స్వగతాలు (4): ఆధునికత!

ఆధునికత!

ఐరోపీయ నాగరికతకు గ్రీకు భావజాలం పునాది.
గ్రీకు పురాణ భావాజాలానికి హిందూ పురాణ భావజాలానికీ సారూప్యత కనిపిస్తుంది.
అతి ముఖ్యమైన బేధమూ కనిపిస్తుంది.
అది – గ్రీకు భావజాలం ఈ భూమినీ భౌతిక శరీరాన్నీ కేంద్రంగా చేసుకుంటే,
హైందవ భావజాలం భూమిని వదిలి ఆకాశాన్నీ ఆత్మనూ కేంద్రంగా చేసుకుని ఎదిగాయి.

myth లు మాయా శశిరేఖల లాంటివి.
హిందూ, గ్రీకు భావజాలాలు రెండింటిలోనూ  కనుపించీ కనుపించనట్లుండే, వినిపించీ వినిపించనట్లుండే
ఎన్నెన్నో అమోఘమైన మాయలనూ, మనోహరమైన స్వప్నాలనూ మానవ మస్తిష్కానికి అవి అల్లి చూపించాయి.

Galileo తోనూ Rene Descartes తోనూ ఐరోపీయ నాగరికత ఆధునికతను సంతరించుకోవడం మొదలెట్టిందని ఒక మాట.
విషయాన్ని మొత్తంగా కన్నా ఖండ ఖండాలుగా విభజించి చూస్తేగాని అసలు నిజం అవగతంగాదన్నది ఆధునిక భావనగా మొదలై, మానవ శరీరంతో సహా కంటికి కనుపించే ప్రతిదీ సూక్ష్మాతి సూక్ష్మ దృష్టిలో ముక్కలవడం మొదలైంది అప్పటినుంచీ! (ఇది క్రీ.శ,16వ, 17వ  శతాబ్దాల నాటి మాట.  మనం అప్పుడు విజయనగర రాజుల పాలనలోని మలిదశలోనూ, గోల్కొండ, డచ్చి, ఫ్రెంచి పాలకుల కాలంలోనూ వున్నాం).

ఐరోపీయ ఆధునికతలో మనిషిని ముక్కలు చేసి చూసే కొలదీ, విషయ జ్ఞానం పెరిగేకొలదీ, ఇంకా అస్పష్టంగా అయిపోవడం మొదలెట్టిన చూపు మనిషిని మరికాస్త అష్పష్టంగా చూపెట్టడం మొదలెట్టిందనీ,  జ్ఞానం ఎంతగా పెరిగితే, అంతగానూ అస్పష్టత పెరిగిందనీ మరి ఒక మాట.

ఈ అస్పష్టతలో మనిషి తనను తాను పోగొట్టుకోకుండా వుండడానికి, మనిషిని మునుపటిలా మొత్తంగా చూసుకోవడానికీ, అక్కడ పుట్టిన ఆధునిక మార్గమే ‘నవల’ అన్నది ఒకటి గుర్తించదగిన మాట.

జ్ఞానం ఒక్కటే నవలకు నైతికత అనీ, ఆధునిక మానవ జీవనంలోని సంక్లిష్టతకూ, సంక్షోభానికీ సంబంధించిన ఏదో ఒక కొత్త నిజాన్ని ఆవిష్కరించి చూపెట్టని ఏ నవలైనా అనైతికమైనదేననీ చెప్పిన నిర్వచనం లాంటి మాట కూడా తప్పనిసరిగా మన్నించదగినది.

Cervantes తో adventure అనే భ్రమ యొక్క ఆనుపానులను పెళ్ళగించడానికి పూనుకుంది నవల.
Richardson తో మనిషి అంతరంగంలోని రహస్య మాయామోహాలను వెలికితీయడానికి పూనుకుంది నవల.
Balzac తో చరిత్రలో మనిషి వేళ్ళూనుకొన్న నేపథ్యాలను కనుగొనటానికి పూనుకుంది నవల.
Flaubert తో మనిషి రోజువారీ జీవితంలో అప్పటిదాకా కనుగొనబడని కొత్త విషయాలను విశదీకరించడానికి పూనుకుంది నవల.
Tolstoy తో మనిషి అర్ధంలేనివిగా అనుపించే ఆవేశాలనూ, నిర్ణయాలనూ అంతు చిక్కించుకోవడానికి ప్రయత్నించింది నవల.
Proust తో చిక్కకుండా వెళ్ళిపోయే గతాన్నీ, Joyce తో చిక్కకుండా వెళ్ళిపోయే వర్తమానాన్నీ పట్టుకోవాలని ప్రయత్నంచేసింది నవల.
Thomas Mann తో వర్తమానంలోని మనిషి నిర్ణయాలకు ఏనాటివో గతంలోని సంగతుల సంబంధాన్ని విశదీకరించడానికి పూనుకుంది నవల.
Kafka తోనూ Camus తోనూ ఆధునిక జీవన విధానంలోని absurdities ని ఎండగట్టే యత్నం చేసింది నవల.
Marquez తో magic realism అనే మాయా వాస్తవాన్ని రుచి చూపించింది నవల.

ఇలా ఇంకెన్నిటినో చేసి చూపించింది ఐరోపీయ ఆధునికతలో వూపిరి పోసుకున్న నవల.

‘నవల ఎక్కడ ఏది సాధించి చూపించినా అది ఐరోపీయ ఆధునికత విజయమే!’ అని చాటుకునేంత బలంగా ఇది నిరూపితమై మిగిలింది.

అదలా వుండగా
ఒకప్పటిదాకా గ్రీకు భావజాలంతోనూ, నాగరికతతోనూ సమ ఉజ్జీగా ఉన్నట్లుండిన హైందవ భావజాలమూ, నాగరికతా, ఐరోపీయ ఆధునికతకు సమాంతరంగా తాను కనిపెట్టి పెంచుకున్న ఆధునికత ఏది?
హిందూ ఆధునికత అంటూ అసలు ఒకటి యోచించబడి వున్నదా? వుంటే ఎక్కడ, ఏ రూపంలో వుంది?
లేకుంటే, ఐరోపీయ ఆధునికతను అనుకరించడమే, అనుసరించడమే హిందూ ఆధునికత అయిందా?
ఎప్పటికైనా అదే – ఐరోపీయ ఆధునికతయే – ఆదీ, అంతమూనా?

తెలుగు మాట, పాట, పద్యం (6)

అచ్చ తెనుగు పాట

పండుగ రోజులలో తెలుగిళ్ళలో స్త్రీలు నోములు నోయడం అన్నది మన సంస్కృతీ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన భాగం. శ్రావణ మాసంలో ప్రతి తెలుగిల్లు శ్రావణ మాసపు నోముల ఫలితంగా కళకళలాడుతూ వుండడం నేటికీ చూస్తూనే వుంటాం! శ్రావణమాసంలో నోముల  తరువాత, దీపావళి మొదలు కార్తీక శుధ్ధ పౌర్ణమి వరకూ పూర్వం తెలుగిళ్ళలో బాలికలు నోచే ఒక నోము (‘మూగనోము’ అని పేరు) చివర రోజున, గౌరీదేవికి పూజ చేసిన తరువాత, ఒక పాట పాడేవాళ్ళని స్వర్గీయ ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, వారు రచించిన ‘ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి’ (ప్రథమ ముద్రణ: 1951) పుస్తకంలో ఒక అచ్చ తెలుగు పాటను సూచించి, ఆ పాట పూర్తి పాఠాన్ని కూడా వ్రాసారు. ఆ పాట పేరు ‘మోచేటి పద్మం’. ఆ పాట పేరుమీదుగానే ఆ నోముకి కూడా ‘మోచేటి పద్మం’ నోము అని ఇంకొక పేరు గూడా వచ్చిందని చెప్పారు. ఆ పాట పూర్తి పాఠం ఇది:

మోచేటి పద్మమ్ము పట్టేటి వేళ
మొగ్గల్లు తామర్లు ముడిగేటి వేళ
ఆవుల్లు లేగల్లు వచ్చేటి వేళ
ఆంబోతు రంకెల్లు వేసేటి వేళ

సందేళ దీపమ్ము పెట్టేటి వేళ
చాకింటి మడతల్లు తెచ్చేటి వేళ
బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ
కోడల్లు పసుపుల్లు కొట్టేటి వేళ

కూతుళ్ళు గుండుగిన్నెల్ల కుడిచేటి వేళ
ముద్ద మొగము అద్దాన్ని బోలు
ముద్దరాలి మొగము మోచేటి పద్మమ్ముబోలు
పద్మమ్ము నోచిన చానకు పదివేల ఐదవతనము.

మొదలు నుంచి చివరిదాకా, అచ్చమైన తెలుగుదనంతో గుబాళిస్తుండే పాట ఇది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు గదా! అయితే, ఈ పాటలో ఒకింత ఇబ్బందికరమైన సంగతి, ‘మేచేటి’ అనే మాటకు అర్ధం ఏమిటి? అన్నది. ఈ మాటకు లక్ష్మీరంజనంగారు సూచించిన అర్ధం – ‘మొగుచు’ అంటే ముకుళించు పద్మమేమో! అని. వారు సూచించిన ఈ అర్ధంతో, ఈ నోమును ‘ముకుళించే పద్మం’ నోము అనుకోవడానికి కూడా సాధ్యమౌతుంది. ఈ నోము ‘మూగ నోము’ కావడం వల్లా, అంటే ఈ నోము నోచే బాలిక, నోము ఆచరించే రోజులలో సాయంత్రం ఇరుగుపొరుగు పేరంటాండ్రను బొట్టుపెట్టి పిలవడానికి బయలుదేరిన దగ్గరనుంచి, ఆ నాటి రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూసే దాకా, ఎవరెంతగా పరియాచకాలాడి ప్రేరేపించినా మాట్లాడక ఊరకుండాడాలే తప్ప పెదవి విప్పకూడదనే నియమం వుంది కాబట్టి, ఈ నోముకు ‘ముకుళించే పద్మం’ అనే పేరు సాధ్యమే అనిపిస్తుంది; ‘పద్మం’ బాలిక నోరు, ‘ముకుళించు’ అంటే పెదవులు విప్పకుండా వుండేట్లు చేసే నోము కాబట్టి!

