తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

ఆంధ్రుల లేదా తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర గురించిన ఈ notes లో తొలి వెయ్యేళ్ళు అంటే క్రీస్తు శకాబ్దం మొదలుకొని ఆపై వెయ్యేళ్ళదాకా అని అనుకున్నది.
అయితే, ఇది నిజానికి ఇంకో రెండువందల పాతికేళ్ళు ముందుకు వెళ్ళి అదనంగా మరో రెండువందలపాతికేళ్ళు కలిసి మొత్తం పన్నెందువందల పాతిక
సంవత్సరాలవుతుంది. దీనికి కారణం, శాతవాహనుల పరిపాలనతో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర మొదలవుతుంది/మొదలుపెట్టుకోవాలనుకుంటే,
శాతవాహనుల పాలన క్రీ.పూ.225 లో మొదలై క్రీ.శ.225 తో అంతమయిందని చరిత్రకారులంటారు గాబట్టి. శాతవాహనుల పరిపాలనలో తెలుగువాళ్ళ
సాంఘిక చరిత్రకు కూడా క్రీ.పూ.225 నుంచి ఆధారలు దొరకాలి.

శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి. ఆంధ్ర భృత్యులని మాటకూడా ఉంది. దీనిమీద లేచినవివాదం ఇంకా ఎటూ తెలకుండానూ ఉంది. ఆంధ్రులైన భృత్యులా?
ఆంధ్రులకు భృత్యులా? ఆంధ్రులు వేరే రాజవంశం వారై, వారికి శాతవాహనులు సామంతరాజులా? అని మీమాంస. అదెలా ఉన్నా, నాలుగున్నర శతాబ్దాల
వీరి పరిపాలన మాత్రం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లిందని చెప్పుకోవాలి. నాలుగున్నర శతాబ్దాలు ఒకే రాజవంశం ఒక భూభాగాన్ని నిరాటంకంగా పరిపాలించడం
అంత సులభంగా జరిగే పని కాదు. అయినా శాతవాహనుల విషయంలో అది సాధ్యమైంది. తరానికి 25 సంవత్సరాల చొప్పున (చరిత్ర పరిశోధనలో తరానికి 25
సం.గా వేసుకుని లెక్కిస్తారని చదివాను) నాలుగున్నర శతాబ్దాలకు 18 తరాలవుతుంది. అంటే తరం నుంచి తరానికి సాగే జ్ఞాపకాల ప్రవాహంలో
పరిస్థితులలోనూ పరిపాలకులకు చెందిన విషయాలలోనూ ఏవిధమైన మార్పూ లేకుండా 18 తరాలు గడవడం, జ్ఞాపకాల, అనుభవాల ప్రవాహం నిరాటంకంగా
కొనసాగడం అన్నది చరిత్రలో ఒక అరుదైన సందర్భం, ఒక luxury గానే చెప్పుకోవాలి. ఆ సందర్భాన్ని, ఆ luxury ని  శాతవాహనుల పరిపాలనలో
అప్పటి ప్రజలు అనుభవించారు.

ఈ సుఖాన్ని అనుభవించిన వాళ్ళలో తెలుగు మాతృభాషగా ఉండిన తెలుగువాళ్ళూ ఉన్నారు. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. అప్పుడు, అంటే
శాతవాహనుల పరిపాలనా కాలం నాటికి, ఆంధ్రులు తెలుగువాళ్ళూ ఒక్కటి కాదా? అని. కాదనే నేను అనుకుంటాను. అయితే గనక, ఆంధ్రులైన
శాతవాహనులు తమ మాతృభాష అయిన తెలుగును వదిలి ప్రాకృతాన్ని ఎందుకు ఆశ్రయిస్తారు? శాతవాహనుల కాలంలో ప్రాకృతం రాజబాష, ప్రజల భాష
కూడాను! ప్రాకృతంలోనే కదా గాథాసప్తశతిలోని గాథలన్ని ఉన్నాయి! అయితే, అప్పటికి తెలుగింకా పూర్తిగా పరిణతిచెందిన భాషగా కాకుండానన్నా
ఉండిఉండాలి. అలా అనుకోవడానికీ వీలు లేదు.  కారణం, గాథాసప్తశతిలో అక్కడక్కడా కనుపించే అత్తా (అత్త), అద్దాఏ (అద్దం) లాంటి కొన్ని తెలుగు
పదాలు, తెలుగు అప్పటికే పూర్తిగా పరిణతి చెందిన భాషగా ఉండినదనీ, ఎంత పరిణతి అంటే, అందులోని కొన్ని మాటలు వేరే భాషలోకి వెళ్ళగలిగేంత పరిణతి
చెందిన భాషగా శాతవాహనుల కాలంనాటికే ఉండినదనీ, పూజ్యులు కీ.శే.తిరుమల రామచంద్ర గారు తమ వ్యాసాలలో ఇప్పటికే నిరూపించి ఉన్నారు కాబట్టి!

అదలా ఉంచితే, “ఆంధ్రశ్చ బహువః” అనే మాట ఒకటి ఉంది. దీని అర్ధం ఆంధ్రులు పలువురు అని. అంటే, పలు జాతుల ప్రజలు కలిసి ఆంధ్రులు
అయ్యారని ఇది సూచిస్తుంది. ఇది నానుడి. ప్రజల నాలుకలపైనుంచి వచ్చిన మాట. దీనికి నిదర్శనాలు, ఆధారాలూ దొరకవు. తరం నుంచి తరానికి ఇలా
దిగుమతి అయిన జ్ఞానంలో నిజం బొత్తిగా ఉండదు అనుకోవడం సాహసమే అవుతుంది. ఈ పలు జాతుల ప్రజలలో తెలుగు మాతృ భాషగా కలిగిన తెలుగువాళ్ళూ
ఉండిఉండవచ్చు. కాదనటానికి లేదు. బలమైన, ప్రభావవంతమైన జాతి కావడం మూలాన పోనుపోను ఆంధ్రులంటే, తెలుగువాళ్ళన్నది స్థిరపడి పోయి
ఉంటుందనుకోవాలి.

కీసరగుట్ట

కీసరగుట్ట - శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం

హైదరాబాదు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంటుంది కీసర (కీసర గుట్ట). ప్రసిధ్ధ శైవక్షేత్రం.

