తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

ఆంధ్రుల లేదా తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర గురించిన ఈ notes లో తొలి వెయ్యేళ్ళు అంటే క్రీస్తు శకాబ్దం మొదలుకొని ఆపై వెయ్యేళ్ళదాకా అని అనుకున్నది.
అయితే, ఇది నిజానికి ఇంకో రెండువందల పాతికేళ్ళు ముందుకు వెళ్ళి అదనంగా మరో రెండువందలపాతికేళ్ళు కలిసి మొత్తం పన్నెందువందల పాతిక
సంవత్సరాలవుతుంది. దీనికి కారణం, శాతవాహనుల పరిపాలనతో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర మొదలవుతుంది/మొదలుపెట్టుకోవాలనుకుంటే,
శాతవాహనుల పాలన క్రీ.పూ.225 లో మొదలై క్రీ.శ.225 తో అంతమయిందని చరిత్రకారులంటారు గాబట్టి. శాతవాహనుల పరిపాలనలో తెలుగువాళ్ళ
సాంఘిక చరిత్రకు కూడా క్రీ.పూ.225 నుంచి ఆధారలు దొరకాలి.

శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి. ఆంధ్ర భృత్యులని మాటకూడా ఉంది. దీనిమీద లేచినవివాదం ఇంకా ఎటూ తెలకుండానూ ఉంది. ఆంధ్రులైన భృత్యులా?
ఆంధ్రులకు భృత్యులా? ఆంధ్రులు వేరే రాజవంశం వారై, వారికి శాతవాహనులు సామంతరాజులా? అని మీమాంస. అదెలా ఉన్నా, నాలుగున్నర శతాబ్దాల
వీరి పరిపాలన మాత్రం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లిందని చెప్పుకోవాలి. నాలుగున్నర శతాబ్దాలు ఒకే రాజవంశం ఒక భూభాగాన్ని నిరాటంకంగా పరిపాలించడం
అంత సులభంగా జరిగే పని కాదు. అయినా శాతవాహనుల విషయంలో అది సాధ్యమైంది. తరానికి 25 సంవత్సరాల చొప్పున (చరిత్ర పరిశోధనలో తరానికి 25
సం.గా వేసుకుని లెక్కిస్తారని చదివాను) నాలుగున్నర శతాబ్దాలకు 18 తరాలవుతుంది. అంటే తరం నుంచి తరానికి సాగే జ్ఞాపకాల ప్రవాహంలో
పరిస్థితులలోనూ పరిపాలకులకు చెందిన విషయాలలోనూ ఏవిధమైన మార్పూ లేకుండా 18 తరాలు గడవడం, జ్ఞాపకాల, అనుభవాల ప్రవాహం నిరాటంకంగా
కొనసాగడం అన్నది చరిత్రలో ఒక అరుదైన సందర్భం, ఒక luxury గానే చెప్పుకోవాలి. ఆ సందర్భాన్ని, ఆ luxury ని  శాతవాహనుల పరిపాలనలో
అప్పటి ప్రజలు అనుభవించారు.

ఈ సుఖాన్ని అనుభవించిన వాళ్ళలో తెలుగు మాతృభాషగా ఉండిన తెలుగువాళ్ళూ ఉన్నారు. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. అప్పుడు, అంటే
శాతవాహనుల పరిపాలనా కాలం నాటికి, ఆంధ్రులు తెలుగువాళ్ళూ ఒక్కటి కాదా? అని. కాదనే నేను అనుకుంటాను. అయితే గనక, ఆంధ్రులైన
శాతవాహనులు తమ మాతృభాష అయిన తెలుగును వదిలి ప్రాకృతాన్ని ఎందుకు ఆశ్రయిస్తారు? శాతవాహనుల కాలంలో ప్రాకృతం రాజబాష, ప్రజల భాష
కూడాను! ప్రాకృతంలోనే కదా గాథాసప్తశతిలోని గాథలన్ని ఉన్నాయి! అయితే, అప్పటికి తెలుగింకా పూర్తిగా పరిణతిచెందిన భాషగా కాకుండానన్నా
ఉండిఉండాలి. అలా అనుకోవడానికీ వీలు లేదు.  కారణం, గాథాసప్తశతిలో అక్కడక్కడా కనుపించే అత్తా (అత్త), అద్దాఏ (అద్దం) లాంటి కొన్ని తెలుగు
పదాలు, తెలుగు అప్పటికే పూర్తిగా పరిణతి చెందిన భాషగా ఉండినదనీ, ఎంత పరిణతి అంటే, అందులోని కొన్ని మాటలు వేరే భాషలోకి వెళ్ళగలిగేంత పరిణతి
చెందిన భాషగా శాతవాహనుల కాలంనాటికే ఉండినదనీ, పూజ్యులు కీ.శే.తిరుమల రామచంద్ర గారు తమ వ్యాసాలలో ఇప్పటికే నిరూపించి ఉన్నారు కాబట్టి!

