన విధానం:

“వారణ శేయ దావగొనవా, నవవారిజమందు తేటి క్రొ
వ్వారుచునంట నీవెఱుగవా, హా ప్రియ వాతెఱ గంటు కంటి కె
వ్వారికి కెంపు రాదు, తగవా మగవారల దూఱ, నీ ప్రియుం
డారసి నీ నిజంబెరుగు నంతకు నంతయు నోర్వు నెచ్చెలీ!”       

ఈ సందర్భంలోనే ముచ్చటించుకోవాల్సిన ముఖ్య విషయం ఇంకొకటుంది. పైన చూపిన నన్నయ భారతంలోని తరువోజ పద్యం తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి ప్రపంచనము (soliloquy). ఆ తరువాత ఈ ప్రక్రియ ఎన్ని చిత్రాలు పోయిందో ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.  అన్నిటిలోకీ మయసభలో భంగపాటు అనంతరం దుర్యోధనుని soliloquy బహుళ ప్రచారం పొందినది.

రాజరాజు – నన్నయ (6)

సంస్కృత మహాభారత ఆంధ్రీకరణలో నన్నయ అనుసరించిన పధ్ధతుల్ని విశ్లేషిస్తూ, నన్నయ కవిత్వంలోని గుణగణాల్ని విశదపరుస్తూ ఎంతో మంది పెద్దలు ఎన్నెన్నో వ్యాసాలను వ్రాసి ప్రచురించారు ఈవరకే.

కావ్య రచనలో నన్నయ తానుగా అనుసరిస్తూ, అనుసరించదగినవిగా సూచనప్రాయంగా తెలిపిన పధ్ధతులలో విశేషమైనది అవకాశం దొరికినప్పుడల్లా మధ్యలో ముక్తకాలనదగినటువంటి నీతి బోధకాలయిన పద్యాలను జొప్పించి చెప్పడం. ఉదాహరణకు ఆంధ్ర మహాభారతం ఆది పర్వం, రెండవ అధ్యాయం లొని 172వ దైన ఈ కంద పద్యం:

“క్రోధము తపముం జెఱచును
గ్రోధమ యణిమాదులయిన గుణముల బాపుం
గ్రోధమ ధర్మక్రియలకు
బాధయగుం గ్రోధిగా దపస్వికి జన్నే!”
(ఈ పద్య భావాన్నే ఇంకా సంక్షిప్తీకరించి ‘తన కోపమె తన శత్రువు’ అని చెప్పాడు వేమన).

విడిగా చదువుకోవడానికీ, సందర్భానికి తగినట్లుగా ఉల్లేఖించడానికీ వీలయినటువంటి చక్కటి పద్యం ఇది. ఇలాంటివే ఇంకా ఎన్నో! సద్వర్తనానికి ఉపకరించే నీతి బొధకాలయిన పద్యాలను విడిగా చెప్పడం కంటె, కావ్యంలో సందర్భానికి తగినట్లుగా చొప్పించి చెప్పడం చాల ఉపయోగకరంగా నన్నయ భావించి అనుసరించి చూపిన పధ్ధతి ఇది.

ఈ పధ్ధతిని తెలుగు సినిమాలల్లో కూడా ప్రవేశపెట్టిన ఘనత స్వర్గీయ సముద్రాల రాఘవాచర్యులు (సీనియర్ సముద్రాల) గారిది. ఉదాహరణకు, భూకైలాస్ సినిమాలో పాతాళరాజు (పరమ వైష్ణవ భక్తుడు)  కొలువులో ఆయన కుమార్తె మండోదరికి సరియయిన వరుడుగా రావణుని (పరమ శివ భక్తుడు) మంత్రి సూచిస్తే, పోయి పోయి విష్ణుద్రోహియైన అతనికా అని విరుచుకుపడ్డ పాతాళరాజుకు నచ్చ చెప్పే ప్రయత్నంచేస్తూ  “లోకాలు వేరు కావచ్చు, విశ్వాసాలు వేరు కావచ్చు. అంత మాత్రాన వియ్యాలు మానుకుంటామా మహారజా!” అని  మంత్రి అన్న మాటలు….