క్రీ.శ. తొలి శతాబ్దాలలో ఆంధ్ర దేశాన్ని (వేంగీ దేశాన్ని) పరిపాలించిన రాజవంశాలలో ఒకటైన విష్ణుకుండినులకు, ఈ కీసరకు సంబంధం ఉందని ఒక మాట ఉంది. ఈ రాజవంశం రాజులలో ఒకడైన రెండవ మాధవ వర్మ పరిపాలనా కాలం అయిన క్రీ.శ.4-5 శతాబ్దాలలో ఈ కీసర రాజధానిగా ఉండేదని చెబుతారు.
విష్ణుకుండిన రాజులలో రెండవ మాధవ వర్మ చాలా ప్రసిధ్ధుడు. రాజ్యాన్ని బాగా విస్తరింపజేసి విష్ణుకుండినుల ప్రభను ఒక వెలుగు వెలిగించిన దీటైన రాజు. ఈయన వైదికమతాభినివిష్టుడనీ, అగ్నిష్టోమ, వాజపేయ, పౌండరీక, అశ్వమేధ, రాజసూయ ఆది క్రతువులను చేశాడనీ చరిత్ర పరిశోధకులు చెప్పారు. పదకొండుసార్లు అశ్వమేధ యాగాన్ని చేయడం వలన ఈయన రాజ్యకాలంలో పదకొండు సార్లు దిగ్విజయ యాత్ర సాగించి ఉంటాడనీ చరిత్ర పరిశోధకులు అంటారు. అప్పటిలో బలవంతులైన వాకాటకులను పోరులో ఓడించి, సంధిలో భాగంగా వాకాటక రాజు కుమార్తెను వివాహం చేసుకుని, తదనంతరం రెండు రాజ్యాలకూ వారసుడు అయ్యాడని కూడా చరిత్ర పరిశొధకులు ఊహించారు. ఇంత ప్రసిధ్ధుడైన రాజుతో సంబంధం కలిగి ఉండిన ఈ క్షేత్రం కూడా అంత ప్రసిధ్ధమైనదే! శివరాత్రి నాడు ఏటా జరిగే ఉత్సవాలకు హైదరాబాదు నుండి ప్రత్యేకంగా బస్సులను వేస్తారు. జనం తండోపతండాలుగా వెళ్ళి ఉత్సవంలో పాల్గొంటారు.

కొండ (‘గుట్ట’ అనే అనాలనుకుంటాను!) మీద ఆలయం. మెట్లు ఎక్కుతూండగా కనిపిస్తుంది ఆలయ గోపురం. కొండ (‘గుట్ట’) మీద ఆలయ ప్రాంగణంలో ఏ వైపు చూసినా శివలింగాకృతులు కనిపించి అబ్బుర పరుస్తాయి. కొండ మీదనుంచి చుట్టు scenery చూడడానికి బాగానే ఉంటుంది. ఈ మధ్యనే వెళ్ళి నప్పుడు తీసినవి ఫోటోలు ఇక్కడ కొన్ని. ఈ ఫోటోలు 2 megapixel లెన్స్ తో ఉన్న సెల్ ఫోనుతో తీసినవి. ఈ ఫోటోలలో చివరి నాలుగు ఫోటోలూ dimensions లో పెద్దవి. వాటి మీద ఎక్కడైనా సరే click చేస్తే, image ని original dimensions లో చూడడానికి వీలవుతుంది.

మళ్ళీ ఒకసారి మన ‘లేపాక్షి’ గురించి…(2)

‘లేపాక్షి’ ని గురించిన ప్రస్తావన ఎప్పుడు, ఎక్కడ వచ్చినా, లేపాక్షి కి మరో పేరు అనుబంధించబడి వినబడుతుంది. ఆ పేరు ‘బసవన్న’! ‘లేపాక్షి’ ని ‘బసవన్న’ ను విడదీయలేని అనుబంధంతో పెనవేసుకునిపోయి, ఎంతగానో ప్రసిధ్ధి చెందింది ‘లేపాక్షి బసవన్న’ అనే పేరు! లేపాక్షి కి వెళ్ళి ఈ బసవన్నను దర్శించుకోనిదే, ఆ వెళ్ళిన వాళ్ళకు లేపాక్షి సందర్శనం పూర్తి అయినట్లుగా భావింపబడదు అనడం అతిశయోక్తి కానే కాదు!

లేపాక్షి శ్రీ వీరభద్రాలయానికి ఒక కిలోమీటరు లోపు (రెండు మూడు ఫర్లాంగుల కంటె ఎక్కువ దూరం వుండదనుకుంటాను!) దూరంలోనే బసవన్న శిల్పం వుంటుంది. కాలి నడకన వెళ్ళవచ్చును.  ఏకశిల నుంచి మలచబడిన ఈ బసవన్న శిల్పం కూడా, లేపాక్షి, శ్రీ వీరభద్రాలయంలోని మిగతా శిల్పాల లాగా,  జీవకళతో మెరిసిపోతూ వుంటుంది.  మొత్తం శిలనే బసవన్నగా మలిచిన అధ్బుత శిల్పం ఇది. దేశంలోనే పరిమాణంలో అతి పెద్ద (8.1 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తు పరిమాణంతో) బసవన్న శిల్పంగా ‘లేపాక్షి బసవన్న’ ను చెబుతారు! తీరుగా కూర్చుని శ్రీ వీరభద్రాలయం కేసి స్తున్నట్లుగా మలచబడింది. బసవన్న వెనక నిలబడి, కొమ్ముల మధ్య నుంచి ధృష్టి సారించి చూస్తే శ్రీ వీరభద్రాలయంలోని  ఏకశిలపై మలచబడి వున్న నాగలింగం కనబడుతుంది.

అన్ని హంగులతో మలచబడి వున్న’లేపాక్షి బసవన్న’ ఫోటోలు, ఇక్కడ ‘slide-show’ గా!

This slideshow requires JavaScript.

మళ్ళీ ఒకసారి మన ‘లేపాక్షి’ గురించి…(1)

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం, అసంపూర్తి కళ్యాణమండపానికి పక్కన ఒకే రాతి మీద మలచిన విఘ్నేశ్వర మరియు నాగలింగ శిల్పాలున్నాయి. ఈ ప్రతిమలున్న పెద్ద శిల వున్నది, ప్రధాన ఆలయానికి సరిగ్గా వెనకవైపు అవుతుంది.

