తెలుగు నాటకాలు (1)

బళ్ళారి వారి ‘చిత్రనళీయము’
వీరేశలింగం గారి ‘శకుంతల’
లక్ష్మీకాంతం గారి ‘హరిశ్చంద్ర’
శ్రీపాద వారి ‘బొబ్బిలి యుధ్ధం’
తిరుపతి వేంకటకవుల ‘పాండవోద్యోగ విజయాలు’
వేదము వారి ‘ప్రతాప రుద్రీయము’
పానుగంటి వారి ‘రాధ కృష్ణ’
వడ్డాది సుబ్బారాయ కవి ‘వేణీ సంహారం’

తెలుగులో నాటకాలలో ఇవి ఎన్నదగినవని, చాల గొప్పవని  పెద్దలు చెబుతారు. జనామోదాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి ‘హరిశ్చంద్ర’ కూ, ఆ తరువాత తిరుపతి వేంకటకవుల ‘పాండవోద్యోగవిజయాల’ కూ ఉన్న popularity మిగతా వాటికి లేదని చెప్పవచ్చు. popularity ని దృష్టిలో పెట్టుకుంటే జ్ఞాపకానికొచ్చే మరో నాటకం కాళ్ళకూరి నారాయణరావుగారి ‘చింతామణి’. తెలుగు నేల పల్లెటూళ్ళలో ఈ మూడు నాటకాలూ ఒకానొక కాలంలో రాజ్యమేలినాయని చెబితే అతిశయోక్తి కాదు.

లక్ష్మీకాంతంగారి ‘హరిశ్చంద్ర’ నాటకంలోని పద్యాలు ప్రేక్షకులను ఎంతగా కదిలించేవో చెప్పనలవికాదు. ‘హరిశ్చంద్ర’ నాటకంలో హరిశ్చంద్రుని పాత్రను ధరించి ప్రసిధ్ధులైనవారిలో కొంతమంది పద్యం పాడే పధ్ధతికి ప్రేక్షకులలో చాలామంది వచ్చే దుఃఖాన్ని చాల కష్టంమీద ఆపుకోగలగడం, కొందరైతే దుఃఖాన్ని ఆపుకోలేక ఒకింతసేపు హాల్లోంచి వెలుపలికెళ్ళి, మళ్ళి లోపలికొస్తూండడం చేస్తూండేవారు. చీమచిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించి ఉన్న హాలులో, లక్ష్మీకాంతంగారి ఈ క్రింద ఉదాహరించిన పద్యంలోని ఒక్కొక్క మాట, ప్రేక్షకుల భావావేశాల్తో చెండాడుకొనేదనడంకూడా అతిశయోక్తి కాదు:

“తిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ సాగిరా వేరి కే
సరికేపాటు విధించెనో విధి యవశ్య ప్రాప్యమద్దాని నె
వ్వరు దప్పించెద రున్నవాడనని గర్వం బేరికెన్ గాదు; కిం
కరుడే రాజగు, రాజె కింకరుడగున్ కాలానుకూలంబుగాన్!”

‘తిరమై’ అన్న మొదటి పదం దగ్గర మొదలై, నడుస్తూ నడుస్తూ, పద్యం చివరి పాదం దగ్గరికొచ్చి, ‘కింకరుడే రాజగు, రాజె కింకరుడగున్ కాలానుకూలంబుగాన్!’ అన్నది రాగయుక్తంగా పూర్తయే సరికి, పాషాణమైనా సరే కరిగి పోవాలిసిందే అన్నట్లుగా ఉండేది. పాడేవాడు కన్నీళ్ళతోనే పాడేవాడు, చూసేవాళ్ళు కన్నీళ్ళతోనే చూసేవాళ్ళు. ఏడుపా అది? కానేకాదు. ఎంతమంది ఎన్నెన్ని పల్లెటూళ్ళలో ఎన్నెన్ని సంవత్సరాలపాటు ఈ పద్యం ధాటికి తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టుకున్నారో చెప్పడానికి లెక్కల్లేవు. అవన్నీ వేరే రోజులు. ఇప్పుడు వచ్చేవి
కావు. చెప్తే అర్ధమయేవీ కావు. ఇప్పుడు rewind చేసుకుని చూసుకోవడానికి స్వంత memory తప్ప వేరే మార్గాలు లేవు.

ఛందస్సు ఒక బంధనమని, శ్రుంఖలమని, అదుండగా అసలుసిసలైన కవిత్వం ఎక్కదని, భావం ఒదగదనీ, వ్యర్ధపదాల్లేకుండా సాధ్యపడదనీ అనుకున్నప్పుడల్లా, ఇలాంటివే పద్యాలు జ్ఞాపకానికొచ్చి నోరుమూయిస్తూంటాయి. పాలేర్లూ, కూలివాళ్ళూ ఈ పద్యాలను అక్షరం తప్పులేకుండా పాడడం తెలిసున్న వాళ్ళలో నేనూ ఒకడిని కావడం నా భాగ్యంగానే భావిస్తూ ఉంటాను ఇప్పటికీ!

వ్యాఖ్యానించండి