అదలా ఉంచితే, “ఆంధ్రశ్చ బహువః” అనే మాట ఒకటి ఉంది. దీని అర్ధం ఆంధ్రులు పలువురు అని. అంటే, పలు జాతుల ప్రజలు కలిసి ఆంధ్రులు
అయ్యారని ఇది సూచిస్తుంది. ఇది నానుడి. ప్రజల నాలుకలపైనుంచి వచ్చిన మాట. దీనికి నిదర్శనాలు, ఆధారాలూ దొరకవు. తరం నుంచి తరానికి ఇలా
దిగుమతి అయిన జ్ఞానంలో నిజం బొత్తిగా ఉండదు అనుకోవడం సాహసమే అవుతుంది. ఈ పలు జాతుల ప్రజలలో తెలుగు మాతృ భాషగా కలిగిన తెలుగువాళ్ళూ
ఉండిఉండవచ్చు. కాదనటానికి లేదు. బలమైన, ప్రభావవంతమైన జాతి కావడం మూలాన పోనుపోను ఆంధ్రులంటే, తెలుగువాళ్ళన్నది స్థిరపడి పోయి
ఉంటుందనుకోవాలి.

తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర: అంధ యుగం – గ్రంథ యుగం

తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర: అంధ యుగం – గ్రంథ యుగం

తెలుగువాళ్ళ సాంఘిక చరిత్రను గురించిన ముఖ్యమైన సమాచారాన్ని, సంగతులను సేకరించుకుని ఒకచోట రాసుకోవడానికి వీలుగా ఇదేమిరకమైన విభజన అనిపించినా, నాకు మాత్రం ఇది ఒక విధమైన (convenient) స్థూల విభజనలాగానే అనిపిస్తుంది.

ఇందులో, అంధ యుగం అని నేను విభజించుకున్నది – తారీకంటూ లేని/తెలియని తొలినాళ్ళ నుంచి క్రీ.శ.1000 సం. దాకా (అంటే గీత గీసినట్లు వెయ్యవ సంవత్సరందాకా అని కాకుండా ఆ ప్రాంతాలదాకా) ఈ అంధ యుగంలోకి చేర్చుకుంటాను. కారణం – వ్రాతలో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్రను గురించి తెలిపే ఆధారాలేవీ ఈ యుగంలో దొరకవు గాబట్టి. దొరికిన శిలాశాసనాలన్నీ దానశాసనాలు. ఇందులో పెద్దగా సామాన్యజనుల సాంఘిక చరిత్రకు సంబంధించిన అంశాలేమీ వుండవు. అందువలన, ఈ యుగానికి చెందిన జనజీవనానికి సంబంధించిన ఆసక్తికరమైన అదనపు సమాచారం చిన్నదైనా సేకరించడం చాలా కష్టం, challenging గా ఉండే పని.