అలాగే నర్తనశాల సినిమాలో విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం గడపడానికి మారు వేషాల్తో వెళ్ళే విషయమై జరుగుతూండిన సంభాషణలో, పాండవ పట్టమహిషియయిన ద్రౌపది ఎలా ఈ కష్టాన్ని భరిస్తూ గడంనుంచి గట్టెక్కుతుందని చింతిల్లుతున్న ధర్మరాజు నుద్దేశించి  “అనురాగం ఉన్నచోట ఆవేదన సహజమే ప్రభూ! ఆర్య పుత్రులకు లేని కష్టం నాకా!” అని ద్రౌపది అన్న మాటలూ…

ఇంకా విరాటరాజు కొలువులోకి కంకుభట్టుగా ప్రవేశించిన ధర్మరాజును చూస్తూ “ముఖవర్చస్సు చూస్తే మహారాజులా ఉన్నారు?” అని అరా తియ్య బోయిన విరాటారాజుకు సమాధానంగా “ఆకారానికీ అదృష్టానికీ అనుబంధం లేదు ప్రభూ” అని ధర్మరాజుచే చెప్పించిన మాటలూ…ఇవన్నీ సందర్భోచితంగా ఉండడమే కాకుండా అర్ధగంభీరంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సంభాషణల మధ్యలో ఇలాంటి చణుకుల్లాంటి సూక్తుల్ని సంధిస్తే సంభాషణ ఎంతగా రుచించి హృదయానికి హత్తుకుంటుందో అప్పట్లో సముద్రాల గారు గ్రహించి ఆచరణలో పెట్టారు. ఈ technique కు మూలాలన్నీ నన్నయ రచిత మాహాభారత భాగంలో సమృధ్ధిగా ఉన్నాయి.

రాజరాజు – నన్నయ (5)

రాజరాజు – నన్నయ (4) కు లింకు ఇక్కడ

రాజరాజు కోరిక మేరకు సంస్కృత మహాభారత ఆంధ్రీకరణ యజ్ఞాన్ని ప్రారంభించిన నన్నయ తన కవిత్వపు రీతికి ‘అక్షర రమ్యత’ ను ఒక లక్షణంగా చేసుకుని కవిత్వం చెప్తానని చెప్పుకున్నాడు ‘సారమతిం కవీంద్రులు’ అన్న పద్యంలో (ఆం.మ.భా.అవతారిక 26వ పద్యం). (ఈ భావాన్నే ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి కొన్ని వందల సంవత్సరాల తరువాత కొఱవి గోపరాజు తన సింహాసనా ద్వాత్రింశిక లో ‘పదజ్ఞత’ నెరిగి కవిత్వం చెప్తానని చెప్పుకున్నాడు. ‘అక్షర రమ్యత’ అన్న పదం కంటే ‘పదజ్ఞత’ అన్న పదానికి భావంలో గాఢత ఎక్కువనేది చెప్పకనే తెలుస్తుంది). 

తెలుగులో పద్య రచనకు కావాల్సిన నియమాలను తానుగానే ఏర్పరచుకుంటూ రచన చేయాల్సిన అవసరం నన్నయది.  తెలుగు సాహిత్య చరిత్రలో మరే కవికీ లేని అవసరం ఇది.  మొదలెట్టడమే సంస్కృత శ్లోకంతో మొదలెట్టాడు నన్నయ అని నింద మోపడం చాలా తేలిక.  నన్నయ ఉన్నది క్రీ.శ.11 శతాబ్దపు పూర్వార్ధంలో అనీ, అప్పటకి తెలుగులో కావ్యం మాట అటుంచి, పద్య నిర్మాణమే సరిగా కుదురుకోలేదనీ ఒక్కసారి గుర్తుకుతెచ్చుకుంటే నన్నయ మీద ఇలాంటి నింద మోపం.