ఏకశిలలో మలచిన ఈ ప్రతిమల వెనకా ఒక కథ వుంది. ఈ ఆలయ నిర్మాణానికి నియోగించబడిన శిల్పులలో, ఒక కుర్ర శిల్పి పనితనానికి సంబంధించిన కథ అది. ఆలయ నిర్మాణం జోరుగా సాగుతున్న రోజులలో ఒకనాటి రోజు, మధ్యాహ్నం భోజన విరామ సమాయానికి, భోజనం తయారవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఆ కుర్ర శిల్పి తల్లి చెప్పడంతో, ఆ మధ్య కాలంలో ఖాళీగా కుర్చోవడం ఇష్టం లేని అతను, తిరిగి అతని తల్లి వద్ద నుండి భోజనం తయారయిందని కబురు వచ్చేంతలోనే, ఆ శిలపై ఈ రూపాలను మలిచాడనీ…

అలా అంత తక్కువ వ్యవధిలోనే శిలను అద్భుతమైన శిల్పంగా మలచ గలిగిన తన కుమారుని ప్రతిభకు ఆశ్చర్య పోయిన ఆ తల్లి, తన్మయంలో ఇంగితం మరచి కుమారుని ఎదుటనే అతని ప్రతిభను గొప్పగా పొగిడిందనీ, అలా ఆమె పొగిడిన తరువాత కొద్ది సేపటికే  అందరూ ఆశ్చర్య పోయే లాగా శిల్పం మలచ బడి వున్న శిల మధ్యలోకి పైనుంచి క్రిందివరకూ ఒక సన్నని పగులు ఏర్పడిందనీ, శిలలో ఏర్పడిన ఆ పగులు కారణంగా శిల్పం  లోపం కలది అయిపొయిందనీ ప్రచారంలో వున్న కథ!

కథ సంగతెలా వున్నా, ఏక శిలపై విఘ్నేశ్వర, నాగలింగ శిల్పాలు చూడడానికి అద్భుతంగా వుంటాయి. నాగలింగ శిల్పంలో పడగ విప్పి వున్న ఏడు తలల నాగరాజు, శిల్పం చెక్కబడి వున్న శిల సహజంగానే ఎత్తుగా వుండడం వలన చాలా gigantic గా, పేరుకు తగినట్లు magnanimous గా కనిపిస్తుంది.

ఆ ఫోటోలు మొదట విఘ్నేశ్వరునివి, ఆ తరువాత నాగరాజువి ఇప్పుడు, ఇక్కడ…slide show గా!

This slideshow requires JavaScript.

చంద్రగిరి!

చంద్రగిరి! చిత్తూరు జిల్లాలో -  ప్రపంచ ప్రసిధ్ధి చెందిన పుణ్య క్షేత్రం, ఆంధ్రుల ఇల వేలుపు, అత్యంత భక్తి శ్రధ్ధలతో కొలిచే దైవం శ్రీ వేంకటేశ్వరుని దివ్య ధామం అయిన – తిరుపతి కి 11 కి.మీ. దూరంలో వున్న ఊరు! ఈ ఊరి పేరు వినగానే ఆంధ్రుల చరిత్రలో జగజ్జగేయమానంగా వెలిగిన  విజయనగర సామ్రాజ్యం, ఆ వెంటనే శ్రీ కృష్ణదేవరాయలు, ఆ వెనువెంటనే ఆయనకు పితృసమానుడూ, గురువు అయిన తిమ్మరుసు గుర్తుకు రావడం మామూలే! తిమ్మరుసయ్య ఇక్కడే పుట్టి, విద్యాబుధ్ధులు నేర్చి అంతవాడయ్యాడని ఐతిహ్యం! కృష్ణదేవరాయలు తిరుపతి యాత్రకు వచ్చినప్పుడల్లా ఇక్కడే బస చేసేవాడని చెబుతారు.

ఇక్కడ ఇప్పుడు చూడడానికి ఒక రాజమహలు, రాణీ మహలూ ఉన్నాయి. రాజ మహలు మూడు అంతస్తులలోనూ, రాణీ మహలు రెండు అంతస్తులలోనూ ఉంటాయి. రాజ మహలులోనే ఆర్కియాలనీ డిపార్టుమెంటువారు నిర్వహిస్తూన్న మ్యూజియం వుంది.

ఇవి కాక, వీటికి దగ్గరలోనే రోడ్డుకు ఇవతలి వైపున, ఎప్పటిదో… ఇప్పుడు పాడుబడిపోయిన స్థితిలో వున్న ఒక చిన్న దేవాలయము కనిపిస్తుంది. ఎప్పటినుంచి ఈ దేవాలయం ఈ స్థితిలో వుందో తెలీదు.

ఇవి అన్నీ కలిసి వున్న ఒక slide show ఇప్పుడు, ఇక్కడ!

This slideshow requires JavaScript.

ఆంధ్రుల చరిత్ర : బృహత్ఫలాయనులు

‘బృహత్ఫలాయన’ మహారాజ జయవర్మ

ఆంధ్ర దేశాన్ని శాతవాహనులు దాదాపు నాలుగువందల సంవత్సరాలు పరిపాలించారు.  వారి పాలన స్థూలంగా క్రీ.పూ.225 నుండి క్రీ.శ.225 దాకా సాంగిదని చరిత్రకారులు చెబుతారు.  శాతవాహనుల తరువాత ఆంధ్ర దేశాన్ని పాలించిన ప్రసిధ్ధ రాజవంశం ‘ఇక్ష్వాకు’ వంశం.  ఈ వంశం పురాణ ప్రసిధ్ధి చెందినది.  వీరి పాలన తరువాత ఆంధ్ర దేశాన్ని చిన్న చిన్న రాజవంశాలు పాలించాయి. బ్రృహత్ఫలాయన, శాలంకాయన, ఆనందగోత్రులు అనే పేర్లతో వున్న ఈ రాజవంశాలకి ఈ పేర్లు వారి ‘గోత్ర’ నామాల మీదుగానే వచ్చాయని చెబుతారు. బృహత్ఫలాయనులది బృహత్ఫలాయన గోత్రం, శాలంకాయనులది శాలంకాయన గోత్రం, ఆనందగోత్రులది (వారి పేరులోనే వున్నట్లుగా) ఆనంద గోత్రం…ఇలాగ!  బృహత్ఫలాయనుల విషయంలోనే కాదు, శాలంకాయన మరియు ఆనందగోత్రుల విషయంలోనూ వారి శాసనాలలో ఎక్కడా వారి వంశ నామం చెప్పబడి వుండక పోవడం వలన ‘గోత్ర’ నామాలే వాళ్ళ వాళ్ళ వంశ నామాలయ్యాయి! చరిత్రకారులు వాళ్ళను గోత్రనామాలతోనే పిలుచుకోవాల్సి వచ్చింది! (ఇది ఇంచుమించు ఎలాంటిదంటే, పల్లవులను ‘భారద్వాజు’ లనీ, కాదంబులను ‘మానవ్యు’ లనీ పిలుచుకోవడం లాంటిదని చెబుతారు!)