ఇక రెండవది  గ్రంథ యుగం – పేరు సూచించేటట్లుగానే, రాజరాజు కోరికతో నన్నయ మహనీయుని చేతులమీదుగా క్రీ.శ.1050 ప్రాంతంలో మొదలైన గ్రంథ రచన, ఆ తరువాత శతాబ్దాలుగా నిరాటంకంగా సాగి, ఇప్పటికీ సాగుతూనే ఉంది. పోను పోను కాలంలో వ్రాత అనేది  పరిణతిచెంది సర్వ సామన్యమైన తరువాత సంగతులన్నీ గ్రంథస్థం చేయబడినాయి.  శాసనాలు చాలమటుకు రాజుల చరిత్రనే చెప్పాయి. తాళపత్రాలు మిగతా సంగతులతో పాటు, అప్పుడప్పుడూ జనసామాన్యం జీవన విశేషాలను చెప్పాయి. అయితే, ఈ యుగానికి సంబంధించి అదనపు సమాచారం పెద్దగా సేకరించగలిగింది ఏమీ లేదనే అనిపిస్తుంది. ఉన్నదేదో ఇప్పటికే పెద్దలచేత బయటపెట్టబడింది గాబట్టి. ఈ యుగంలో కూడా, వెతకడానికి మిగిలి ఉన్నవిగా చెప్పాల్సినవి దొరకకుండాపోయిన ప్రసిధ్ధకవులవే గానీ, అంత ప్రసిధ్ధులు కానివారివి గానీ రచనలు. కాలగర్భంలో కలిసిపోయినవిగా అనుకోబడుతున్నవాటిని వెలికి తీసి వెలుగుచూపించడానికి కొంత అదృష్టంతో సహా ఇంకా చాలా కలిసిరావాలి.

అలాగని ఈ గ్రంథయుగంలో ఇక వెదకడానికి ఏమీ లేదని అనుకోవడంకూడా తెలివైన మాటకాదు. ఎందుకంటే, తెలుగువాళ్ళ చరిత్రకు సంబంధించిన చాలానే సంగతులు ఇంకా అపరిష్కృతాలుగా మిగిలున్నవి ఉన్నాయి. ఉదాహరణకి, శాతవాహను లెవరు? వీళ్ళు పుట్టుకతో ఆంధ్రులేనా? అనే ప్రశ్నకు ఇది final అని చెప్పుకోదగిన సమాధానం ఇంతవరకూ లేదు. అలాగే, కాకతీయులు ఎవరు? అన్న ప్రశ్నకూ, ‘కాకతి’ అనే మాట ఏ అర్ధాన్ని సూచిస్తుంది? కాకతి శక్తి ఎవరు? ఇలాంటి ప్రశ్నలకూ ఇది అంతిమం, దీనికిక తిరుగులేదు అని చెప్పుకోదగ్గ, అందరూ ఒప్పుకోదగిన, ఒప్పుకున్న సమాధానం లేదు, నాకు తెలిసినంతవరకూ, నేను చదివున్నంతవరకూ. ఇలాగే, పల్లవులు ఇక్కడివారా? బయటనుంచి వచ్చిన వారా? పల్లవ అనే మాటకు ఏమిటి అర్ధం? బృహత్ఫలాయన, శాలంకాయన, ఇత్యాది చిన్న చిన్న రాజవంశాలవారు ఇక్కడివారేనా? లేక బయటినుంచి వచ్చినవారా? ఇక్కడివారే అయితే వీరి పూర్వులు ఎవరు? ఈ వంశనామాలు దేనిని సూచిస్తాయి? ఇవి వంశనామాలేనా లేక గోత్రనామాలా? గోత్రనామాలే వంశనామాలుగా ఎందుకయ్యాయి? ఇలాంటి ప్రశ్నలకూ సరయిన convincing సమాధానాలు దొరకవలసే ఉంది ఇంకా!