ప్రాకృతం పూర్తిగా తెరమరుగైపోయి, సంస్కృతం రాజ్యమేలుతున్న రోజులవి.  పక్కన తమిళంలోనూ, కన్నడంలోనూ అప్పటికే సాహింత్యం ఉంది.  తెలుగు పద్యం తన ప్రత్యేకతను చాటుకోవడానికి వీలుగా, సంస్కృత, తమిళ, కన్నడ భాషలలో పద్య నిర్మాణానికి వాడుతూండిన ఛందస్సుకు సంబంధించిన నియమాలకు కొంచెమన్నా భిన్నంగా తెలుగు పద్యాలకు నియమాలు ఉండాలని నన్నయ సంకల్పించడం అసహజమేమీ కాదు. ఇందుకోసం నన్నయ ఆలోచించి ప్రవేశ పెట్టినవే ‘యతి (వడి, వళి)’, ‘ప్రాస’ అనే రెండు నియమాలు.  నన్నయ ఏర్పరచిన పధ్ధతిలో తెలుగు పద్యానికి ఇవి ప్రత్యేకమైనవి.తెలుగు పద్యం సంస్కృత లేదా ఇతర ద్రావిడ భాషా పద్యాలతో ఈ రెండు విషయాలలోనే భేదిస్తుంది.

పద్య పాదంలో ఒక నియత స్థానంలో పద్యపాదపు ప్రధమాక్షరాన్ని గానీ లేదా దాని మిత్రాక్షరాన్ని గానీ ఉంచడం యతి (వడి) నియమం. సంస్కృతంలో ఇది ఇలా ఉండదు.  సంస్కృత శ్లోకానికి యతి ఉంటుంది గాని, అది విశ్రాంతి రూపమైనదే తప్ప(అంటే యతి స్థానంలో పదం విరిగితే చాలు) పాద ప్రధమాక్షరం గానీ దాని మిత్రాక్షరం గానీ పునరావృతం కావాలన్న నియమం లేదు. కన్నడములో గూడా ఈ వడి నియమం లేదు.

పద్యంలోని నాలుగు పాదాల్లోనూ రెండవ అక్షరాలు సమానములై ఉండాలనే నియమం ‘ప్రాస’. తెలుగులో నన్నయ తెచ్చి పెట్టిన ఈ నియమాన్నే ‘ద్వితీయాక్షరపు ఆట’ అని స్వర్గీయ పండిత ఉమాకాంత విద్యాశేఖరులు ఎద్దేవా చేసినప్పటికీ, ఇది తెలుగు పద్యానికే పరిమితమైనది. నన్నయ తెచ్చి పెట్టిన  ఈ నియమం వల్ల అనవసర పదజాలం పద్యంలో చేరాల్సి రావడం (ప్రాస నియమాన్ని పాటించడంకోసం) జరిగి కవిత్వం పలచ బడిందని వారి భావన. పద్య రచనలో సరైన ప్రవీణ్యం లేని వాళ్ళు పద్య రచనకు పూనుకోవడం వల్ల జరిగే అనర్ధం ఇది.

ప్రాస, యతి నియమం పాటించకుండా రాసిన పద్యాలు మనకు పనికిరావని చెప్పిన ఒక చక్కటి పద్యం, కొఱవి గోపరాజు రచించిన ‘సింహాసనా ద్వాత్రిం శిక’ లోనిది -

“పలుతెఱంగు లైన పలుకులు గలిగియు
బ్రాలు వళ్ళు లేని బేలుకవిత
వన్నెలెల్ల గూర్చి వ్రాయుచో గాటుక
వన్నె లేని ప్రతిమవ్రాత బోలు”

నన్నయ పెట్టిన ఈ ప్రాస, యతి నియమాల వల్ల తెలుగు పద్యం మరీ బిగిసి పోయి ప్రజలకు దూరమైందనే మాటకు ఇప్పటి వరకూ దొరికిన అజ్ఞాత కర్తృకాలైన ఎన్నో చాటు పద్యాలు సమాధానం చెప్తాయి.

రాజ రాజు (4) కు లింకు

రాజరాజు – నన్నయ (4)

రాజరాజు ఎలాంటివాడు?’ అనే ప్రశ్నకు సమాధానం ఆంధ్ర మహాభారతం ప్రధమాశ్వాసంలోని 10వ పద్యం, 11వ వచనం మరియు 12వ పద్యంలో కొంత దొరుకుతుంది.

మనసులో వేరే ఏ ఆలోచనలూ లేని చిత్తంతో పురాణాలు చాలా విన్నవాడూ, అర్ధ ధర్మ శాస్త్రముల లోని పధ్ధతులు తెలుసుకున్నవాడూ, ఉదాత్త రసాన్విత కావ్య, నాటకాల సొగసులనెన్నిటినో ఆస్వాదించినవాడూ, ఈశ్వరార్చన యందు భక్తితో హృదయాన్ని లగ్నం చేసినవాడూ అయినటువంటి ధర్మచిత్తుడూ, మెత్తని మనిషీ అనిపిస్తాడు రాజరాజు.