ఇక, ఈ పాట నిండా, నాటి పల్లెటూళ్ళ సంధ్యా సమయపు శోభ పరుచుకుని కనిపిస్తుంది. ఈ పాట మొత్తంలో అర్ధంగానట్లు అనిపించి ఇబ్బంది పెట్టే పదాలు రెండే రెండు. అవి, ‘మోచేటి’, ‘బీరాయి’ అనేవి. వీటిల్లో ,మోచేటి’ కి అర్ధం ముందే వివరించ బడింది గనుక, ఇప్పుడు , ‘బీరాయి’ అన్న పదం సంగతి చూడాలి!

‘బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ’ అని చరణం! ఇది చదివిన వెంటనే ఊహ సహజంగానే పల్లెటూరి ఇళ్ళ ముంగిళ్ళలోనో లేక పెరడులలోనో సర్వ సాధారణంగా కనుపించే ‘బీర చెట్టు’ మీదకు పోతుంది. అయితే, ‘బీర చెట్టు’ పూవులు విడవడానికి ‘సంధ్యా సమయాని’ కి ఏమిటి సంబంధం? అన్నది ప్రశ్న. అదీగాక, బీర (చెట్టు) కు ‘బీరాయి (చెట్టు)’ అని నామాంతరం వున్నట్లుగా కనబడదు. ఈ రెండూ కాకపోతే, మరి ఈ మాటకు
ఇక్కడ అర్ధం ఏమై వుంటుంది?

ప్రస్తుతానికి అదలా వుంచి, ఒక్కసారి పూజ్యులు డాక్టర్ బిరుదురాజు రామరాజు గారి ‘తెలుగు జానపదగేయ సాహిత్యం’ (ప్రథమ ముద్రణ: 1958) పుస్తకంలో చూస్తే, ఈ ‘మోచేటి పద్మం’ నోము శ్రీ నేదునూరి గంగాధరం గారి పాఠంలో ‘మోచేతి పెద్దమ్మ’ నోముగా మారి, ఈ పాట పాఠం కూడా బాగా విస్త్రుతమై కనిపిస్తుంది. శ్రీ గంగాధరంగారి పాఠం ఇది:

మోచేటి పెద్దమ్మ నోచేటి వేళ – మొగ్గల్లు తామరలు పూసేటివేళ
బీరాయి పువ్వులు పూసేటి వేళ – బిందెలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
గుమ్మడి పువ్వులు పూసేటివేళ – గుండిగలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
కాకర పువ్వులు పూసేటివేళ – కడవలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
ఆనబాయ పూవులు పూసేటివేళ – అటికలతో ఉదకమ్ము తెచ్చేటివేళ
చిక్కుడు పువ్వులు పూసేటివేళ – చిప్పలతో గంధాలు తీసేటివేళ
ఆవులు దూడలు వచ్చేటివేళ – ఆంబోతు రంకెలు వేసేటివేళ
సందిటి దీపాలు పెట్టేటివేళ – చాకింటి మడతలు దెచ్చేటివేళ
మరదళ్ళు మరి జూద మాడేటివేళ – కూతుళ్ళు గుండిగలు దింపేటివేళ
కోడళ్ళు కొటుపసుపు కొట్టేటివేళ – చెల్లెల్లు చేమంతులు ముడిచేటివేళ
వదినల్లు వంటిల్లు చేసేటివేళ -
ముద్దుల మొగము అద్దానబోలు – తన ముఖము తామర పద్మానబోలు.

శ్రీ నేదునూరి గంగాధరం గారు ఇచ్చిన పాఠాన్ని బట్టి చూస్తే, ‘బీరాయి’ బీర చెట్టునే సూచిస్తుంది. అయితే, ఈ పాఠం లక్ష్మీరంజనంగారి పాఠంలోలా ‘సంధ్య’ వర్ణనను సూచించదు. తెలుగింటి వాతావరణం మాత్రం కళ్ళకు కట్టినట్లు వుంటుంది. కానీ, లక్ష్మీరంజనంగారి పాఠంతో పోలిస్తే మాత్రం, ఈ పాట పాఠం సందర్భ శుధ్ధి లేనట్లుగా, అంటే ఒక సందర్భానికి సంబంధించినది కాకుండా వున్నట్లుగా అనిపిస్తుంది. పాట పేరులోకూడా ఈ అసందర్భం కనిపిస్తుంది, ‘మోచేతి పెద్దమ్మ’ ఏమిటన్నది అంతు చిక్కేదిగా కనుపించదు.

ఇప్పుడు, లక్ష్మీరంజనంగారు ఇచ్చిన పాట పాఠంలోని ‘బీరాయి పువ్వుల్లు విడిచేటి వేళ’ దగ్గరకొస్తే, ‘బీరాయి’ అన్న పదం ‘బీర చెట్టు’ ను సూచించేదిగానే అనుకుంటే, ‘బీర చెట్టు పూవులను విడిచేటి వేళ’ అన్న అర్ధం ఆ చరణానికి వస్తుంది. ఇందులో ఇమిడి వున్న అర్ధం ఏమిటి? అన్నది మాత్రం ఇప్పటిదాకా ఎంతగా శోధించినా నాకు పట్టుబడలేదు. బీర చెట్టు వెశేషంగా సాయంత్రం వేళల పూవులను రాలుస్తుందా? అన్నది నాకున్న సందేహం! రాలుస్తుంది గనకనే ఆ పాటలో చరణం అలా వుందని నేను నమ్ముతున్నాను! ఇది సరైనదో కాదో తెలిసినవాళ్ళు చెప్పాలి!

తెలుగు మాట, పాట, పద్యం (5)

అచ్చ తెనుగు పద్యం

తెలుగు పద్య సాహిత్యంలో ‘అచ్చ తెనుగు’ అన్న మాటను మొదటి సారిగా వాడిన వ్యక్తి మూలఘటిక కేతన అని చెబుతారు. ఈయన తిక్కన మహాకవి సమకాలికుడు. తెలుగులో మొదటి కథాకావ్యానికి (దశకుమార చరిత్ర) శ్రీకారం చుట్టినవాడు కేతన. ‘కవిత చెప్పి’ తిక్కన మహాకవినే మెప్పించినవాడు ఈయన.  ఈయన చెప్పిన ఈ ‘అచ్చ తెనుగు’ అనే మాటకు ముందు, ఈ మాట ఏ అర్ధాన్నయితే సూచిస్తుందో అదే అర్ధంలో ‘జాను తెనుగు’, ‘దేశి’ అనే మాటలు వాడుకలో వుండేవి. ఈ మాటలను తమ పద్యాలలో చెప్పిన వారు ‘నన్నె చోడుడు’, పాలుకురికి సోమనాధుడు!

పేరుకి ఇన్ని మాటలున్నా, ఈ మాటలు ‘అచ్చ తెనుగు’ భాషా స్వరూపాన్ని అర్ధమయేలా చేయడంలో సఫలీకృతం కాలేకపోయాయన్న ఒక అభిప్రాయం, విజ్ఞుల మాట కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాలి! భాషా స్వరూపం అర్ధం కావాలంటే, ఒక ఉదాహరణంతో చెప్పుకుంటే, కొంతలో కొంత స్ఫష్టత వచ్చి, సులభం అవుతుంది.

“పగలు సేయుచు వేడిమి మిగుల జగము
గ్రాచు జమునబ్బ మున్నీట గలిసె ననియొ
తొగ వెలందుక నగియె నమ్మగువ పెంపు
గని సయింపక తమ్మి మొగంబు మొగిచె.”

కూచిమంచి తిమ్మకవి రచించిన ‘అచ్చ తెలుగు రామాయణం’ కావ్యంలోనిది ఈ పద్యం. సూర్యాస్తమయాన్ని సుందరంగా వర్ణించే పద్యం! నాకయితే, ఈ పద్యంలోని మాటల పొందిక, brevity, గాథా సప్తశతిలోని గాథలను తలపుకు తెస్తుంది. మంచి భావంతో నిండి వున్న పద్యం! ఊహ original ది! నాకు తెలిసినంతవరకూ, ఏ ప్రాకృత గాథనుంచో, సంస్కృత శ్లోకంనుంచో ఎత్తుకొచ్చింది కాదు!

ఇప్పుడు, ఈ పద్య భావాన్ని కొంచెం విడమరచి చెప్పుకుంటే…

‘పగలు సేయుచు’ – పగలు సేయువాడు – దినకరుడు.
సందర్భం వచ్చింది గాబట్టి, ఇక్కడ, కొన్ని రకాలయిన సంస్కృత సమాసాలు అచ్చ తెలుగులోకి మారేటప్పుడు జరిగే మార్పులను గురించి కొంత వివరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో సంస్కృత సమాసాలలోని ప్రత్యయాలకు బదులుగా తెలుగు సమాసాలలో వాడు, దొర, తపసి, జోదు…ఇత్యాది శబ్దాలు జతవుతాయి అని వ్యాకరణం. ఉదాహరణకి:

అచ్చ తెలుగులో ‘కప్పు కుత్తుక వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘నీలకంఠ’ కు,
అచ్చ తెలుగులో ‘గిత్త తత్తడి వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘వృషభ వాహన’ కు,
అచ్చ తెలుగులో ‘వెంట్రుక యడుగుల దొర’ అనే సమాసం, సంస్కృతంలో ‘రోమ పాద’ కు,
అచ్చ తెలుగులో ‘మనుబోతు కొమ్ము తపసి’ అనే సమాసం, సంస్కృతంలో ‘ఋష్యశృంగ’ కు,
అచ్చ తెలుగులో ‘పచ్చ వారువపు జోదు’ అనే సమాసం, సంస్కృతంలో ‘హరిదశ్వా’ కూ అనువాదాలని పెద్దల వివరణ. తెలుగులో వీటినే బహువ్రీహి సమాసాలుగా భావిస్తారని కూడా చెబుతారు, అర్ధంలో చివరన కలది, కలవాడు చేరతాయి కాబట్టి. (నల్లని కంఠము కలవాడు, ఎద్దును వాహనముగా కలవాడు…ఇత్యాదిగ).