బృహత్ఫలాయన వంశానికి చెందిన రాజు ఆంధ్ర చరిత్రలో ఇప్పటివరకూ ఒక్కడే ఒక్కడు కనిపిస్తాడు.  ఆ రాజు పేరు ‘జయ వర్మ’. ఈయన తన పరిపాలనా కాలంలో వేయించిన ఒక తామ్ర శాసనం వలన ఈయనకు సంబంధించిన చరిత్ర కొద్దిగానయినా బయటపడింది.  ఆ తామ్ర శాసనం నేటి గుంటూరు జిల్లా, తెనాలి కి దగ్గరిలోని ‘కొండముది’ అనే గ్రామంలో దొరకడం వలన, ఈ శాసనానికి ‘కొండముది’ తామ్ర శాసనం అనే పేరు వచ్చింది. ఈ ‘కొండముది’ తామ్ర శాసనం వలననే ‘బృహత్పలాయన’ అనే పేరుతో ఒక గోత్రం వుందన్నది వెలుగులోకి వచ్చిందని పెద్దలు చెబుతారు. ఈ గోత్ర నామం (‘బృహత్ఫలాయన స గొత్తొ’ అన్న మాటలలో) ఈ ఒక్క శాసనంలో తప్ప వేరే ఎక్కడా ఇంతవరకూ లభించకపోవడం అందుకు కారణం అని కూడా చెబుతారు.

కొండముది శాసనం ఒక దాన శాసనం! ఇందులో ‘మహేశ్వర’, ‘బృహత్ఫలాయన’ అన్న రెండు మాటలు తప్ప మిగతా అంతా ప్రాకృతంలో వుంటుంది.  ఈ శాసనంలోని రాజముద్రికలో జయవర్మ మహారాజు పేరు కనబడుతున్నది.  ఈయన బృహత్ఫలాయన గోత్రుడు. మహేశ్వర పాద భక్తుడుగా అందులో వర్ణించబడినాడు.

ఈ ‘కొండముది’ దాన శాసనంలో ఈ మహారాజు తన రాజ్యంలో వున్న ‘కూడూరుహార’ లోని ‘పంతూరు’ అనే గ్రామాన్ని ఎనమండుగురు బ్రాహ్మణులకు (బ్రాహ్మదేయంగా) ఇచ్చి వున్నానని కూడూరు లోని తన ‘వ్యాపృతు’ నకు ఈ శాసనంద్వారా తెలియజేశాడు. ఇక్కడ వాడిన ‘వ్యాపృత’ అనే మాట రాజ్యంలోని (Administrative) విభాగాలకు సంబంధించిన కొంత సమాచారాన్ని వెలుగులోకి తెచ్చి చూపెడుతుంది. అప్పటిలో రాజ్యంలోని భూభాగం పరిపాలనా సౌలభ్యం కోసం ‘ఆహారా’ లుగా విభజించబడి, ఒక్కొక్క ‘ఆహారము’ ఒక్కొక్క అధికారి చేతులలో పెట్టబడి వుండేది, ఆ అధికారి హోదాను ‘వ్యాపృత’ నామంతో పిలిచేవారు. ఈ ‘వ్యాపృత’ పదం ‘వియపత’ అన్నరూపంలో అశోకుని శాసనాలలో కనిపిస్తుంది. ఈ పదానికి పాణిని చెప్పిన ఇంకొక రూపమే ‘ఆయుక్త’. ఈ రెండూ కూడా శాతవాహనుల ‘ఆమకు’ లకు, ఆ తరువాతి కాలంలోని ‘విషయపతు’ లకు సమానమైవని చెబుతారు. ఈ ‘వ్యాపృత’ పదానికి ప్రాకృత రూపమైన ‘వాపతమ్’ జయవర్మ వేయించిన కొండముది శాసనంలోనూ, పల్లవ రాజైన యువమహారాజ శివ స్కందవర్మ వేయించిన ‘మైదవోలు’ శాసనంలోనూ కనిపిస్తుంది. దీనిని బట్టీ, మైదవోలు, కొండముది శాసనాలలోని లిపి కూడా ఒకేరకంగా వున్నట్లు అనిపించడాన్నిబట్టీ, బృహత్పలాయన జయవర్మ, యువమహారాజ శివ స్కందవర్మ సమకాలీనులయి వుండవచ్చన్న అభిప్రాయానికి Dr.Hultzsch వంటి లిపి శాస్త్రజ్ఞులు (epigraphists) వచ్చారు!  (పల్లవ యువ మహారాజ శివస్కందవర్మ వేయించిన ఈ ‘మైదవోలు’ తామ్ర శాసనానికి ఆంధ్ర చరిత్రలో ఒక ప్రముఖ స్థానం వుంది. దేశపరమైన ‘ఆంధ్ర’ శబ్దం ప్రయోగం మొట్టమొదటగా ఈ శాసనంలో జరగడం, ఇందువలన ఈయన పరిపాలనా కాలమైన క్రీ.శ.మూడవ శతాబ్దం నుంచే ‘ఆంధ్ర’ శబ్దం దేశ సూచకంగా వాడుకలో వుండినదని ఈ శాసనంలోని ‘అంథాపథీయో’ అనే మాటల వలన తెలియడం, ఈ శాసన ప్రాముఖ్యానికి గల కారణాలు!)

పల్లవ శివ స్కందవర్మ రాజ్యం చేస్తున్న కాలంలో (అంటే క్రీ.శ.మూడవ శతాబ్దం ఉత్తరార్ధంలో) బృహత్ఫలాయనులు వేంగిని పరిపాలిస్తూండే వారనీ, ఇక్ష్వాకులు ఆంధ్ర దేశాన్ని (అంటే శ్రీశైలం, దక్షిణ కోసల మరియు గోదావరీ ఉత్తర కోస్తా తీర ప్రాంతం అంతా కలిసివున్న ప్రదేశాన్ని) పాలిస్తూండేవారనీ కూడా ఒక అభిప్రాయానికి చరిత్రకారులు రావడం జరిగింది.  దీనిని బట్టి చూస్తే, ఇక్ష్వాకుల పరిపాలనా కాలం, బృహత్ఫలాయన జయవర్మ రాజ్యం చేసిన కాలం, పల్లవుల రాజ్య కాలం అన్నీ సమకాలికాలై కనిపిస్తాయి. ఈ రాజుల పరిపాలనా కాలం క్రీ.శ.మూడవ శతాబ్దం!