ఇంత వ్యాసంగం తరువాత గూడ మహాభారతం మీద ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది రాజరాజుకు. అందుకే తనకు అమితంగా ఇష్టమైన అయిదు అంశాల్లో రెండవదిగా భారత శ్రవణాసక్తిని చెప్పుకున్నాడు.

ఆంధ్ర మహాభారతంలోని 16వ పద్యం నన్నయ వ్రాసిన రెండవ కంద పద్యం.  సంస్కృత మహాభారతంలోని ఏఏ విషయాలు తెలుగులోకి ఎలా రచింపబడాలని రాజరాజు కోరుకున్నాడో స్పష్టంగా తెలియచెప్పే పద్యం ఇది.

“జననుత కృష్ణద్వైపాయన మునివృషభాభిహిత మహాభారత బ
ధ్ధ నిరూపితార్ధ మేర్పడ తెలుగున రచియింపు మధిక ధీయుక్తిమెయిన్”

వ్యాసులవారు తమ అంతరంగంలో ఏఏ అర్ధాలనైతే మహాభారతంలో బంధింపబడి నిరూపితమవ్వాలని కోరుకున్నారో వాటినే స్పష్టంగా అర్ధమయేలా తెలుగుభాషలో రచింపమని రాజరాజు ఆదేశం. రాజరాజు ఉద్దేశ్యంలో నన్నయ చెయ్యాల్సినపని సంస్కృత మహాభారతాన్ని తెలుగు భాషలోకి మక్కీకిమక్కి అనువాదం కానేకాదు. నన్నయ చేసిందికూడ కేవలం అనువాదం కానేకాదు.

రాజరాజు – నన్నయ (3)

నన్నయ రాజరాజుకు కులబ్రాహ్మణుడు, అనురక్తుడు. రాజరాజు దృష్టిలో నన్నయ అవిరత జపహోమతత్పరుడని, విపుల శబ్దశాసనుడని, సంహితాభ్యాసుడని, బ్రహ్మాండాది నానాపురాణవిజ్ఞాననిరతుడని, పాత్రుడని, ఆపస్థంబసూత్రుడని, ముద్గలగోత్రుడని, సద్వినుతావదాతచరితుడని, లోకజ్ఞుడని, ఉభయభాషాకావ్యరచనాభిశొభితుడని, సత్ప్రతిభాభియోగ్యుడని, నిత్యసత్యవచనుడని, సుజనుడని నన్నయ తనకుతానే చెప్పుకొన్న మాటలు ఆంధ్ర మహాభారతం 9వ పద్యం వల్ల మనకు అవగతమౌతుంది. తృతీయ పురుష (third person) లో narrative లా సాగే పద్య నిర్మాణం ఈ విధమైన వర్ణనను సులభతరం చేసింది. రచన చేస్తూన్న నన్నయ తనను, తన ప్రభువైన రాజరాజునూ రచనలో పాత్రధారులనుగా చేసుకొని సాగించిన రచనా విధానం ఇది. ఇలాంటి ఇప్పటి తరహా రచనా విధానాన్ని అప్పుడు, అంటే క్రి.శ.11వ శతాబ్ధంలోనే, నన్నయ ఊహించి కల్పించడానికి ముఖ్యమైన కారణం రాజరాజు వ్యక్తిత్వాన్ని, కోరికనూ భావితరాలకు తెలియజెప్పాలని నన్నయ త్రికరణశుధ్ధిగా భావించి ఉండడంగానే అని నాకనిపిస్తుంది.

తెలుగు భాషలో కావ్య రచన ఆరంభం కావడానికి, అది సంస్కృత మహాభారతం ఆంధ్రీకరణం ద్వారా జరగడానికి, రెంటికీ బాధ్యుడు రాజరాజు అన్నది లోకానికి తెలియడం నన్నయ ముఖ్య ఉద్దేశ్యం. అందులోని మంచైనా, చెడైనా రాజరాజుకే చెందాలని నన్నయ అభిలషించాడని చెప్పవచ్చు.