నాకయితే తెలుగులో ఈ మాటలు, సంస్కృతంలో మాటలు ఎంత అందంగా కనిపిస్తాయో, తెలుగులోనూ అంతే అందంగా అనిపిస్తాయి. ఇలాంటివే ఇంకొన్ని సమాసాలు:

వలిగుబ్బలి రాచ కూతురు (హైమవతి – హిమవంతుని కూతురు, ‘వలిగుబ్బలి’ అంటే మంచుకొండ అని అర్ధం), పుట్ట బుట్టువు తపసి (వాల్మీకి – పుట్ట  నుంచి పుట్టిన తపస్వి), పదియరదముల దొర కొడుకు (దాశరధి – దశరధుని కుమారుడు) – ఇవన్నీ కూడా సంస్కృత శబ్దాలంత అందంగానే కనబడతాయి.

ఇక్కడితో ఇది ఆపి, అసలు పద్యానికొస్తే –

పగలు సేయుచు – పగటిని చేస్తూ, ఆ క్రమంలోనే; వేడికి మిగుల జగము గ్రాచు – వేడిమితో జగత్తునంతా వుడికించి ఇబ్బందికిలోను చేసే; యమునబ్బ – యముని తండ్రి (సూర్యుడు); మున్నీట – సముద్రములోనికి; కలిసె ననియొ – కలిసిపోయాడుగదా అని; తొగ వెలందుక – కలువ పూవు (అనే పడతి); నగియె – నవ్వింది; అమ్మగువ – ఆ కలువ సుందరి; పెంపు గని – సంతోషంతో వదనం పెద్దదవడం (కలువ వికసించడం అన్న భావం) చూసి; సయింపక – తాళ లేక; తమ్మి – తామర పూవు (అనే పడతి); మొగంబు మొగిచె – మొహం ముడుచుకుంది, చాటు చేసుకుంది.

సూర్యాస్తమయంతోనూ, చంద్రాగమనంతోనూ కలువలు వికసించడం అనేది ప్రకృతి ధర్మం. సూర్యాస్తమయంతో తామరలు వికసనం కొల్పోయినట్లయి, కళావిహీనంగా, ముడుచుకున్నట్లయిపోవడమూ ప్రకృతిధర్మమే! ఈ రెండు ధర్మాలనూ కలబోసి, ఒకే సందర్భానికి జతచేసి, హృద్యంగా చెప్పడం ఈ పద్యంలో జరిగింది.

నాకు ఈ పద్యాన్ని చదివినప్పుడల్లా, ఇంకొకటి కూడా అనిపిస్తుంది. పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, గాథా సప్తశతి లోని పద్యాలను తెలుగులోకి అనువదించడంలో ఈ పద్యాన్నే(సరిగ్గా ఈ పద్యాన్నే అని కాకుండా, ఇలాంటి పద్యాలనే) ఆదర్శంగా తీసుకున్నరేమో! అని. ఎందుకంటే, అందులోని చాలా పద్యాల నడక ఈ పద్యాన్నే పోలి వుంటుంది. ఉదాహరణకి:

“అడుగుదమ్ములందు బడివేడు పతివీపు
జిన్ని కొమరుడెక్కి చెలగి యాడ
అలుక యెంత తెగనిదయ్యును నిల్లాలి
మొగమునందు నవ్వు మొలచె నపుడు! “                (శతకం 1 గాథ 11)

“ఎవని వదలిన జీవంబు నవసి చనునొ
యతని నపరాధినయ్యు నోదార్ప వలయు;
ఊరు గాలుచు బొలిపోవు చున్న గాని
యగ్గి నొల్లని వారెవ్వరతివ, చెపుమ?”         (శతకం 2, గాథ 63)

అందుండి అచ్చ తెలుగు మాటలలో వున్న ఇలాంటి రమ్యమైన పద్యాలను ఇంకా చాలానే ఉదాహరించవచ్చు!

మన కథకులు (my notes) – తిలక్ (1)

దేవరకొండ బాలగంగాధర తిలక్ (ఆగస్ట్ 1921 – జులై 1961)

ఊరి చివరి ఇల్లు (1)

కథల్ని నేను స్థూలంగా రెండు రకాలుగా విభజించుకుంటాను. issue-based and feeling-based అనేవి ఈ రెండు రకాలు. మానవ జీవనానికి సంబంధించిన ఏదో ఒక సమస్య చుట్టూ తిరుగుతూ, ఆ సమస్యను ఏదో ఒక కోణం నుంచో లేక పలు కోణాలనుంచో చూసి విశ్లేషిస్తూ నడిచి, అవసమయ్యుంటే, ఇవ్వగలిగుంటే, రచయిత చూపగలిగుంటే చివరికి ఒక పరిష్కారాన్ని చూపుతూ ముగిసే కథలు మొదటి రకానివి. మానవ హృదయానికి సంబంధించిన బాధలను, భావోద్రేకాలనూ మనసుకు హత్తుకునేలా చూపుతూ, కథ ముగిసేటప్పటికి ఒక pleasant feeling ని గానీ లేదా painful feeling ని గానీ మిగిల్చే కథలు రెండో రకానివి. తిలక్ గారి ‘ఊరి చివరి ఇల్లు’ ఈ రెండవ రకానికి చెందిన కథ.

పూర్వ కాలం నుంచీ పురుషుడు స్త్రీ అనే భావనను సౌందర్యానికి ముడివేసి చూసుకున్నట్లుగానే, వేశ్య అనే భావనను సాధారణ స్త్రీలకంటే తెలివిగలదిగానూ, సంభాషణాచతురురాలుగానూ, sensitive at heart గానూ ఊహించి చూసుకోవడానికే ఎక్కువ ఇష్ట పడ్డాడనిపిస్తుంది. నిజ జీవితంలో ఇలాంటి వాళ్ళు ఎదురవుతారో లేదో చెప్పలేను గాని, గురజాడ గారి కన్యాశుల్కంలోని మధురవాణి ఆధునిక తెలుగు సాహిత్యంలో అప్పటినుంచి ఇప్పటిదాకా నిలిచివున్న అలాంటి ఒక వేశ్య పాత్ర. (గురజాడ గారి కన్యాశుల్కం మొదటి కూర్పులో మధురవాణి ఒక insignificant, ప్రాముఖ్యమేమీ లేని పాత్ర; రెండువ కూర్పులో గురజాడ గారిచే బాగా విస్తరింపబడి ఇప్పుడున్న స్థాయికి చేరిన పాత్ర). తెలుగు సాహిత్యంలో మధురవాణి  ప్రభావం ఎంతటిదంటే, ఈమె చేత తెలుగు ప్రముఖ సాహిత్యకారులలో చాలామందిని సరదాగా imaginary interview లు కూడా చేయించడం జరిగింది. ‘ఊరు చివరి ఇల్లు’ లో రమ, sensitive heart తో వున్న ఒక, వేశ్యగా మార్చబడడానికి సిధ్ధం చేయబడుతున్న, యువతి పాత్ర!

‘ఊరి చివరి ఇల్లు’ మొదటి నుంచీ ఒక above from the normal or different from the normal వాతావరణంలో నడిచే కథ. అసలు కథకు ఆ పేరు పెట్టడంలోనే రచయిత తాను అనుకున్నది సాధించాడని, సాధారణ ఊరికి దూరంగా (ఇక్కడ దూరం అనేది physical దూరం అనే దానికంటే  – psychological – ఊహలలో దూరం అనేది గుర్తుంచుకోవాలి) ఒక different locale ని set చేయడంలో సఫలీకృతుడయ్యాడని నేననుకుంటాను. ఈ ఒక్క మాటతో పాఠకుని చిత్తాన్ని ఊరికి దూరంగా ఎక్కడికో ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్ళి కూర్చో బెడతాడు రచయిత. అలాగే, కథ మొదలయ్యే మొదటి వాక్యంతోనే కథకు కావలసిన ఒక mood ని set చేసి, పాఠకుడి చిత్తాన్ని ఊరుకు చివర, ఒక వర్షపు వాతావరణంలో కూర్చోబెడతాడు. కథనంలో ఒక చోట ‘ఆ ఇల్లు అక్కడ ఎందుకుందో ఎవరికీ తెలియదు’ అనే explanation కూడా ఇస్తాడు. This explanation serves as a hint, a message to the reader, to not to think more than what he says in the story and not to go deep into reasoning! ఈ hint తోనూ, message తోనూ, పాఠకుడు ఇంక extra thinking మానేసి, కథతో నిలిచి వుండి, కథను నడవనిస్తూ, తనుకూడా కథతో నడుస్తాడు. ముందు పేరాలలోనే ఈ message ఇవ్వడం అవసరం అనేది తిలక్ గారికి తెలుసు. ఎందుకంటే, ఈ కథను strict reasoning తో చదవడం మొదలెడితే, ముందుకు సాగదనీ, ఈ కథలో తాను చెప్పదలుచుకున్న, నిరూపించదలుచుకున్న విషయానికి, reasoning తో పని పెడితే కుదిరే విషయం కాదనీ తిలక్ గారు కథకునిగా ముందుగానే ఊహించారని నేననుకుంటాను!

మన కథకులు (my notes): బుచ్చిబాబు-2

నన్ను గురించి కథ వ్రాయవూ? – (2)

కథలో ‘నేను’. కథ మొదటినుంచీ కుముదంలో ఏ ప్రత్యేకతా లేదంటూనే, కుముదం ను ఎప్పుడుచూసినా  కనులకు ఉత్ప్రేక్షలనే అద్దాలను తగిలించుకుని తప్ప చూడడు; కుముదం గురించి ఏది చెప్పినా ఉత్ప్రేక్షలనే అలంకారాన్ని జతచేసి తప్ప చెప్పడు. ఇది ఒక వైరుధ్యం. కథ మొదలు నుంచి చివరంటా సాగే వైరుధ్యం.