అయితే, నాణానికి ఒక వైపు లాంటి పై అభిప్రాయానికి, రెండవ వైపు లాంటి వేరొక అభిప్రాయం కూడా వుంది! ఆ అభిప్రాయం ప్రకారం, మైదవోలు శాసనాన్ని యువమహారాజు శివస్కందవర్మ, తన తండ్రి (బప్ప) రాజ్యం చేస్తున్న కాలంలో ఇచ్చాడని, ఈ శాసనంలోని లిపినీ, బృహత్ఫలాయన జయవర్మ ఇచ్చిన ‘కొండముది’ శాసనంలోని లిపినీ పోల్చి చూస్తే, జయవర్మ యొక్క కొండముది శాసనం మైదవోలు శాసనం కంటే కనీసం ఒక తరం ముందుదనీ, కాబట్టి జయవర్మ, పల్లవ శివస్కందవర్మ కంటే కనీసం ఒక తరం ముందు రాజ్యం చేసి వుంటాడనీ కూడా చెబుతారు. చారిత్రకంగా కూడా ఇదే నిజమైనదన్న అభిప్రాయం కూడా వుంది!  కృష్ణకు దక్షిణాన వున్న ప్రాంతాల దాకా కూడా జయవర్మ అధికారం చెల్లిందనీ, ఆ దిగువన అంతా పల్లవ రాజ్యం క్రింద వుండినదనీ కూడా ఇక్కడ నిర్ణయించుకోవచ్చు.

బృహత్ఫలయాన వంశ మూలపురుషుడు ఎవరో తెలుసుకోవడానికి ఏ ఆధారమూ లేదు.  కొండముది శాసనంలో కూడా ఈ ప్రస్తావనలేక పోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాదాపుగా సమకాలీకులైన  పల్లవ, శాలంకాయనుల శాసనాలలో ఈ ఆచారం పాటింపబడి వుండడం ఇందుకు కారణం! కొండముది శాసనంలో, జయవర్మ తన తండ్రి పేరును తెలుపకపోయి వుండడం వలన, జయవర్మ తనకు తానుగానే తన ఒక్కడి కృషిద్వారా రాజ్యాన్ని దక్కించుకుని, తద్వారా బృహత్ఫలాయన వంశానికి మూలపురుషుడై,  ఆ వంశంలో ఒక్కడే ఒక్క రాజుగా చరిత్రలో మిగిలిపోయాడా? అన్న సందేహం కూడా కలుగుతుంది. అయితే, ఈ సందేహం తీరడానికి సరిపోయే ఆధారాలేవీ చరిత్రలో మిగలలేదు, మిగిలినా ఇప్పటివరకూ లభ్యం కాలేదు!

(ఈ చిన్న వ్యాసం వ్రాయడంలో సంప్రదించిన ప్రముఖుల పుస్తకాలు: (1) Early history of the Andhra Country – Dr.K. Gopalachari (2) ఆంధ్రుల చరిత్రము – (ప్రథమ భాగం) – చిలుకూరి వీరభద్రరావుగారు      (3) చరిత్ర చర్చ – ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి.)

తెలుగు మాట, పాట, పద్యం (6)

అచ్చ తెనుగు పాట

పండుగ రోజులలో తెలుగిళ్ళలో స్త్రీలు నోములు నోయడం అన్నది మన సంస్కృతీ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన భాగం. శ్రావణ మాసంలో ప్రతి తెలుగిల్లు శ్రావణ మాసపు నోముల ఫలితంగా కళకళలాడుతూ వుండడం నేటికీ చూస్తూనే వుంటాం! శ్రావణమాసంలో నోముల  తరువాత, దీపావళి మొదలు కార్తీక శుధ్ధ పౌర్ణమి వరకూ పూర్వం తెలుగిళ్ళలో బాలికలు నోచే ఒక నోము (‘మూగనోము’ అని పేరు) చివర రోజున, గౌరీదేవికి పూజ చేసిన తరువాత, ఒక పాట పాడేవాళ్ళని స్వర్గీయ ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, వారు రచించిన ‘ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి’ (ప్రథమ ముద్రణ: 1951) పుస్తకంలో ఒక అచ్చ తెలుగు పాటను సూచించి, ఆ పాట పూర్తి పాఠాన్ని కూడా వ్రాసారు. ఆ పాట పేరు ‘మోచేటి పద్మం’. ఆ పాట పేరుమీదుగానే ఆ నోముకి కూడా ‘మోచేటి పద్మం’ నోము అని ఇంకొక పేరు గూడా వచ్చిందని చెప్పారు. ఆ పాట పూర్తి పాఠం ఇది:

మోచేటి పద్మమ్ము పట్టేటి వేళ
మొగ్గల్లు తామర్లు ముడిగేటి వేళ
ఆవుల్లు లేగల్లు వచ్చేటి వేళ
ఆంబోతు రంకెల్లు వేసేటి వేళ

సందేళ దీపమ్ము పెట్టేటి వేళ
చాకింటి మడతల్లు తెచ్చేటి వేళ
బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ
కోడల్లు పసుపుల్లు కొట్టేటి వేళ

కూతుళ్ళు గుండుగిన్నెల్ల కుడిచేటి వేళ
ముద్ద మొగము అద్దాన్ని బోలు
ముద్దరాలి మొగము మోచేటి పద్మమ్ముబోలు
పద్మమ్ము నోచిన చానకు పదివేల ఐదవతనము.

మొదలు నుంచి చివరిదాకా, అచ్చమైన తెలుగుదనంతో గుబాళిస్తుండే పాట ఇది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు గదా! అయితే, ఈ పాటలో ఒకింత ఇబ్బందికరమైన సంగతి, ‘మేచేటి’ అనే మాటకు అర్ధం ఏమిటి? అన్నది. ఈ మాటకు లక్ష్మీరంజనంగారు సూచించిన అర్ధం – ‘మొగుచు’ అంటే ముకుళించు పద్మమేమో! అని. వారు సూచించిన ఈ అర్ధంతో, ఈ నోమును ‘ముకుళించే పద్మం’ నోము అనుకోవడానికి కూడా సాధ్యమౌతుంది. ఈ నోము ‘మూగ నోము’ కావడం వల్లా, అంటే ఈ నోము నోచే బాలిక, నోము ఆచరించే రోజులలో సాయంత్రం
ఇరుగుపొరుగు పేరంటాండ్రను బొట్టుపెట్టి పిలవడానికి బయలుదేరిన దగ్గరనుంచి, ఆ నాటి రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూసే దాకా, ఎవరెంతగా పరియాచకాలాడి ప్రేరేపించినా మాట్లాడక ఊరకుండాడాలే తప్ప పెదవి విప్పకూడదనే నియమం వుంది కాబట్టి, ఈ నోముకు ‘ముకుళించే పద్మం’ అనే పేరు సాధ్యమే అనిపిస్తుంది; ‘పద్మం’ బాలిక నోరు, ‘ముకుళించు’ అంటే పెదవులు విప్పకుండా వుండేట్లు చేసే నోము కాబట్టి!