రాజరాజు కోరికను విన్న నన్నయ వినమ్రతతో అన్ని విధాలా అలోచించి చివరికి ‘నా నేర్చు విధంబున’ మహాభారతాన్ని రచిస్తానని తెలుపుతాడు (ఆంధ్ర మహాభారతం  20 వ.). ఇందులో ‘నా నేర్చు’ అనే పదప్రయోగం ఇప్పుడు లేనిది.  అప్పుడు, అంటే క్రి.శ.11వ శతాబ్దిలో ఏ అర్ధంలో వాడబడినదో తెలియనిది. ఇది ‘ఎప్పటికప్పుడు ఉచితమని తోచిన  పధ్ధతిలో ‘ అనే అర్ధాన్ని సూచిస్తుందని నాకనిపిస్తుంది. తాను నేర్చుకొంటూ, నేర్చుకుంటూన్నదాన్ని రచనగా ముందుంచుతూ భారత అంధ్రీకరణాన్ని కొనసాగించడంగా నన్నయ ఈ పదానికి అర్ధనిర్దేశంచేసి ఉపయోగించాడని నా భావన.

రాజరాజు కోరిక తీర్చే మార్గాన్ని ఊహించి, దర్శించి పద్యరచనగావించే ప్రక్రియలో ముందుతరాలకు మార్గదర్శకుడై నిలిచాడు నన్నయభట్టు.

రాజరాజు – నన్నయ (2)

నన్నయ రచన ఎక్కువగా సంస్కృతపదభూయిష్టంగా ఉంటుంది అని ఒక అభిప్రాయం ఉంది. అంటేఅవసరంకన్నామించి సంస్కృత పదాలు ఉండడంగా ఈ అభిప్రాయాన్ని లేదా విమర్శ ను తీసుకొని ఆలోచిస్తే కొన్ని విషయాలు స్ఫురణకు వస్తాయి.

గ్రంథ రచన చెయ్యడానికి అనువైనదిగా తెలుగు భాష అభివృధ్ధి చెందిందని గుర్తించిన మొదటి వ్యక్తి రాజరాజ నరెంద్రుడు. అప్పటికే వెయ్యేళ్ళగా (గాధా సప్తశతి నాటికే తెలుగు స్వతంత్ర భాషగా ఎదిగి ఉన్నది అని చెప్పడానికి సరిపడా అధారాలు గాధా సప్తశతి లోనే ఉన్నాయి) వాడుకలో ఉన్న తెలుగు భాషలో ప్రజాబాహుళ్యం పాడుకొనే పాటలూ, అప్పుడప్పుడూ శాసనాల్లో దేశీ చ్ఛందస్సులైన కందం, తరువోజ, ఆటవెలది లలో దర్శనమిస్తూ వచ్చిన పద్యరచన, రాజరాజు యొక్క పై నిర్ణయానికి ఆలంబనగా నిలిచియుండవచ్చు.

పండితత్వానికి ప్రతీక సంస్కృతం. తెలుగు పామర భాష అనడం కంటే పండితేతర భాష అనడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికే పూర్తిగా అభివృధ్ధి చెందిన తెలుగు భాషలో పండితులు సైతం సంభాషించుకునే వారనీ, నిత్య వ్యవహారంలో వాడేవారనీ అనుకొవడంలో తప్పేమీలేదు.

రాజరాజుకూ నన్నయభట్టుకూ మధ్య మహాభారత ఆంధ్రీకరణాన్ని గురించిన సంభాషణ తెలుగులోనే జరిగిఉండవచ్చు. ఇరువురూ సంస్కృతంలో కంటే తెలుగులోనే సంభాషించుకొని ఉంటారని అనుకుంటేనే సమంజసంగా ఉంటుంది.

అయితే, రాజరాజు నన్నయను మహాభారత గ్రంథాన్ని ఆంధ్రీకరించమని చెప్పినప్పుడు వారి ఉద్దేశ్యంలో నన్నయ మహాభరాత ఆంధ్రీకరణలో వాడాల్సిన భాష అప్పుడు వారిద్దరూ వ్యవహారంలో మాట్లాడుకొంటూండిన భాష మాత్రం అయి ఉండదు. రాజరాజు ఉద్దేశ్యంలో నన్నయ తెలుగులో గ్రంథరచనకు కావల్సిన భాషను తనకు నచ్చిన విధంగానూ, ఆనాటి పండితవర్గానికంతటికీ నచ్చే విధంగానూ తయారు చేసుకోవాలనే అనుకోవడం సబబుగానే ఉంటుంది.