కుముదాన్ని తాను అసాధారణమైన వర్ణనలతో ఒక వైపు చూస్తూ, ఇంకొకవైపు ఆ పక్కనే ఆమె ఏ ప్రత్యేకతా లేనిదని తీర్మానంగా చెబుతూ చివరిదాకా దానినే పాఠకుడిని నమ్మమంటాడు కథలో ‘నేను’! అదెలా కుదురుతుంది? కుదరదు గనుక  పాఠకుడు కుముదం ను మొదటినుంచీ అసాధారణ వ్యక్తి గానే గణించి, పరిగణిస్తూ వస్తాడు.

—- ‘పూర్తిగా పండని జామపండు రంగులా వుండేది ఆ పిల్ల ఛాయ.’

‘తన వ్యక్తిత్వాన్ని గుర్తుంచుకుని, దాని ప్రభావాన్ని ఇతరులకి తెలియచెయ్యాలన్న స్త్రీని మొట్టమొదట కుముదంలో చూడగలిగాను. ….  ఆమెని తొలిగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుతుంది.’

‘ఆమెలో కథావస్తువుగా వుండేటంతటి విశేషం ఒక్కటి కూడా లేదు.  చూడడానికి చాలా సామాన్యంగా వుంటుంది. పల్చటి శరీరం.  వేసంగిలో వర్షం కురిసే ముందు దట్టంగా అల్లుకున్న మబ్బురంగు శరీరఛ్ఛాయ.  సంపూర్ణంగా వికసించని అవయవాలు.  ఎవరో దువ్వినట్లుగా వుండే జడకట్టు.  చూసిన వస్తువులు తనకోసం కానట్టు చాంచల్యంగా కదిలే బలహీనమైన కనురెప్పల కింద మంచులో కదిలిపోయిన కుందేలులా మెరిసే నేత్రాలు, కంఠంలో కొలవడానికి వీలుగా వుండే పచ్చటి నాళాలు.  నీడ కనుపించినట్లు స్ఫురించే వక్షం.  శరీరంలో పై భాగాన్ని మోసేటందుకు వోపిక లేనట్టి అల్పమైన నడుం.  కుముదం సాధారణమైన స్త్రీ. ఎవరూ తుదకు వాళ్ళమ్మకూడా ఆమె అందమైనదని చెప్పుకోవడం నేనెరగను.  అందుకనే ఆమెలో నేనేమీ విశేషం చూడలేక పొయ్యానేమో!’

‘పోతపోసి పదును పెట్టినట్లుగా చలించే వేళ్ళు ఆమెవి.  ఏ అవయవం కదిలినా శరీరంలోని శక్తంతా దానిలో పూరించినట్లుగా వుంటుంది.  ఒక వస్తువుకేసి చూస్తున్నప్పుడు, పంచ ప్రాణాలు కళ్ళల్లోకి పరిగెత్తుకొచ్చినంత తీవ్రంగా చూస్తుంది.  సిగ్గు పడితే రక్తం చెక్కిళ్ళలోనుంచి తొంగిచూస్తున్నట్లుంటుంది. కాని, కుముదాన్ని వర్ణించినంత మాత్రాన కథౌతుందా?’

‘నేను ఆమె కళ్ళకేసి చూస్తూ కూర్చున్నాను.  నిదానించి చూస్తే ఆమె మొహంలో వొక వింత ఆకర్షణ వుంది.  ఆమె శరీరంలో వొంపులు, ఎత్తు పల్లాలు సూర్యరశ్మి సోకినప్పుడు తీర్చి నట్లుగా విప్పారుకున్నాయి.  ఆ కళ్ళు ఆమెకి ఉపయోగం లేవు కాబోలు.  మనుషులకు ఆత్మ వుందో, లేదో నాకు తెలీదు కాని, ఆమెకు మాత్రం లేనట్లు నాకనిపించింది.  మరో లోకంలో ఆత్మని మరచిపోయి, శరీరాన్ని తనిష్టం లేకుండానే ఇక్కడికి రప్పించినట్లు సంచరిస్తుంది.  ఈ ప్రపంచంలో మూసుకుని మరో లోకంలో తెరచుకొన్న నేత్రాలు ఆమెవి.’

‘కుముదం… … చీరని పాదాల పైకి తీసింది.  ఆమె శరీరానికి మాతృత్వం పరిపూర్ణత నిచ్చింది.  వయస్సు మొహానికి వైరాగ్యాన్నిచ్చినా, వార్థక్యాన్నివ్వలేక పోయింది.  మట్టిలో నీళ్ళు కలిసిన వింత సువాసన నన్నావరించింది.  మొహాన్ని పమిటతో తుడుచుకుంది.  తడిసిన పమిట పర్వత శిఖరానికి ఎగబ్రాకేవాడికి పట్టు దొరికినట్లు, వక్షాన్ని అదిమి పట్టుకుంది. సూర్యుడి కడసారి కిరణం లోయలో నీడని వొక్కసారి వెలిగించి మాయమైంది.  సంధ్య అందాన్ని అనుభవించాలన్నవాడు కుముదంతో వుండాలి.  సంధ్యలో నేనెన్నడూ చూడని ప్రత్యేక శోభని ఆనాడు చూడగలిగాను.’ —-

కథా గమనంలో కుముదం ను గురించిన వర్ణన ఇక్కడికి చేరుకునేటప్పటికి. ఆమెపై భావచిత్రణ peak కు చేరినట్లై, ఆమె చుట్టూ ఒక అసాధారణమైన aura ను సృష్టించి వదులుతుంది. ఒక వైపు ఇంత వర్ణన చేస్తూనే, కథలో ‘నేను’ మాత్రం ఆమె అప్పటికీ ఏ ప్రత్యేకతలూ లేని స్త్రీనే అనే అభిప్రాయానికే బధ్ధుడై వుంటాడు. ఇది ఒక paradox, రచయిత కావాలని conscious గా సృష్టించిన paradox! ఈ paradoxical situation ని పాఠకుడు గమనించే పరిస్థితిలో వుండడు. వూపిరి సలపనీయనట్లు వుండే, అసాధారణమైన ఆ powerful imagery లో, వర్ణనలలో పడి కొట్టుకు పోతూ వుంటాడు. (ఈ paradox యే కథ ముగింపును decide చేసిందనీ, కథ dramatic గా ముగియడానికి కారణమయ్యిందనీ అనిపిస్తుంది.)

ఇంత powerful imagery తో కుముదం ను ఆ స్థాయికి తెచ్చి కూర్చో బెట్టిన తరువాత – ఇక ఇప్పుడు ఏమిటి? అన్నది  ప్రశ్న. What to do with her? And, what to do with him? అన్నవి కూడా కథ ముందుకు నడవడానికి సమాధానాలు దొరకాల్సిన ప్రశ్నలు.

ఆమెను glorify చెయ్యడానికి ఇంక మిగిలిన మాటలు లేవు.
అతని గురించి ఇక చెయ్యగలిగింది లేదు.

ఈ స్థితిలో, కథ లేని చోట కథను ఏలా ముందుకు నడిపించాలి, ఎలా ముగించాలి? అన్న సమస్య ఎదురైన ఇప్పుడు, రెండు possibilities:

ఒకటి – He had to change…అతను మారాలి.  ఇది పొసగదు.
రెండు – She had to cease…cease to exist… ఆమె మరణించాలి.

మరణం ఎందుకు? అంటే, మరణంలో వ్యక్తి ప్రదీప్తుడవుతాడు గనుక. కుముదం మరింతగా ప్రదీప్తితమౌతుంది గనుక! ఇంతకంటే, dramatic గా జరిగిన  కుముదం మరణానికి వేరే కారణం ఊహించలేము. Her death was the indirect result of the unbearable wieght of the aura created around her!

అయితే, ఇందులోనే మరో dramatic situation, చనిపోతూ కుముదం  కథలో ‘నేను’ పెళ్ళిచేసుకోకపోవడానికి సంబంధించి చెప్పిన మాటలు, దానిపై  విశ్లేషణ చేసుకుంటూ, ‘ఆమె కోసం నేను పెండ్లి చేసుకోలేదట’ అని కథలో ‘నేను’ చేసిన వ్యాఖ్య, ఆపై ఫ్రాయిడ్ ‘సుప్త చేతన’ ఆలంబన….ఇవన్నీ ఒకదానికొకటి making up గా చేరిన సంగతులు అనిపిస్తాయి. ఈ విశ్లేషణతో పాఠకుడు identify అవలేడు. ఈ విశ్లేషణతోనే కాదు, కుముదం చివరి మాటలతోనే పాఠకుడు identify అవలేడు; కారణం ఒకటే – ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి అన్ని రోజులు ఆగదామె!

ఏదేమైనా, బుచ్చిబాబు గారి ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ కథ మొదటే చెప్పుకున్నట్లుగా రెండు కారణాలవల్ల గొప్ప కథ. అవి narration and inquiry అనేవి! narration గురించి వేరే చేప్పేదేమీ లేదు, ఇప్పటిదాకా చెప్పుకుందదే కాబట్టి.

ఇక రెండవది – inquiry- అవును. Surface level లో మూసలో పోసినట్లు అంతా ఒకే రకంగా unbearably absurd గానే కనిపిస్తాయి. అయితే, things continue to happen out of this absurdity only అనేది సత్యం! కాకపోతే, చూడగలిగే కన్నూ, పట్టుకోగలిగే మనసూ వుండాలి. One needs to have the eye to look and the brains to pick! అన్నది కథలో దొరికే సమాధానం!

మన కథకులు (my notes): బుచ్చిబాబు-1

బుచ్చిబాబు (జూన్ 1916 – సెప్టెంబరు 1967)

కథనం స్థూలంగా రెండు రకాలు. ఒకటి naration – ఎక్కువ వర్ణనలతో పని పెట్టుకోకుండా కథను చెప్పుకుంటూ పోవడం; రెండు inquiry – కథను చెబుతున్నట్లుగానే చెబుతూ అంతః సూత్రంగా ఒక ప్రశ్నను లేవనెత్తి, విశ్లేషించే ప్రయతం చేసి, వీలయితే సమాధానాన్ని సూచించడం, లేదా చెప్పడం.