ఇక, ఈ పాట నిండా, నాటి పల్లెటూళ్ళ సంధ్యా సమయపు శోభ పరుచుకుని కనిపిస్తుంది. ఈ పాట మొత్తంలో అర్ధంగానట్లు అనిపించి ఇబ్బంది పెట్టే పదాలు రెండే రెండు. అవి, ‘మోచేటి’, ‘బీరాయి’ అనేవి. వీటిల్లో ,మోచేటి’ కి అర్ధం ముందే వివరించ బడింది గనుక, ఇప్పుడు , ‘బీరాయి’ అన్న పదం సంగతి చూడాలి!

‘బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ’ అని చరణం! ఇది చదివిన వెంటనే ఊహ సహజంగానే పల్లెటూరి ఇళ్ళ ముంగిళ్ళలోనో లేక పెరడులలోనో సర్వ సాధారణంగా కనుపించే ‘బీర చెట్టు’ మీదకు పోతుంది. అయితే, ‘బీర చెట్టు’ పూవులు విడవడానికి ‘సంధ్యా సమయాని’ కి ఏమిటి సంబంధం? అన్నది ప్రశ్న. అదీగాక, బీర (చెట్టు) కు ‘బీరాయి (చెట్టు)’ అని నామాంతరం వున్నట్లుగా కనబడదు. ఈ రెండూ కాకపోతే, మరి ఈ మాటకు
ఇక్కడ అర్ధం ఏమై వుంటుంది?

ప్రస్తుతానికి అదలా వుంచి, ఒక్కసారి పూజ్యులు డాక్టర్ బిరుదురాజు రామరాజు గారి ‘తెలుగు జానపదగేయ సాహిత్యం’ (ప్రథమ ముద్రణ: 1958) పుస్తకంలో చూస్తే, ఈ ‘మోచేటి పద్మం’ నోము శ్రీ నేదునూరి గంగాధరం గారి పాఠంలో ‘మోచేతి పెద్దమ్మ’ నోముగా మారి, ఈ పాట పాఠం కూడా బాగా విస్త్రుతమై కనిపిస్తుంది. శ్రీ గంగాధరంగారి పాఠం ఇది:

మోచేటి పెద్దమ్మ నోచేటి వేళ – మొగ్గల్లు తామరలు పూసేటివేళ
బీరాయి పువ్వులు పూసేటి వేళ – బిందెలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
గుమ్మడి పువ్వులు పూసేటివేళ – గుండిగలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
కాకర పువ్వులు పూసేటివేళ – కడవలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
ఆనబాయ పూవులు పూసేటివేళ – అటికలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
చిక్కుడు పువ్వులు పూసేటివేళ – చిప్పలతో గంధాలు తీసేటివేళ
ఆవులు దూడలు వచ్చేటివేళ – ఆంబోతు రంకెలు వేసేటివేళ
సందిటి దీపాలు పెట్టేటివేళ – చాకింటి మడతలు దెచ్చేటివేళ
మరదళ్ళు మరి జూద మాడేటివేళ – కూతుళ్ళు గుండిగలు దింపేటివేళ
కోడళ్ళు కొటుపసుపు కొట్టేటివేళ – చెల్లెల్లు చేమంతులు ముడిచేటివేళ
వదినల్లు వంటిల్లు చేసేటివేళ -
ముద్దుల మొగము అద్దానబోలు – తన ముఖము తామర పద్మానబోలు.

శ్రీ నేదునూరి గంగాధరం గారు ఇచ్చిన పాఠాన్ని బట్టి చూస్తే, ‘బీరాయి’ బీర చెట్టునే సూచిస్తుంది. అయితే, ఈ పాఠం లక్ష్మీరంజనంగారి పాఠంలోలా ‘సంధ్య’ వర్ణనను సూచించదు. తెలుగింటి వాతావరణం మాత్రం కళ్ళకు కట్టినట్లు వుంటుంది. కానీ, లక్ష్మీరంజనంగారి పాఠంతో పోలిస్తే మాత్రం, ఈ పాట పాఠం సందర్భ శుధ్ధి లేనట్లుగా, అంటే ఒక సందర్భానికి సంబంధించినది కాకుండా వున్నట్లుగా అనిపిస్తుంది. పాట పేరులోకూడా ఈ అసందర్భం కనిపిస్తుంది, ‘మోచేతి పెద్దమ్మ’ ఏమిటన్నది అంతు చిక్కేదిగా కనుపించదు.

ఇప్పుడు, లక్ష్మీరంజనంగారు ఇచ్చిన పాట పాఠంలోని ‘బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ’ దగ్గరకొస్తే, ‘బీరాయి’ అన్న పదం ‘బీర చెట్టు’ ను సూచించేదిగానే అనుకుంటే, ‘బీర చెట్టు పూవులను విడిచేటి వేళ’ అన్న అర్ధం ఆ చరణానికి వస్తుంది. ఇందులో ఇమిడి వున్న అర్ధం ఏమిటి? అన్నది మాత్రం ఇప్పటిదాకా ఎంతగా శోధించినా నాకు పట్టుబడలేదు. బీర చెట్టు వెశేషంగా సాయంత్రం వేళల పూవులను రాలుస్తుందా? అన్నది నాకున్న సందేహం! రాలుస్తుంది గనకనే ఆ పాటలో చరణం అలా వుందని నేను నమ్ముతున్నాను! ఇది సరైనదో కాదో తెలిసినవాళ్ళు చెప్పాలి!

తెలుగు మాట, పాట, పద్యం (5)

అచ్చ తెనుగు పద్యం

తెలుగు పద్య సాహిత్యంలో ‘అచ్చ తెనుగు’ అన్న మాటను మొదటి సారిగా వాడిన వ్యక్తి మూలఘటిక కేతన అని చెబుతారు. ఈయన తిక్కన మహాకవి సమకాలికుడు. తెలుగులో మొదటి కథాకావ్యానికి (దశకుమార చరిత్ర) శ్రీకారం చుట్టినవాడు కేతన. ‘కవిత చెప్పి’ తిక్కన మహాకవినే మెప్పించినవాడు ఈయన.  ఈయన చెప్పిన ఈ ‘అచ్చ తెనుగు’ అనే మాటకు ముందు, ఈ మాట ఏ అర్ధాన్నయితే సూచిస్తుందో అదే అర్ధంలో ‘జాను తెనుగు’, ‘దేశి’ అనే మాటలు వాడుకలో వుండేవి. ఈ మాటలను తమ పద్యాలలో చెప్పిన వారు ‘నన్నె చోడుడు’, పాలుకురికి సోమనాధుడు!

