భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (6)

మనమిప్పుడు శాతవాహనుల పరిపాలనా కాలానికి (క్రి.పూ.225 – క్రి.శ.225)  చేరుకున్నాం..  శాతవాహనులు ఆంధ్రులు అని ప్రతీతి.  ఆంధ్రభృత్యులు అన్న పదంగూడా శాతవాహనుల గురించి వాడబడి కనిపిస్తుంది.  వేరే ప్రసిధ్ధి చెందిన రాజవంశానికి సామంతరాజులు అన్న అర్ధంలోనా లేక ఆంధ్ర రాజులకు సామంత రాజులు అన్న అర్ధంలో ఈ మాట వాడబడినదా అన్నది తెలుసుకోవడానికి సరియయిన అధారాలు లేవు. ఏదయినప్పటికీ, ఆంధ్ర రాజులకు జాతీయ స్థాయిలో గౌరవాన్ని సంపాదించి పెట్టిన తొలి రాజవంశం శాతవాహన రాజ వంశం. పురాణాలలో కూడా ఈ రాజ వంశ ప్రసక్తి కనిపిస్తుంది.

జాతి పరంగా ఆంధ్రులైనా, వీరి రాజధాని మొదటలో ధాన్యకటకము (నేటి అమరావతి) అయిఉండి, తరువాత ప్రతిష్ఠానపురానికి (నేటి ‘పైఠన్’) మార్చబడింది.  ప్రాకృతం రాజ భాష.  శాతవాహనరాజులలో స్త్రీలు బౌధ్ధాన్ని అవలంబిస్తే, పురుషులు వైదికమతాన్ని అనుసరించారు.  అజంతా గుహాలయాలు వీరి కాలంలో నిర్మించబడ్డాయి.  అమరావతి ఆంధ్రుల కళా నైపుణ్యానికి ఒక మచ్చుతునక.  వీరి పరిపాలనా కాలంలోనే రెండు ముఖ్యమైన శకములు – విక్రమాదిత్య శకము క్రి.పూ.58  సంవత్సరములనుండి, శాలివాహన శకము క్రీస్తు తరువాత 78 సంవత్సరములనుండి లెక్కింపబడుతూ – ప్రచారములోకి వచ్చాయి. ఈ రాజ వంశంలో కడపటి చక్రవర్తి గౌతమీ పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ని.  ఈయన క్రీ.శ. 174 – 203 సం.ల మధ్య కాలంలో పరిపాలన సాగించాడు.  ఈయనకు సమకాలికుడు ఆచార్య నాగార్జునుడు. క్రీ.శ.180 సం.ల ప్రాంతంలో ఇప్పుడు నాగార్జునకొండ అని పిలవబడే అప్పటి శ్రీపర్వతమనే కొండమీద సంఘారామాన్ని నెలకొల్పి వందల కొలది బౌధ్ధ భిక్షువులకు విద్యాబొధనకు, జీవనానికి అనువైన సౌకర్యములను కల్పించిన వ్యక్తి ఆచార్య నాగార్జునుడు.

ఏదీ అకారణంగా జరగదు, అనేక కారణాల ఫలితంగా ఒక కార్యం ఏర్పడుతుంది అన్న కార్యకారణ సంబంధ సూత్రం బౌధ్ధానికి మూలం.  నాగార్జునుడు దీనిని అంగీకరుస్తూనే అంతకంటే మౌలికమయినది ఏది? అని ప్రశ్నించుకుని ప్రతిదీ మౌలికంగా నిస్స్వభావం గనుక శూన్యం అని సమాధానాన్ని రాబట్టాడు.  చాందొగ్యోపనిషత్తు తండ్రి కొడుకుల మధ్య సంభాషణ చివరలో ఎదురైన శూన్యాన్ని శూన్యంగా వదలక అక్కడ ఆత్మను, పరమాత్మను నిలబెట్టింది.  నాగార్జునుడు ఆ భావననే ఇంకొంత ముందుకు తీసుకువెళ్ళి ఆత్మ, పరమాత్మ అన్న ముసుగును తీసివేసి, శూన్యాన్ని శూన్యంగానే అంగీకరించమని చెప్పాడు.

శూన్యత్వమే అసలైన నిర్వాణమనీ, అది కారణ రహితమైన అస్తిత్వమనీ, అందులో అన్ని పరిణామాలూ సమత్వం పొందుతాయని నాగార్జునుని సిధ్ధాంతం.  ఇదే అతని శూన్యవాద సారాంశం.

ఆచార్య శంకరుని మాయా వాదానికి నాగార్జునుని శూన్య వాదమే ప్రాతిపదిక అయ్యిందని పెద్దలు చెబుతారు.

వ్యాఖ్యానించండి