అందువలన, (నా విభజనలో) అంధయుగంలోనే కాదు, గ్రంథయుగంలోని సంగతులకు సంబంధించిన సమాచారమూ సమగ్రమేమీ కాదు! అందులోకూడా ఇంకా తెలియాల్సింది ఉందనే అనుకోవాలి. చరిత్ర గురించి రాయడం out of fashion అయిపోయి చాల రోజులే అయింది. ఒకప్పుడు, 1970 ల దాకా కూడా, చరిత్ర గురించి రాయడం ఒక యజ్ఞంగా తీసుకుని కృషి చేసిన వాళ్ళున్నారు. ప్రచురించిన పత్రికలూ ఉన్నాయి. అవన్నీ గ్రంథాలయాల్లో భద్రంగానే ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుతూనే ఉన్నారు, రాయడానికి సాహసించకపోయినా!

కీ.శే. సురవరం ప్రతాపరెడ్డిగారు తమ ఆంధ్రుల సాంఘిక చరిత్రలో శాతవాహనుల కాలం నుండి క్రీ.శ.వెయ్యి దాకా ఆంధ్రుల సాంఘిక చరిత్రను గ్రంథస్థం చేయాలని అభిలషించారుగాని, ఏ కారణం చేతనో, అది కార్యరూపం దాల్చలేదు. ముందు చెప్పుకున్నట్లుగానే, వెయ్యి తరువాత ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాయడానికి తగినన్ని ఆధారాలు ఉన్నందువలన వీలయ్యే పనే! వెయ్యికి ముందు చరిత్ర రాయడానికి సరయిన ఆధారాలు ‘sources’ లేకపోవడం అనడం కంటే లభ్యంకాకపోవడం వలన అంత సులభంగా జరగే పనికాదు.

అందువలన ఆంధ్రుల చరిత్రలో తొలి వెయ్యేళ్ళు ఓరకంగా అంధయుగమే! అలా అన్నంత మాత్రాన, ఇక కృషి చెయ్యడానికి ఏమీ లేదని కాదు; చేయగలిగినంత ఉంది…ఉంటుంది!

స్వగతాలు (12): పసితనమూ, పోయిన వసంతమూ….

పసితనమూ, పోయిన వసంతమూ….

shades of future-2ఏ అనవసరపు ఆవేశానికీ లోనుకాకుండా
నింపాదిగానూ, ఒకింత నిర్మోహంగానూ చూడగలిగే కన్ను
చూడలేనిది ఏదీ ఉండదు.
పసితనమూ, వార్ధక్యమూ
పత్రహరితమూ, పోయిన వసంతమూ
అన్నీటినీ ఆ కన్ను అదే కరుణతో వీక్షిస్తుంది.

వెలిగే దీపం చీకటి వాకిట్లో మరీ హుందాగా మెరిసేటట్లుగా
అందం అప్పుడప్పుడూ ఒక్కొక సందర్భాన్నీ అంటిపెట్టుకుని ఉంటుంటుంది.
అందువలన, సౌందర్యాన్ని సృష్టించడమంటే ఎప్పటికప్పుడు సందర్భాన్ని కల్పించడమో, మేలుకొల్పడమో అవుతుంటుంది.

నువ్వు ఉండవు.
అయినా నిన్ను గురించిన సందర్భాలు కొన్నైనా చిత్రాలుగా మారి చిత్తాన్ని అలంకరించి ఉండడమే జ్ఞాపకం.
ఇది సహజం.

నేను ఉంటాను.
అయినా నన్ను గురించిన సందర్భం ఏదీ నీ చిత్తాన్ని  అలంకరించి ఉండకుండడమూ నాకు జ్ఞాపకమే!
అసహజమైనా సౌందర్యమే!

అందుకే అంటాను
నింపాదిగానూ, ఒకింత నిర్మోహంగానూ చూడగలిగే కన్ను
చూడలేనిది ఏదీ ఉండదు.

అడవి గాచిన వెన్నెలలా, ఎవరికీ చెందని విషాదం కూడా ఒక్కొకప్పుడు మహా సౌందర్యానికి కారణమౌతుందన్నది నిజం!

స్వగతాలు (11): చెట్టు – హరితాత్మ (ఒక జ్ఞాపకం)

చెట్టు – హరితాత్మ (ఒక జ్ఞాపకం)

ఇంత తీయగా ఉంటుంది గనుకనే నీ జ్ఞాపకపు గాయాన్ని నేను ఎన్నటికీ  మానిపోనీయను.