పేరుకి ఇన్ని మాటలున్నా, ఈ మాటలు ‘అచ్చ తెనుగు’ భాషా స్వరూపాన్ని అర్ధమయేలా చేయడంలో సఫలీకృతం కాలేకపోయాయన్న ఒక అభిప్రాయం, విజ్ఞుల మాట కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాలి! భాషా స్వరూపం అర్ధం కావాలంటే, ఒక ఉదాహరణంతో చెప్పుకుంటే, కొంతలో కొంత స్ఫష్టత వచ్చి, సులభం అవుతుంది.

“పగలు సేయుచు వేడిమి మిగుల జగము
గ్రాచు జమునబ్బ మున్నీట గలిసె ననియొ
తొగ వెలందుక నగియె నమ్మగువ పెంపు
గని సయింపక తమ్మి మొగంబు మొగిచె.”

కూచిమంచి తిమ్మకవి రచించిన ‘అచ్చ తెలుగు రామాయణం’ కావ్యంలోనిది ఈ పద్యం. సూర్యాస్తమయాన్ని సుందరంగా వర్ణించే పద్యం! నాకయితే, ఈ పద్యంలోని మాటల పొందిక, brevity, గాథా సప్తశతిలోని గాథలను తలపుకు తెస్తుంది. మంచి భావంతో నిండి వున్న పద్యం! ఊహ original ది! నాకు తెలిసినంతవరకూ, ఏ ప్రాకృత గాథనుంచో, సంస్కృత శ్లోకంనుంచో ఎత్తుకొచ్చింది కాదు!

ఇప్పుడు, ఈ పద్య భావాన్ని కొంచెం విడమరచి చెప్పుకుంటే…

‘పగలు సేయుచు’ – పగలు సేయువాడు – దినకరుడు.
సందర్భం వచ్చింది గాబట్టి, ఇక్కడ, కొన్ని రకాలయిన సంస్కృత సమాసాలు అచ్చ తెలుగులోకి మారేటప్పుడు జరిగే మార్పులను గురించి కొంత వివరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో సంస్కృత సమాసాలలోని ప్రత్యయాలకు బదులుగా తెలుగు సమాసాలలో వాడు, దొర, తపసి, జోదు…ఇత్యాది శబ్దాలు జతవుతాయి అని వ్యాకరణం. ఉదాహరణకి:

అచ్చ తెలుగులో ‘కప్పు కుత్తుక వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘నీలకంఠ’ కు,
అచ్చ తెలుగులో ‘గిత్త తత్తడి వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘వృషభ వాహన’ కు,
అచ్చ తెలుగులో ‘వెంట్రుక యడుగుల దొర’ అనే సమాసం, సంస్కృతంలో ‘రోమ పాద’ కు,
అచ్చ తెలుగులో ‘మనుబోతు కొమ్ము తపసి’ అనే సమాసం, సంస్కృతంలో ‘ఋష్యశృంగ’ కు,
అచ్చ తెలుగులో ‘పచ్చ వారువపు జోదు’ అనే సమాసం, సంస్కృతంలో ‘హరిదశ్వా’ కూ అనువాదాలని పెద్దల వివరణ. తెలుగులో వీటినే బహువ్రీహి సమాసాలుగా భావిస్తారని కూడా చెబుతారు, అర్ధంలో చివరన కలది, కలవాడు చేరతాయి కాబట్టి. (నల్లని కంఠము కలవాడు, ఎద్దును వాహనముగా కలవాడు…ఇత్యాదిగ).

నాకయితే తెలుగులో ఈ మాటలు, సంస్కృతంలో మాటలు ఎంత అందంగా కనిపిస్తాయో, తెలుగులోనూ అంతే అందంగా అనిపిస్తాయి. ఇలాంటివే ఇంకొన్ని సమాసాలు:

వలిగుబ్బలి రాచ కూతురు (హైమవతి – హిమవంతుని కూతురు, ‘వలిగుబ్బలి’ అంటే మంచుకొండ అని అర్ధం), పుట్ట బుట్టువు తపసి (వాల్మీకి – పుట్ట  నుంచి పుట్టిన తపస్వి), పదియరదముల దొర కొడుకు (దాశరధి – దశరధుని కుమారుడు) – ఇవన్నీ కూడా సంస్కృత శబ్దాలంత అందంగానే కనబడతాయి.

ఇక్కడితో ఇది ఆపి, అసలు పద్యానికొస్తే –

పగలు సేయుచు – పగటిని చేస్తూ, ఆ క్రమంలోనే; వేడికి మిగుల జగము గ్రాచు – వేడిమితో జగత్తునంతా వుడికించి ఇబ్బందికిలోను చేసే; యమునబ్బ – యముని తండ్రి (సూర్యుడు); మున్నీట – సముద్రములోనికి; కలిసె ననియొ – కలిసిపోయాడుగదా అని; తొగ వెలందుక – కలువ పూవు (అనే పడతి); నగియె – నవ్వింది; అమ్మగువ – ఆ కలువ సుందరి; పెంపు గని – సంతోషంతో వదనం పెద్దదవడం (కలువ వికసించడం అన్న భావం) చూసి; సయింపక – తాళ లేక; తమ్మి – తామర పూవు (అనే పడతి); మొగంబు మొగిచె – మొహం ముడుచుకుంది, చాటు చేసుకుంది.

సూర్యాస్తమయంతోనూ, చంద్రాగమనంతోనూ కలువలు వికసించడం అనేది ప్రకృతి ధర్మం. సూర్యాస్తమయంతో తామరలు వికసనం కొల్పోయినట్లయి, కళావిహీనంగా, ముడుచుకున్నట్లయిపోవడమూ ప్రకృతిధర్మమే! ఈ రెండు ధర్మాలనూ కలబోసి, ఒకే సందర్భానికి జతచేసి, హృద్యంగా చెప్పడం ఈ పద్యంలో జరిగింది.