కథా వస్తువు (subject) ను బట్టి, ఈ రెండింటిలో ఏది ప్రధానమై వుండాలన్నది నిర్ణయమై వుంటుంది. అయితే, enquiey అనేది లేకుండా కేవలం narration తోనే గొప్ప కథ తయారవడానికి ఆస్కారం వుంది గాని, సరయిన narraation లేకుండా కేవలం inquiry తోనే గొప్ప కథ తయారవుతుందనడానికి నిదర్శనాలు సున్న. కారణం, సరయిన narration లేకుండా కథ లేదు.

బుచ్చిబాబు గారి ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ – great narration as well as enquiry, both at the same time! అందువలన ఆ కథ తెలుగులో అత్యుత్తమ కథానికలలో ఒకటిగా మన్ననలందుకుని నిలిచింది.

మనలో చాలా మధ్య తరగతి జీవితాలు పుట్టుకనుంచి గిట్టేదాకా మూసపోసినట్లు ఒకేరకంగా, కొత్తదనమేమీ లేకుండా, unbearably absurd గా వుంటాయి – ఇది ఆ కథలో enquiry! అవును? కాదు? – కథలో ప్రధాన పాత్రలైన ఇద్దరిలో ఒకరు ‘నేను’ దృష్టిలో ‘అవును!’; రెండవ పాత్ర అయిన కుముదం దృష్టిలో ‘కాదు. అలా అనుకోవడానికి వీల్లేదు. that is a wrong notion!’

‘ఎక్కడో ఎప్పుడో పుట్టడం, ఎవరో ఎవర్నో ఒప్పగిస్తే వారిని పెళ్ళాడడం, ఎందుకో తెలీకుండా పిల్లల్ని కనడం, ఎప్పుడో ఎక్కడే చచ్చిపోవడం. ఇది చాలామంది చేస్తున్నది. దీన్ని గురించి కథగా చెప్పుకునేందుకు ఏముంది? ప్రత్యేకత, వ్యక్తిత్వం లేని ఈ జీవితాలు ప్రశాంతాన్ని పొందుతున్నాయి.  కాని, అది బురద గుంటలో పురుగు పొందే ప్రశాంతం’ – అని కథలో ‘నేను’. He was unclear, unrealistic, too emotional and idealistic!

‘ఏమీ లేదు. నాకేదో చెప్పాలనుంది. ఎట్లా చెప్పాలో తెలీడం లేదు. నే చదువుకున్న దాన్ని కాదు. ఉండు, ఆలోచించనీ…’

‘కానీ….కానీ…సుర్యుడూ, చంద్రుడూ ఎప్పుడూ చూస్తూంటాను. కాని, ప్రతిసారి ఎందుకో క్రొత్తగా కనబడతాయి.  మంచినీళ్ళు రోజూ త్రాగుతా. కాని ప్రతిసారి ఎంతో క్రొత్తగా వుంటాయి…నక్షత్రాలు…’

‘ఏమో, నువ్వు జీవితాన్ని పరిశీలిస్తావు.  నేను అనుభవిస్తాను. ఏమో’ – అని కుముదం. She was clear in her thought, realistic, reasonably emotional and focused!

1945-46 ప్రాంతాలలో వ్రాసిన కథ ఇది. కథలోని ‘నేను’ లో బుచ్చిబాబు తనకు తానుగా లేడనుకోవడానికి వీలు లేకుండా వుంటుంది పాత్ర చిత్రణ. బుచ్చిబాబు ఈ కథ వ్రాసే నాటికి 30 సంవత్సరాల వయసులో వున్నారు.

కథలో ‘నేను’ కు ఇరవై యేళ్ళ వయసులో కథ మొదలవుతుంది. కుముదానికి పద్దెనిమిదేళ్ళు. అప్పటికే పెళ్ళి అయింది. కథ అంతమయే నాటికి ‘నేను’ ముఫ్ఫై నాలుగేళ్ళ వయసు వాడు. అప్పటికీ అవివాహితుడూ. కుముదం ముఫ్ఫై రెండేళ్ళ వయసులో వుంటుంది. కనుక, కథ నడిచిన కాలం పధ్నాలుగేళ్ళు.

కథ అంతంలో, కుముదం న్యుమోనియ జబ్బుతో హాస్పిటలులో మంచం పై చావుబ్రతుకుల మధ్య వుండగా చూడడానికి వెళ్ళిన అతను ‘అనుకోకుండా’ తన చేతిని ఆమె చేతిపై ఆనించబోగా, వెంటనే చేతిని లాగేసుకుని దుప్పటిలో దాచేసుకుని ‘నువ్వెందుకు పెండ్లి చేసుకోలేదో నాకు తెలుసు – నాకోసం.’ అంటుంది.

‘నీ స్థితి నాకెంతో బాధగా వుంది’ అంటాడతను కన్నీరు దగమింగుకుని.
‘నాకు నిర్విచారం. ఈ ప్రపంచం నాదైతేగా విచారానికి. నువ్వు మాత్రం….’ అని కళ్ళు మూసి మరివిప్పదు కుముదం.

కుముదం ఈ మాటలు కథలో ‘నేను’ కు ఒక revealation! ఈ revealation కథలో ‘నేను’ యొక్క ప్రపంచాన్ని తల క్రిందులు చేసి అతని జీవిత పరమావధినే తారుమారు చేస్తుంది. అదే కుముదం సాధించిన విజయం, అదే ఆమె ప్రత్యేకత. కుముదంలోని ఈ ప్రత్యేకతే (కథలో ‘నేను’ చేత) ఆమె గురించి కథ వ్రాయించేలా చేస్తుంది.

కథాంతంలో కుముదం మాటలవలన జరిగిన ఈ revealation రెండు విషయాలను సుచిస్తుంది:
ఒకటి – కుముదం ‘అతడు తనను ప్రేమిస్తున్నాడు’ అన్న అభిప్రాయంలో వుంది, మొదటినుంచీ.
రెండు – అతడు ‘తాను కుముదాన్ని ప్రేమిస్తున్నాను’ అనుకోలేదు ఎప్పుడూ.

ఈ confusion అసలుగా ఎవరిది? మొదటినుంచీ చూసుకుంటూ వస్తే:

తనకు పదేళ్ళ వయసులో ‘నన్ను గురించి కథ చెప్పవూ?’ అంటుంది కుముదం.
తనకు పద్దెనిమిదేళ్ళ వయసులో ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ అంటుంది.

‘తన వ్యక్తిత్వాన్ని గుర్తించుకుని, దాని ప్రభావాన్ని ఇతరులకి తెలియచెయ్యాలన్న స్త్రీని మొట్టమొదట కుముదంలో చూడగలిగాను. ఆమె ఒక జీవి. ప్రత్యేకమైన ఉనికి గలది. ఆమెని తొలగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుంది’ అని వ్యఖ్యానిస్తాడు అతను, కుముదం ఆ కోరిక గురించి.

కుముదంపై ఈ పవిత్ర భావం అతనికి ఎప్పటిది? తాను ఇరవై యేండ్ల వయసప్పటిదా? లేక, (చివరలో ఆమె మాటల తరువాత) ఆమె మరణానంతరం, కథ వ్రాసే నాటికి కలిగినదా? అంటే, రెండింటిలోనూ పెద్ద తేడా లేదనిపించొచ్చు గాని, ఆమె మరణం తరువాత కలిగిన ఈ పవిత్రతా భావాన్ని తన ఇరవై ఏండ్ల వయసప్పటి స్థితికి కూడా ఆపాదించుకున్నట్లుగా అనిపిస్తుంది కథాగమనంలో ఈ వ్యాఖ్య చేసిన చోటు.

కుముదం అందమైంది కాదు. అసాధారణ స్త్రీ కాదు. పదే పదే ఈ వ్యాఖ్య చేయబడి కనిపిస్తుంది కథలో. సారాంశం – ఆరోజులలో (1945-46) మధ్యతరగతి తెలుగిళ్ళలో కనిపిస్తూండిన సాధారణ గృహిణి ఆమె. అయితే, కొన్ని సందర్భాలలో మాత్రం a born intellectual లా కనిపిస్తంది ఆమె మాటలలో.

‘….మనం ప్రకృతికి దాస్యం చెయ్యడం తప్పదు. దాస్యం నేను సహించలేను. కానీ, అది తప్పదనుకుంటాను. నేను ఎదురు తిరగలేక కాదు. నాకదిష్టం లేదు. జీవితానికి తలవొగ్గి ప్రపంచాన్ని అంగీకరిస్తాను.’

‘…ప్రపంచాన్ని మనం ఏదేనా కోరి ఆశిస్తే దాన్ని ఇవ్వదు. మనం దేన్నీ ఆశించకుండా, దూరంగా వుండి చెయ్యగలిగిన పని చేస్తుంటే ప్రపంచం మన పాదాలముందు వాల్తుంది.’

‘నేను నువ్వైతే ఏం చేద్దునో తెలుసా? నదీ తీరాన్న చిన్న తాటాకు పాక కట్టుకుంటాను. అందులో కూర్చుని, ఊరికే చదువు నేర్పుతానని చాటింపు వేయిస్తాను.   మొదట ఏ పదిమంది పొలం కాపులో వస్తారు.  సాయంత్రం వాళ్ళకి బోధించడం మొదలెడతాను. ఇరుగు పొరుగు నుంచి అనేక మంది కర్షకులు, కూలివాళ్ళు చదువుకోసం వస్తారు.  ఉత్త చేతుల్తో రాకుండా, ఒకరు వుప్పు, చింతపండు, ఒకరు పాలు అలా నాక్కావల్సిన వాటిని వాళ్ళే సిధ్ధం చేస్తారు.  వారు నా శిష్య బృందం. వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటా. వారి తగాదాలకు తీర్పు చెపుతా. అంతే. అప్పుడు నా జీవితం వృధా అనుకోను.’ – ఇదీ కుముదం మాటలలోనే కుముదం.

సమయం సందర్భం దొరికినప్పుడల్లా ఉద్యోగం సద్యోగం లేకుండా unrealistic idealism లాంటి దేనిలోనో కొట్టుకుపోతూ నేల విడిచి సాముకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించే అతని జీవితానికి ఒక దిశా నిర్దేశం చేయడానికి ప్రయత్నిస్తుంది కుముదం. దీనిని ఏమనాలి? ఇప్పుడున్న సంకుచితార్ధంలో ‘ప్రేమ’ అనుకోలేం. దానికంటే మించినది, వేరే మాట కావాలి.