ఎక్కు పెట్టిన బాణానికి గురి తప్పడం కూడా తెలిసే ఉంటుంది.
ఎడారికి దాహాన్ని గురించిన స్పృహ మొదటినుంచీ ఉంటుంది.

ఎంత పకడ్బందీగా రాసుకున్నా విఫలం అయ్యే కొన్ని ప్రేమ కథల్లోనూ గాథల్లోనూ  లాగా
అయిన గాయాన్ని
ఎవరిదో ఒక విరహ గీతంలా పెదవులపై మోస్తూ తిరగడంలో ఎంత సుఖముందో నీకేం తెలుసు?
నువ్వు జ్ఞాపకంగా ఉండడంలో ఎన్ని వేల గేయాలున్నాయో నాకిప్పుడు బాగా తెలుసు.

ఎంతగా కాంక్షించి చూసుకున్నా సఫలం కాని కొన్ని ప్రేమ కథల్లోనూ గాథల్లోనూ లాగా
మరిచిపోవడం తప్పనిసరి అయిన ప్రతిసారీ నేను నీ మోహం లోనుంచి తప్పుకుని ఏదో ఒక గాయంలోకో, గేయంలోకో, జ్ఞాపకాల తోయంలోకో లీనం అయిపోవడానికి ప్రయత్నిస్తాను. సఫలం చెందుతాను కూడా!

నన్ను నేను తప్పిపోగొట్టుకోవడంలో ఎంత సుఖముందో నీకేం తెలుసు?
వాడిపోయిన, మోడైపోయిన ప్రతి పూవునుంచి చెట్టునుంచి నన్ను నేను కొంచెం కొంచెంగా దక్కించుకోవడంలో ఎంత సుఖం ఉందో ఇప్పుడు నాకు మాత్రమే తెలుసు.

ఎప్పుడైనా నేనిప్పుడు
నువ్వు ఉండకుండా ఉండే నీ జ్ఞాపకాల లోకంలో ఇలా చెట్టు చెట్టుకీ ఒక హరితాశ్రువునై పరిభ్రమిస్తూ కనబడతాను.
నువ్వుండని ప్రతిచోటా నీ కంటే నిజంగా నాకు నీ జ్ఞాపకమే హరితాత్మ!

స్వగతాలు (10): రంగుల కల -4

రంగుల కల -4

ఏదైనా సరే  ఒక విలక్షణతతో విశ్వాన్ని సమ్మోహపరచాలని కాంక్షించే ప్రతి చిన్న పువ్వుకూ
ఏదో ఒకనాటికి ఎవరిదో ఒకరి సాన్నిధ్యంలో కనులు మొగిడ్చి తన్మయానికి లొంగి పోయే తరుణం రానే వస్తుంది.

గడ్డిపరక కైనా సరే,
వెనక్కి వాలి, వెన్నిచ్చి, కనులు మూసుకుని కాస్త సేద దీరినపుడు
నలిగి పోతున్నానన్న బాధకన్నా
నన్నే గదా ఆపు చేసుకున్నాడన్న స్పృహ, సంతోషమూ లోపల ఉండకుంటే తప్ప
మళ్ళీ లేచి కూర్చోలేదనుకుంటాను.

క్షణాలుగా గడిచిపోతుంటుంది యవ్వనం
యుగాలుగా గడుస్తూ ఉంటుంది వార్ధక్యం!

అన్నీ అయిపోయాక
కళ్ళ రెప్పల వెనుక బారులుగా తీరి ఉన్న నీళ్ళ చారల దారులలో
ఎవరిదో తెలియని ఒక విశ్వ మొహక గళం తనను తాను తప్పిపోగొట్టుకుని
ఆలాపించే అంతులేని శోకాశోక గీతానికి పారవశ్య సూచకంగానో నిదర్శనంగానో అన్నట్లుగా
ఎప్పుడూ ఒక నీటి బొట్టు కనుపించీ కనుపించకుండా కంటి రెప్పలనంటి
వేళ్ళాడుతూ ఉండడం ఒకానొక మధురాతి మధురమైన జ్ఞాపకం!