నాకు ఈ పద్యాన్ని చదివినప్పుడల్లా, ఇంకొకటి కూడా అనిపిస్తుంది. పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, గాథా సప్తశతి లోని పద్యాలను తెలుగులోకి అనువదించడంలో ఈ పద్యాన్నే(సరిగ్గా ఈ పద్యాన్నే అని కాకుండా, ఇలాంటి పద్యాలనే) ఆదర్శంగా తీసుకున్నరేమో! అని. ఎందుకంటే, అందులోని చాలా పద్యాల నడక ఈ పద్యాన్నే పోలి వుంటుంది. ఉదాహరణకి:

“అడుగుదమ్ములందు బడివేడు పతివీపు
జిన్ని కొమరుడెక్కి చెలగి యాడ
అలుక యెంత తెగనిదయ్యును నిల్లాలి
మొగమునందు నవ్వు మొలచె నపుడు! “                (శతకం 1 గాథ 11)

“ఎవని వదలిన జీవంబు నవసి చనునొ
యతని నపరాధినయ్యు నోదార్ప వలయు;
ఊరు గాలుచు బొలిపోవు చున్న గాని
యగ్గి నొల్లని వారెవ్వరతివ, చెపుమ?”         (శతకం 2, గాథ 63)

అందుండి అచ్చ తెలుగు మాటలలో వున్న ఇలాంటి రమ్యమైన పద్యాలను ఇంకా చాలానే ఉదాహరించవచ్చు!

మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (13)

వివిధ (వైవిధ్య) రూపాలు (2)

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం స్తంభాలపైన, గోడలపైన మలచబడి వున్న మరి కొన్ని అందమైన రూపాలు:

ఏనుగుపై ఆసీనమైవున్న/నిలబడి వున్న సింహం

మరుక్షణం గెంతడానికి చూస్తున్నట్లున్న జింక

ఆసీనుడై ఎదురుగా చూస్తున్న పురుషుడు

ఆసీన వృషభం (కూర్చుని వున్న ఎద్దు) అనవచ్చుననుకుంటాను.

హరిసంకీర్తనా నిమజ్ఞుడు

పూర్ణ కుంభం

ఆకుల/పూరేకుల ఒక డిజైన్

సర్వాలంకృతయై చేతిలో పూగుత్తితో నిలబడివున్న వనిత

అలంకరింపబడివున్న ఏనుగు

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం స్తంభాల వసారాలోనూ, నాట్యమండపంలోనూ స్తంభాలపై మలచబడి వుండి అడుగడుగునా దర్శనమిచ్చే అందమయిన రూపాలలో ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే!

మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (12)

వివిధ (వైవిధ్య) రూపాలు (1)

ఆలయాల నిర్మాణంలో స్థపతులకు ఎదురయ్యే సమస్యలలో ముఖ్యమైనది అనదగినది space management! ఇక్కడ space అంటే, అప్పటిదాకా ఏమీ లేని ఖాళీ ప్రదేశం అనే కాదు. రాతి గోడ మీద విస్తారంగా వున్న ప్రదేశం, రాతి స్తంభంపై పరిమితంగా వున్న ప్రదేశం కూడా ఖాళీ ప్రదేశమే! ఏ అలంకరణాలేని రాతి గోడ కానీ, స్తంభం కానీ ఏమీ చెప్పదు. ఏ అనుభూతినీ కలిగించదు. దేవాలయం అనేది ఏమీ చెప్పకపోవడానికీ, ఏ అనుభూతినీ కలిగించకుండా వుండడానికి వుద్దేశించినది కాదు. దేవాలయ ప్రాంగణంలో అడుగు పెట్టిన దగ్గరనుంచీ సందర్శకుని కంటినీ, చిత్తాన్ని రూపంతో నింపాలి అన్నది ఆనాటి స్థపతులకు అవగతం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఈ realisation దేవాలయంలోని గోడలపై, స్తంభాలపై కొన్ని లోక (worldly), కొన్ని అతిలోక (unworldly and mythical) ఆకృతుల రూప కల్పనకు, మలచడానికి దారి తీసింది. అలాంటి అతిలోక (mythical and purely imaginary) శిల్పాకృతులలో చాలా ఆకర్షణీయమైనది, ముఖ్యమైనది ఒకటి – ‘ఆసీన శార్దూలం’ (కూర్చుని వున్న సింహం) అన్న పేరు కలిగిన శిల్పాకృతి.

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : 'ఆసీన శార్దూలం'

ఈ శిల్పాకృతులు విజయనగర రాజుల కాలంలో నిర్మించబడిన దేవాలయాలలో ఎక్కువగా కనబడతాయని పెద్దలు చెబుతారు. సింహం తలతోనూ, మనిషి శరీరంతోనూ వుండే ఈ రూపం, చూసేందుకు వింతగా అనిపించినా, ఆకర్షణీయంగా మలచబడి కనిపిస్తుంది. పెద్ద పెద్దగా వుండి ముందుకు పొడుచుకు వచ్చినటులుండే కళ్ళు, బయటికి చొచ్చుకు వచ్చినట్లుండే నాలుక, కాళ్ళకూ చేతులకూ పొడుగాటి గోళ్ళతో ఎక్కడ మలచబడినా కూడా కూర్చుని వున్నట్లుగానే మలచబడి కనిపిస్తుంది. ఈ రూపాన్ని కొందరు వ్యాఖ్యాతలు ‘యోగ నారసింహ మూర్తి’ గా కూడా వ్యాఖ్యానించడం కనబడుతుంది. ఈ రూపం విజయనగర శిల్పుల చేతిలో పరిణతి చెంది ఆకర్షవంతమయినప్పటికీ, ఇది విజయనగర శిల్పుల సృష్టి మాత్రం కాదనీ, పల్లవుల కాలం నుంచీ ఈ రూపం దేవాలయ స్తంభాలపై దర్శనమిస్తుందనీ పెద్దలు చెబుతారు.

లేపాక్షి శ్రీ వీరభద్రాలయంలో స్తంభాలపై ఆకర్షణీయంగా మలచబడి కనుపించే మరో వింతైన రూపం ‘మరుగుజ్జు’ ప్రతిమ రూపం.  ఈ ‘మరుగుజ్జు’ ప్రతిమలు శిల్పంలో బౌధ్ధుల కాలంనుంచీ ఉన్నాయని చెబుతారు. అన్ని కాలాల దేవాలయాలలోనూ శిల్పులు ఈ ప్రతిమను అభిమానించి ఆదరించి మలిచినట్లు చెబుతారు. శరీరావయవాలు బలిష్టంగానూ, బొద్దుగానూ, అకారంలో పొట్టిగా, శరీరంపై కొన్ని రకాలయిన అలంకరణాలతో వుండే ఈ ప్రతిమ విషేషంగా లేపాక్షి శ్రీ వీరభద్రాలయంలోని నాట్య మండపం స్తంభాలపై మలచబడి కనిపిస్తుంది. ఒక్కొక చోట వీరత్వం వుట్టిపడే ముఖ, శరీర అవయవాలతో మలచబడితే, మరింకొన్ని చోటల ఒక సంగీత వాయిద్యాన్ని ఊదుతున్నట్లుగానూ మలచబడి కనిపిస్తుంది.

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : 'మరుగుజ్జు' (1)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : 'మరుగుజ్జు' (2)