అతడు కుముదం మాటలను అర్ధవంతమైనవిగా ఖాతరు చెయ్యడు, పట్టించుకోడు. కథ చివరిదాకా కూడా అదే పరిస్థితిలో ఉంటాడు తప్ప మార్పేమీ వుండదు.

అలా వచ్చి, చివరి సన్నివేశంలో, చేయి స్పృసించబోతాడు. కుముదం అంగీకరించదు.
ఇక అదే ఆఖరి ప్రయత్నంగా, ఒక shock treatment లా -

‘నువ్వెందుకు పెండ్లి చేసుకోలేదో నాకు తెలుసు – నా కోసం.’
‘నాకు నిర్విచారం. ఈ ప్రపంచం నాదైతేగా విచారానికి. నువ్వు మాత్రం….’ మాట పూర్తికాకుండానే కళ్ళు మూస్తుంది.

ఈ shock treatment ఫలితంగా – చివరికి ఆమె ఆశించింది జరిగిందనడాన్ని కథాంత వాక్యంలో ‘నా ప్రపంచాన్ని తలక్రిందులుచేసి నా జీవిత పరమావధినే తారుమారు చేసిన కుముదాన్ని గురించి ఏం కథ వ్రాయను?’ అన్న మాటలు సూచిస్తాయి.

ఈ వాక్యానికి ముందు, కథలో ‘నేను’ , తాను కుముదం చేతిని అనుకోకుండా స్పృశించబోవడాన్ని, ఫ్రాయిడ్ మనోవైజ్ఞానిక సిధ్ధాంతంలోని ‘సుప్త చేతన’  నేపధ్యంలో విశ్లేషణ చేస్తూ – ‘ఇంతకాలం నా బుధ్ధి వాటిని (కుముదంపై ప్రేమ సంబంధ భావనలను) కట్టేసింది. ఆనాడు ఆమె చెయ్యిపైన చెయ్యి వేసినప్పుడు బుధ్ధిని తొలగించి వాంచలు బైటికొచ్చినట్లు కుముదం గ్రహించి, తన చేతిని లోపల దాచుకున్నట్లు వాటిని వెనక్కి నెట్టి నోరు నొక్కింది. ఆమెలో ఏమీ విశేషం లేదని సమాధానపరుచుకున్నా, ప్రాకృతికమైన ఆకర్షణ లోపల దాగి వుండి, నా జీవితంపై అంత ఒత్తిడి కలిగించినందుకు ఆశ్చర్యపడ్డాను’ – అని explanation యిస్తాడు.(కుండలీకరణం లోని మాటలు నావి).

అయితే, ఒక స్త్రీ పై పురుషుని ప్రేమ భావనలు ఇంత ‘సుప్తం’ గా వుండగలవా? అన్నది ఇక్కడ పుట్టుకొచ్చే ప్రశ్న.
దీనికి సమాధానం ‘అవును’ అన్నదయితే, అది నమ్మశక్యంగానట్లుగా వుండి convincing గా ఒప్పుకోలేము.
‘కాదు’ అయితే, ఈ explanation కథలో ‘నేను’ ఆ చర్యను convincing గా సమర్ధించేదిలా అనిపించదు. అప్పుడు వారిద్దరూ వున్న పరిస్థతిలో, చాలా సహజమైన సానుభూతి ఫలితమైన ఆ చర్యను సమర్ధించడానికి ‘సుప్త చేతన’ ను తోడు తెచ్చుకోవాలా? అన్న సందేహాన్ని రేపుతుంది.

తెలుగు మాట, పాట, పద్యం (4)

తెలుగులో శతక సాహిత్యంలో అధిక్షేప శతకానిది ఒక ప్రత్యేకమైన శాఖ అయితే, అందులో వేణుగోపాల శతకానిది ఒక విశిష్ఠ స్థానం అన్నది తెలిసినదే! ఈ శతకాన్ని రచించినది పోలిపెద్ది వేంకటరాయ కవి.  ఇతడు కార్వేటి సంస్థాన కవులలో ప్రముఖుడు అని చెబుతారు.

వేణుగోపాల శతకంలోని పద్యాలలో తెలుగు నానుడులు, సామెతలు అనదగినవి చాలా (పద్యాలకు అనువైన భాషలో)  పద్యాలలోకి ఎక్కి కనబడతాయి. వాటిలో కొన్ని మంచివాటిని పద్యాలలోంచి ఏరి విడిగాతీసి చూపించడం ఇక్కడ జరిగింది:

పొరుగూరి కేగిన పోవునే దుర్దశ
కాదె పెండిలి సన్నికల్లు దాచ
డొంకల డాగ పిడుగుపాటు తప్పునే    (డొంకలలో దాక్కుని పిడుగుపాటునుంచి తప్పుకోగలమా? అని)
కాలడ్డ నిలుచునే గాంగ ఝరము       (గంగా ప్రవాహాన్ని కాలడ్డుపెట్టి ఆపగలమా?)
ఇంకిపోవునే అనావృష్టి జలధి            (దేశంలో అనావృష్టివలన సముద్రం ఇంకిపోతుందా?)
అర్కుడుదయింప చెడునె గుహా తిమిరము  (గుహలో చీకటి సూర్యోదయంతో తొలుగుతుందా?)

పెట్టిపోసిన నాడె చుట్టాల రాకడ
సేవ చేసిన నాడె క్షితినాదు మన్నన
విభవంబు గల నాడె వెనువెంట తిరుగుట   (ఇవన్నీ సమానార్ధకాలే!)

‘అభావ విరక్తి’ అని ఒక అవస్థ వుందని, దానికి ఈ క్రిందివి వుదాహరణలనీ ఒక పద్యంలో చెప్పి…

శక్తి చాలని నాడు సాధుత్వం వహించడం
విత్తహీనుడు ధర్మ వృత్తి తలచడం
వ్యాధి పీడితుడు దైవతాభక్తి దొరలాడడం
పని పోవ మౌనవర్తనం దాల్చడం
రమణి లేకున్న విరక్తి మంచిది అనడం
భారము పైబడ్డ (పుడు) బరువెఱుంగడం (బరువు గుఱించి ఉపన్యాసాలివ్వడం)…

ఇత్యాది ‘అభావ విరక్తు’ ల వలన, తత్కాల విరక్తుల వల్ల ఫలితంలేదంటూ….

తినక చవి చొరకయె లోతు తెలియబడునె (తినక రుచి, దిగక లోతూ తెలియడం సాద్యం అవుతుందా?) అనే సామెత చెప్పబడింది.

ఆశకు ముదిమియు అర్ధికి సౌఖ్యంబు
ధనపరాయణునకు ధర్మచింత
అల్పవిద్యునకు అహంకారదూరత
పాపభీరుత సంతానబాహ్యునకు
కలదనెడువార్త కలదె లోకములయందు… (దీనికి ఏమీ వివరణ అవసరంలేదు కదా!)

ఈతకు మిక్కిలి లోతు లేదు
కవిజనంబుల కెఱుంగనివి లేవు

మెఱుపు దీపంబౌనె మేఘంబు గొడుగౌనె
అల యెండమావులు జలంబు లౌనె
కాని వస్తువు పట్టుకో కాంక్షచేత
పెనుగు మాత్రంబెగాని లభింపదేమి….

పొయిపాలికే పాలు పొంగుటెల్ల
ఆఱిపోయెడి దివ్వె కధిక దీప్తి
కట్టనిల్వని చెర్వు గడియలోపల నిండు
బ్రతుకజాలని బిడ్డ బారెడుండు
పెరుగుటయు విఱుగుటకని యెఱుగలేక
అదిరిపడుచుండు నొక్కొక్క అల్పజనుడు….

వలపు రూపెరుగదు
ఆకలిలో నాల్క అరుచి యెరుంగదు
కోపం బెదుటి గొప్పకొద్దు లెఱుంగదు
నిదుర సుఖం బెఱుంగదు
హరునకైనను నివి గెల్వ నలవికాదు
ఇతరులైనట్టి మానవులెంతవారు….

పైన చూపినవన్నీ అదనంగా వివరణ యేమీ అవసరంలేకుండానే అర్ధమయ్యేవీ,  తక్కువ మాటలలో చక్కటి నిజాలను చెప్పేవీను! వాటిల్లో కొన్ని ఇప్పటికీ  సామెతలుగా అదపాదడపా నిత్యవ్యవహారంలో పెద్దవాళ్ళనోట వినిపిస్తూనే వున్నాయి కూడానూ!

*****

తెలుగులో అధిక్షేప శతకాలు రచించిన వారిలో కూచిమంచి తిమ్మకవి, జగ్గ కవి అని ఇద్దరు కవులున్నారు.  వీరిద్దరూ అన్నదమ్ములని తెలుస్తూనేవుంది కదా! కూచిమంచి తిమ్మకవి రచించిన శతకం శ్రీ భర్గ శతకం, జగ్గ కవి రచించిన శతకం శ్రీ భక్తమందార శతకం. వీరు  క్రీ.శ.18 వ శతాబ్దానికి చెందిన వారు. వీరిలో కూచిమంచి జగ్గకవి తెలుగులో మొట్టమొదటి అధిక్షేప ప్రబంధకర్తగా ప్రసిధ్ధుడు.  ఆ ప్రబంధం పేరు ‘చంద్రరేఖా విలాపము’. ఇందులోని కవిత్వ స్థాయిని C.P.Brown దొర కూడా మెచ్చుకున్నాడని ఎక్కడో చదివినట్లు గుర్తు.