***

స్వగతాలు (9): రంగుల కల -3

రంగుల కల -3

ఎందుకో గాని
ఈ రంగుల ముందు నా మాటలు
ఎప్పుడూ మౌనంగా వుండడాన్నే
ఇష్టపడతాయి!

అదెందుకో గాని
విరిసినా విరియక ఉన్నా వాడినా
పువ్వెప్పుడూ ఒక మధుర స్వప్నానికి ఆనవాలులాగానే ఉంటుంది.
ప్రియమైన లోగిలి వైపుకు ఇంకా మొదలేకాని ఒకానొక కలల ప్రయాణంలోకి వేయ జూడబోయిన తొలి అడుగులా
విరిసినా విరియక ఉన్నా వాడినా
ఎలా ఉన్నా పువ్వెప్పుడూ ఒక మధురానుభూతిలాగానే ఉంటుంది.

ఎంతకూ మోహపడని యవ్వనాన్ని భరించి ఉండడం ఎంత కష్టమో
ఎంతకూ మోదపడని హృదయాన్ని ధరించి ఉండడమూ అంతే కష్టం!

లోలోపల మధురంగా జ్వలించలేని మనుషులున్న చోటున
పువ్వు వికసించినా వికసించకున్నా పెద్దగా తేడా ఉండదు.

నీకోసమే అన్నట్లుగా విరిసి విప్పారి ఉన్న విరి తనువును
తనకుతానుగా చేయి చాచి స్పృశించలేని మనిషికి మోహస్పర్శ ఎలాంటిదో ఎప్పటికీ తెలియదు!

స్వగతాలు (8): రంగుల కల -2

రంగుల కల -2

మనిషిగా
ఉన్నంతకాలం ఇంత సామాన్యంగా, స్వచ్చంగా మెరవడానికి
ఎన్నెన్ని యాగాల యుగాల యోగాల ఫలితాల్ని ధరించి ఉండాలో అనుకోవడం అత్యూహ కాదు కదూ…

ఇంత తోడుతోడుగా, సామీప్యంలో ఉన్నంతకాలం ఉండడానికీ…
ఉంటూ చూడడానికీ చూడబడడానికీ…

ఈ రంగులదొక వింత లోకం.
కమ్ముకుంటున్న ఉషోదయం లాంటిదో, అస్తమయం లాంటిదో వెలుతురు వర్ణం
ఒకానొక ఇంకా మొదలుకాని సంగతిని సూచిస్తున్నట్లుగా ఉంటుంది.
ఎన్నో వింతలను రాత్రి మోసుకు వస్తుంది.
భయపడతాం భయపెడతాం గానీ, స్వతహాగా చీకటి ఒక సాధువు.
చూడాలని వెలిగిస్తే చిన్నచిన్న సంగతులను కూడా దివ్యంగా వెలిగించి చూపెడుతుంది.

ఈ అనంతమైన విశ్వంలో
ప్రతి రేణువంత ప్రాణికి కూడా  ఒక ప్రత్యేకమైన ఉనికి ఉంటుంది.
ఎటొచ్చీ, సానుభూతితో సంయమనంతో చూసే చూపే మనిషికి ఉండాలి.

స్వగతాలు (7): రంగుల కల -1

రంగుల కల

అవును, ఇది ఒక రంగుల కల!
ఈ కల ఎప్పటికప్పుడు పరుచుకుంటున్న మంచు తెరలా కళ్ళను కమ్మేసి కలవరపెడుతూనే ఉంటుంది.
ఎందుకో తెలియని భావోద్రేకాన్ని భరించి ఉండడం ఎంత కష్టమో, కళ్ళముందు కమ్ముకుంటున్న ఈ రంగుల కలనూ పక్కకు నెట్టి విడిగా చూడడమూ అంతే కష్టంగా ఉంటుంది.

