‘నాతో మాట్లాడడమే ఒక education’ అంటూండే ‘కన్యాశుల్కం’ లోని గిరీశం పాత్ర కోతలను తలపింపజేసే పద్యం ఒకటి, ఈ క్రింద చూపించినది, వేణుగోపాల శతకంలో ఉంది:
“రామాండ కతలెల్ల మేమెఱుంగని యవే, కాటమరాజుకు కర్ణు డోడె
బాగోత కతలంట పలుమాఱు వినలేదె, యిగనేశు డర్జను నిరగ మొడిసె
బారత కతలోన బాలరా జొక్కడు, కుంబకర్ణుని బట్టి గుద్ది సంపె
కంద పురాండలకత పిల్లకాటేరి, యీరబద్రుని మెడ యిరగగొట్టె,
అనుచు మూర్ఖులు పలుకుదు రవనియందు….”
ఈ పద్యంలో చెప్పినట్లుగా, రామాయణ కథలో కాటమరాజుకు కర్ణుడు ఓడడం, భాగవత కథలో గణేశుడు అర్జుజుని ఓడించడం, భారత కథలో బాలరాజు కుంభకర్ణుని గుద్ది చంపడం, కుమార స్వామి కోపంతో వీరభద్రుని మెడ విరగగొట్టడం…ఇలాంటివన్నీ ఏమీ తెలియకపోయినా అన్నీ తెల్సినట్లుగా భేషజం కనబరిచే వాళ్ళు మాట్లాడే మాటలే కదా! వినే వాళ్ళు ఉండాలే గాని, చెప్పే వాళ్ళకు కొదువ ఉండదుగా!
ఇందులోదే, మంచి ధార ఉన్న పద్యం, తన్ను తాను బేరీజు వేసుకుంటూ, చివరకు తాను నమ్మిన దేవునికి తనను తాను సమర్పించుకుంటూ చెప్పిన పద్యంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను:
“ఖేద మోదంబుల భేదంబు తెలియక గోలనై కడపితి కొన్ని నాళ్ళు,
పరకామినుల కాసపడి పాప మెఱుగక కొమరు ప్రాయంబున కొన్ని నాళ్ళు,
ఉదరపోషణమున కుర్వీశులను వేడి కొదవచే కుందుచు కొన్ని నాళ్ళు,
ఘోరమైనట్టి సంసార సాగర మీదుకొనుచు పామరముచే కొన్ని నాళ్ళు,
జన్మ మెత్తుట మొదలు ఈ సరణి గడిచె, ఎటుల కృప జూచెదో గతంబెంచబోకు,
మదరిపువిఫాల మునిజన హృదయలోల వేణుగోపాల భక్త సంత్రాణశీల!”
(అయిపోయింది)