ఆ సంగతి అలా వుంచి, ప్రస్తుత విషయానికి వస్తే – వీరిరువురు రచించిన అధిక్షేప శతకాలను  ఇప్పుడు తలుచుకోవడానికి కారణం, వీరిరువురూ వారి శతకాలలోని పద్యాలలో వాడిన పరభాషా పదాలను గుఱించి ముచ్చటించుకోవడానికి! పరభాషా పదాలలో వీరు మక్కువపడి అన్నట్లుగా ఒకటికి రెండుసార్లు వాడిన పదం  ‘ఇల్ల’. ఈ పదం తమిళ భాషలోనిది.  ‘లేదు’ అని తమిళంలో ఈ మాటకు అర్ధం. ఎందుకు అంత మక్కువపడి ఈ పదాన్ని వీరు వాడారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. ‘ఇల్లె’ అనే ఈ మాటకు బదులు తెలుగు పదం ‘లేదు’ అన్నది వాడొచ్చు, ఛందోభంగం ఏమీ కాదు. (సుఖం ఇల్లె, సుఖం లేదు – తేడా ఏమీ లేదు).

“కోపంబెక్కువ; తాల్మి యిల్ల, పరుషోక్తుల్ పెల్లు, సత్యంబు తీల్”

కూచిమంచి తిమ్మకవి – శ్రీ భర్గ శతకము లోనిది ఈ శార్దూల పద్య ప్రథమ పాదం. ఈ పాదంలో  చివరిపదం   ‘తీల్’ అనేది కూడా పరభాషా పదమే, జగ్గకవి భక్తమందార శతకంలోని ఒక పద్యంలో ఈ పదం ‘తీర్’ అని కనిపించింది, నేను చూసిన పుస్తకంలో.  ఇది అచ్చు తప్పు అయివుండాలి. ఈ పదం తీల్/తీర్ ఏ భాషా పదమోగాని, అర్ధం మాత్రం ‘లేదు’ అనే అన్నది సందర్భాన్ని బట్టి అర్ధమై పోతుంది!

కూచిమంచి జగ్గకవి రచించిన శ్రీ భక్తమందార శతకం నుండి ఈ క్రింది పద్య పాదాలు:

“దానంబిల్లె, దయారసంబు నహి, సద్ధర్మంబు తీర్, మీపద
ధ్యానంబున్ గడులొచ్చు…..”

“క్రతువుల్ సేసెదనంటినా, బహుపదార్ధంబిల్లె!…”

అదలా వుంచితే, కూచిమంచి జగ్గకవి భక్త మందార శతకంలో నాకు బాగా ఆసక్తి కరంగా అనిపించిన ఒక మాట ‘దేమస’ అనే మాట. ఈ మాట బ్రౌన్ నిఘంటువులోనికి కూడా ఎక్కలేదు. ఇది ఇప్పుడు ‘తమాషా’ అన్న అర్ధంలో వాడకంలో వుంది.  భక్తమందార శతకంలోని ఆ పద్యం, మత్తేభం:

“రసికోత్తంసులు సత్కులీనులు మహాద్రాఘిష్ఠ సంసార ఘో
రసముద్రాంతరమగ్నులై దరికి జేరన్ లేక విభ్రాంతిచే
పసులం గాచిన మోటుకొయ్య దొరలం బ్రార్ధింతు రెంతేని దే
మసగాదే యిది యెంచిచూచినను రామా! భక్త మందారమా!”

తెలుగు మాట, పాట, పద్యం (3)

ఏ భాషలో నైనా సరే, పద్యం పదికాలాల పాటు నిలబడాలంటే, దానికి ముఖ్యంగా కావలసింది నడక. మంచి అర్ధసౌందర్యం కలిగిన పద్యానికి, ఒక మోస్తరు నడకైనా తోడైతే, ఆ పద్యం పదికాలాలు కాదు, వెయ్యి  కాలాలైనా నిలుస్తుంది. తెలుగులో వందల కొలది చాటు పద్యాలు, అజ్ఞాతకర్తృకాలైనవి, ప్రజల నాలుకల మీదనుంచే తరంనుంచి తరానికి అంది నిలిచి వుండడానికి కారణం ఇదే గదా!

పద్యానికి ఛందస్సు వుంది. ఛందస్సులో వున్నంతమాత్రాన పద్యం పద్యమవుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. గాలికి తావి తోడైనట్లుగా, ఛందస్సుతో వున్న పద్యానికి మరొకటేదో తోడుకావాలి. ఆ ‘మరొక’ లక్షణాన్ని ప్రతిభగల కవి మాత్రమే అందించగలడు.

తెలుగు పద్యాలలో కంద పద్యానిది ఒక ప్రత్యేక స్థానం. కేవలం 64 మాత్రల నిడివి గలిగినటువంటి ఈ పద్యాన్ని రకరకాలుగా నడిపించారు మన కవులు. ఒక కవి వినూత్నంగా సాధించిన నడకను ఆ తరువాతి కవులు మక్కువతో అనుసరించిన సందర్భాలు సాహిత్యంలో చాలానే కనిపిస్తాయి. పద్యాల నడకల విషయంలో ఎవరు ముందు ఎవరు వెనుక అనే విషయాన్ని పక్కన పెట్టి, ఆయా నడకలలో తెలుగు పద్యం వయ్యారంగా నడిచిన తీరును పట్టి చూసుకుని ఆనందించడం ఒక పధ్ధతి. ఆ పధ్ధతిలో, ఇప్పుడు కంద పద్యమనే కాకుండా, మరికొన్ని రకాల ఛందస్సులలో వున్న పద్యాలను, ఆకర్షణీయంగానూ, ఆనందదాయకంగానూ వుండే వాటి ఒకటి రెండు  రకాల ముచ్చటైన నడకలని, ఆ నడకలలో వివిధ కవుల పద్యాలను, నా దృష్టికి వచ్చిన వాటిని, ఇక్కడ మరోసారి మననం చేసుకుంటూ చూపెడుతున్నాను.

“లేమా, దనుజుల గెలువగ
లేమా నీవేల కడగి లేచితి విటురా
లే! మాను, మానవేనిన్
లే, మా విల్లందికొనుము లీలంగేలన్.”

పోతనగారి భాగవతంలోనిది ఈ కంద పద్యం. ఈ పద్యానికి ఒక వీనులవిందైన నడక వుంది. ఈ నడక పోతనగారితో ఆగిపోలేదు. ఇంకా ముందుకు వెళ్ళింది. ఆడిదం సూరకవి ( క్రీ.శ.18 వ శతాబ్దం) తరం దాకా వెళ్ళింది. రేకపల్లి సోమనాథకవి అని  ఆడిదం సూరకవికి బలవత్ ప్రత్యర్ధియైన ఒక కవి ఉండేవాడట! ఆయన మీద ఒక భట్రాజు చెప్పన ఈ క్రింది కంద పద్యంలో మళ్ళి ప్రత్యక్షమైంది:

“అప్పా! రేకపలీ సో
మప్పా! విభుదాళి పాళి అమృతపు లప్పా!
ఒప్పులు నీ కవితలు వె
న్నప్పాలకు సాటి వచ్చునౌ భళి రుచులన్!”

ఈ పద్యం చెప్పి, సోమనాథకవికి రాజుగారు బహుమానంగా ఇచ్చిన దుశ్శాలువను ఆయనదగ్గరనుంచి కొట్టేశాడట ఆ భట్రాజు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో సంగతి ఏమిటంటే, కంద పద్యంలో సాధింపబడిన ఈ  నడక, క్రీ.శ.18వ శతాబ్దం వాడే అయిన కూచిమంచి జగ్గకవి భక్తమందార శతకంలో ‘మత్తేభ’ ఛందంలో వున్న రెండు పద్యాలలో సాధింపబడి కనిపిస్తుంది. ఆ పద్యాలు ఇవి:

“అదిరా! పిల్చినబల్కవేటికి? పరాకా చాలు నిం కేలగా
గదరా! మిక్కిలివేడి వేసిరిలు బాగా? నీకు శ్రీజానకీ
మదిరాక్షీ శరణంబులాన! నను ప్రేమన్ బ్రోవరా….”

“గడియల్ రెండిక సైచిరా, వెనుకరా, కాసింత సేపుండిరా,
విడిదింటం గడె సేద దీర్చుకొనిరా, వేగంబె బోసేసి రా,
యెడపొద్దప్పుడు రమ్మటంచు….”

భాగవతంలోని ద్వితీయాశ్వాసంలో పోతనగారిదే మరొక కంద పద్యం:

“రామున్ మేచక జలద
శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవ సు
త్రామున్ దుష్టనిశాట వి
రామున్ పొమ్మనియె పంక్తిరథుడడవికిన్.”

కందపద్యానికి ఇది వీనులవిందైన, హాయిగొలిపే నడక. అయితే ఈ అనుప్రాసమే కొంచెం ఎక్కువైతే పద్యం ఎలా వుంటుందో తెలియడానికి పోతనగారిదే ఒక కందపద్యం:

“అడిగెదనని కడువడిజను
నడిగిన దనుమగుడ నుడువడని నడయుడుగున్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్.”

ఇందులో మోతాదు కొంచెం ఎక్కువైందని నేననుకుంటాను.  అయితే, ఈ మోతాదులో అనుప్రాసము నచ్చే వాళ్ళూ వుండవచ్చు. కాదనలేం! ఈ రకపు నడకను, అనుప్రాసాన్ని కొంచెం మితంగా అంటే తగినంతగా వుంచి, చెప్పిన పద్యం ఎలా వుంటుందో ఈ క్రింది పద్యంలో తెలుస్తుంది:

“కడుపునకు కూడుగానక
పడి మిడిమిడి మిడుకునట్టి బడుగునకీయా
రడి అమరత్వం బేటికి
కడుపిటగాలంగ కంటకాటుక యేలా?”

కొఱవి గోపరాజు రచించిన సింహాసనాద్వాత్రింశిక లోనిదనుకుంటాను ఈ పద్యం, నాకు సరిగా గుర్తులేదు.

దొరకకుండా పోయిన తిక్కనసోమయాజిగారి ‘కృష్ణశతకము’ లోనిదిగా ఈ క్రింది పద్యం, మత్తేభ విక్రీడిత వృత్తం లోనిది, ప్రచారంలో వుంది:

“అరయన్ శంతనుపుత్రుపై విదురుపై నక్రూరుపై కుబ్జపై
నరుపై ద్రౌపదిపై కుచేలునిపయి న్నందవ్రజస్త్రీలపై
పరగం గల్గు భవత్కృపారసము నాపైగొంతరానిమ్ము నీ
చరణాబ్జంబులు నమ్మినాడ జగదీశా! కృష్ణ! భక్తప్రియా!”