flowers, clrs (18)తల వంచుకుని నడుస్తూనే ఉంటామా…
అడుగులు ముందుకు పడుతూనే ఉంటాయా…
ఇంతలో ఏదో ఒక ఊహించని మూలనుంచి ఒక వర్ణమో, వర్ణాల సముదాయమో తెలియకుండా వచ్చి తమ ఉనికిని తెలుపుకుంటున్నట్లవుతుంది.
అదెందుకలా అవుతుందన్న దానికి సమాధానాం దొరకదు గాని,
తల అటుగా తిప్పి చూస్తే, ఇదిగో ఇలా చూడాలన్నట్లుగా వాటికవే చూపులకు దారి పరిచినట్లవుతుంది.

flowers, clrs (19)చంద్రుడితో పాటే పోయే వెన్నెలలా,
ప్రియుడి వెంట ప్రేయసి పోతుందని ఎవరో ఒక పూర్వ కవి ఉత్ప్రేక్షించినట్లు,
వర్ణంతో పాటుగానే నా కంటి చూపూ పోతుంది.

flowers, clrs (20)వర్ణ సౌందర్యం, వర్ణ సముదాయాల సమ్మేళనల సౌందర్యం. నాకొక తన్మయ నయనానందకర సమ్మోహ భీభత్సం!

flowers, clrs (21)విరియడానికి వేసటతో వేచి చూస్తున్నట్లుగా కనుపించే వర్ణం, పువ్వు వెంట ఒకానొక  తన్మయాన్ని గాలిలోకి నిరంతరంగా నిశ్వాసిస్తూనే ఉంటుంది;
మొగ్గగా విలసిల్లడానికి ముందే, ఒకా నొక …కాదు కాదు, అనేకానేక తమోహ రణాల సమీకరణాలను అణువణువునా నింపుకుని గదా అది అవతరించేది!

కీసరగుట్ట

కీసరగుట్ట - శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం

హైదరాబాదు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంటుంది కీసర (కీసర గుట్ట). ప్రసిధ్ధ శైవక్షేత్రం.

క్రీ.శ. తొలి శతాబ్దాలలో ఆంధ్ర దేశాన్ని (వేంగీ దేశాన్ని) పరిపాలించిన రాజవంశాలలో ఒకటైన విష్ణుకుండినులకు, ఈ కీసరకు సంబంధం ఉందని ఒక మాట ఉంది. ఈ రాజవంశం రాజులలో ఒకడైన రెండవ మాధవ వర్మ పరిపాలనా కాలం అయిన క్రీ.శ.4-5 శతాబ్దాలలో ఈ కీసర రాజధానిగా ఉండేదని చెబుతారు.
విష్ణుకుండిన రాజులలో రెండవ మాధవ వర్మ చాలా ప్రసిధ్ధుడు. రాజ్యాన్ని బాగా విస్తరింపజేసి విష్ణుకుండినుల ప్రభను ఒక వెలుగు వెలిగించిన దీటైన రాజు. ఈయన వైదికమతాభినివిష్టుడనీ, అగ్నిష్టోమ, వాజపేయ, పౌండరీక, అశ్వమేధ, రాజసూయ ఆది క్రతువులను చేశాడనీ చరిత్ర పరిశోధకులు చెప్పారు. పదకొండుసార్లు అశ్వమేధ యాగాన్ని చేయడం వలన ఈయన రాజ్యకాలంలో పదకొండు సార్లు దిగ్విజయ యాత్ర సాగించి ఉంటాడనీ చరిత్ర పరిశోధకులు అంటారు. అప్పటిలో బలవంతులైన వాకాటకులను పోరులో ఓడించి, సంధిలో భాగంగా వాకాటక రాజు కుమార్తెను వివాహం చేసుకుని, తదనంతరం రెండు రాజ్యాలకూ వారసుడు అయ్యాడని కూడా చరిత్ర పరిశొధకులు ఊహించారు. ఇంత ప్రసిధ్ధుడైన రాజుతో సంబంధం కలిగి ఉండిన ఈ క్షేత్రం కూడా అంత ప్రసిధ్ధమైనదే! శివరాత్రి నాడు ఏటా జరిగే ఉత్సవాలకు హైదరాబాదు నుండి ప్రత్యేకంగా బస్సులను వేస్తారు. జనం తండోపతండాలుగా వెళ్ళి ఉత్సవంలో పాల్గొంటారు.