రాజరాజు మాట ఎలా ఉన్నా, అనాడు జనసామాన్యంలో వాడుకలో ఉన్న తెలుగు భాష స్వరూపం నన్నయకు తెలియకుండా ఉండదు. అప్పటిదాకా శాసనాలలో వాడబడుతూండిన తెలుగు భాషా స్వరూపం నన్నయకు తెలుసు. శాసనాలలో వాడబడిన భాషను అధికారిక భాషగా గ్రహించడంలో అనౌచిత్యం లేదు గనుక తెలుగులో గ్రంథ రచనకు వీలైనటువంటి భాషాస్వరూపంగా నన్నయ దానినే స్వీకరించడం కూడ సహజమే.

రాజరాజు – నన్నయ (1)

సంస్కృతం లో ఉన్న భారత ఇతిహాసాన్ని తెలుగులో చదువుకోవాలనేది రాజరాజ నరేంద్రుని కోరిక. అప్పటిదాకా తెలుగు భాషలో లిఖించబడి గ్రంథ లేకపోవడమనేది ఒక కొరతగా రాజరాజు భావించి ఉండవచ్చు, ముఖ్యంగా అప్పటికే పొరుగు భాషైన కన్నడం లో గ్రంధితమై కావ్యాలు ఉండడం చేత. కన్నడం లో గ్రంథరచన భారత కధతోనే ప్రారంభమైనది కాబట్టి తెలుగులో కూడ భారత రచన తోనే గ్రంథరచన ప్రారంభం కావాలని అభిలషించి ఉండవచ్చు.

రాజరాజ నరేంద్రుడు క్రీ.శ.1022 నుండి క్రీ.శ.1062 సం., దాక ఆంధ్ర దేశాన్ని పరిపాలించాడు. అంటే క్రీ.శ.11వ శతాబ్దం లో ఉండిన రాజుకి ఇదే ఒక కొత్త మరియు ప్రయోజనకరమైన అలోచన. ప్రయోజనకరమైన అన్నది ఎందుకంటే తెలుగులో ఓంప్రథమంగా వెలువడనున్న రచన పూజ్యమైనదిగా అప్పటికే భావింపబడుతూండినటువంటి మహాభారతం అయి ఉండాలని రాజరాజు భావించడం అంత అసమంజసంగా అనిపించదు.

లక్షా ఏడువందల శ్లోకాల సంస్కృత మహాభారతంలో వ్యాస భగవానులు తడమని మానవ జీవిత పార్శ్వం లేదనేది పెద్దల మాట. అట్లాంటి మహాభారతం తెలుగు భాషలోనూ మొదటి రచనగా ఉండాలనుకోవడంలో రాజరాజ నరేంద్రుడు తన ఏలికలో ఉన్న రాజ్యంలో ధర్మోధ్ధరణనే అభిలషించాడు అనుకోవడం తప్పుకాదు.

మక్కికి మక్కి అనువాదంలా కాకుండా, సంస్కృత భారతంలో మానవ జీవనానికి సంబంధించిన ఏఏ అర్ధాలైతే నిరూపితమయ్యాయో వాటినే తెలుగులో చెప్పమని తాను కోరుకొన్న అనువాద పధ్ధతిని రాజరాజు స్పష్ఠంగా నన్నయకు చెప్పాడు.

స్థూలంగా నన్నయ చేసింది కూడ అదే. అయితే నన్నయ ముందుండిన సమస్యలలో అనువాద పధ్ధతి రెండవది.  మొదటి సమస్య అప్పటికి అసలు నిర్దేసింపబడిన నియమాలతో లేని తెలుగు పద్యం, కావ్య నిర్మాణ పధ్ధతి. ఈ రెండింటిని నన్నయ తనకు తానుగానే నియమాలు నిర్దేసించుకుని ముందుకు సాగాడు.  మిత్రుడైన నారాయణ భట్టు సహాయం అవసరమైనప్పుడల్ల తీసుకున్నాడు. నిజానికి అసలు అనువాదంలో కన్న నన్నయ ఇందులోనే ఎక్కువగా కష్టపడి ఉంటాడని నాకనిపిస్తుంది.