తెలుగులోని సరళాతిసరళమైన పద్యాలలో ఇది ఒకటి. ఈ పద్యం చదివినతరువాత ఎవరికైనా పోతనగారి భాగవతంలోని పద్యం గుర్తుకురాకుండా ఉంటుందా? ఆ పద్యం:

“ఇంతింతై వటుడింతింతై మఱియు దానింతై నభొవీధిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్థియై!”

పోతనగారి ఈ పద్యం శార్దూలవిక్రీడిత ఛందంలోనిది.

తెలుగు మాట, పాట, పద్యం (2)

తెలుగు మాట, పాట, పద్యం - image (1)

“ఉ. శారదరాత్రు లుజ్జ్వలలసత్తర తారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధ బంధురో
దారసమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచిపూరములం బరిపూరితంబులై.”

తెలుగు పద్యం ఒక పధ్ధతిగా నన్నయతోనే మొదలైంది. నన్నయచే ఆంధ్రీకరించబడిన మహాభారత భాగంలో,  అరణ్యపర్వం, చతుర్ధాశ్వాసం 142వ పద్యం ఇది. నన్నయ చివరి పద్యం.

“వర్షాకాలం గడిచి, చలి కాలం అప్పుడప్పుడే మొదలౌతున్న రోజుల నాటి రాత్రులు.  చంద్రుడు కర్పూర పరాగం లాంటి వెన్నెలను కురిపిస్తున్నాడు. ఇలాంటి చంద్రుణ్ణి చూసి అప్పుడే వికసించినటువంటి తెల్లకలువల నుంచి వెలువడుతూన్న గంధాన్ని తనలో కలుపుకుని గాలి మత్తుగా వీస్తొంది.  అలా కాస్తూన్న వెన్నెలనూ ఇలా వీస్తూన్న గాలినీ వహించి చుక్కలు మైమరచి మెరుస్తూంటే ఆ మెరుపులో రాత్రులు ఇంకా మెరిసిపోతున్నాయి” అన్నది ఈ పద్యపు భావం.

పై ఫొటోకి తెలుగులో పద్యాన్ని ఊహించుకుంటున్నప్పుడు, నా మనస్సులో మెదలిన పద్యం నన్నయగారి ఈ పద్యం. పై ఫొటోలో వెన్నెల ఎంతగా కనిపిస్తుందో నేను చెప్పలేనుగాని, నన్నయగారి ఈ పద్యం నిండా వెన్నెల పరుచుకుని కనిపిస్తుంది.

ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వర్ణించడానికి అంతే అహ్లాదకరమైన చింతనలో మనసుండాలి, చిత్తంతో మనిషుండాలి. ఈ పద్యం లిఖించేటప్పుడు నన్నయగారు కూడా అంతే ఆహ్లాదకరమైన చిత్తంతో వుండి వుంటాడని నేననుకుంటాను. అప్పటికిక స్వస్తి చెప్పుకుని, మిగతాది మరుసటి దినానికి వాయిదా వేసుకుని, మామూలుగానే నిద్రకుపక్రమించి వుంటాడనీ నేననుకుంటాను. అయితే, తెల్లవారేసరికి పరిస్థితులు మారిపోయాయి. అలా మారిన ఆ పరిస్థితులు ఎలాంటివో,  ఆ మారిన పరిస్థితులు నన్నయ భారత ఆంధ్రీకరణం అర్ధంతరంగా ఆగిపోవడానికి ఎందుకు దారితీశాయో ఇదమిధ్ధంగా తేల్చి చెప్పుకోవడానికి సరిపడా ఆధారాలేవీ చరిత్రలో మిగలలేదు. అది  ఇప్పటికీ  ఒక mystery గానే మిగిలిపోయింది.

ఏదేమైనా, నన్నయ చివరి పద్యం ఒక బధామయ సన్నివేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని నాకనిపిస్తుంది. ఆ బాధకు ఒక కారణం ఆ పద్యంలో నిండుగా వున్న ఆహ్లాదకరమైన సన్నివేశమే అని కూడా నేననుకుంటాను! తాను వెన్నెలలాగా నిండుగా మెరుపులు కురిపిస్తూ, తన వెనుక ఎంతకూ వీడని ఒక చిక్కుముడిలాంటి చీకటినీ, రహస్యాన్నీ బంధించి దాచి ఉంచడం లాంటిది ఆ సన్నివేశం!!

తెలుగు కావ్యాలు – కుమారసంభవం (3)

తెలుగు కావ్యాలు – కుమారసంభవం (3)

“హరి వికచామలాంబుజసహస్రము పూంచి మృగాంకునం దవి
స్ఫురిత మలాసితాబ్జమని పుచ్చగ జాచిన చేయి జూచి చం
దురు డది రాహు సావి వెఱ దుప్పలదూలగ జాఱుచున్న న
య్యిరువుర జూచి నవ్వు పరమేశ్వరు డీవుత మా కభీష్టముల్.”

చంపకమాల వృత్తంలో ఉన్న పద్యం ఇది, కుమార సంభవం, ప్రథమాశ్వాసం మూడవ పద్యం.

ఇందులో ఒక చిత్రమైన సన్నివేశం ఊహించబడి, పద్యంగా వర్ణించబడింది.

ఎక్కడా మచ్చంటూ లేనటువంటి వెయ్యి తామరలతో విష్ణువు శివుని శిరస్సును పూజిస్తూంటాడు. విష్ణువుచే అలా పూజలో సమర్పించబడిన తామరపుష్పాలలో, మచ్చకలిగిన (అంటే స్వఛ్ఛమైనది కాని) ఒక తామరపూవుగా భ్రమింపజేస్తూ అకస్మాత్తుగా శివుని జటాజూటంలోని చంద్రునివదనం, మృగాంక సహితంగా, కనుపించి విష్ణువును కలవరపాటుకు గురిచేయగా, కలత చెందిన మనస్సుతో విష్ణువు ఆ మలినపుష్పాన్ని తీసివేసే ఉద్దేశ్యంతో చేయిచాస్తాడు. అలా విష్ణువుచే చాచబడిన (నీల వర్ణం కలిగిన) చేతిని తనను మింగడానికి సమీపిస్తున్న రాహువుగా భ్రమసి, చంద్రుడు శివజటాజూటాన్ని వీడి పారిపోయే ప్రయత్నంలో ఉండగా,
భ్రాంతికిలోనయిన ఆ ఇరువురి చేష్టలను చూసి పరమేశ్వరుడు నవ్వుకుంటుంటాడు – ఇదీ ఆ సన్నివేశం.

‘హరి – వికచ – అమల – అంబుజ – సహస్రము – పూనిచి’ –వికసించినటువంటి నిర్మలమైనట్టి వేయి తామరలను సమర్పించి, హరి (శివునికి పూజ చేసేటప్పుడు)….

‘మృగాంకున్ – అందున్ – అవిస్ఫురిత – మల – అసిత – అబ్జమని’ –వాటిలో చంద్రుని మాలిన్యముచే నల్లనైన వికసించని తామరపూవుగా అనుకుని…

‘పుచ్చగ – జాచిన – చేయి చూచి’ –తొలగించుటకు చాచిన చేతిని చూసి…

‘చందురుడు – అది – రాహు సావి – వెఱన్ – తుప్పలతూలగ – జాఱుచున్నన్’ –చంద్రుడు దానిని (తనను కబళించడానికి వస్తున్న) రాహువని తలచి, ఆ భయంతో మిక్కిలిగా చలించి పారిపోయే చర్యలో ఉండగా…

‘అయ్యిరువుర – జూచి – నవ్వు – పరమేశ్వరుడు – ఈవుత – మాకు – అభీష్టముల్’ (భ్రమలో వింత వింత చర్యలకు పాల్పడియున్న) ఆ ఇరువురినీ చూచి నవ్వు పరమేశ్వరుడు మా కోరికలను తీర్చు గాక!

ఇందులో ‘అయ్యిరువురన్’ అనే మాట, నా జ్ఞాపకాలను ఒక్కసారిగా మా హైస్కూలు 10వ తరగతి గదిలోకి తీసుకువెళ్ళి మా తెలుగు మాష్టారిముందు బాసింపట్లు వేయించి కూర్చోబెడతాయి.

‘అయ్యిరువురన్’ అనేది యడాగమానికీ, ఆపై  త్రికసంధికి మంచి ఉదాహరణ. బాలవ్యాకరణం, సంధి/సమాస పరిఛ్ఛేదాలలోని మూడు సూత్రాలు ‘ఆ’ ‘ఇరువురన్’ అనే రెండు మాటలను ఒకటిగా సంధిస్తాయి. దీనిని వివరిస్తూ మా తెలుగు మాష్టారు ‘ఆ, ఈ, ఏ లు త్రికములు’ అనే సూత్రంతో మొదలు పెట్టేవారు. అప్పుడు ఈ పదాలు ‘ఆ + ఇరువురన్’ అని వాటి సాధారణ రూపంలో వుంటాయి. ఆ తరువాత వరుసగా -

‘సంధి లేని చోట స్వరంబుకంటె పరంబయిన స్వరంబునకు యడాగమంబగు’ (బాల వ్యా.సంధి.3)

ఆ + యిరువురన్

‘త్రికంబుమీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు’ (బాల వ్యా.సమాస.14)

ఆ + య్యిరువురన్

‘ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు ఆఛ్ఛికంబగు దీర్ఘంబు హ్రస్వంబగు’ (బాల వ్యా.సమాస.13)

అ + య్యిరువురన్ = అయ్యిరువురన్ గా  మారి మిగులుతుంది చివరికి.

ఎన్నిసార్లు ఈ త్రికసంధి సూత్రాలను practice చేయించారో చెప్పలేను…ఆ రోజులలో నిద్రలో లేపి అడిగినా అక్షరం పొల్లుపోకుండా చెప్పగలిగి ఉండేవాళ్ళం.

తెలుగు భాషపై ఏమాత్రం పట్టు సాధించాలన్నా బాలవ్యాకరణం జోలికిపోకుండా సాధ్యమవుతుందంటే నాకు సందేహమే!