కొండ (‘గుట్ట’ అనే అనాలనుకుంటాను!) మీద ఆలయం. మెట్లు ఎక్కుతూండగా కనిపిస్తుంది ఆలయ గోపురం. కొండ (‘గుట్ట’) మీద ఆలయ ప్రాంగణంలో ఏ వైపు చూసినా శివలింగాకృతులు కనిపించి అబ్బుర పరుస్తాయి. కొండ మీదనుంచి చుట్టు scenery చూడడానికి బాగానే ఉంటుంది. ఈ మధ్యనే వెళ్ళి నప్పుడు తీసినవి ఫోటోలు ఇక్కడ కొన్ని. ఈ ఫోటోలు 2 megapixel లెన్స్ తో ఉన్న సెల్ ఫోనుతో తీసినవి. ఈ ఫోటోలలో చివరి నాలుగు ఫోటోలూ dimensions లో పెద్దవి. వాటి మీద ఎక్కడైనా సరే click చేస్తే, image ని original dimensions లో చూడడానికి వీలవుతుంది.

స్వగతాలు (6) : జ్ఞాపకం -2

జ్ఞాపకం (2)

ఒకప్పటి అతి గాఢమైన ప్రేమ కూడా
ఇప్పటికి ఒక అగాఢమైన, అస్పష్టమైన జ్ఞాపకాల సముదాయంగా అంతమై మిగలొచ్చని ఒక మాట!

ఏది పరమ నిజం (absolute truth)?
ఏదీ కాదు.
సంబంధ నిజమో (relative truth)?
అన్నీ!
నీవూ నేనూ, నీ ప్రేమా నా ప్రేమా…. ఇలా అన్నీ!

చూడగలిగితే, చదవ గలిగితే, కాలంలో ఎప్పుడూ ఒక అప్రకటిత దాన శాసనం శిలామయమై క్షణానికో మారు లిఖించబడి వుండి కనబడుతూ వుంటుంది!

ఇదివరకే పడివున్న అక్షరాల అడుగుజాడలలో తడబడుతూ నడుస్తూండేవే
నీవీ నావీ, ఇంకా మనలాంటి వాళ్ళవే అందరివీ, జ్ఞాపకాలు.

చిక్కుపడిపోయి వున్న కురులలోకి వేళ్ళు పోనిచ్చి, ఉదయం అరవిప్పారిన కన్నులతో ఆవులిస్తూ బడలికగా పురివిప్పుకుంటున్నట్లు కదిపినప్పుడల్లా, హటాత్తుగా రాలిపడే ఒక వాడిపోయిన మల్లెపూవు లాంటిది ఈ జ్ఞాపకం.

కళ్ళు నులుముకుని చూడాల్సి వచ్చేటంత అపనమ్మకంగా, నమ్మశక్యం కానంత నిర్నిమిత్తంగా,
ఒక మధురాతి మధురమైన స్మృతిని జ్ఞప్తికి తెచ్చి ఒళ్ళు ఝల్లుమనిపిస్తుంటుంది.

కురులమధ్య కవోష్ణంలో కాలిపోయి మిగిలిన అప్పుడెప్పటిదో మోహాన్నీ, మొహాన్నీ
అక్షరాలా ఈ అక్షరాల జలపాతంలో తడుపుకుని తృష్ణ తీర్చుకుంటూ
నేనిక్కడ ఎన్నాళ్ళుగా నయినా సరే పడి ఉంటూనే ఉంటాను….

అటూ ఇటూ ఒకేసారి మండుతూన్న సూర్యునిలా
ఉదయం సాయంత్రం, పగలూ రాత్రీ అనే ప్రాపంచిక సంగతులను వేటినీ పట్టించుకోకుండా
ఇలా…..